హీరోగా దేవిశ్రీ ప్రసాద్... నేను ఎప్పుడో అయ్యా.. థమన్ షాకింగ్ కామెంట్స్

 

దేవి శ్రీ ప్రసాద్.. ఈ పేరు తెలియనివారు ఉండరు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఇప్పుడు హవా తగ్గింది కానీ 10, 15 ఏళ్ల క్రితం అంతా దేవిశ్రీ పాటలే వినిపించేవి. సీనియర్ హీరోల నుంచి జూనియర్ హీరోల వరకు అందరికీ దేవియే కావాలి. అలా అభిమానులతో రాక్‌ స్టార్ అని పిలిపించుకున్న దేవిశ్రీ ప్రసాద్‌కు ఇటీవల థమన్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఒకటి ఆరా చిత్రాలు తప్పించి.. ఎక్కువగా థమన్ హవానే కనిపిస్తోంది.

ఇండస్ట్రీలో చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు హీరోలుగా, దర్శకులుగా రాణించారు. ఈ క్రమంలోనే దేవి శ్రీ ప్రసాద్‌కు సంగీత దర్శకుడి నుంచి హీరోగా ప్రమోషన్ వచ్చింది. బలగం ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఎల్లమ్మ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీ కోసం కంప్లీట్‌గా మేకోవర్ అయిన ప్రాణం పెట్టి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్నారు.

నిజానికి దేవిశ్రీ ప్రసాద్‌ను హీరోగా చూడాలని ఆయన తండ్రి, ప్రముఖ సినీ రచయిత సత్యమూర్తి ఆశించారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో దేవిని హీరోగా లాంచ్ చేసేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ సమయంలో సత్యమూర్తి చనిపోవడంతో హీరో కావాలన్న ఆలోచనను దేవి విరమించుకున్నారు. హీరోగా నటించకపోయినా శంకర్ దాదా, జులాయి, అత్తారింటికి దారేది, ఖైదీ నెం 150 తదితర సినిమాలో తెరపై తళుక్కున మెరిశారు. 

దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటించడంపై ఎస్ఎస్ థమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓజీ టూర్ కాన్సర్ట్‌లో పాల్గొన్న ఆయనను మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలు  అడగ్గా ఓపికగా సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే దేవిశ్రీ ప్రసాద్ గారు హీరోగా  చేస్తున్నారు? మరి మీరు ఎప్పుడు హీరోగా చేస్తున్నారు? అని విలేకరులు ప్రశ్నించారు. దీనికి థమన్ ఆసక్తికరంగా బదులిచ్చారు. 

నేను ఆల్రెడీ హీరో అయ్యే వచ్చాను. బాయ్స్‌లో హీరో అయిపోయి వచ్చాను. యాక్టింగ్ చాలా కష్టం.. అది ఎంత పనో మీకు తెలియదు. అది చాలా టార్చర్.. మనం ప్రశాంతంగా ఏసీ  రూమ్‌లో కూర్చొని మంచి ట్యూన్ చేయరా అని దేవుడు ఆశీర్వదించాడు. ఈ ఎండలు, వడదెబ్బలు మనకెందుకు? కానీ దేవి అన్నకు హ్యాట్సాఫ్. ఆ స్క్రిప్ట్ మొత్తం నాకు తెలుసు.. అది బ్లాక్‌బస్టర్ సినిమా అంతే. అన్న అయితే ప్రాణం పెట్టేస్తున్నాడు.. దిల్‌రాజు గారు కూడా నాతో చెప్పారు. 

