Rashmika Mandanna Net Worth: రష్మిక మందన్న ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?

 


కిర్రాక్ పార్టీతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి నేషనల్ క్రష్‌గా ఎదిగారు కన్నడ కస్తూరి రష్మిక మందన్న. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండను ఆమె త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మీడియాలో వస్తున్న కథనాలను బట్టి ఫిబ్రవరి 26వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ వివాహం జరగనుంది. కానీ ఈ ఇద్దరు స్టార్స్ మాత్రం తమ పెళ్లి విషయాన్ని రహస్యంగానే ఉంచుతున్నారు. ఓ పక్క ఇరు కుటుంబాల్లో పెళ్లి పనులు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తుండగా.. రష్మిక కానీ, విజయ్ కానీ ఈ విషయాన్ని ఇంత వరకు అధికారికంగ ప్రకటించలేదు. ఈ క్రమంలో రష్మిక మందన్న ఓ సినిమాకు తీసుకునే పారితోషికం ఎంత? ఆమె ఆస్తులు ఎన్ని కోట్లు? అనేది పరిశీలిస్తే.

ఏప్రిల్ 5, 1996న కర్ణాటకలోని విరాజ్‌పేటలో కొడవ కమ్యూనిటీలో జన్మించారు రష్మిక మందన్న. ఆమె తల్లిదండ్రులు సుమన్, మదన్ మందన్నా. రష్మిక తండ్రికి స్థానికంగా కాఫీ ఎస్టేట్, ఫంక్షన్ హాల్ ఉంది. ఆమె తల్లి సాధారణ గృహిణి. అయితే రష్మిక చిన్నతనంలో ఆమె తండ్రికి వ్యాపారంలో బాగా నష్టాలు రావడంతో ఆర్ధికంగా వీరి కుటుంబం చితికిపోయింది. అద్దె ఇంట్లోకి మారడం, తన తల్లిదండ్రులు తనకు ఆటబొమ్మలు కూడా కొనలేని స్థితిలో ఉన్నారని రష్మిక పలు సందర్భాల్లో చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. 

చిన్నప్పటి నుంచి చదువులో ముందుండే రష్మిక.. బెంగళూరులోని ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. ఈ క్రమంలోనే మోడలింగ్ వైపు అడుగులు వేసిన రష్మిక 2014లో టైమ్స్ ఆఫ్ ఇండియా క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ అవార్డ్‌ అందుకున్నారు. ఈ దశలో సినీరంగం నుంచి ఆమెకు అవకాశాలు వచ్చాయి. అయితే వాటిని రష్మిక తిరస్కరించారు.. తనకు నటన అంటే ఇష్టం లేదని చెప్పేవారు. కానీ ఆమె కాలేజ్ ప్రొఫెసర్ ఒత్తిడితో ఓ సినిమాకు ఆడిషన్‌ ఇవ్వడానికి వెళ్లి సెలెక్ట్ అయ్యారు రష్మిక. ఈ క్రమంలో తొలి సినిమా అగ్రిమెంట్‌ మీద సంతకం చేయడానికి తల్లిదండ్రులు మొదట ఒప్పుకోలేదు. అయితే కూతురి ఇష్టాన్ని కాదనలేక అంగీకరించారు.

2015లో కన్నడ సూపర్‌స్టార్ రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన కిర్రాక్ పార్టీలో రక్షిత్ శెట్టి సరసన నటించారు రష్మిక. ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించడంతో పాటు రష్మికు బెస్ట్ డెబ్యూ నటిగా రష్మికకు సైమా అవార్డ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత అంజనీ పుత్ర, చమక్ తదితర కన్నడ చిత్రాలలో నటించారు. ఇదే సమయంలో తన తొలి చిత్ర హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ.. ఆయనతో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంది. అయితే పెళ్లికి కొద్దిరోజుల ముందు రక్షిత్ శెట్టితో నిశ్చితార్ధాన్ని రద్దు చేసుకుని షాకిచ్చారు రష్మిక మందన్నా. 

