తొలిరోజే టాస్క్‌లతో రణరంగంలా బిగ్‌బాస్ 10.. మేజిక్‌ కీలను గెలుచుకున్నదెవరు?

 


బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఘనంగా ప్రారంభమైంది. 10 మంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్ కలిపి మొత్తం 16 మంది ఈసారి కంటెస్టెంట్స్‌గా హౌస్‌లో అడుగుపెట్టారు. సెలబ్రిటీ కేటగిరీలో దేబ్‌జనీ మోదక్, టెంపర్ వంశీ, కృష్ణుడు, చైత్రా రాయ్, ఆటో రాంప్రసాద్, జబర్దస్త్ నరేష్, త్రిగుణ్, సుధీర్ రెడ్డి, వర్షిణి సౌందరరాజన్, ముఖేష్‌ గౌడలు కంటెస్టెంట్స్‌గా వచ్చారు. ఇక కామనర్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా అగ్నిపరీక్ష సీజన్ 2లో ఫైనల్ లిస్టులో చేరిన 13 మందిలో 6గురిని హౌస్‌లోకి పంపారు. వారు సింగర్ ఝాన్సీ, అమన్, చరణ్, సృష్టి, షాలిని, రోహిత్‌. 

ప్రతి సీజన్‌లోనూ కంటెస్టెంట్స్ అంతా వచ్చిన తర్వాత రెండో రోజు నుంచి టాస్క్‌లు మొదలవుతాయి. కానీ ఈ సీజన్‌లో మాత్రం లాంచింగ్ ఎపిసోడ్ రోజునే టాస్క్‌లు మొదలెట్టారు కింగ్ అక్కినేని నాగార్జున. దీనిలో భాగంగా బిగ్‌బాస్ హౌస్‌ చూపించడానికి వెళ్లిన నాగ్.. తనతో పాటు గార్డెన్ ఏరియా మాదిరిగా ఉన్న రూమ్‌లోకి ఓ కీని పట్టుకుని వెళ్లారు. ఈసారి ఆట మొత్తం ఈ మేజిక్ కీతోనే ఉందని చెప్పిన ఆయన 10 బాక్స్‌లు చూపించారు. ఇందులో ఓ బాక్స్‌ను తన దగ్గరున్న కీతో ఓపెన్ చేయగా అందులో ఈ కీ ల గురించి, ఈ బాక్స్‌లు ఓపెన్ చేయడం వల్ల వచ్చే పవర్స్ గురించి చదివి వినిపించారు. 

ఆ తర్వాత హౌస్‌లోకి వచ్చిన తొలి నలుగురు కంటెస్టెంట్స్‌ దేబ్‌జనీ మోదక్, త్రిగుణ్, సుధీర్ రెడ్డి, సింగర్ ఝాన్సీలను గార్డెన్ ఏరియాకి పిలిపించి వారికి మేజిక్ కీ గురించి చెప్పి టాస్క్ ఇచ్చారు. 

దీని ప్రకారం వారి ఎదురుగా డైమండ్ షేపులో ఉన్న పజిల్, బాక్స్‌ పెట్టారు. బజర్ మోగగానే వారి ముందున్న బాక్స్‌లు పగలగొట్టి వాటి ఉన్న బిగ్‌బాస్ 10 అనే ఇంగ్లీష్ అక్షరాలు ఉన్న బాక్స్‌లను తీసుకోవాలి. వాటిని డైమండ్ షేపులో సరిగ్గా అమర్చాలి. బజర్ మోగే లోగా ఎవరైతే ఫస్ట్ పూర్తి చేస్తారో వాళ్లకి కీ దొరుకుతుంది. ఈ టాస్క్‌లో తొలుత త్రిగుణ్ గెలవగా.. ఆ తర్వాత సింగర్ ఝాన్సీ గెలిచి కీని సొంతం చేసుకుంది. 

ఆ తర్వాత హౌస్‌లోకి వచ్చిన మరో నలుగురు కంటెస్టెంట్స్ చైత్రారాయ్, ఆటో రాంప్రసాద్, శాలిని, అమన్‌లకు కూడా కీ టాస్క్ పెట్టారు. అయితే అమన్‌కు అంతకుముందు నాగార్జున ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేయకపోవడంతో అతనిని ఈ టాస్క్ నుంచి ఎలిమినేట్ చేస్తున్నట్లు కింగ్ ప్రకటించారు. ఈ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్స్ ముందు రంధ్రాలున్న బోర్డ్ పెట్టి వాటిలో నుంచి బంతిని అందుకుంటూ ఒక బాక్స్‌లో వేయాలి. ఎవరైతే ముందుగా పడేస్తారో వారికే మేజిక్ కీలు దొరుకుతాయి. ఈ టాస్క్‌లో రాంప్రసాద్, షాలినీలు గెలిచి కీలు సొంతం చేసుకున్నారు.

ఆ తర్వాత వంశీ, చరణ్, సృష్టి, పొట్టి నరేష్‌ల ముందు గోల్డెన్ ఎగ్స్ పెట్టి ఒక్కొక్కరితో వాటిని పగలగొట్టారు. వారిలో చరణ్, సృష్టిలకు ఉడకబెట్టిన గుడ్డులు వస్తాయి. దాంతో నరేశ్, వంశీలలో ఒకరిని తమతో పాటు టాస్క్‌కి తీసుకెళ్లాలని నాగార్జున చెప్పారు. దాంతో వారిద్దరూ ఆలోచించుకుని నరేశ్ అయితే తమకు పోటీ ఉండరు అనుకుని అతనిని సెలెక్ట్ చేసుకున్నారు. అనంతరం గార్డెన్ ఏరియాకు ముగ్గురిని పిలిచి వారికి ఓ ఐరన్ రాడ్ తిప్పి దాని కిందపడే రింగులను, ఎదురుగా ఉన్న మూడు హుక్స్‌పై కరెక్ట్‌గా పడేలా వేయాలని టాస్క్ పెట్టారు. ఈ టాస్క్‌లో సృష్టి, పొట్టి నరేశ్‌లు గెలిచి కీలు సొంతం చేసుకున్నారు. 

అయితే చివరిలో వచ్చిన వర్షిణి సౌందరాజన్, కృష్ణుడు, ముఖేష్ గౌడ, రోహిత్‌లకు మేజిక్ కీ గెలుచుకునే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌కు వంశీ సంచాలక్‌గా వ్యవహరించారు. టాస్క్‌లో భాగంగా ఒక రింగ్‌కు అటు ఇటూ తాళ్లు కట్టి ఉంటాయి. వాటిని ఇద్దరు పట్టుకుని మధ్యలో బంతిని పెట్టి దానిని నెట్‌లో వేయాలి.. బజర్ మోగేసరికి ఎవరు ఎక్కువ బంతులు వేస్తారో వారు గెలిచినట్లు అని వంశీ చదివి వినిపించారు. 

ముఖేష్- వర్షిణి, కృష్ణుడు- రోహిత్‌లు ఒక జోడీగా టాస్క్ ఆడారు. ఈ టాస్క్‌లో ముఖేష్-వర్షిణి గెలిచి మేజిక్ కీలను సొంతం చేసుకున్నారు. ఓవరాల్‌గా త్రిగుణ్, సింగర్ ఝాన్సీ, ఆటో రాంప్రసాద్, శాలిని, సృష్టి, పొట్టి నరేశ్, వర్షిణి, ముఖేష్ గౌడతో కలిపి 8 మంది మేజిక్ కీలను గెలుచుకున్నారు. మరో రెండు కీలు బ్యాలెన్స్ ఉండగా వాటిని ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి. 


Comments