అవసరమైతే నేను కూడా మీకు సాయం చేస్తానని దిల్‌రాజు గారికి  చెప్పాను. జీవితంలో అంతా నాకే, నాదే అనుకోకూడదు. అందరం కలిసి పనిచేసుకుందామని దిల్‌రాజు గారితో మాట్లాడాను. ఎల్లమ్మ బ్లాక్‌బస్టర్ స్క్రిప్ట్స్, ఫస్ట్ సినిమాతోనే యాక్టర్‌గా దేవిశ్రీ ప్రసాద్ గారు ప్రూవ్ చేసుకుంటారని థమన్ అన్నారు. భవిష్యత్తులో కూడా హీరో కావాలన్న ఉద్దేశం నాకు లేదు. గేమ్ ఛేంజర్ ఆడియో ఫంక్షన్‌కి డల్లాస్ వెళ్లినప్పుడు ఎల్లమ్మ మూవీ లైన్ ఫ్లైట్‌లోనే చెప్పారు. సినిమా చాలా బాగుంటుంది అని థమన్ వెల్లడించారు. 


విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోరం... 8 మంది కార్మికులు మృతి

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో సోమవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉక్కుద్రవం లీకై 8 మంది కార్మికులు దుర్మరణం పాలవ్వగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్లాంట్‌లోని ఎస్ఎంఎంస్ 2, ఎస్‌టీసీ -3 హీట్ ఎఫ్‌జీలో స్టీల్ మెటల్ లిక్విడ్ లాడిల్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

పేలుడు జరిగిన సమయంలో దాదాపు 1500 డిగ్రీల వేడితో ఉన్న స్టీల్ మెటల్ లిక్విడ్‌ను లిఫ్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పేలుడు శబ్ధం వినిపించగానే భయాందోళనలకు గురైన కార్మికులు, ఇతర ఉద్యోగులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, పోలీస్, ఇతర అధికారులు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాద విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మెరుగైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అటు హోంమంత్రి అనిత కూడా విజయనగరంలో తన పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని విశాఖకు బయల్దేరారు. 


Peddi Public Talk: పెద్ది పబ్లిక్ టాక్.. రామ్ చరణ్ మూవీపై జనం టాక్ ఇదే

 


బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన మూవీ పెద్ది. జగపతిబాబు, శివరాజ్ కుమార్, దివ్యెందు శర్మ, బొమన్ ఇరానీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లపై వై రవిశంకర్, నవీన్ యెర్నెనీ, వెంకట సతీష్ కిలారులు కలిసి పెద్ది సినిమాను నిర్మించారు. 

జూన్ 4న పెద్ది మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే జూన్ 3వ తేదీ రాత్రి ఈ సినిమా ప్రీమియర్స్ ప్రదర్శించారు. పెద్దిపై పబ్లిక్ టాక్ ఎలా ఉంది? రామ్ చరణ్ నటన, బుచ్చిబాబు డైరెక్షన్ ఎలా ఉంది? అనే దానిపై సోషల్ మీడియాలో వీడియోలు, పోస్టులు వైరల్ అవుతున్నాయి. 

రామ్ చరణ్‌కు రంగస్థలంకు నేషనల్ అవార్డ్ రాలేదు. కానీ ఈ మూవీ చూసిన తర్వాత ఆయనకు నేషనల్ అవార్డ్ రాకపోతే నేషనల్ అవార్డ్ జ్యూరీనే మార్చుకోవాలేమో. అందరూ ఓ టైప్ ఆఫ్ మూవీస్‌కి అలవాటు పడిపోయారు. స్లో యాక్షన్, స్లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, పిచ్చి పిచ్చి బీజీఎంలు, గాలిలో ఎగిరే సీన్లు వస్తే అదే సినిమా అనుకుంటున్నారు. కానీ నిజంగా ఒక యాక్టర్ పొటెన్షియల్ ఏంటీ? కమర్షియల్ యాంగిల్ అన్ని పక్కనపెడితే పెద్దితో చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాము. 

మన తెలుగులో ఇలాంటి మూవీ వచ్చింది. ఈ సినిమా చూస్తుంటే ఒక హాలీవుడ్ మూవీలా అనిపించింది. ఇంటర్వెల్ వచ్చినప్పటి నుంచి తెరపై వాళ్లు ఏడుస్తుంటే మాకు ఏడుపొచ్చింది. వాళ్లని కొడుతుంటే ఆ పెయిన్ మనకి వస్తుంది. థియేటర్‌లో చూసిన 600 మందిలో ఒక్కళ్లనైనా పెద్ది సినిమా ఖచ్చితంగా ఇన్‌స్పైర్ చేస్తుందని ఒక అభిమాని తెలిపారు. 

ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇన్‌స్పైర్ అవ్వాల్సిందే. ఐడెంటీటీ, గెలుపు అనేది చాలా ముఖ్యం. అది ఉంటేనే బయట రెస్పెక్ట్ ఇచ్చేది కూడా అని ఓ ప్రేక్షకుడు చెప్పాడు. రామ్ చరణ్ బాడీ చూస్తే అదిరిపోయింది. నాకు కూడా జిమ్‌కి వెళ్లాలని అనిపిస్తుంది. ఖచ్చితంగా రామ్ చరణ్‌కి నేషనల్ అవార్డ్ వస్తుంది.. ఎందుకు రాదో చూద్దామని ఓ అభిమాని అన్నాడు. 

మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. బుచ్చిబాబు గారి డైరెక్షన్ కానీ, రామ్ చరణ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగున్నాయి. ఇది ఒక సినిమా కాదు.. ఒక ఆటగాడి గెలుపు. ఆట అనేది స్వార్ధం కోసం కాదు.. ఒక పర్పస్ కోసమని సూపర్‌గా ప్రజెంట్ చేశారు. చరణ్ జీవితంలో మరో మైలురాయి. తండ్రిని మించిన తనయుడిగా ఇవాళ ఆయన యాక్టింగ్ అద్భుతంగా చేశాడు అని ఫ్యాన్స్ తెలిపారు. 


Peddi: పెద్ది బడ్జెట్ ఎంత? రామ్ చరణ్ ముందు టార్గెట్ ఎంతంటే?

 


తమిళ దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్ కావడంతో మెగా ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు. దాంతో ఎలాగైనా అభిమానులకు సాలీడ్ హిట్ అందించాలని డిసైడ్ అయిన రామ్ చరణ్ .. తన వీరాభిమాని బుచ్చిబాబు సానాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉప్పెన తర్వాత కొన్నేళ్ల పాటు చరణ్ కోసం వెయిట్ చేసి చివరికి అనుకున్నది సాధించారు బుచ్చిబాబు. వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన మూవీ పెద్ది. 

స్పోర్ట్స్, విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు తెరకెక్కించాయి. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యెందు శర్మ, బొమన్ ఇరానీ, రవికిషన్, విజి చంద్రశేఖర్, సత్య, అజయ్ ఘోష్, ఉపేంద్ర లిమాయే తదితరులు నటించారు. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ స్పెషల్ సాంగ్ చేశారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు.

పెద్దిని 350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించినట్లు స్వయంగా దర్శకుడు బుచ్చిబాబు వెల్లడించారు. రామ్ చరణ్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకు భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. 

నైజాంలో 48 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 24 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 18 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 10.20 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 8.25 కోట్ల రూపాయలు, గుంటూరులో 11.20 కోట్ల రూపాయలు, కృష్ణాలో 9.30 కోట్ల రూపాయలు, నెల్లూరులో 6.30 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 17 కోట్ల రూపాయలు, తమిళనాడులో 5.25 కోట్ల రూపాయలు, కేరళలో 2 కోట్ల రూపాయలు, హిందీ+ రెస్టాఫ్ ఇండియాలో 25 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 34 కోట్ల రూపాయలతో కలిపి వరల్డ్ వైడ్‌గా 218 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది పెద్ది. ఈ సినిమా బ్రేక్ఈవెన్ కావాలంటే 220 కోట్ల రూపాయల షేర్.. 450 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. 

సంక్రాంతి సీజన్ తర్వాత టాలీవుడ్ గడ్డు పరిస్ధితులని ఎదుర్కొంటోంది. ఒకటి రెండు సినిమాలు తప్పించి పెద్ద సినిమాలన్నీ వాయిదా పడటంతో తెలుగు చిత్ర పరిశ్రమకు కీలకమైన సమ్మర్ సీజన్ నిరుత్సాహ పరిచింది. దాంతో ప్రేక్షకులు రాక... కొత్త సినిమాల సందడి లేక థియేటర్లు వెలవెలబోయాయి. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల ఆశలన్నీ పెద్దిపైనా ఉన్నాయి. మరి టాలీవుడ్‌కు పెద్ది సినిమా తిరిగి ఊపిరి పోస్తుందో లేదో చూడాలి. 


