సినీ కెరీర్‌కు నటి త్రిష గుడ్‌బై? స్టార్ డైరెక్టర్ కామెంట్స్ వైరల్

 


ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో.. మరీ ముఖ్యంగా తమిళనాడు సినీ, రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు త్రిష కృష్ణన్. కోలీవుడ్ సూపర్‌స్టార్, టీవీకే అధినేత దళపతి విజయ్‌తో ఆమె రిలేషన్‌లో ఉన్నారంటూ కొద్దిరోజుల క్రితం తమిళనాడు బీజేపీ చీఫ్ నాయనర్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆయన క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదానికి తెరపడింది. 

ఇది జరిగిన  కొద్దిరోజులకే దళపతి విజయ్ సతీమణి సంగీత సోర్ణలింగం షాకిచ్చారు. తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలంటూ చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమిళ సినీరంగానికి చెందిన ఓ నటితో తనకు భర్తకు వివాహేతర సంబంధం ఉందని, ఆమె కారణంగా మా ఇద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకుంటున్నాయని సంగీత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే అందులో నటి పేరును మాత్రం ఆమె ప్రస్తావించలేదు. కానీ అందరి చూపు త్రిషపైనే పడింది.

టీవీకే పార్టీ ద్వారా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన విజయ్‌కి ఈ పరిణామాలు ఇబ్బంది కలిగించాయి. అయితే ఆ వెంటనే ఓ నిర్మాత ఇంట్లో పెళ్లి వేడుకకు త్రిషతో కలిసి విజయ్ జంటగా హాజరుకావడంతో సంచలనం  సృష్టించింది. దాంతో విజయ్ - త్రిషల రిలేషన్ నిజమేనంటూ వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. ఈ క్రమంలో త్రిషపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. 

అయితే త్రిష రాజకీయాల్లోకి అడుగుపెడతారని, తమిళనాడు సీఎం కావాలన్నది ఆమె కల అని సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్వయంగా త్రిష సైతం తనకు రాజకీయాలపై ఆసక్తి ఉందని పలుమార్లు బయటపెట్టారు. తాజాగా వీటికి బలం చేకూర్చేలా సీనియర్ దర్శకుడు చిత్రా లక్ష్మణన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

త్రిష త్వరలోనే తన సినీ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నారని బాంబు పేల్చారు. కొంతమంది నిర్మాతలను త్రిష గురించి అడగ్గా.. ఆమెకు సినిమాల్లో కొనసాగాలని లేదని చెప్పారని లక్ష్మణన్ అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు తమిళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. దీనిపై త్రిష స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం త్రిష కృష్ణన్ సూర్య సరసన కరుప్పు, మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర.. మలయాళంలో రామ్ చిత్రాలలో నటిస్తున్నారు.  


హీరోగా అనిల్ రావిపూడి.. నిర్మాతగా దిల్‌రాజు

 


టాలీవుడ్‌లో ఓటమి ఏరుగని దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు అనిల్ రావిపూడి. తొలి సినిమా పటాస్ నుంచి ఈ ఏడాది మన శంకర వరప్రసాద్ గారు వరకు అనిల్ తీసిన ప్రతి చిత్రం విజయాన్ని సాధిస్తూ వచ్చింది. ప్రతియేటా ఖచ్చితంగా తన సినిమాను విడుదల చేస్తూ.. సంక్రాంతి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు అనిల్ రావిపూడి.

ఆయనలో డైరెక్టర్‌తో పాటు మంచి నటుడు కూడా ఉన్నారు. హీరో కావాలని అనిల్ కూడా కలలు కన్నారు. అయితే తన సినిమాల్లో గెస్ట్ రోల్స్ మాదిరిగా తళుక్కున మెరుస్తూ ముచ్చట తీర్చుకుంటున్నారు. పలు ఈవెంట్స్‌లో విక్టరీ వెంకటేష్, డాక్టర్ రాజశేఖర్ వంటి స్టార్స్‌ను ఇమిటేట్ చేస్తూ డ్యాన్స్ ఇరగదీస్తారు అనిల్ రావిపూడి. ఒడ్డూపొడుగూ, ఫిజిక్‌, అందంతో పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ అనిపించుకున్నారు ఈ దర్శకుడు. తాజాగా అనిల్ రావిపూడిని నటుడిగా పరిచయం చేస్తానిన చెప్పారు స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు.

తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్, యంగ్ హీరోయిన్ కృతిశెట్టి జంటగా నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో అనిల్ రావిపూడి, దిల్‌రాజులు సందడి చేశారు. ఈ సందర్భంగా దిల్‌రాు మాట్లాడుతూ.. అనిల్ రావిపూడిలో మంచి నటుడు ఉన్నారు. ఆయనను నటుడిగా నేనే పరిచయం చేస్తాను. ఎప్పుడు నన్ను కలిసినా? స్టోరీ డిస్కషన్స్ కోసం వచ్చినా అదే మాట చెబుతానని దిల్‌రాజు తెలిపారు.

ఆ వెంటనే అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. రాజుగారి ఆఫర్ బాగుంది, అయితే ఆయన ప్రొడ్యూసర్‌గా, ప్రదీప్ రంగనాథన్ హీరోగా, నేను దర్శకుడిగా సినిమాను తీస్తా. ప్రస్తుతానికి నటుడిగా మారాలన్న  ఆలోచన లేదని తేల్చేశారు. కాగా.. మన శంకర వరప్రసాద్ గారు తర్వాత విక్టరీ వెంకటేష్ - నందమూరి కళ్యాణ్ రామ్‌లు హీరోలుగా ఒక మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నారు అనిల్ రావిపూడి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఆదిత్యధర్ ధురంధర్ 3 తీస్తే.... సోషల్ మీడియాలో స్టోరీ, స్క్రీన్ ప్లే హల్‌చల్!

 


గత నాలుగు నెలలుగా భారతీయ చిత్ర పరిశ్రమను కుదిపేస్తోన్న పేరు ధురంధర్. ఆదిత్యధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ఈ స్పై, యాక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. తొలి భాగం 1400 కోట్ల రూపాయలు వసూలు చేయగా.. రెండో భాగం ఇప్పటికే 1500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి 2000 కోట్ల దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ధురంధర్ సిరీస్ చిత్రాలు.. భారతీయ సినిమా మేకింగ్ విధానాన్ని పూర్తిగా మార్చేసింది. కథ, స్క్రీన్‌ ప్లే పకడ్బందీగా ఉంటే 4 గంటల నిడివ ఉన్న సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని తేలింది. 

ధురంధర్ సిరీస్ విజయవంతం కావడంతో ధురంధర్ 3 ఎప్పుడంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మూడో భాగం గురించి చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదు. అయితే పార్ట్ 3 కావాలంటూ కోరుకునే వారు రోజురోజుకి పెరుగుతున్నారు. ధురంధర్ 3ని ఎటు నుంచి మొదలు పెడతారనే ఆసక్తి నెలకొంది. 

ధురంధర్ 3ని సిద్ధం చేయడానికి ఎన్నో మార్గాలు చెబుతున్నారు నెటిజన్లు. ధురంధర్ ది రివెంజ్‌ క్లైమాక్స్‌లో జస్కిరత్ తన కుటుంబాన్ని దూరం నుంచి చూస్తాడు తప్పించి, తల్లిని చెల్లిని పలకరించడు. వాళ్లని కలుసుకుని ఇన్ని రోజులు ఏం చేసింది చెప్పడంతో పాటు జస్కిరత్ చేతిలో హత్యకు గురైన ఎమ్మెల్యే కుటుంబంలో ఎవరో ఒకరు ఇతనిపై పగ సాధించడం ఒకటి. 