ఈ క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రష్మికకు పిలుపొచ్చింది. ఛలో మూవీ ద్వారా ఆమె టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత గీతా గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మతో హిట్స్ అందుకున్న రష్మిక కెరీర్‌ను పుష్ప సిరీస్ మలుపు తిప్పింది. ఇందులో శ్రీవల్లిగా జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్నారు. అనంతరం యానిమల్, ఛావా, సికందర్, కుబేరా, థామా, ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రాలతో నేషనల్ క్రష్‌గా అవతరించారు రష్మిక. అత్యధిక సక్సెస్ రేట్‌తో ఆమె దరిదాపుల్లోనూ ఏ హీరోయిన్ లేరంటే అతిశయోక్తి కాదు.  ప్రస్తుతం హిందీలో కాక్‌టెయిల్, తెలుగులో మైసా సినిమాలో రష్మిక నటిస్తున్నారు. 

గీత గోవిందం సినిమా టైంలో విజయ్ దేవరకొండతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ సీక్రెట్‌గా ప్రేమాయణం సాగిస్తూ పలుమార్లు మీడియాకు దొరికిపోయారు. కానీ ఇద్దరూ తమ బంధాన్ని బయటపెట్టలేదు. గతేడాది విజయ్ దేవరకొండ - రష్మికల ఎంగేజ్‌మెంట్ హైదరాబాద్‌లో జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని కూడా వీరిద్దరూ రహస్యంగానే ఉంచారు. అనంతరం రష్మిక - విజయ్‌ల పెళ్లిపై రకరకాల రూమర్స్ వచ్చాయి. కానీ వేటికీ కూడా ఇద్దరూ స్పందించలేదు. చివరికి ఫిబ్రవరి 26వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో విజయ్ - రష్మికల పెళ్లి సీక్రెట్‌గా జరగనుందని గాసిప్స్ వైరల్ అయ్యాయి. దీనిపైనా అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. కానీ రెండు కుటుంబాల్లోనూ పెళ్లిపనులు మొదలైనట్లుగా సాక్ష్యాలు చూపిస్తున్నారు నెటిజన్లు. 

ప్రస్తుతం వార్తల్లో నిలిచిన రష్మిక మందన్న సంపాదన, ఆమె ఆస్తులపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. సినిమాల పారితోషికం, బ్రాండ్ అండార్స్‌మెంట్స్ ద్వారా రష్మిక మందన్న బాగానే ఆస్తులను కూడబెట్టినట్లుగా ఫిలింనగర్ టాక్. సినిమాకు 10 నుంచి 12 కోట్ల రూపాయల రేంజ్‌లో రెమ్యునరేషన్ అందుకుంటున్న రష్మిక మందన్న.. బ్రాండ్ ప్రమోషన్స్‌కు కూడా భారీగానే ఛార్జ్ చేస్తున్నారట. ఇక ఆమె ఆస్తుల విషయానికి వస్తే .. బెంగళూరులో 8 కోట్ల రూపాయల విలాసవంతమైన భవనంతో పాటు కూర్గ్, హైదరాబాద్‌లలోనూ రష్మికకు ఖరీదైన ఆస్తులు ఉన్నాయి. తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని రియల్ ఎస్టేట్‌తో పాటు ఇతర మార్గాల్లో పెట్టుబడులు పెడుతున్నారు రష్మిక మందన్న.

ఇక కార్లంటే రష్మికకు ఎంతో ఇష్టం. ఆమె వద్ద 1.84 కోట్ల రూపాయల విలువైన రేంజ్ రోవర్ స్పోర్ట్, ఆడి క్యూ3 (40 లక్షల రూపాయలు), మెర్సిడెస్ బెంజ్ సీ క్లాస్ (50 లక్షల రూపాయలు), టయోటా ఇన్నోవా, హ్యుందాయ్ క్రెటా వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. మొత్తంగా రష్మిక మందన్న ఆస్తుల విలువ 70 కోట్ల రూపాయల వరకు ఉంటుందని సినీ వర్గాల అంచనా. 


నిర్మాతగా కమల్ హాసన్.. టాలీవుడ్ టాప్ హీరోతో సినిమా, దిగ్గజ నటుడి బిగ్‌ స్కెచ్?


గతంలో పోలిస్తే హీరోలు సినిమాలలో నటించడంతో సరిపెట్టకుండా సినిమాతో వ్యాపారం ఎలా చేయాలనే దానిపై గట్టిగా ఫోకస్ పెడుతున్నారు. చాలా మంది హీరోలు నిర్మాతలుగా మారి మంచి లాభాలను గడిస్తున్నారు. మరికొందరైతే పంపిణీ రంగంలో అడుగుపెట్టి అక్కడా సక్సెస్ కొడుతున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇలాంటి వారు చాలామందే ఉన్నారు. అయితే ఆల్రెడీ నిర్మాణ రంగంలో ఉన్న హీరోలు.. తమ బిజినెస్ మరింత విస్తరించే పనిలో పడ్డారు. ఈ లిస్ట్‌లోకే వస్తారు తమిళ నట దిగ్గజం కమల్ హాసన్.

నటనకే కొత్త భాష్యం చెప్పి భారతదేశం గర్వించదగ్గ మహానటుల్లో ఒకరిగా చోటు దక్కించుకున్నారు కమల్ హాసన్. చాలా ఏళ్ల క్రితమే ఆయన సినీ నిర్మాణంలో అడుగుపెట్టి ఎన్నో విజయవంతమైన చిత్రాలను తీశారు. ప్రయోగాలకు, వినూత్నమైన కథలకు పెద్దపీట వేసే కమల్.. తన అభిరుచి వల్ల నిర్మాతలకు ఎలాంటి నష్టం కలగకుండా, నతకు నచ్చిన స్క్రిప్ట్‌లను వెండితెరపై ఆవిష్కరించేందుకు వీలుగా రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌ను స్థాపించారు. 

1981లో అమావాస్య చంద్రుడితో మొదలుపెట్టి.. నిన్న మొన్నటి థగ్‌లైఫ్ వరకు ఎన్నో చిత్రాలను తీశారు కమల్ హాసన్. ప్రస్తుతం తన సహచరుడు, కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి దాదాపు 45 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్నాడు కమల్. ఈ చిత్రానికి స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. భారీ బడ్జెట్‌ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం రజనీకి ఏకంగా 225 కోట్ల రూపాయల పారితోషికం సైతం అందజేయబోతున్నట్లుగా కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.

దీనితో పాటు తన 237వ చిత్రాన్ని సొంతంగా నిర్మిస్తున్నారు కమల్ హాసన్. ఇది కాకుండా కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తీకేయన్‌తో సెయాన్ నిర్మిస్తున్నారు. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. శివకార్తీకేయన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అంచనాలను పెంచేసింది. ఇదిలాఉండగా తన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌ సంస్థను విస్తరించాలని కమల్ భావిస్తున్నారట. 

తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాలు నిర్మించాలని లోక నాయకుడు యోచిస్తున్నారట. టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తదితరులతో సినిమాలు తీసి పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలని కమల్ ప్రణాళికలు రచిస్తున్నట్లుగా చిత్ర పరిశ్రమలో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఈ హీరోల ఇమేజ్‌కు తగిన స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో ఆయన ఉన్నారని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే తెలుగు స్టార్స్‌తో కమల్ సినిమా పట్టాలెక్కడం పెద్ద విషయం కాదని అంటున్నారు విశ్లేషకులు. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. 


Jaahnavi Kandula: అమెరికాలో తెలుగు విద్యార్ధిని మృతి... బాధితురాలికి 262 కోట్ల నష్టపరిహారం

ఐదేళ్ల క్రితం అమెరికాలోని సియాటెల్ నగరంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన తెలుగు విద్యార్ధిని జాహ్నవి కందుల కుటుంబానికి ఊరట లభించింది. బాధిత కుటుటంబానికి దాదాపు 262 కోట్ల రూపాయల నష్టపరిహారం దక్కింది. అసలు ఈ కేసు ఏంటీ? జాహ్నవి ఎలా చనిపోయారు? ఈ కేసులో వివాదం ఏంటీ? అనే పూర్వాపరాల్లోకి వెళితే.

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి కందుల 2021లో మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్లారు. అనంతరం సౌత్‌లేక్ యూనియన్‌లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందారు. ఈ దశలో 2023 జనవరి 23వ తేదీ రాత్రి రోడ్డు దాటుతుండగా అదే సమయంలో అటువైపు వేగంగా వస్తోన్న పోలీస్ వాహనం ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జాహ్నవి ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. ఉన్నత చదువులు చదివి జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తుందనుకున్న తమ బిడ్డ తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో జాహ్నవి కుటుంబ సభ్యలు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

అయితే అమెరికాలో తీవ్ర సంచలనం సృష్టించిన జాహ్నవి మృతి కేసుపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో అక్కడి ప్రభుత్వం విచారణ చేయించింది. ప్రమాదానికి కారణమైన పోలీస్ వాహనాన్ని ఆ సమయంలో కెవిన్ డేవ్ అనే అధికారి డ్రైవ్ చేస్తున్నాడు. జాహ్నవిని ఢీకొట్టిన ప్రదేశంలో నిబంధనల ప్రకారం కారును 40 కి.మీ వేగంలో నడపాల్సి ఉంది. కానీ కెవిన్ మాత్రం వాహనాన్ని దాదాపు 119 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నాడు. అప్పటికే అతను డ్రగ్స్ మత్తులో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. అలాగే కారుకున్న ఎమర్జెన్సీ లైట్లు ఆన్ చేసి.. కూడళ్ల వద్ద తన సైరన్‌ను ఉపయోగించినట్లు విచారణ తేలింది. 

అటు జాహ్నవి మరణంపై స్థానికంగానూ నిరసనలు జరిగాయి. ఇదే సమయంలో మరో అధికారి బాడీ కెమెరా రికార్డింగ్స్‌లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఇందులో కెవిన్ నవ్వుతూ.. జాహ్నవి మరణానికి విలువ లేదని వ్యాఖ్యానించడంతో అతనిని ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. అతని వ్యాఖ్యలు పోలీస్  శాఖ ప్రతిష్టను, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశాయని నగర పౌర వాచ్‌డాగ్ కనుగొంది. అయితే తనను విధుల నుంచి తప్పించడంపై కెవిన్ కోర్టును ఆశ్రయించాడు. న్యాయవాదులు ఈ మరణంపై ఎలా స్పందిస్తారనే  దానిపై విమర్శించేందుకే ఈ వ్యాఖ్యలు చేశానని దారుణంగా మాట్లాడాడు. 

అయితే కందుల జాహ్నవి మరణానికి కారకులైన వారిని వదిలిపెట్టేది లేదని ఆమె కుటుంబం న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తూనే వచ్చింది. ఈ క్రమంలో గత శుక్రవారం కింగ్ కౌంటీ సుపీరియర్ కోర్టులో ఇరుపక్షాలు సెటిల్‌మెంట్ నోటీసు దాఖలు చేశాయి. దీనిలో భాగంగా జాహ్నవి కుటుంబానికి 29 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 262 కోట్ల రూపాయలు) పరిహారం చెల్లించేందుకు సియాటెల్ సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ కీలక ప్రకటన చేశారు. దీని ద్వారా జాహ్నవి కుటుంబానికి కాస్తయిన ఉపశమయనం లభిస్తుందని ఎరికా పేర్కొన్నారు. అయితే సెటిల్‌మెంట్‌పై జాహ్నవి తరపు న్యాయవాదులు ఇంకా స్పందించలేదని మీడియాలో కథనాలు వస్తున్నాయి. 


ICC Under-19 Men's Cricket World Cup: విశ్వవిజేతగా యువ భారత్.. ఆరవసారి కప్ కొట్టిన టీమిండియా

 

Photo Courtesy: x.com/BCCI

అండర్ 19 వన్డే ప్రపంచకప్‌ 2026లో టీమిండియా తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఆరోసారి అండర్ 19 వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచి అరుదైన ఘనత సాధించింది. హరారెలో శుక్రవారం ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్‌లో ఏకంగా 100 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టును మట్టికరిపించి సగర్వంగా అండర్ 19 వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది టీమిండియా. 

భారత్ నిర్దేశించిన 412 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండో 40.2 ఓవర్లలో 311 పరుగుల ఆలౌట్ అయ్యింది. ఫాల్కనర్ సెంచరీతో (115) ఒంటరి పోరాటం చేసినప్పటికీ అతనికి సహకరించేవారు లేక జట్టు ఓటమి పాలైంది. ఇంగ్లీష్ ఆటగాళ్లలో బెన్ డాకిన్స 66, బెన్ మేయెస్ 45, థామస్ రేవ్ 31 పరుగులు చేశారు. భారత బౌలర్ల అంబరీష్ 3, దీపేశ్, కనిష్క్‌లు తలో 2 వికెట్లు తీయగా.. ఖిలాన్ పటేల్, ఆయుష్ మాత్రేలు తలో వికెట్ పడగొట్టారు.

తొలుత టాస్ గెలిచిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ (175) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి.. జట్టు భారీ స్కోరు చేడానికి కారణమయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ ఆయుష్ మాత్రే 53, అభిజ్ఞాన్ కుందు (40), వేదాంత్ త్రివేది (32) పరుగులు చేశారు. ఇంగ్లీష్ బౌలర్లలో జేమ్స్ మింట 3, మోర్గాన్, అలెక్స్ గ్రీన్‌లు తలో 2 వికెట్లు పడగొట్టగా.. మానీ ఒక వికెట్ తీశారు.

1988లో అండర్ 19 వన్డే వరల్డ్ కప్‌కు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రూపకల్పన చేసింది. ఈ మెగా టోర్నీలో భారత జట్టుది తిరుగులేని  రికార్డ్. మొత్తం 6 సార్లు టీమిండియా ఈ అండర్ 19 వన్డే వరల్డ్ కప్‌ ట్రోఫీని అందుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 4 సార్లు, పాకిస్తాన్ రెండు సార్లు, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాయ, వెస్టిండిస్‌లు తలో ఒకసారి కప్ గెలిచాయి. 37 ఏళ్ల ఈ ట్రోఫీ చరిత్రలో న్యూజిలాండ్, శ్రీలంకలు ఒక్కసారి కూడా కప్ గెలవలేకపోయాయి. 



భారత్- పాకిస్తాన్ మ్యాచ్ విలువ ఎన్ని వేల కోట్లో తెలుసా? మ్యాచ్ రద్దయితే నష్టం ఎంతంటే?

 


త్వరలో జరగనున్న టీ 20 ప్రపంచకప్ వివాదాస్పదం అవుతోంది. భారత్‌లో భద్రతా కారణాలను సాకుగా చూపి బంగ్లాదేశ్ ఈ టోర్నీలో తప్పుకోవడంతో కలకలం రేపింది. ఐసీసీ పలుమార్లు నచ్చజెప్పాలని చూసినా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (బీసీబీ) మాత్రం ససేమిరా అనడంతో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌ను ఈ టోర్నీ నుంచి తప్పించి దాని స్థానంలో స్కాట్లాండ్‌ను టీ 20 ప్రపంచకప్‌లో ఆడేందుకు అనుమతించింది. ఈ వ్యవహారం సద్దుమణిగిందో లేదో ఈ టోర్నీలో మరో వివాదం చోటు చేసుకుంది. 

బంగ్లాదేశ్‌కు మద్ధతుగా నిలబడుతూ వచ్చిన పాకిస్తాన్ ఈ టోర్నీలో భారత్‌లో జరగనున్న మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశాల మేరకు పాక్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. 

అసలు ఏ ఐసీసీ టోర్నమెంట్ అయినా అసలు సిసలు మజా అందించేది భారత్ - పాకిస్తాన్ మ్యాచే. దాయాదుల మ్యాచ్‌ను ఇరుదేశాల ప్రజలతో పాటు క్రికెట్ అభిమానులు ఎంజాయ్ చేస్తుంటారు. మైదానంలో సింహాల్లా పోరాడటంతో పాటు భావోద్వేగాలు ముడిపడిన అంశం కావడంతో ఏ మ్యాచ్‌కు రానంత రికార్డ్ స్థాయిలో వ్యూస్‌తో పాటు ఆదాయం కూడా భారత్ - పాక్ మ్యాచ్‌కు వస్తుండటంతో ఐసీసీ తన టోర్నమెంట్‌లలో ఖచ్చితంగా రెండు జట్లను ఒకే గ్రూప్‌లో ఆడేలా ప్లాన్ చేస్తుంది.

భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌తో ఐసీసీకి, ఇరు దేశాల క్రికెట్ బోర్డులకు కూడా భారీ ఆదాయం వస్తోంది. ప్రసార హక్కులు, ప్రకటనలు, స్పాన్సర్‌షిప్‌లు, టికెట్ విక్రయాలు, ఇతర వాణిజ్య కార్యక్రమాలతో భారీ లాభాలను కళ్లజూస్తున్నారు. ఈసారి టీ 20 ప్రపంచకప్ - 2006లోనూ భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ విలువ దాదాపు 4500 కోట్ల రూపాయలని అంచనా.  ఇందులో సింహా భాగం డిజిటల్, లైవ్ టెలివిజన్ ప్రసార హక్కుల ద్వారా వచ్చేదే. 

భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ జరుగుతుండగా ప్రకటనలు ప్రసారం చేయాలంటే 10 సెకన్ల స్లాట్‌కు 25 నుంచి 40 లక్షల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. అలా ఒక్క మ్యాచ్ ద్వారా ప్రకటనల కింద దాదాపు 300 కోట్ల ఆదాయం రానుంది. టీ 20 ప్రపంచకప్‌లో ఏ ఇతర జట్ల మధ్య జరిగే మ్యాచ్ కూడా ఈ స్థాయిలో ఆదాయాన్ని అందించలేదు. ఒక్కో మ్యాచ్ విలువ సరాసరిగా 138 కోట్ల రూపాయలు మాత్రమే. ఇది భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌లో ప్రకటన ద్వారా వచ్చే ఆదాయంలో సగం కూడా దాటదంటే దాయాదుల పోరుకు క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

ఇప్పుడు ఇండియాతో జరిగే మ్యాచ్‌ను పాకిస్తాన్ బహిష్కకరించడం వల్ల ఈ ప్రకటనల కింద వచ్చే ఆదాయాన్ని బ్రాడ్‌కాస్టర్స్ కోల్పోనున్నారు. ఈ మ్యాచ్ ప్రభావం.. టోర్నీలోని మిగిలిన మ్యాచ్‌లపైనా బలంగా పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. తద్వారా బ్రాడ్‌కాస్టర్స్ దాదాపు 400 కోట్ల రూపాయలు కోల్పోతారని భావిస్తున్నారు. దీనిని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ భరిస్తుంది. అయితే సభ్యదేశాలకు పంచే ఆదాయంలో కోత విధిస్తుంది. ఈ ప్రభావం క్రికెట్‌ను శాసించే భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి దేశాలపై పడదు. కానీ చిన్నా చితకా జట్లకు ఐసీసీ ఆదాయమే జీవనాధారం అలాంటి దేశాలు పాకిస్తాన్ నిర్ణయం వల్ల తీవ్రంగా నష్టపోనున్నాయి.

అటు భారత్‌తో మ్యాచ్‌ను పాకిస్తాన్ బహిష్కరించడం వల్ల పాక్ క్రికెట్ మనుగడ ప్రశ్నార్ధకంగా మారనుంది. ఐసీసీ నుంచి ఏడాదికి పాక్ క్రికెట్ బోర్డ్ 34.51 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని అందుకుంటుంది. ఇప్పుడు భారత్‌తో మ్యాచ్ రద్దయితే ఆదాయంలో కోతతో పాటు ఐసీసీ నుంచి భారీ జరిమానాలు, ప్రసారకర్తల నుంచి లీగల్ సమస్యలు, అంతర్జాతీయ క్రీడాకారులు పాకిస్తాన్‌లో పాల్గొనే మ్యాచ్‌లకు ఎన్ఓసీ అందుకునే విషయంలో తీవ్ర ఇబ్బందులు తప్పవు. 

ఇక్కడితో ఇది ఆగదు.. క్రమశిక్షణ చర్యల కింద పాకిస్తాన్‌ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఐసీసీ సస్పెండ్ చేసే అవకాశం కూడా లేకపోలేదనే వార్తలు వస్తున్నాయి. త్వరలో ఐసీసీ సమావేశం జరగనుండగా.. ఈ భేటీలో పాకిస్తాన్‌పై చర్యలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌కు సమయం ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ తన నిర్ణయం పట్ల వెనక్కి తగ్గుతుందా? లేక కట్టుబడి ఉంటుందా? అన్నది చూడాలి. పీసీబీ నిర్ణయంపై క్రికెట్ ప్రేమికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 


ఘోర విమాన ప్రమాదం... మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం

 


బుధవారం మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. ఈ వార్తతో మహారాష్ట్రతో పాటు యావత్ దేశం ఉలిక్కిపడింది. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం బుధవారం ముంబై నుంచి బారామతి వెళ్తుండగా విమానం కుప్పకూలినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌ సహా ఐదుగురు దుర్మరణం పాలైనట్లుగా తెలుస్తోంది. వీరిలో ఇద్దరు పైలట్స్, ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

అజిత్ పవార్ ప్రస్థానం:

1959 జూలై 22న మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా దేయ్‌లాలీ ప్రవరలో జన్మించారు అజిత్ పవార్. ఆయన తండ్రి అనంతరావ్ పవార్. ఈయన ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కి స్వయాన అన్నయ్య. చదువు పూర్తి చేసిన తర్వాత రాజకీయాలపై ఆసక్తితో బాబాయ్ శరద్ పవార్ శిష్యరికంలో అడుగులువ వేశారు అజిత్. 1982లో తొలిసారిగా కార్పోరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డ్‌కు ఎన్నికయ్యారు. అనంతరం మహారాష్ట్రలో బలమైన సహకార సంఘాలపై పట్టు సాధించిన పవార్.. 16 ఏళ్ల పాటు పుణె జిల్లా కేంద్ర సహకార కో ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్‌గా వ్యవహరించారు.

1991లో తొలిసారిగా తన కుటుంబ రాజకీయాలకు కేంద్రంగా ఉన్న బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ దశలో శరద్ పవార్ కేంద్రంలో చక్రం తిప్పేందుకు వీలుగా బాబాయ్ కోసం ఆ సీటును త్యాగం చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు 1991లో బారామతి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి తొలిసారిగా మహారాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ నియోజకవర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత అజిత్ పవార్ సొంతం. 

పలుమార్లు మంత్రిగా పనిచేసిన అజిత్ పవార్... ముఖ్యంగా ఆర్ధిక శాఖపై బలమైన ముద్ర వేశారు. పలుమార్లు బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటు మహారాష్ట్రకు పాలసీలు రూపొందించారు. బాబాయ్ శరద్ పవార్‌కు కుడిభుజంగా ఉంటూ మహారాష్ట్ర రాజకీయాలను శాసించారు. అయితే గత మహారాష్ట్ర ఎన్నికలకు ముందు బాబాయ్ శరద్ పవార్‌పై తిరుగుబాటు చేసి ఎన్సీపీలో చీలిక తీసుకొచ్చారు. తన వర్గం ఎమ్మెల్యేలతో ఎన్డీఏలో చేరి వ్యూహాత్మకంగా పార్టీని, ఎన్సీపీ గుర్తును సొంతం చేసుకున్నారు. అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా.. ఆర్ధిక, ప్రణాళిక, క్రీడలు, మైనారిటీ వ్యవహారాల శాఖలను నిర్వహిస్తున్నారు. గతంలోనూ పలువురు ముఖ్యమంత్రులకు డిప్యూటీ సీఎంగా వ్యవహరించి.. మహారాష్ట్రలో అత్యధిక కాలం డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఘనత దక్కించుకున్నారు అజిత్ పవార్.

మహారాష్ట్రలో పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పక్షాల్లోనూ అజిత్ పవార్‌కు సన్నిహితులు ఉన్నారు. రాజకీయ, సినీ, వ్యాపార, తదితర రంగాల ప్రముఖులతోనూ ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రవేయడంతో పాటు భవిష్యత్‌లో సీఎం అవుతారని అంతా భావిస్తున్న వేళ అజిత్ పవార్ విమాన ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో రాష్ట్ర ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అజిత్ పవార్ హఠాన్మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ తదితరులు సంతాపం తెలియజేస్తున్నారు. 

300 కోట్లకు అడుగు దూరంలో మెగాస్టార్.. మన శంకర వరప్రసాద్ గారుతో చిరంజీవి రికార్డ్‌లు చూశారా?


అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ చిత్రం.. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మెగా అభిమానులు అసలు సిసలు సంక్రాంతిని తెచ్చింది. మెగాస్టార్ నుంచి తాము ఏళ్లుగా మిస్ అయిన.. తాము చిరంజీవిని ఎలా చూడాలని అనుకుంటున్నామో నాటి వింటేజ్ హీరోని అభిమానుల ముందు ప్రెజెంట్ చేశారు అనిల్ రావిపూడి. చిరంజీవికి తోడు వెంకటేష్ అల్లరితో మన శంకర వరప్రసాద్ మూవీ భారీ కలెక్షన్స్ సాధిస్తోంది. విడుదలై వారం దాటిపోయిన నేపథ్యంలో చిరంజీవి ఫస్ట్ వీక్ ఎన్ని కోట్ల కలెక్షన్స్ వసూలు చేశారు అనేది ఆసక్తిగా మారింది.

సాక్‌నిక్ వెబ్‌సైట్ వెల్లడించిన లెక్కల ప్రకారం మనశంకర వరప్రసాద్ గారు మూవీ భారతదేశంలో తొలివారం 158 కోట్ల రూపాయల నికర కలెక్షన్స్... 188 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు సాక్‌నిక్ చెప్పింది. మెగాస్టార్ మూవీ ఇప్పటికే  నార్త్ అమెరికాలో 2.5 మిలియన్ డాలర్లు రాబట్టగా.. త్వరలోనే 3 మిలియన్ డాలర్లు (27 కోట్ల రూపాయలు) మైలురాయిని చేరుకోనుంది. మన శంకర వరప్రసాద్ గారు మూవీ ఫస్ట్ వీక్‌లో 292  కోట్లు వసూలు చేసినట్లు షైన్ క్రియేషన్స్‌ అధికారికంగా ప్రకటించింది. సోమవారం నాటి కలెక్షన్స్‌తో ఈ సినిమా 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తద్వారా మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో తొలి 300 కోట్ల రూపాయల సినిమాగా మన శంకర వరప్రసాద్ గారు మూవీ నిలవనుంది. 

టాలీవుడ్‌కు నాలుగు దశాబ్ధాలుగా నాలుగు స్తంభాల్లా నిలిచిన నలుగురు  అగ్ర కథానాయకుల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత 300 కోట్ల కలెక్షన్స్ సాధించిన హీరోగా చిరంజీవి నిలవనున్నారు. అలాగే వరుసగా రెండు సంక్రాంతులకు రెండు 300 కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్‌గా అనిల్ రావిపూడి అరుదైన రికార్డుకు అడుగు దూరంలో నిలిచారు. అలాగే మొదటి వారంలో 292 కోట్ల రూపాయలు వసూలు చేసిన తొలి రీజనల్ మూవీగా మన శంకర వరప్రసాద్ నిలిచింది. దానితో పాటు విడుదలైన ఏడో రోజు 30 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాగా శంకర వరప్రసాద్ కొత్త చరిత్ర సృష్టించాడు. 

అంతేకాదు.. ప్రాంతీయ చిత్రాల విభాగంలో అత్యంత వేగంగా బుక్ మై షోలో 3 మిలియన్లకు పైగా టికెట్స్ బుక్ చేసిన సినిమాగా నిలిచింది. కృష్ణా జిల్లాలో తొలి వారం అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ 5 చిత్రాలలో మన శంకర వరప్రసాద్ గారు (7.63 కోట్ల  రూపాయలు) 4వ స్థానంలో నిలిచినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ జాబితాలో ఆర్ఆర్ఆర్ (10.70 కోట్ల రూపాయలు) అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత పుష్ప 2 (8.49 కోట్ల రూపాయలు), బాహుబలి 2 (8.35 కోట్ల రూపాయలు), కల్కి 2898 ఏడీ (7.02 కోట్ల రూపాయలు)తో నిలిచాయి.