IPL 2026 విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... పోరాడి ఓడిన గుజరాత్

 

Photo Courtesy: RCBTweets

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 (ఐపీఎల్ 2026) విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. విరాట్ కోహ్లీ 75 పరుగులు, జితేష్ శర్మ 11 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్ల ధాటికి గుజరాత్ బ్యాట్స్‌మెన్ నిలవలేకపోయారు. ఒక్కొక్కరిగా పెవిలియన్ చేరారు. దాంతో గుజరాత్ కనీసం 100 పరుగులైనా చేస్తుందా అన్న అనుమానాలు నెలకొన్నాయి. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన వాషింగ్టన్ సుందర్ జట్టును ఆదుకున్నాడు. 37 బంతుల్లో 50 పరుగులు చేశాడు. 

గుజరాత్ బ్యాట్స్‌మెన్‌లలో సాయి సుదర్శన్ 12, శుభమన్ గిల్ 10, నిషాంత్ సింధు 20, జోస్ బట్లర్ 19, వాషింగ్టన్ సుందర్ 50, అర్షద్ ఖాన్ 15, రాహుల్ తేవాటియా, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్‌లు తలో 7 పరుగులు, రబాడా 3 పరుగులు చొప్పున నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హేజల్‌వుడ్‌లు తలో 2 వికెట్లు పడగొట్టగా.. రషిక్ సలామ్ దర్ 3, కృనాల్ పాండ్యా ఒక వికెట్ పడగొట్టారు.

156 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఓపెనర్ విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్‌లు శుభారంభం అందించారు. వీరిద్దరూ బౌండరీల వర్షం కురిపించడంతో బెంగళూరు లక్ష్యం దిశగా పరుగులు తీసింది. అయితే 32 పరుగులు చేసిన వెంకటేష్ అయ్యర్‌ను మొహ్మద్ సిరాజ్ ఔట్ చేశాడు. ఆ వెంటనే దేవదత్ పడిక్కల్ 1 పరుగుకే వెనుదిరిగాడు. విరాట్, కెప్టెన్ రజత్ పాటిదర్‌లు కాసేపు గుజరాత్ బౌలర్లకు ఎదురు నిలిచారు. ఈ దశలో 15 పరుగులు చేసి రజత్‌ను రషీద్ ఖాన్ ఔట్ చేశాడు.

ఆ కాసేపటికే కృనాల్ పాండ్యాను రషీద్ ఖాన్ ఎల్‌‌బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపడంతో 4 వికెట్లు కోల్పోయి బెంగళూరు కష్టాల్లో పడింది. ఈ దశలో టిమ్ డావిడ్ - విరాట్ కోహ్లీల జోడీ సమయోచితంగా ఆడి 41 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను అర్షద్ ఖాన్ విడదీశాడు. 24 పరుగుల వ్యక్తిగత పరుగుల వద్ద టిమ్ డావిడ్ పెవిలియన్ చేరాడు. దీంతో వికెట్ కీపర్ జితేష్ శర్మతో కలిసి విరాట్ కోహ్లీ జట్టును విజయం దిశగా నడిపించాడు. 

చివరిలో గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పరుగులు రావడం కష్టంగా మారింది. మ్యాచ్ నానాటికీ ఉత్కంఠగా మారుతున్న దశలో విరాట్ కోహ్లీ క్యాచ్ రూపంలో ఔట్ కావడంతో మైదానం ఒక్కసారిగా నిశ్శబ్ధంగా మారింది. అయితే టీవీ రిప్లయ్‌లో బంతి నేలను తాకినట్లుగా కనిపించడంతో థర్డ్ ఎంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. దాంతో బతికిపోయిన కోహ్లీ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. కోహ్లీ విరోచిత బ్యాటింగ్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి ఐపీఎల్ 2026 విజేతగా నిలిచింది. 

