టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్.. ఫైనల్‌లో న్యూజిలాండ్ చిత్తు, టీమిండియా నయా హిస్టరీ

 

Photo Courtesy: X.com/BCCI

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఛాంపియన్‌గా టీమిండియా నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి మూడో సారి టీ20 ప్రపంచకప్‌ను అందుకుని చరిత్ర సృష్టించింది. ఇంతకు ముందు క్రికెట్ దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మలు భారత జట్టుకు ట్రోఫీలు అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి సరసన సూర్యకుమార్ యాదవ్ కూడా చేరారు. 

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ 2026లో తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు అభిషేర్ శర్మ (52), సంజూ శాంసన్ (89)లు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ విధ్వంసక ఆటతో కివీస్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. 

ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను రచిన్ రవీంద్ర విడదీశాడు. 52 పరుగుల వ్యక్తిగత స్కోరు అభిషేక్ శర్మ ఔటయ్యాడు. అభి ఔటైనా సంజూ విధ్వంసం కొనసాగింది. అతనికి ఇషాన్ కిషన్ (54) నుంచి చక్కటి సహకారం లభించగా.. ఇద్దరూ ధాటిగా ఆడి పరుగుల వరద పారించారు. వీరి ధాటికి భారత్ 12 ఓవర్లకే 150 పరుగుల మార్క్ దాటేసింది. ఈ దశలో జేమ్స్ నీషమ్ మేజిక్ చేశాడు. ఒకే ఓవర్‌లో సంజూ, ఇషాన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లను ఔట్ చేశాడు. తర్వాత కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో భారత్‌కు పరుగులు చేయడం కష్టమైంది. 

ఈ దశలో హార్డిక్ పాండ్య (18), శివమ్ దూబే (26)లు బ్యాట్ ఝళిపించడంతో టీమిండియా 250 పరుగుల మార్క్ దాటింది. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో జేమ్స్  నీషమ్ 3 వికెట్లు తీయగా.. హెన్రీ, రచిన్ రవీంద్రలు తలో వికెట్ పడగొట్టారు. భారత బ్యాట్స్‌మెన్‌లో సంజూ శాంసన్ 89 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 

256 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ ధాటిగా తన ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. ఓపోనర్ టిమ్ సీఫెర్ట్ ఫోర్లు, సిక్సర్లతో భారత బౌలర్లను వణికించాడు. ఈ దశలో అక్షర్ పటేల్ కివీస్‌కు షాకిచ్చాడు. 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓపెనర్ అలెన్‌ను ఔట్ చేశాడు. ఆ వెంటనే బుమ్రా బౌలింగ్‌లో రచిన్ రవీంద్ర పెవిలియన్ చేరాడు. కీలక ఆటగాళ్లు గ్లెన్ ఫిలిప్స్ (5), మార్క్ చాప్‌మెన్ (3), డేరీ మిచెల్‌ (17)లను భారత్ త్వరత్వరగా ఔట్ చేయడంతో న్యూజిలాండ్ కష్టాల్లో పడింది.

ఓ వైపు వికెట్లు పడుతున్నా స్టిఫెర్ట్ మాత్రం దూకుడుగా ఆడుతూనే ఉన్నాడు. ఈ దవలో వరుణ్ చక్రవర్తికి దొరికిపోవడంతో న్యూజిలాండ్ ఆశలు వదిలేసుకుంది. చివరి వరుస బ్యాట్స్‌మెన్లు జేమ్స్ నీషమ్ (8), హెన్రీ (0), ఫెర్గూసన్ (6), జాకబ్ డఫి (3)లను కూడా భారత బౌలర్లు ఇంటికి పంపారు. అయితే న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ మొండిగా పోరాడుతూ ఆశలు రేపాడు. అయితే బుమ్రా అతనిని క్లీన్‌బౌల్డ్ చేసి భారత్‌కు విజయాన్ని ఖరారు చేశాడు. దాంతో న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటై దారుణ పరాజయాన్ని చవిచూసింది. నాలుగు వికెట్లు తీసి భారత విజయంలో కీలకపాత్ర పోషించిన జస్‌ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కగా.. సంజూ శాంసన్‌ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ అవార్డ్ దక్కించుకున్నాడు. 

