భారత్- పాకిస్తాన్ మ్యాచ్ విలువ ఎన్ని వేల కోట్లో తెలుసా? మ్యాచ్ రద్దయితే నష్టం ఎంతంటే?

 


త్వరలో జరగనున్న టీ 20 ప్రపంచకప్ వివాదాస్పదం అవుతోంది. భారత్‌లో భద్రతా కారణాలను సాకుగా చూపి బంగ్లాదేశ్ ఈ టోర్నీలో తప్పుకోవడంతో కలకలం రేపింది. ఐసీసీ పలుమార్లు నచ్చజెప్పాలని చూసినా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (బీసీబీ) మాత్రం ససేమిరా అనడంతో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌ను ఈ టోర్నీ నుంచి తప్పించి దాని స్థానంలో స్కాట్లాండ్‌ను టీ 20 ప్రపంచకప్‌లో ఆడేందుకు అనుమతించింది. ఈ వ్యవహారం సద్దుమణిగిందో లేదో ఈ టోర్నీలో మరో వివాదం చోటు చేసుకుంది. 

బంగ్లాదేశ్‌కు మద్ధతుగా నిలబడుతూ వచ్చిన పాకిస్తాన్ ఈ టోర్నీలో భారత్‌లో జరగనున్న మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశాల మేరకు పాక్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. 

అసలు ఏ ఐసీసీ టోర్నమెంట్ అయినా అసలు సిసలు మజా అందించేది భారత్ - పాకిస్తాన్ మ్యాచే. దాయాదుల మ్యాచ్‌ను ఇరుదేశాల ప్రజలతో పాటు క్రికెట్ అభిమానులు ఎంజాయ్ చేస్తుంటారు. మైదానంలో సింహాల్లా పోరాడటంతో పాటు భావోద్వేగాలు ముడిపడిన అంశం కావడంతో ఏ మ్యాచ్‌కు రానంత రికార్డ్ స్థాయిలో వ్యూస్‌తో పాటు ఆదాయం కూడా భారత్ - పాక్ మ్యాచ్‌కు వస్తుండటంతో ఐసీసీ తన టోర్నమెంట్‌లలో ఖచ్చితంగా రెండు జట్లను ఒకే గ్రూప్‌లో ఆడేలా ప్లాన్ చేస్తుంది.

భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌తో ఐసీసీకి, ఇరు దేశాల క్రికెట్ బోర్డులకు కూడా భారీ ఆదాయం వస్తోంది. ప్రసార హక్కులు, ప్రకటనలు, స్పాన్సర్‌షిప్‌లు, టికెట్ విక్రయాలు, ఇతర వాణిజ్య కార్యక్రమాలతో భారీ లాభాలను కళ్లజూస్తున్నారు. ఈసారి టీ 20 ప్రపంచకప్ - 2006లోనూ భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ విలువ దాదాపు 4500 కోట్ల రూపాయలని అంచనా.  ఇందులో సింహా భాగం డిజిటల్, లైవ్ టెలివిజన్ ప్రసార హక్కుల ద్వారా వచ్చేదే. 

భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ జరుగుతుండగా ప్రకటనలు ప్రసారం చేయాలంటే 10 సెకన్ల స్లాట్‌కు 25 నుంచి 40 లక్షల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. అలా ఒక్క మ్యాచ్ ద్వారా ప్రకటనల కింద దాదాపు 300 కోట్ల ఆదాయం రానుంది. టీ 20 ప్రపంచకప్‌లో ఏ ఇతర జట్ల మధ్య జరిగే మ్యాచ్ కూడా ఈ స్థాయిలో ఆదాయాన్ని అందించలేదు. ఒక్కో మ్యాచ్ విలువ సరాసరిగా 138 కోట్ల రూపాయలు మాత్రమే. ఇది భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌లో ప్రకటన ద్వారా వచ్చే ఆదాయంలో సగం కూడా దాటదంటే దాయాదుల పోరుకు క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

ఇప్పుడు ఇండియాతో జరిగే మ్యాచ్‌ను పాకిస్తాన్ బహిష్కకరించడం వల్ల ఈ ప్రకటనల కింద వచ్చే ఆదాయాన్ని బ్రాడ్‌కాస్టర్స్ కోల్పోనున్నారు. ఈ మ్యాచ్ ప్రభావం.. టోర్నీలోని మిగిలిన మ్యాచ్‌లపైనా బలంగా పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. తద్వారా బ్రాడ్‌కాస్టర్స్ దాదాపు 400 కోట్ల రూపాయలు కోల్పోతారని భావిస్తున్నారు. దీనిని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ భరిస్తుంది. అయితే సభ్యదేశాలకు పంచే ఆదాయంలో కోత విధిస్తుంది. ఈ ప్రభావం క్రికెట్‌ను శాసించే భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి దేశాలపై పడదు. కానీ చిన్నా చితకా జట్లకు ఐసీసీ ఆదాయమే జీవనాధారం అలాంటి దేశాలు పాకిస్తాన్ నిర్ణయం వల్ల తీవ్రంగా నష్టపోనున్నాయి.