ఆర్సీబీ బ్యాట్స్‌మెన్‌లలో వెంకటేష్ అయ్యర్ 32, విరాట్ కోహ్లీ 75, దేవదత్ పడిక్కల్ 1, రజత్ పాటిదర్ 15, కృనాల్ పాండ్యా 1, టిమ్ డావిడ్ 24, జితేశ్ శర్మ 11 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్, కసిగో రబాడా, అర్షద్ ఖాన్‌లు తలో వికెట్ పడగొట్టగా.. రషీద్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టాడు. 



హైదరాబాద్‌లో ప్రభాస్ కొత్త డ్రీమ్ హౌస్.. ఖరీదు ఎన్ని కోట్లో తెలుసా?

పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, నాగ్ అశ్విన్‌తో కల్కి 2, హను రాఘవపూడితో ఫౌజీ సినిమాలలో నటిస్తున్నారు. స్పిరిట్, కల్కి 2ను సమాంతరంగా చేస్తూ వస్తున్న ప్రభాస్.. ఈ రెండింటిలో ఒకటి త్వరగా పూర్తి చేసి ఫౌజీ సెట్‌లో దిగిపోవాలని ప్లాన్ చేస్తున్నారు డార్లింగ్. ఈ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో సలార్ 2ను సెట్స్ మీదకి తీసుకెళ్లనున్నారు ప్రభాస్. 

ప్రజెంట్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రభాస్ దరిదాపుల్లో ఏ హీరో కూడా లేరు. భారత్‌లో 6 సినిమాలకు 6 సార్లు 100 కోట్ల రూపాయల ఓపెనింగ్స్  రాబట్టిన ఏకైక హీరోగా నిలిచారు. డివైడ్ టాక్‌తోనూ ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టిన నటుడు ప్రభాస్ ఒక్కరే. తన రాబోయే సినిమాలు స్పిరిట్, కల్కి 2, ఫౌజీ చిత్రాలు కూడా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

బాహుబలితో తెలుగు సినిమా స్థితిని, గతిని మార్చిన ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా సూపర్‌స్టార్‌గా దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్‌ను సంపాదించారు. ఆయనతో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు బడా నిర్మాతలు క్యూకడుతున్నారు. సినిమాకు 150 నుంచి 200 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటారు ప్రభాస్. ఆయన మార్కెట్, క్రేజ్ దృష్ట్యా ఎంత కావాలన్నా ఇచ్చే వారు ఎందరో. 

ప్రభాస్‌కు హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విలువైన ఆస్తులున్నాయి. ఇటలీలోనూ ఆయనకు ఖరీదైన విల్లా ఉంది. ప్రభాస్ ఆస్తుల విలువ 300 కోట్ల వరకు ఉంటుందని అంచనా. సినిమాలు, బ్రాండ్ అండార్స్‌మెంట్స్, ఇతర మార్గాల ద్వారా బాగానే సంపాదిస్తున్నారు ప్రభాస్. తన సంపాదనను రియల్ ఎస్టేట్, ఇతర పెట్టుబడుల్లోకి మళ్లిస్తున్నారు. ప్రభాస్‌కు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఖరీదైన బంగ్లా ఉంది. 

ప్రస్తుతం పాన్ ఇండియా సూపర్‌స్టార్‌గా తన క్రేజ్ పెరిగిన నేపథ్యంలో తన రేంజ్‌కి తగినట్లుగా మరో కొత్త ఇల్లు నిర్మించుకోవాలని ప్రభాస్ భావిస్తున్నట్లుగా ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లోనే అత్యంత ఖరీదైన ప్రాంతంలో తన డ్రీమ్ మ్యాన్షన్ నిర్మించనున్నారట. ఐటీ, ఫార్మా, ఇతర కార్పోరేట్ కంపెనీలకు నెలవైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసరాల్లో  రెండు ఎకరాల స్థలాన్ని ప్రభాస్ ఇప్పటికే కొనుగోలు  చేశారట. 