 


టాక్సిక్ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

 


కర్ణాటకకు చెందిన బడా నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు అస్సలు టైం బాగున్నట్లుగా కనిపించడం లేదు. కోలీవుడ్ సూపర్‌స్టార్, దళపతి విజయ్ సినీ కెరీర్‌లో చివరి మూవీ జన నాయగన్‌ను ఈ సంస్థే నిర్మించింది. తమ అభిమాన నటుడి చివరి సినిమా కావడంతో విజయ్ అభిమానులు కూడా జన నాయగన్ కోసం ఉత్కంఠగా ఎదురుచూశారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది.

అయితే సెన్సార్ బోర్డ్ నుంచి అనుమతులు రాకపోవడం, న్యాయపరమైన చిక్కులు కారణంగా జన నాయగన్ సినిమాను వాయిదా వేస్తున్నట్లు కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. కట్ చేస్తే.. కన్నడ సూపర్‌స్టార్ యష్ నటించిన లేటెస్ట్ మూవీ టాక్సిక్. కేజీఎఫ్ సిరిస్ తర్వాత యష్ నటిస్తున్న మూవీ కావడంతో టాక్సిక్‌పైనా భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి 19న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా విడుదల అవుతుందని నిర్మాతలు ప్రకటించారు.

ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ చేశారు. అదే రోజున రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 విడుదల కానుండటంతో రెండు సినిమాలలో ఏది బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుందోనని సినీ జనాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి దశలో టాక్సిక్‌ నిర్మాతలు షాకిచ్చారు. టాక్సిక్ : ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్‌ మూవీ విడుదలను వాయిదా వేస్తున్నట్లు కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. 

ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ యుద్ధంతో పాటు ఇరాన్ ప్రతీకార దాడులతో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది. జూన్ 4న భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్‌లో టాక్సిక్‌ను విడుదల చేస్తామని ప్రకటించింది. దాంతో యష్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 


Thalapathy Vijay: దళపతి విజయ్‌కి షాక్.. విడాకులు కోసం కోర్టుకెక్కిన భార్య సంగీత

 


కోలీవుడ్ సూపర్‌స్టార్, టీవీకే అధినేత దళపతి విజయ్‌కి తమిళనాడు ఎన్నికల వేళ బిగ్ షాక్ తగిలింది. విజయ్ నుంచి విడాకులు కావాలంటూ ఆయన సతీమణి సంగీత ఫిబ్రవరి 25వ తేదీన చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని పరిగణనలోనికి తీసుకున్న కోర్ట్.. విజయ్‌కి సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 20న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. తన భర్తకు మరో మహిళ అక్రమ సంబంధం ఉందని సంగీత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 

దశాబ్ధాల పాటు తనను ఆదరించి ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజల కోసం సినీ కెరీర్‌ను వదులుకుని రాజకీయాల్లోకి దిగారు దళపతి విజయ్. తమిళగ వెట్రి కజగం అనే పార్టీని స్థాపించి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తమిళనాట సూపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్, ఛరిష్మా ఉన్న నటుడిగా విజయ్‌కి పేరు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి దిగడంతో రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పక్షాలైన డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు కాంగ్రెస్, బీజేపీలు షాక్ అయ్యాయి. 

త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ ఎవరి ఓట్లు చీలుస్తాడో? ఎవరికి విజయావకాశాలను దూరం చేస్తాడోననని నేతలు టెన్షన్‌లో ఉన్నారు. ఇప్పటికే విడుదలవుతున్న పలు సర్వేలు.. విజయ్‌కి చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు పడతాయని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్‌ని దారికి తెచ్చుకుని పొత్తు పెట్టుకోవాలని పలు పార్టీలు భావిస్తున్నాయి. అయితే డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీలకు తాను దూరమని ఇప్పటికే విజయ్ ప్రకటించారు. 