అటు భారత్‌తో మ్యాచ్‌ను పాకిస్తాన్ బహిష్కరించడం వల్ల పాక్ క్రికెట్ మనుగడ ప్రశ్నార్ధకంగా మారనుంది. ఐసీసీ నుంచి ఏడాదికి పాక్ క్రికెట్ బోర్డ్ 34.51 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని అందుకుంటుంది. ఇప్పుడు భారత్‌తో మ్యాచ్ రద్దయితే ఆదాయంలో కోతతో పాటు ఐసీసీ నుంచి భారీ జరిమానాలు, ప్రసారకర్తల నుంచి లీగల్ సమస్యలు, అంతర్జాతీయ క్రీడాకారులు పాకిస్తాన్‌లో పాల్గొనే మ్యాచ్‌లకు ఎన్ఓసీ అందుకునే విషయంలో తీవ్ర ఇబ్బందులు తప్పవు. 

ఇక్కడితో ఇది ఆగదు.. క్రమశిక్షణ చర్యల కింద పాకిస్తాన్‌ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఐసీసీ సస్పెండ్ చేసే అవకాశం కూడా లేకపోలేదనే వార్తలు వస్తున్నాయి. త్వరలో ఐసీసీ సమావేశం జరగనుండగా.. ఈ భేటీలో పాకిస్తాన్‌పై చర్యలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌కు సమయం ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ తన నిర్ణయం పట్ల వెనక్కి తగ్గుతుందా? లేక కట్టుబడి ఉంటుందా? అన్నది చూడాలి. పీసీబీ నిర్ణయంపై క్రికెట్ ప్రేమికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 


ఘోర విమాన ప్రమాదం... మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం

 


బుధవారం మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. ఈ వార్తతో మహారాష్ట్రతో పాటు యావత్ దేశం ఉలిక్కిపడింది. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం బుధవారం ముంబై నుంచి బారామతి వెళ్తుండగా విమానం కుప్పకూలినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌ సహా ఐదుగురు దుర్మరణం పాలైనట్లుగా తెలుస్తోంది. వీరిలో ఇద్దరు పైలట్స్, ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

అజిత్ పవార్ ప్రస్థానం:

1959 జూలై 22న మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా దేయ్‌లాలీ ప్రవరలో జన్మించారు అజిత్ పవార్. ఆయన తండ్రి అనంతరావ్ పవార్. ఈయన ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కి స్వయాన అన్నయ్య. చదువు పూర్తి చేసిన తర్వాత రాజకీయాలపై ఆసక్తితో బాబాయ్ శరద్ పవార్ శిష్యరికంలో అడుగులువ వేశారు అజిత్. 1982లో తొలిసారిగా కార్పోరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డ్‌కు ఎన్నికయ్యారు. అనంతరం మహారాష్ట్రలో బలమైన సహకార సంఘాలపై పట్టు సాధించిన పవార్.. 16 ఏళ్ల పాటు పుణె జిల్లా కేంద్ర సహకార కో ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్‌గా వ్యవహరించారు.

1991లో తొలిసారిగా తన కుటుంబ రాజకీయాలకు కేంద్రంగా ఉన్న బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ దశలో శరద్ పవార్ కేంద్రంలో చక్రం తిప్పేందుకు వీలుగా బాబాయ్ కోసం ఆ సీటును త్యాగం చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు 1991లో బారామతి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి తొలిసారిగా మహారాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ నియోజకవర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత అజిత్ పవార్ సొంతం. 

పలుమార్లు మంత్రిగా పనిచేసిన అజిత్ పవార్... ముఖ్యంగా ఆర్ధిక శాఖపై బలమైన ముద్ర వేశారు. పలుమార్లు బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటు మహారాష్ట్రకు పాలసీలు రూపొందించారు. బాబాయ్ శరద్ పవార్‌కు కుడిభుజంగా ఉంటూ మహారాష్ట్ర రాజకీయాలను శాసించారు. అయితే గత మహారాష్ట్ర ఎన్నికలకు ముందు బాబాయ్ శరద్ పవార్‌పై తిరుగుబాటు చేసి ఎన్సీపీలో చీలిక తీసుకొచ్చారు. తన వర్గం ఎమ్మెల్యేలతో ఎన్డీఏలో చేరి వ్యూహాత్మకంగా పార్టీని, ఎన్సీపీ గుర్తును సొంతం చేసుకున్నారు. అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా.. ఆర్ధిక, ప్రణాళిక, క్రీడలు, మైనారిటీ వ్యవహారాల శాఖలను నిర్వహిస్తున్నారు. గతంలోనూ పలువురు ముఖ్యమంత్రులకు డిప్యూటీ సీఎంగా వ్యవహరించి.. మహారాష్ట్రలో అత్యధిక కాలం డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఘనత దక్కించుకున్నారు అజిత్ పవార్.

మహారాష్ట్రలో పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పక్షాల్లోనూ అజిత్ పవార్‌కు సన్నిహితులు ఉన్నారు. రాజకీయ, సినీ, వ్యాపార, తదితర రంగాల ప్రముఖులతోనూ ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రవేయడంతో పాటు భవిష్యత్‌లో సీఎం అవుతారని అంతా భావిస్తున్న వేళ అజిత్ పవార్ విమాన ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో రాష్ట్ర ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అజిత్ పవార్ హఠాన్మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ తదితరులు సంతాపం తెలియజేస్తున్నారు. 

300 కోట్లకు అడుగు దూరంలో మెగాస్టార్.. మన శంకర వరప్రసాద్ గారుతో చిరంజీవి రికార్డ్‌లు చూశారా?


అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ చిత్రం.. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మెగా అభిమానులు అసలు సిసలు సంక్రాంతిని తెచ్చింది. మెగాస్టార్ నుంచి తాము ఏళ్లుగా మిస్ అయిన.. తాము చిరంజీవిని ఎలా చూడాలని అనుకుంటున్నామో నాటి వింటేజ్ హీరోని అభిమానుల ముందు ప్రెజెంట్ చేశారు అనిల్ రావిపూడి. చిరంజీవికి తోడు వెంకటేష్ అల్లరితో మన శంకర వరప్రసాద్ మూవీ భారీ కలెక్షన్స్ సాధిస్తోంది. విడుదలై వారం దాటిపోయిన నేపథ్యంలో చిరంజీవి ఫస్ట్ వీక్ ఎన్ని కోట్ల కలెక్షన్స్ వసూలు చేశారు అనేది ఆసక్తిగా మారింది.

సాక్‌నిక్ వెబ్‌సైట్ వెల్లడించిన లెక్కల ప్రకారం మనశంకర వరప్రసాద్ గారు మూవీ భారతదేశంలో తొలివారం 158 కోట్ల రూపాయల నికర కలెక్షన్స్... 188 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు సాక్‌నిక్ చెప్పింది. మెగాస్టార్ మూవీ ఇప్పటికే  నార్త్ అమెరికాలో 2.5 మిలియన్ డాలర్లు రాబట్టగా.. త్వరలోనే 3 మిలియన్ డాలర్లు (27 కోట్ల రూపాయలు) మైలురాయిని చేరుకోనుంది. మన శంకర వరప్రసాద్ గారు మూవీ ఫస్ట్ వీక్‌లో 292  కోట్లు వసూలు చేసినట్లు షైన్ క్రియేషన్స్‌ అధికారికంగా ప్రకటించింది. సోమవారం నాటి కలెక్షన్స్‌తో ఈ సినిమా 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తద్వారా మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో తొలి 300 కోట్ల రూపాయల సినిమాగా మన శంకర వరప్రసాద్ గారు మూవీ నిలవనుంది. 

టాలీవుడ్‌కు నాలుగు దశాబ్ధాలుగా నాలుగు స్తంభాల్లా నిలిచిన నలుగురు  అగ్ర కథానాయకుల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత 300 కోట్ల కలెక్షన్స్ సాధించిన హీరోగా చిరంజీవి నిలవనున్నారు. అలాగే వరుసగా రెండు సంక్రాంతులకు రెండు 300 కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్‌గా అనిల్ రావిపూడి అరుదైన రికార్డుకు అడుగు దూరంలో నిలిచారు. అలాగే మొదటి వారంలో 292 కోట్ల రూపాయలు వసూలు చేసిన తొలి రీజనల్ మూవీగా మన శంకర వరప్రసాద్ నిలిచింది. దానితో పాటు విడుదలైన ఏడో రోజు 30 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాగా శంకర వరప్రసాద్ కొత్త చరిత్ర సృష్టించాడు. 

అంతేకాదు.. ప్రాంతీయ చిత్రాల విభాగంలో అత్యంత వేగంగా బుక్ మై షోలో 3 మిలియన్లకు పైగా టికెట్స్ బుక్ చేసిన సినిమాగా నిలిచింది. కృష్ణా జిల్లాలో తొలి వారం అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ 5 చిత్రాలలో మన శంకర వరప్రసాద్ గారు (7.63 కోట్ల  రూపాయలు) 4వ స్థానంలో నిలిచినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ జాబితాలో ఆర్ఆర్ఆర్ (10.70 కోట్ల రూపాయలు) అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత పుష్ప 2 (8.49 కోట్ల రూపాయలు), బాహుబలి 2 (8.35 కోట్ల రూపాయలు), కల్కి 2898 ఏడీ (7.02 కోట్ల రూపాయలు)తో నిలిచాయి. 


ఇరాన్‌పై ట్రంప్ దూకుడు... మరో భారీ ఆపరేషన్‌కు ఇండియా రెడీ?

 


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుతో ప్రపంచం వణికిపోతోంది. కొద్దిరోజుల క్రితం వెనిజులా అధ్యక్షుడు, అతని భార్యను అరెస్ట్ చేసి రాత్రికి రాత్రి న్యూయార్క్ తరలించి ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేశారు ట్రంప్. అక్కడితో ఆగకుండా తానే వెనిజులాకు తాత్కాలిక అధ్యక్షుడినని ప్రకటించారు. అమెరికా భద్రత, డ్రగ్స్ నిర్మూలన‌కే ఈ సైనిక చర్య చేపట్టినట్లు ట్రంప్ చెబుతున్నప్పటికీ.. వెనిజులాలోని చమురు, పెట్రోల్ వనరులపై ఆధిపత్యం కోసమే అగ్రరాజ్యం ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ కన్ను

వెనిజులాపై సైనిక చర్యను మరిచిపోకముందే ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ఆయన పావులు కదుపుతున్నారు. అమెరికా జాతీయ భద్రత దృష్ట్యా గ్రీన్‌లాండ్ తమకే దక్కాలని.. ఇందుకు నాటో దేశాలు చొరవ చూపాలని లేదంటే రష్యా, చైనాలు దానిని ఆక్రమించుకుంటాయని ట్రంప్ చెబుతున్నారు. అయితే తోటి నాటో దేశం ఆధీనంలో ఉన్న గ్రీన్‌లాండ్‌పై సైనిక చర్యను ఆ కూటమిలోని దేశాలతో పాటు అంతర్జాతీయ సమాజం వ్యతిరేకిస్తోంది. ఈ వివాదం ముదురుతున్న దశలోనే ఇరాన్‌లో అక్కడి ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేయడం, నిరసనలను అణిచివేసేందుకు ఇరాన్ పెద్దలు కఠినంగా వ్యవహరిస్తుండటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ అయ్యారు.

ఇరాన్ నిరసనలకు ట్రంప్ మద్ధతు

ఇరాన్‌లో నిరసనకారులకు ఆయన బహిరంగంగా మద్ధతు పలకడంతో పాటు నిరసనలను ఖండించారు. ఇరాన్ ప్రజలకు అమెరికా అండగా ఉంటుందని.. నిరసనలు ఆపొద్దని సోషలో మీడియాలో పేర్కొన్నారు. ఆందోళనలను అణిచివేసే క్రమంలో మానవత్వంతో వ్యవహరించాలని లేనిపక్షంలో ఇరాన్‌ భారీ మూల్యం చెల్లించక తప్పదని ట్రంప్ హెచ్చరించారు. అయితే అగ్రరాజ్యాధినేత ఈ స్థాయిలో వార్నింగ్ ఇచ్చినా ఇరాన్ ఏమాత్రం తగ్గడం లేదు. అరెస్ట్ చేసిన ఆందోళనకారులకు మరణశిక్ష సహా కఠినమైన శిక్షలను విధించాలని అక్కడి ప్రభుత్వం పెద్దలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు

ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా ఏ క్షణామైనా ఇరాన్‌పై విరుచుకుపడే అవకాశాలు ఉండటంతో గల్ఫ్, పశ్చిమాసియా దేశాలలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్‌పై సైనిక చర్యకు ట్రంప్ నిర్ణయించినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనికి తగినట్లుగానే అగ్రరాజ్యం.. తనకు గల్ఫ్, పశ్చిమాసియా దేశాలలో ఉన్న సైనిక స్థావరాలను అప్రమత్తం చేయడంతో పాటు ఆయుధ సంపత్తిని భారీగా మొహరిస్తోంది. అలాగే అమెరికాకు దాని మిత్రపక్షాల నుంచి కూడా సంపూర్ణ సహకారం లభిస్తోంది. అటు ఇజ్రాయెల్ కూడా మరోవైపు నుంచి ఇరాన్‌ను కమ్మేయడం ఖాయంగా కనిపిస్తుండటంతో ఇరాన్‌లో రాగల 24 గంటల్లో ఏం జరుగుతుందోనని అంతర్జాతీయ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

ప్రపంచ దేశాలు అలర్ట్

ఇరాన్‌లో పరిస్ధితుల నేపథ్యంలో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. తమ పౌరులు తక్షణం ఇరాన్ విడిచి వచ్చేయడంతో పాటు ఆ దేశానికి విమాన సర్వీసులను సైతం నిలిపివేశాయి. అటు భారతదేశం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే పలుమార్లు అడ్వైజరీలను జారీ చేయగా.. తాజాగా పలు మార్గాల్లో భారతీయులు ఇరాన్‌ను వీడాలని కేంద్ర విదేశాంగ శాఖ సూచించింది. అలాగే ఇరాన్ నుంచి భారతీయులను క్షేమంగా స్వదేశానికి తిరిగి తీసుకురావడానికి భారీ ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇరాన్‌లో 10 వేలమంది భారతీయులు

విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం ఇరాన్ వ్యాప్తంగా దాదాపు 10 వేలమంది భారతీయులు ఉన్నట్లుగా అంచనా. ఇంటర్నెట్ సేవలు, రవాణా సేవలు స్తంభించిపోవడంతో వీరి తరలింపులో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ అన్ని రకాల మార్గాల ద్వారా భారతీయులను స్వదేశానికి తరలించేలా కేంద్రం కట్టుదిట్టమైనప ఏర్పాట్లు చేస్తోంది. అయితే భారతదేశానికి ఇలాంటి ఆపరేషన్లు వెన్నతో పెట్టిన విద్య. ఈ తరహా ఆపరేషన్లు నిర్వహించడం కొత్త కూడా కాదు.. కరోనా, లాక్‌డౌన్ సమయంలో వందే భారత్ మిషన్ ద్వారా ప్రపంచం మునుపెన్నడూ చూడని తరలింపు ప్రక్రియ చేపట్టింది ఇండియా.  వివిధ దేశాలలో చిక్కుకుపోయిన దాదాపు 1.83 కోట్ల మంది భారతీయులను స్వదేశానికి క్షేమంగా తీసుకొచ్చి చరిత్ర సృష్టించింది.

భారీ ఆపరేషన్‌కు ఇండియా రెడీ?

2022లో రష్యా - ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకురావడానికి గాను భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగా పేరుతో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఉక్రెయిన్ నుంచి రొమానియా, హంగరీ, పోలాండ్, స్లోవాకియా దేశాల మీదుగా 22500 మంది భారతీయులను స్వదేశానికి తరలించింది ఇండియా. ఇక గతేడాది ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధ సమయంలో ఆపరేషన్ సింధు చేపట్టిన భారతదేశం.. ఇజ్రాయెల్, ఇరాన్‌లలో ఉన్న దాదాపు 4,429 మంది భారతీయులను క్షేమంగా స్వదేశానికి తరలించింది. ఇప్పుడు ఇరాన్‌లో యుద్ధ వాతావరణం నేపథ్యంలో మరోసారి భారతదేశం భారీ ఆపరేషన్‌కు సిద్ధమైనట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే భారత విదేశాంగ శాఖ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడాల్సిందే.

దళపతి విజయ్‌ సినిమాకు కష్టాలు... జన నాయగన్‌కు సుప్రీంకోర్టులోనూ షాక్

 


కోలీవుడ్ సూపర్‌స్టార్, దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం జన నాయగన్ కష్టాలు కొనసాగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం జనవరి 9న విడుదల కావాల్సిన ఈ సినిమా అనూహ్యంగా వాయిదా పడింది. సెన్సార్ సంబంధిత కారణాలతో విజయ్ చిత్రం వాయిదా పడింది. చివరి న్యాయస్థానాన్ని ఆశ్రయించినా చిత్ర నిర్మాతలకు ఊరట లభించింది. తాజాగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు నిరాశే ఎదురైంది. 

సెన్సార్ సర్టిఫికెట్ జారీపై స్టే విధించిన మద్రాస్ హైకోర్ట్ తీర్పును సవాల్ చేస్తూ జన నాయగన్‌ను నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్‌నే ఆశ్రయించాలని తీర్పు వెలువరించింది. అలాగే ఈ నెల 20వ తేదీన జన నాయగన్ కేసుపై విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్ట్ డివిజన్ బెంచ్‌కు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఆ రోజునే ఖచ్చితంగా తీర్పును వెలువరించాలని ధర్మాసనం సూచించింది.

జన నాయగన్ వివాదం ఏంటీ?

జన నాయగన్‌ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, రెబా మోనికా జాన్, సునీల్, మోనిషా బ్లెస్సీ, నిళగల్ రవి, రేవతి, శ్రీకాంత్ తదితరులు నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కేలు జన నాయగన్ మూవీకి నిర్మాతలుగా వ్యవహరించారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా, ప్రదీప్ రాఘవ్ ఎడిటింగ్, అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్షన్ చేశారు.

33 ఏళ్ల సినీ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ రాజకీయాల్లోకి దిగారు దళపతి విజయ్. జన నాయగన్ తన నట జీవితంలో చివరి సినిమా అని మలేషియాలో జరిగిన ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్‌లో ప్రకటించారు. ఇకపై ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటానని తెలిపారు. తమిళనాట భారీ ఫ్యాన్ బేస్ ఉన్న విజయ్‌కి చివరి సినిమా కావడంతో కోలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ పరిశ్రమలో జన నాయగన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ దీనిని మరింత పెంచేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 9న జన నాయగన్ విడుదల అవుతుందని కేవీఎన్ ప్రొడక్షన్ రిలీజ్ డేట్ లాక్ చేసింది. నార్త్ అమెరికాతో పాటు కేరళ, కర్ణాటక తదితర ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ భారీగా జరిగింది. అయితే అనూహ్యంగా సెన్సార్ క్లియరెన్స్ కాకపోవడంతో సినిమా విడుదల ఆగిపోయింది. 

ఇందులోని కొన్ని సన్నివేశాలు తొలగించాలని, సంభాషణలు మ్యూట్ చేయాలని తొలుత సెన్సార్ బోర్డ్ సిఫారసు చేసింది. సీబీఎఫ్‌సీ బోర్డ్ ఆదేశాల మేరకు అవసరమైన మార్పులు చేసి మళ్లీ సెన్సార్ బోర్డ్ రివ్యూకి పంపింది కేవీఎన్ ప్రొడక్షన్స్. అయితే దీనిపై సీబీఎఫ్‌సీ బోర్డ్ నిర్ణయం తీసుకోకుండా.. రివ్యూని రివైజింగ్ కమిటీకి పంపించామని, వారే జన నాయగన్‌కు సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేస్తారని సెన్సార్ బోర్డ్ అధికారులు చెప్పడంతో నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్ట్ సింగిల్ జడ్జి జనవరి 9వ తేదీన తీర్పును రిజర్వ్ చేశారు. అనంతరం జన నాయగన్‌కు సర్టిఫికేట్ జారీ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. 

దీంతో నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. సంక్రాంతి సీజన్‌లోనే జన నాయగన్ రిలీజ్ అవుతుందని ఆశించారు. కానీ అంతలోనే వీరి ఆనందం ఆవిరైంది. ఈ తీర్పుపై సెన్సార్ బోర్డ్.. మద్రాస్ హైకోర్ట్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. తమకు కొంత సమయం కావాలని.. సినిమాను రివ్యూ చేయాలని కోరడంతో జన నాయగన్ సెన్సార్ విషయంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించడంతో పాటు తదుపరి విచారణను జనవరి 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్‌నే ఆశ్రయించాలని సుప్రీం తీర్పు వెలువరించింది. దీంతో విజయ్ అభిమానులు మరోసారి నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 


మన శంకర వరప్రసాద్ గారు కలెక్షన్స్... చిరంజీవి సినిమాకు ఓపెనింగ్స్ ఎన్ని కోట్లంటే?

 


ఓటమి ఏరుగని దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్గింపు తెచ్చుకున్నారు అనిల్ రావిపూడి. పటాస్‌తో మొదలుపెట్టి సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, ఎఫ్ 3, భగవంత్ కేసరి, సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్నారు అనిల్. తాజాగా ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఆఫర్ అందుకున్నారు. ఎంతో మంది దర్శకులకు మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయాలని ఒక కల. అలాంటి అరుదైన అవకాశం అనిల్ రావిపూడికి దక్కింది.

సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ద్వారా అనిల్ నెక్ట్స్ ఎవరితో చేస్తున్నారనే ఉత్కంఠకు తెరదించుతూ మెగా 157గా మన శంకర వరప్రసాద్ గారు చిత్రాన్ని ప్రకటించారు. యాక్షన్, కమర్షియల్ సినిమాలతో బిజీ అయిపోయిన చిరును వింటేజ్ లుక్‌లోకి తీసుకొచ్చారు అనిల్. మెగాస్టార్ మార్క్ డ్యాన్స్‌లు, కామెడీలతో మన శంకర వరప్రసాద్ గారు చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో లేడీ సూపర్‌స్టార్ నయనతార ఆయనకు జంటగా నటించారు.

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటితో కలిసి చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల సంయుక్తంగా మన శంకర వరప్రసాద్ గారు సినిమాను నిర్మించారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా, భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకుడిగా పనిచేశారు. తమ్మిరాజు ఎడిటర్‌గా సేవలు అందించారు. ఇక అన్నింటిలోకి ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు అనిల్ రావిపూడి. దశాబ్ధాలుగా తెలుగు ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న చిరంజీవి- విక్టరీ వెంకటేష్ కాంబోని ఆయన సుసాధ్యం చేశారు. చిరుతో కలిసి వెంకీ చేసిన అల్లరితో మన శంకర వరప్రసాద్ గారు చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శరత్ సక్సేనా, కేథరిన్ థ్రెసా, సచిన్ ఖేడేకర్, మాస్టర్ రేవంత్, బేబీ ఐరా, హర్షవర్థన్‌ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

మన శంకర వరప్రసాద్ గారు చిత్రాన్ని దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. మెగాస్టార్ క్రేజ్, అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డులతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగినట్లుగానే ఈ చిత్రం థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్‌లో బాగానే రాబట్టింది. తెలుగు రాష్ట్రాలు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి వరల్డ్ వైడ్‌గా మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు 150 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది.

సంక్రాంతి కానుకగా జనవరి 12న మన శంకర వరప్రసాద్ గారు చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. దీనికి ముందు రోజు రాత్రి తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్‌లలో పెయిడ్ ప్రీమియర్స్ పడ్డాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 800 స్క్రీన్లు, కర్ణాటక + తమిళనాడులలో 300 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 800 స్క్రీన్లు చొప్పున వరల్డ్ వైడ్‌గా 2100 థియేటర్స్‌లో మన శంకర వరప్రసాద్ గారు చిత్రాన్ని విడుదల చేశారు.

మన శంకర వరప్రసాద్ గారు తొలిరోజు కలెక్షన్స్‌పైలుక్కేస్తే... పెయిడ్ ప్రీమియర్స్కింద ఏపీ, తెలంగాణలలో 8.5 కోట్ల రూపాయలు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో 2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 1.5 మిలియన్ డాలర్లు ( 13.52 కోట్ల రూపాయలు) చొప్పున 25 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది. తొలి రోజున ఏపీ, నైజాంలలో 60 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 8 కోట్ల రూపాయలు ఓవర్సీస్‌‌లో 15 కోట్ల రూపాయలతో కలిపి మన శంకర వరప్రసాద్ గారు 85 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. 

అతడు మూవీలో ఆ రోల్ నాదే... 6 నెలలు తిప్పించి.. చక్రవాకం ఇంద్రనీల్ షాకింగ్ కామెంట్స్

 


సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన క్లాసికల్ మూవీస్‌లో అతడు కూడా ఒకటి. ఒక సినిమా థియేటర్‌లలో హిట్ అయితే టీవీలో ఫట్ అవుతుంది. మరికొన్ని సినిమాలు థియేటర్‌లో ఫ్లాప్ అయ్యి, టీవీలో సూపర్‌ హిట్‌గా నిలుస్తుంది. అయితే అతడు సినిమా రెండు చోట్లా ఘన విజయం సాధించింది. బుల్లితెరపై అయితే ఎప్పుడు ప్రసారమైనా ఇంటిల్లిపాది టీవీలకు అతుక్కుపోతారు. విడుదలై దాదాపు 20 ఏళ్లు కావొస్తున్నా... రీ రిలీజ్‌లలోనూ సంచలన వసూళ్లు సాధిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

జయభేరి ఆర్ట్స్ బ్యానర్‌పై కిశోర్ దుగ్గిరాల, ఎం రామ్మోహన్‌లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. మహేశ్ బాబు, త్రిష హీరో హీరోయిన్లు నటించగా.. ప్రకాశ్‌రాజ్, సోనూసూద్, షయాజీ షిండే, కోటా శ్రీనివాసరావు, రాహుల్ దేవ్, నాజర్, సునీల్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళీ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. 2005 ఆగస్ట్ 10న విడుదలైన అతడు చిత్రం భారీ వసూళ్లను సాధించింది.

వరల్డ్ వైడ్‌గా రూ.22 కోట్ల కలెక్షన్స్‌తో పాటు 205 కేంద్రాలలో 50 రోజులు, 38 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. హైదరాబాద్ సుదర్శన్ 35 ఎంఎంలో 175 రోజులు ప్రదర్శించబడటంతో పాటు ఆ ఒక్క థియేటర్‌లోనే ఏకంగా రూ.1.40 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. థియేటర్ రిలీజ్ తర్వాత దాదాపు 7 ఏళ్ల తర్వాత స్టార్ మా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కాంట్రాక్ట్‌ను దాదాపు రూ.3.5 కోట్లు వెచ్చించి రెన్యువల్ చేయించుకోవడం విశేషం. టీవీలలో దాదాపు 1000 సార్లకు పైగా టెలికాస్ట్ అయిన సినిమాగా అతడు చరిత్ర సృష్టించింది.

ఇక ఈ సినిమా క్యాస్టింగ్ విషయంలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. తొలుత ఈ సినిమా కథను పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్‌ల దగ్గరకి వెళ్లగా.. అనివార్య కారణాలతో చివరికి మహేశ్ బాబు ఈ సినిమాను చేయడం.. అతడు బ్లాక్‌బస్టర్ కావడం జరిగిపోయాయి. అయితే ఈ సినిమాలో తనకు కూడా ఓ పవర్‌ఫుల్ రోల్ దక్కిందని, చివరి నిమిషంలో చేజారిపోయిందని బుల్లితెర నటుడు ఇంద్రనీల్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

విజయవాడకు చెందిన ఇంద్రనీల్.. ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల వద్ద నటనలో శిక్షణ తీసుకున్నారు. అతని పేరు తొలుత రాజేష్ బాబు.. అయితే న్యూమరాలజీ ప్రకారం ఇంద్రనీల్‌గా మార్చుకున్నారు. జెమినీ టీవీలో ప్రసారమైన చక్రవారం సీరియల్‌తో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు ఇంద్రనీల్. ఆ తర్వాత మొగలిరేకులు, కాలచక్ర, అపరంజి, సూర్యపుత్రుడు సీరియల్స్‌లో నటించాడు. ఇదే సమయంలో కాలేజ్, ఇష్టపడి, ఆరెంజ్ సినిమాలలో ఇంద్రనీల్ కీలకపాత్రలు పోసించారు. ఇటీవల విడుదలైన శంబాల మూవీతో మరోసారి తనలోని విలక్షణ నటుడిని పరిచయం చేశారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అతడు సినిమాలో ఛాన్స్ ఎలా మిస్ అయ్యిందో వెల్లడించాడు.

అతను సినిమాకు ఎంపికై 25 రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నా. అప్పటికీ చక్రవాకం సీరియల్ చేస్తూ పీక్స్‌లో ఉన్నాను. త్రివిక్రమ్ గారు ఏమన్నారంటే.. నావి 40 రోజుల కాల్షీట్స్ కావాలని అడిగారు. అందులో షయాజీ షిండే కొడుకు పాత్ర నాదే. దానిని తర్వాత అజయ్ గారు చేశారు. నేను కూడా అందులో పొలిటికల్ లీడర్‌నే. కాకపోతే నాకు డిజైన్ చేసిన క్యారెక్టర్ వేరు. చాలా క్లాస్ విలన్ అన్నమాట అని ఇంద్రనీల్ చెప్పారు.

వైట్ అండ్ వైట్‌ ధరించి క్లాస్‌గా కనిపిస్తా. అప్పుడు నాకు 23 ఏళ్ల వయసు. నాకొక కీప్ ఉంటుంది పక్కన సరసాలు ఆడుకుంటూ, ఓ పెగ్గేస్తూ ఉంటా. కోటా శ్రీనివాసరావు గారు ఉంటారు. నా ఇంట్రడక్షన్ కోసం జయభేరీ లోకేషన్స్‌లో ఒక పెద్ద సెట్ వేశారు... చాలా బాగా చేశారు. 20 రోజులు వర్క్ చేసిన తర్వాత 40 రోజులు కాల్షీట్స్ అడ్జెస్ట్‌మెంట్స్ కావాలని అడిగారు. అప్పట్లో సీరియల్ షూటింగ్ ప్రతిరోజూ ఉండేది. చక్రవాకంలో నేనే హీరో. మేడం మంజుల నాయుడు గారు అన్నిరోజులు అడ్జెస్ట్ చేయలేను.. మ్యాగ్జిమమ్ 15 రోజులు చూసుకోగలను అని చెప్పారు అని ఇంద్రనీల్ గుర్తుచేసుకున్నారు.

ఇదే మాట నేను ప్రొడక్షన్‌లో త్రివిక్రమ్ గారి మేనేజర్‌‌కి చెప్పా. అప్పుడు ఆయన కనుక్కుని చెబుతాను అన్నారు. ఏదో ఒకటి చెబుతారని నేను వెయిట్ చేస్తున్నా, కాల్ రావడం లేదు. 6 నెలలు అయిపోతున్నా ఇంకా చెప్పడం లేదని నేనే మళ్లీ ట్రై చేస్తుంటే ఆ రోల్‌ని అజయ్ గారు చేస్తున్నారని తెలిసింది. అప్పుడు చాలా బాధపడ్డాను.. మిస్ అయ్యాందని ఫీల్ అయ్యా. ఆ తర్వాత ఇక సినిమాలు మనకి వద్దులే అనుకున్నా. పరిస్థితులు ఇలాగే ఉంటాయేమో.. వెళ్లినా అక్కడ ఛాన్స్ ఉంటుందో, లేదో అనిపించింది? ఇక సినిమాల మీద కాన్సన్‌ట్రేషన్ కూడా చేయలేదు అని ఇంద్రనీల్ క్లారిటీ ఇచ్చారు.