ఆ ప్రాంతంలో ఎకరం అక్షరాల 80 కోట్ల రూపాయలు.. అంటే కేవలం స్థలం ఖరీదే 160 కోట్ల రూపాయలు. కోకాపేట ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్‌కు సమీపంలో ప్రభాస్ డ్రీమ్ హౌస్ నిర్మించే ప్రదేశం ఉండటంతో ఇక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ సహా నగరంలోని ఏ ప్రాంతానికైనా సులభంగా ప్రభాస్ చేరుకోవచ్చు. ఈ డ్రీమ్ మాన్షన్‌లో అత్యాధునిక వసతులు ఉంటాయని చెబుతున్నారు. 

జిమ్, హోమ్ థియేటర్, స్విమ్మింగ్ పూల్, గార్డెన్‌తో పాటు మరెన్నో లగ్జరీ సౌకర్యాలు ఉంటాయట. ఇక ఇంటి లోపల తన అభిరుచికి తగినట్లుగా ఇంటీరియర్‌ను ప్లాన్ చేశారట డార్లింగ్. ఈ డ్రీమ్ హౌస్ పూర్తి కావడానికి తక్కువలో తక్కువ రెండేళ్లు సమయం పడుతుందుని వార్తలు వస్తున్నాయి. స్థలం ఖర్చు, నిర్మాణంతో కలిపి ప్రభాస్ డ్రీమ్ మ్యాన్షన్ ఖరీదు 200 కోట్లను దాటేస్తుందని చెబుతున్నారు. ఈ వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. 


దిగ్గజాల సరసన రామ్ పోతినేని..!

 

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నారు. ఏడేళ్ల క్రితం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆయన మళ్లీ హిట్ కొట్టలేదు. తర్వాత చేసిన రెడ్, రొమాంటిక్, ది వారియర్, స్కంధ, డబుల్ ఇస్మార్ట్, ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజప్పాయింట్ చేశాయి. దీంతో రేసులో నిలబడాలంటే ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్ధితి నెలకొంది. ఇప్పటికే యంగ్ టాలెంట్‌తో పాటు సీనియర్ హీరోల నుంచి రామ్ పోతినేనికి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో తన 23వ సినిమాకు సంబంధించి ఆయన ఓ నిర్ణయం తీసుకున్నారు. 

దేవదాసు సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు రామ్ పోతినేని. తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న రామ్.. ఎనర్జిటిక్ హీరో, చాక్లెట్ బాయ్‌గా అభిమానుల్లో స్టార్‌డమ్ తెచ్చుకున్నాడు. రెడీ, మస్కా, కందిరీగ, రేయ్, నేను శైలజ, హైపర్, ఇస్మార్ట్ శంకర్, డబుల్ ఇస్మార్ట్ వంటి హిట్స్‌తో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే 20 ఏళ్ల కెరీర్‌లో అనుకున్నంత స్థాయిలో ఆయన సక్సెస్ కాలేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రస్తుతం వరుస ఫ్లాపుల్లో ఉన్న రామ్ పోతినేని.. తన 23వ చిత్రానికి స్వయంగా దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటి వరకు నటుడిగా, గాయకుడిగా, గేయ రచయితగా తన టాలెంట్ చూపించిన ఆయన కెరీర్‌లో తొలిసారిగా మెగా ఫోన్ పట్టనున్నారు. మే 15న తన పుట్టినరోజును పురస్కరించుకుని RAPO 23 పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో రామ్ లెదర జాకెట్‌తో వెనుక నుంచి చూపిస్తూ స్టైలీష్ లుక్‌లో అదరగొట్టేశారు. ఈ సినిమాలో ఆయన వీర అనే క్యారెక్టర్‌ను పోషించనున్నారు. జూన్‌లో సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లి డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

అయితే ఈ సినిమాతో రామ్ అరుదైన ఘనతను అందుకోనున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకులుగా మారిన హీరోల లిస్ట్‌లో ఆయన చేరనున్నారు. విశ్వ విఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్, సూపర్‌స్టార్ కృష్ణ, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వంటి దిగ్గజాలు హీరోలుగా నటిస్తూనే మెగా ఫోన్ పట్టి తమ అభిరుచి మేరకు సినిమాలకు దర్శకత్వం వహించారు. అన్న ఎన్టీఆర్ సీతారామ కళ్యాణంతో మొదలుపెట్టి శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర వరకు దాదాపు 15 సినిమాలకు దర్శకత్వం వహించారు. 