రాష్ట్ర రాజకీయాలు హాట్ టాపిక్‌గా ఉన్న సమయంలో కొద్దిరోజుల క్రితం ప్రముఖ సినీ నటి త్రిషతో విజయ్‌కి లింక్ పెడుతూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. విజయ్‌కి రాజకీయ అనుభవం లేదని... ముందు ఆయన తన కుటుంబంలోని సమస్యలను చక్కదిద్దుకోవాలి. త్రిష ఇంటి నుంచి బయటకు వస్తేనే విజయ్‌కి వాస్తవాలు తెలుస్తాయంటూ నాగేంద్రన్ వ్యాఖ్యానించారు. 

ఈ వ్యాఖ్యలు తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. విజయ్ - త్రిషల మధ్య ఏదో జరుగుతోందని గత కొద్దినెలలుగా గాసిప్స్ వైరల్ అవుతున్న దశలో నాగేంద్రన్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అయితే దీనికి త్రిష తనదైన శైలిలో రియాక్ట్ అయ్యింది. సంబంధం లేని విషయాల్లోకి తన పేరును తీసుకురావొద్దని.. లేనిపక్షంలో లీగల్‌గానే స్పందిస్తానని వార్నింగ్ ఇచ్చింది. దాంతో త్రిషకి నాగేంద్రన్ క్షమాపణలు చెప్పారు. 

ఈ వివాదం సద్దుమణిగిందో లేదో విజయ్ భార్య సంగీత షాకిచ్చారు. తనకి విడాకులు కావాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లో ఆమె పలు అభియోగాలు కూడా చేశారు. 2021 నుంచి విజయ్‌కి ఓ తమిళ సినీ నటితో వివాహేతర సంబంధం ఉందని.. దీని కారణంగా తాను ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తున్నట్లు సంగీత ఆరోపించింది. రెండేళ్లుగా తామిద్దరం విడివిడిగానే ఉంటున్నామని పేర్కొంది. 

ఇప్పటికే కరూర్ తొక్కిసలాట, సీబీఐ విచారణ, జన నాయగన్ మూవీ ఆగిపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్న విజయ్‌కి తాజాగా భార్య సంగీత షాక్ ఇవ్వడంతో ఆయనకు ఏం చేయాలో అర్ధం కానీ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు రాజకీయ ప్రత్యర్ధులను ఎదుర్కొంటూనే.. ఇప్పుడు సొంతింట్లో భార్య చేసిన ఆరోపణల నుంచి తన నిజాయితీని దళపతి విజయ్ ఎలా నిరూపించుకుంటారోనని తమిళ సినీ, రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. 



Rashmika Mandanna Net Worth: రష్మిక మందన్న ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?

 


కిర్రాక్ పార్టీతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి నేషనల్ క్రష్‌గా ఎదిగారు కన్నడ కస్తూరి రష్మిక మందన్న. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండను ఆమె త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మీడియాలో వస్తున్న కథనాలను బట్టి ఫిబ్రవరి 26వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ వివాహం జరగనుంది. కానీ ఈ ఇద్దరు స్టార్స్ మాత్రం తమ పెళ్లి విషయాన్ని రహస్యంగానే ఉంచుతున్నారు. ఓ పక్క ఇరు కుటుంబాల్లో పెళ్లి పనులు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తుండగా.. రష్మిక కానీ, విజయ్ కానీ ఈ విషయాన్ని ఇంత వరకు అధికారికంగ ప్రకటించలేదు. ఈ క్రమంలో రష్మిక మందన్న ఓ సినిమాకు తీసుకునే పారితోషికం ఎంత? ఆమె ఆస్తులు ఎన్ని కోట్లు? అనేది పరిశీలిస్తే.

ఏప్రిల్ 5, 1996న కర్ణాటకలోని విరాజ్‌పేటలో కొడవ కమ్యూనిటీలో జన్మించారు రష్మిక మందన్న. ఆమె తల్లిదండ్రులు సుమన్, మదన్ మందన్నా. రష్మిక తండ్రికి స్థానికంగా కాఫీ ఎస్టేట్, ఫంక్షన్ హాల్ ఉంది. ఆమె తల్లి సాధారణ గృహిణి. అయితే రష్మిక చిన్నతనంలో ఆమె తండ్రికి వ్యాపారంలో బాగా నష్టాలు రావడంతో ఆర్ధికంగా వీరి కుటుంబం చితికిపోయింది. అద్దె ఇంట్లోకి మారడం, తన తల్లిదండ్రులు తనకు ఆటబొమ్మలు కూడా కొనలేని స్థితిలో ఉన్నారని రష్మిక పలు సందర్భాల్లో చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. 

చిన్నప్పటి నుంచి చదువులో ముందుండే రష్మిక.. బెంగళూరులోని ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. ఈ క్రమంలోనే మోడలింగ్ వైపు అడుగులు వేసిన రష్మిక 2014లో టైమ్స్ ఆఫ్ ఇండియా క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ అవార్డ్‌ అందుకున్నారు. ఈ దశలో సినీరంగం నుంచి ఆమెకు అవకాశాలు వచ్చాయి. అయితే వాటిని రష్మిక తిరస్కరించారు.. తనకు నటన అంటే ఇష్టం లేదని చెప్పేవారు. కానీ ఆమె కాలేజ్ ప్రొఫెసర్ ఒత్తిడితో ఓ సినిమాకు ఆడిషన్‌ ఇవ్వడానికి వెళ్లి సెలెక్ట్ అయ్యారు రష్మిక. ఈ క్రమంలో తొలి సినిమా అగ్రిమెంట్‌ మీద సంతకం చేయడానికి తల్లిదండ్రులు మొదట ఒప్పుకోలేదు. అయితే కూతురి ఇష్టాన్ని కాదనలేక అంగీకరించారు.

2015లో కన్నడ సూపర్‌స్టార్ రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన కిర్రాక్ పార్టీలో రక్షిత్ శెట్టి సరసన నటించారు రష్మిక. ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించడంతో పాటు రష్మికు బెస్ట్ డెబ్యూ నటిగా రష్మికకు సైమా అవార్డ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత అంజనీ పుత్ర, చమక్ తదితర కన్నడ చిత్రాలలో నటించారు. ఇదే సమయంలో తన తొలి చిత్ర హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ.. ఆయనతో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంది. అయితే పెళ్లికి కొద్దిరోజుల ముందు రక్షిత్ శెట్టితో నిశ్చితార్ధాన్ని రద్దు చేసుకుని షాకిచ్చారు రష్మిక మందన్నా. 

ఈ క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రష్మికకు పిలుపొచ్చింది. ఛలో మూవీ ద్వారా ఆమె టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత గీతా గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మతో హిట్స్ అందుకున్న రష్మిక కెరీర్‌ను పుష్ప సిరీస్ మలుపు తిప్పింది. ఇందులో శ్రీవల్లిగా జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్నారు. అనంతరం యానిమల్, ఛావా, సికందర్, కుబేరా, థామా, ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రాలతో నేషనల్ క్రష్‌గా అవతరించారు రష్మిక. అత్యధిక సక్సెస్ రేట్‌తో ఆమె దరిదాపుల్లోనూ ఏ హీరోయిన్ లేరంటే అతిశయోక్తి కాదు.  ప్రస్తుతం హిందీలో కాక్‌టెయిల్, తెలుగులో మైసా సినిమాలో రష్మిక నటిస్తున్నారు. 

గీత గోవిందం సినిమా టైంలో విజయ్ దేవరకొండతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ సీక్రెట్‌గా ప్రేమాయణం సాగిస్తూ పలుమార్లు మీడియాకు దొరికిపోయారు. కానీ ఇద్దరూ తమ బంధాన్ని బయటపెట్టలేదు. గతేడాది విజయ్ దేవరకొండ - రష్మికల ఎంగేజ్‌మెంట్ హైదరాబాద్‌లో జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని కూడా వీరిద్దరూ రహస్యంగానే ఉంచారు. అనంతరం రష్మిక - విజయ్‌ల పెళ్లిపై రకరకాల రూమర్స్ వచ్చాయి. కానీ వేటికీ కూడా ఇద్దరూ స్పందించలేదు. చివరికి ఫిబ్రవరి 26వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో విజయ్ - రష్మికల పెళ్లి సీక్రెట్‌గా జరగనుందని గాసిప్స్ వైరల్ అయ్యాయి. దీనిపైనా అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. కానీ రెండు కుటుంబాల్లోనూ పెళ్లిపనులు మొదలైనట్లుగా సాక్ష్యాలు చూపిస్తున్నారు నెటిజన్లు. 

ప్రస్తుతం వార్తల్లో నిలిచిన రష్మిక మందన్న సంపాదన, ఆమె ఆస్తులపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. సినిమాల పారితోషికం, బ్రాండ్ అండార్స్‌మెంట్స్ ద్వారా రష్మిక మందన్న బాగానే ఆస్తులను కూడబెట్టినట్లుగా ఫిలింనగర్ టాక్. సినిమాకు 10 నుంచి 12 కోట్ల రూపాయల రేంజ్‌లో రెమ్యునరేషన్ అందుకుంటున్న రష్మిక మందన్న.. బ్రాండ్ ప్రమోషన్స్‌కు కూడా భారీగానే ఛార్జ్ చేస్తున్నారట. ఇక ఆమె ఆస్తుల విషయానికి వస్తే .. బెంగళూరులో 8 కోట్ల రూపాయల విలాసవంతమైన భవనంతో పాటు కూర్గ్, హైదరాబాద్‌లలోనూ రష్మికకు ఖరీదైన ఆస్తులు ఉన్నాయి. తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని రియల్ ఎస్టేట్‌తో పాటు ఇతర మార్గాల్లో పెట్టుబడులు పెడుతున్నారు రష్మిక మందన్న.

ఇక కార్లంటే రష్మికకు ఎంతో ఇష్టం. ఆమె వద్ద 1.84 కోట్ల రూపాయల విలువైన రేంజ్ రోవర్ స్పోర్ట్, ఆడి క్యూ3 (40 లక్షల రూపాయలు), మెర్సిడెస్ బెంజ్ సీ క్లాస్ (50 లక్షల రూపాయలు), టయోటా ఇన్నోవా, హ్యుందాయ్ క్రెటా వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. మొత్తంగా రష్మిక మందన్న ఆస్తుల విలువ 70 కోట్ల రూపాయల వరకు ఉంటుందని సినీ వర్గాల అంచనా. 


నిర్మాతగా కమల్ హాసన్.. టాలీవుడ్ టాప్ హీరోతో సినిమా, దిగ్గజ నటుడి బిగ్‌ స్కెచ్?


గతంలో పోలిస్తే హీరోలు సినిమాలలో నటించడంతో సరిపెట్టకుండా సినిమాతో వ్యాపారం ఎలా చేయాలనే దానిపై గట్టిగా ఫోకస్ పెడుతున్నారు. చాలా మంది హీరోలు నిర్మాతలుగా మారి మంచి లాభాలను గడిస్తున్నారు. మరికొందరైతే పంపిణీ రంగంలో అడుగుపెట్టి అక్కడా సక్సెస్ కొడుతున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇలాంటి వారు చాలామందే ఉన్నారు. అయితే ఆల్రెడీ నిర్మాణ రంగంలో ఉన్న హీరోలు.. తమ బిజినెస్ మరింత విస్తరించే పనిలో పడ్డారు. ఈ లిస్ట్‌లోకే వస్తారు తమిళ నట దిగ్గజం కమల్ హాసన్.

నటనకే కొత్త భాష్యం చెప్పి భారతదేశం గర్వించదగ్గ మహానటుల్లో ఒకరిగా చోటు దక్కించుకున్నారు కమల్ హాసన్. చాలా ఏళ్ల క్రితమే ఆయన సినీ నిర్మాణంలో అడుగుపెట్టి ఎన్నో విజయవంతమైన చిత్రాలను తీశారు. ప్రయోగాలకు, వినూత్నమైన కథలకు పెద్దపీట వేసే కమల్.. తన అభిరుచి వల్ల నిర్మాతలకు ఎలాంటి నష్టం కలగకుండా, నతకు నచ్చిన స్క్రిప్ట్‌లను వెండితెరపై ఆవిష్కరించేందుకు వీలుగా రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌ను స్థాపించారు. 

1981లో అమావాస్య చంద్రుడితో మొదలుపెట్టి.. నిన్న మొన్నటి థగ్‌లైఫ్ వరకు ఎన్నో చిత్రాలను తీశారు కమల్ హాసన్. ప్రస్తుతం తన సహచరుడు, కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి దాదాపు 45 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్నాడు కమల్. ఈ చిత్రానికి స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. భారీ బడ్జెట్‌ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం రజనీకి ఏకంగా 225 కోట్ల రూపాయల పారితోషికం సైతం అందజేయబోతున్నట్లుగా కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.

దీనితో పాటు తన 237వ చిత్రాన్ని సొంతంగా నిర్మిస్తున్నారు కమల్ హాసన్. ఇది కాకుండా కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తీకేయన్‌తో సెయాన్ నిర్మిస్తున్నారు. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. శివకార్తీకేయన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అంచనాలను పెంచేసింది. ఇదిలాఉండగా తన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌ సంస్థను విస్తరించాలని కమల్ భావిస్తున్నారట. 

తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాలు నిర్మించాలని లోక నాయకుడు యోచిస్తున్నారట. టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తదితరులతో సినిమాలు తీసి పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలని కమల్ ప్రణాళికలు రచిస్తున్నట్లుగా చిత్ర పరిశ్రమలో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఈ హీరోల ఇమేజ్‌కు తగిన స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో ఆయన ఉన్నారని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే తెలుగు స్టార్స్‌తో కమల్ సినిమా పట్టాలెక్కడం పెద్ద విషయం కాదని అంటున్నారు విశ్లేషకులు. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. 


Jaahnavi Kandula: అమెరికాలో తెలుగు విద్యార్ధిని మృతి... బాధితురాలికి 262 కోట్ల నష్టపరిహారం

ఐదేళ్ల క్రితం అమెరికాలోని సియాటెల్ నగరంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన తెలుగు విద్యార్ధిని జాహ్నవి కందుల కుటుంబానికి ఊరట లభించింది. బాధిత కుటుటంబానికి దాదాపు 262 కోట్ల రూపాయల నష్టపరిహారం దక్కింది. అసలు ఈ కేసు ఏంటీ? జాహ్నవి ఎలా చనిపోయారు? ఈ కేసులో వివాదం ఏంటీ? అనే పూర్వాపరాల్లోకి వెళితే.

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి కందుల 2021లో మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్లారు. అనంతరం సౌత్‌లేక్ యూనియన్‌లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందారు. ఈ దశలో 2023 జనవరి 23వ తేదీ రాత్రి రోడ్డు దాటుతుండగా అదే సమయంలో అటువైపు వేగంగా వస్తోన్న పోలీస్ వాహనం ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జాహ్నవి ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. ఉన్నత చదువులు చదివి జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తుందనుకున్న తమ బిడ్డ తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో జాహ్నవి కుటుంబ సభ్యలు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

అయితే అమెరికాలో తీవ్ర సంచలనం సృష్టించిన జాహ్నవి మృతి కేసుపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో అక్కడి ప్రభుత్వం విచారణ చేయించింది. ప్రమాదానికి కారణమైన పోలీస్ వాహనాన్ని ఆ సమయంలో కెవిన్ డేవ్ అనే అధికారి డ్రైవ్ చేస్తున్నాడు. జాహ్నవిని ఢీకొట్టిన ప్రదేశంలో నిబంధనల ప్రకారం కారును 40 కి.మీ వేగంలో నడపాల్సి ఉంది. కానీ కెవిన్ మాత్రం వాహనాన్ని దాదాపు 119 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నాడు. అప్పటికే అతను డ్రగ్స్ మత్తులో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. అలాగే కారుకున్న ఎమర్జెన్సీ లైట్లు ఆన్ చేసి.. కూడళ్ల వద్ద తన సైరన్‌ను ఉపయోగించినట్లు విచారణ తేలింది. 

అటు జాహ్నవి మరణంపై స్థానికంగానూ నిరసనలు జరిగాయి. ఇదే సమయంలో మరో అధికారి బాడీ కెమెరా రికార్డింగ్స్‌లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఇందులో కెవిన్ నవ్వుతూ.. జాహ్నవి మరణానికి విలువ లేదని వ్యాఖ్యానించడంతో అతనిని ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. అతని వ్యాఖ్యలు పోలీస్  శాఖ ప్రతిష్టను, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశాయని నగర పౌర వాచ్‌డాగ్ కనుగొంది. అయితే తనను విధుల నుంచి తప్పించడంపై కెవిన్ కోర్టును ఆశ్రయించాడు. న్యాయవాదులు ఈ మరణంపై ఎలా స్పందిస్తారనే  దానిపై విమర్శించేందుకే ఈ వ్యాఖ్యలు చేశానని దారుణంగా మాట్లాడాడు. 

అయితే కందుల జాహ్నవి మరణానికి కారకులైన వారిని వదిలిపెట్టేది లేదని ఆమె కుటుంబం న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తూనే వచ్చింది. ఈ క్రమంలో గత శుక్రవారం కింగ్ కౌంటీ సుపీరియర్ కోర్టులో ఇరుపక్షాలు సెటిల్‌మెంట్ నోటీసు దాఖలు చేశాయి. దీనిలో భాగంగా జాహ్నవి కుటుంబానికి 29 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 262 కోట్ల రూపాయలు) పరిహారం చెల్లించేందుకు సియాటెల్ సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ కీలక ప్రకటన చేశారు. దీని ద్వారా జాహ్నవి కుటుంబానికి కాస్తయిన ఉపశమయనం లభిస్తుందని ఎరికా పేర్కొన్నారు. అయితే సెటిల్‌మెంట్‌పై జాహ్నవి తరపు న్యాయవాదులు ఇంకా స్పందించలేదని మీడియాలో కథనాలు వస్తున్నాయి. 


ICC Under-19 Men's Cricket World Cup: విశ్వవిజేతగా యువ భారత్.. ఆరవసారి కప్ కొట్టిన టీమిండియా

 

Photo Courtesy: x.com/BCCI

అండర్ 19 వన్డే ప్రపంచకప్‌ 2026లో టీమిండియా తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఆరోసారి అండర్ 19 వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచి అరుదైన ఘనత సాధించింది. హరారెలో శుక్రవారం ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్‌లో ఏకంగా 100 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టును మట్టికరిపించి సగర్వంగా అండర్ 19 వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది టీమిండియా. 

భారత్ నిర్దేశించిన 412 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండో 40.2 ఓవర్లలో 311 పరుగుల ఆలౌట్ అయ్యింది. ఫాల్కనర్ సెంచరీతో (115) ఒంటరి పోరాటం చేసినప్పటికీ అతనికి సహకరించేవారు లేక జట్టు ఓటమి పాలైంది. ఇంగ్లీష్ ఆటగాళ్లలో బెన్ డాకిన్స 66, బెన్ మేయెస్ 45, థామస్ రేవ్ 31 పరుగులు చేశారు. భారత బౌలర్ల అంబరీష్ 3, దీపేశ్, కనిష్క్‌లు తలో 2 వికెట్లు తీయగా.. ఖిలాన్ పటేల్, ఆయుష్ మాత్రేలు తలో వికెట్ పడగొట్టారు.

తొలుత టాస్ గెలిచిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ (175) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి.. జట్టు భారీ స్కోరు చేడానికి కారణమయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ ఆయుష్ మాత్రే 53, అభిజ్ఞాన్ కుందు (40), వేదాంత్ త్రివేది (32) పరుగులు చేశారు. ఇంగ్లీష్ బౌలర్లలో జేమ్స్ మింట 3, మోర్గాన్, అలెక్స్ గ్రీన్‌లు తలో 2 వికెట్లు పడగొట్టగా.. మానీ ఒక వికెట్ తీశారు.

1988లో అండర్ 19 వన్డే వరల్డ్ కప్‌కు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రూపకల్పన చేసింది. ఈ మెగా టోర్నీలో భారత జట్టుది తిరుగులేని  రికార్డ్. మొత్తం 6 సార్లు టీమిండియా ఈ అండర్ 19 వన్డే వరల్డ్ కప్‌ ట్రోఫీని అందుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 4 సార్లు, పాకిస్తాన్ రెండు సార్లు, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాయ, వెస్టిండిస్‌లు తలో ఒకసారి కప్ గెలిచాయి. 37 ఏళ్ల ఈ ట్రోఫీ చరిత్రలో న్యూజిలాండ్, శ్రీలంకలు ఒక్కసారి కూడా కప్ గెలవలేకపోయాయి.