జైళ్లో ఉన్న రెహమాన్ బలోచ్ తమ్ముడు ఉరైజ్ బలోచ్ తప్పించుకుని తన అన్నయ్యతో పాటు తమ వాళ్లను చంపి, తనపై గూఢచార్యం నేరం మోపి జైలుకి పంపింది హంజానే అని తెలుసుకుంటాడు. హంజా భార్యాబిడ్డల్ని, మామ జమీల్‌ను బంధించి తిరిగి అతనిని పాకిస్తాన్‌కు రప్పించడం ఒక వెర్షన్. లేదంటే మరో కొత్త ఆపరేషన్ కోసం హస్కిరత్‌ను తిరిగి పాకిస్తాన్‌కు పంపడం వంటి వెర్షన్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఆదిత్యధర్ మనసులో ధురంధర్ 3వ భాగం ఆలోచన లేనప్పటికీ సోషల్ మీడియా జనాలు మాత్రం తమకు నచ్చిన విధంగా కథలు అల్లేస్తూ.. ఎలాంటి కథ కావాలో కూడా వారే ఇస్తున్నారు. 


ధురంధర్ 2 చూడలేదు... అమీర్‌ఖాన్ సంచలన వ్యాఖ్యలు

 


ఆదిత్యధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ నటించిన హిట్ ఫ్రాంచైజీ మూవీ ధురంధర్ 2. భారతీయ సినీ ప్రేక్షకులకు కనివినీ ఎరుగని అనుభూతిని అందించడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్ల రూపాయల క్లబ్‌లో అడుగుపెట్టి సరికొత్త రికార్డులు నెలకొల్పింది. రణ్‌వీర్ జోరు చూస్తుంటే త్వరలోనే 2000 కోట్ల మార్క్ చేరుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ధురంధర్ 2ను వీక్షించిన సామాన్యులు, సినీ ప్రముఖులు ఈ సినిమాపైనా.. హీరో రణ్‌వీర్ సింగ్‌, దర్శకుడు ఆదిత్యధర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళీతో పాటు స్టార్ హీరోలు మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ తదితరులు ధురంధర్ 2ను చూసి తమదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. 

టాలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు సైతం ధురంధర్ 2 సక్సెస్‌పై చిత్ర యూనిట్‌కు  అభినందనలు తెలియజేశారు. అయితే సొంత ఇండస్ట్రీ బాలీవుడ్ నుంచి మాత్రం ధురంధర్ 2కు ఎలాంటి ప్రశంసా దక్కలేదు. ఒకరిద్దరు తప్పించి పెద్దగా స్టార్ హీరోలు సైతం స్పందించలేదు. తాజాగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

ఓ ఈవెంట్‌లో పాల్గొనేందుకు వచ్చిన అమీర్‌ఖాన్‌ను మీడియా ప్రతినిధులు చుట్టుముట్టి.. ధురంధర్ 2 గురంచి అడిగారు. దానికి ఆయన స్పందిస్తూ.. తాను ధురంధర్ 2ను చూడలేదు, సినిమా బాగుందని ప్రశంసలు వస్తున్నాయి. అలాగే ధురంధర్ 2 యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు అమీర్. దాంతో ఈ వ్యాఖ్యలు హిందీ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశం అవుతున్నాయి. విడుదలై వారం రోజులు గడుస్తున్నా ధురంధర్ 2 ఇంకా రిలీజ్ కాకపోవడం ఏంటీ? అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు


పాపులారిటీలో వరల్డ్ నెంబర్‌వన్‌గా మోడీ... ట్రంప్ స్థానం ఎక్కడంటే?

 


వరల్డ్ లీడర్స్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి సత్తా చాటారు.  పాపులారిటీ పరంగా ప్రపంచ నేతల్లో తొలి స్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన పరిశోధనా సంస్థ మార్నింగ్ కన్సల్ట్ బుధవారం విడుదల చేసిన ఈ జాబితాలో మోడీ అగ్రస్థానంలో నిలిచారు. అగ్ర రాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ వంటి శక్తివంతమైన నేతలను దాటుకుని మోడీ ఈ ప్లేస్‌లో నిలవడం విశేషం. 

ఈ  సర్వే ప్రకారం.. ప్రపంచంలోని నేతలు అందరిలోకి మోడీకి 68 శాతం అప్రూవల్  రేటింగ్ వచ్చింది. సర్వేలో పాల్గొన్న వారిలో కేవలం 26 శాతం మంది మాత్రమే ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకించారు.  6 శాతం మంది మాత్రం తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని తెలిపారు. 

మోడీ తర్వాత స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై పార్మెలిన్ (62 శాతం), దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే- మ్యుంగ్ (62 శాతం) అప్రూవల్ రేటింగ్‌తో నిలిచారు. ప్రధాని మోడీకి, ఇతర పాశ్చాత్య నేతలకు మధ్య అప్రూవల్ రేటింగ్ గణనీయమైన అంతరం కనిపిస్తున్నట్లు ఆ సర్వే వెల్లడించింది. ఇరాన్‌తో ఇటీవల తలెత్తిన యుద్ధ పరిణామాల ప్రభావంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అప్రూవల్ రేటింగ్ 39 శాతానికి పడిపోయింది. యూరప్ నేతలలో యూకే ప్రధాని కీర్ స్టార్మర్ (24 శాతం), జర్మనీకి చెందిన ఫ్రెడరిక్ మెర్జ్ (20 శాతం) సాధించారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ (17 శాతం) అప్రూవల్ రేటింగ్‌ సాధించగా.. వ్యతిరేకత 75 శాతంగా ఉంది. 

ఈ గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ ట్రాకర్‌లోని గణాంకాలు మోడీకి దేశీయంగా ఉన్న ఆదరణతో పాటు ఆయనకు పెరుగుతున్న అంతర్జాతీయ గుర్తింపును నొక్కి చెబుతోంది. ప్రపంచంలోని ఇతర ప్రధాన ఆర్ధిక వ్యవస్థలకు చెందిన అధినేతల కంటే ఆయన ముందంజలో ఉన్నారు. ఇప్పుడే కాదు.. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ జూలై 2025లో విడుదల చేసిన నివేదికలోనూ మోడీయే నెంబర్ వన్‌గా నిలిచారు. నాడు ఏకంగా 75 శాతం అప్రూవల్ రేటింగ్‌తో ప్రధాని ఆధిపత్యం చూపించారు. 

మే 2024లో వరుసగా మూడోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించిన నరేంద్ర మోడీ.. తన పదవీకాలానికి సంబంధించిన కీలకమైన మైలురాయిని చేరుకోనున్నారు. ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించి మొత్తంగా ఇప్పటి వరకు 4079 రోజులను పూర్తి చేసుకున్నారు. తద్వారా ఇందిరా గాంధీని అధిగమించి భారతదేశంలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన నేతగా నరేంద్రమోడీ నిలిచారు. ఈ లిస్ట్‌లో తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ టాప్‌లో ఉన్నారు. 


హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. ఏపీ వాసులకి చల్లని కబురు

 


హైదరాబాద్‌లో మంగళవారం భారీ వర్షం కురిసింది. సాయంత్రం చిరు జల్లులతో ప్రారంభమై రాత్రి  9 గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, మియాపూర్, చందానగర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, షాపూర్, చింతల్‌లో భారీ వర్షం కురిసింది. దాంతో సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్లకు బయల్దేరిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం తగ్గే వరకు మెట్రో పిల్లర్ల కింద వాహనదారులు బారులు తీరారు. 

రోడ్లపైకి వర్షపు నీరు పోటెత్తి, మోకాలి లోతులో వరద నీరు ప్రవహించింది. యూసుఫ్‌గూడ, శ్రీకృష్ణనగర్ ఏరియాలలో భారీగా నీరు రోడ్ల మీదకు దూసుకొచ్చి కాలనీలను  ముంచెత్తింది. ఈ ప్రవాహంలో పలు వాహనాలు కొట్టుకుపోయాయి. చాలా ఏరియాలలో భారీ ట్రాఫిక్ జాంలు చోటు చేసుకోవడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. రంగంలోకి దిగిన జీహెఎంసీ, హైడ్రా, పోలీస్, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. వేసవి కారణంగా గత కొంతకాలంగా ఎండ వేడి, ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ నగర ప్రజలు తాజా వర్షంతో కాస్త సేదతీరారు. 

మరోవైపు.. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోఫి కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. రాగల 72 గంటల్లో ఏపీలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, పశ్చిమ గోదావరి, ఏలూరు, తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 


మగాళ్లకు ఫ్రీ బస్సు.. ఉచితంగా ఫ్రిజ్.. అన్నాడీఎంకే హామీలు విన్నారా?

 


త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. డీఎంకేకు చెక్ పెట్టి ఈసారి అధికారాన్ని అందుకోవాలని అన్నాడీఎంకే.. రెండోసారి కూడా పవర్‌ని కంటిన్యూ చేయాలని డీఎంకే గట్టి పట్టుదలతో ఉన్నాయి. ఇక డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా ఎదిగే లక్ష్యంతో కోలీవుడ్ సూపర్‌స్టార్ దళపతి విజయ్ తన టీవీకేతో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 

తమిళనాడు ఎన్నికలు అంటేనే భారీగా ఉంటాయని దేశంలో పేరు. ఓటర్లను ఆకర్షించడానికి అనేక ఆఫర్లను, హామీలను, పథకాలను ఆయా పార్టీలు పోటీపడుతుంటాయి. ఈసారి కూడా ప్రజలకు భారీ హామీలతో పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి. దీనిలో భాగంగా అన్నాడీఎంకే పలు ప్రజాకర్షక పథకాలతో ముందుకొచ్చింది. రాష్ట్రంలో అన్నాడీఎంకే సారథ్యంలోని ఎన్డీయే కూటమిలో బీజేపీ, పీఎంకే, ఏఎంఎంకే, టీఎంసీ(ఎం), పీబీకే, పీబీకే, పీడీకేలు ఒక కూటమిగా ఉన్నాయి. సోమవారం ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపిణీ పూర్తయ్యింది. 

234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి మార్చి 30న అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి 30 నుంచి ఏప్రిల్ 6 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 9. రాష్ట్రంలోని అన్ని స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ పేర్కొంది. మే 4న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటించనున్నారు. 

అభ్యర్థల ఎంపిక, సీట్ల పంపిణీ, పొత్తులు ఖరారు కావడంతో తమిళనాడులో ఎన్డీయే కూటమి ప్రచారంపై ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏఐఏడీఎంకే పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. కనివినీ ఎరుగని హామీలతో అన్నాడీఎంకే షాకిచ్చింది. 

ఏఐఏడీఎంకే మేనిఫెస్టో- 2026

  • రేషన్ కార్డ్ కలిగిన కుటుంబాలకు ఉచిత ఫ్రిజ్‌లు
  • మహిళలతో సమానంగా పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం
  • 25 వేల సబ్సిడీతో రాష్ట్రంలోని 5 లక్షల మంది మహిళా ఉద్యోగులకు ద్విచక్ర వాహనాల పంపిణీ
  • బ్యాంకుల్లో తీసుకున్న విద్యా రుణాలు మాఫీ
  • రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 10 వేల రూపాయల ఆర్ధిక సాయం
  • రేషన్ కార్డ్  ఉన్న వారికి నెలవారి  కోటా కింద బియ్యంతో పాటు ఉచితంగా కేజీ కందిపప్పు, కేజీ మంచి నూనె
  • రాష్ట్రంలోని కుటుంబాలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు
  • ఫించను మొత్తం 2 వేల రూపాయలకు పెంపు
  • జల్లికట్లు ఆటలో పాల్గొనే వారి కుటుంబాలకు 10 లక్షల ఆర్ధిక సాయం