ఇక సూపర్‌స్టార్ కృష్ణ సింహాసనం మూవీతో మొదలుపెట్టి ఈశ్వర్ అల్లా తేరే నామ్ వరకు దాదాపు 17 సినిమాలకు దర్శకత్వం వహించి అత్యధిక సినిమాలను డైరెక్ట్ చేసిన హీరోగా ఘనత వహించారు. అలాగే దర్శకుడిగా తెలుగు తెరకు తొలి 70 ఎంఎం, తొలి డీటీఎస్ వంటి టెక్నాలజీలను పరిచయం చేశారు నట శేఖర కృష్ణ. అంతేకాదు.. ఏక కాలంలో తెలుగు, హిందీ భాషల్లోనూ సినిమాలను డైరెక్ట్ చేసిన శెభాష్ అనిపించుకున్నారు కృష్ణ.

ఎన్టీఆర్, కృష్ణల తర్వాత నుంచి చాలామంది తెలుగు అగ్రనటులు దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చినప్పటికీ ఎవరూ సాహసం చేయలేకపోయారు. మధ్యలో నట సింహం బాలకృష్ణ నర్తనశాల పేరుతో పౌరాణికాన్ని తెరకెక్కించేందుకు మెగా ఫోన్ పట్టినప్పటికీ ఈ ప్రాజెక్ట్ అనివార్య కారణాలతో అర్ధాంతరంగా నిలిచిపోయింది. 

వీరి తర్వాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఆ సాహసం చేశారు. జానీ సినిమాతో మెగా ఫోన్ పట్టారు. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు పవన్ కళ్యాణ్. 2003 ఏప్రిల్ 25న విడుదలైన జానీ మూవీ అభిమానులను నిరాశపరిచింది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ప్రయత్నాన్ని విశ్లేషకులు సైతం మెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ మేకోవర్, జానీ కర్చీఫ్‌లు, బనియన్స్, రిబ్బన్స్, బెల్టులతో మార్కెట్‌లో ప్రభంజనం సృష్టించారు పవన్. 

పవన్ కళ్యాణ్ తర్వాత కొన్నాళ్ల వరకు తెలుగులో మరే హీరో కూడా మెగా ఫోన్ పట్టలేదు. ఈ జనరేషన్‌లో మాస్ దా కాస్ దాస్ విశ్వక్‌సేన్ రెండు చిత్రాలకు దర్శకత్వం వహించారు. మరో సినిమా సెట్స్ మీదుంది. సిద్ధూ జొన్నలగడ్డ, నవీన్ పొలిశెట్టిలు స్క్రిప్ట్, డైరెక్షన్ విషయాలలో జోక్యం చేసుకుంటున్నా.. ఫుల్ టైం డైరెక్టర్లు కాలేదు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం త్వరలోనే మెగా ఫోన్ పట్టుకోనున్నారు. 

అయితే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ పోతినేని దర్శకుడిగా మారుతుండటం హాట్ టాపిక్‌గా మారింది. తన సోదరుడు చైతన్య కృష్ణ నిర్మాణంలో తన 23వ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు రామ్. దీనికి స్వయంగా ఆయనే కథ అందిస్తుండటం విశేషం. ఓ సినిమాలో నటిస్తూ.. దానికి దర్శకత్వం వహించడం, స్క్రిప్ట్, మిగిలిన పనులు చూసుకోవడం అంతా కత్తిమీద సాములాంటి వ్యవహారమే. అయితే దీని కోసం రామ్ పోతినేని అన్ని రకాలుగా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. మరి దర్శకుడుగా ఈ ఎనర్జిటిక్ హీరో ఎంత మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి.