తొలిరోజే టాస్క్‌లతో రణరంగంలా బిగ్‌బాస్ 10.. మేజిక్‌ కీలను గెలుచుకున్నదెవరు?

 


బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఘనంగా ప్రారంభమైంది. 10 మంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్ కలిపి మొత్తం 16 మంది ఈసారి కంటెస్టెంట్స్‌గా హౌస్‌లో అడుగుపెట్టారు. సెలబ్రిటీ కేటగిరీలో దేబ్‌జనీ మోదక్, టెంపర్ వంశీ, కృష్ణుడు, చైత్రా రాయ్, ఆటో రాంప్రసాద్, జబర్దస్త్ నరేష్, త్రిగుణ్, సుధీర్ రెడ్డి, వర్షిణి సౌందరరాజన్, ముఖేష్‌ గౌడలు కంటెస్టెంట్స్‌గా వచ్చారు. ఇక కామనర్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా అగ్నిపరీక్ష సీజన్ 2లో ఫైనల్ లిస్టులో చేరిన 13 మందిలో 6గురిని హౌస్‌లోకి పంపారు. వారు సింగర్ ఝాన్సీ, అమన్, చరణ్, సృష్టి, షాలిని, రోహిత్‌. 

ప్రతి సీజన్‌లోనూ కంటెస్టెంట్స్ అంతా వచ్చిన తర్వాత రెండో రోజు నుంచి టాస్క్‌లు మొదలవుతాయి. కానీ ఈ సీజన్‌లో మాత్రం లాంచింగ్ ఎపిసోడ్ రోజునే టాస్క్‌లు మొదలెట్టారు కింగ్ అక్కినేని నాగార్జున. దీనిలో భాగంగా బిగ్‌బాస్ హౌస్‌ చూపించడానికి వెళ్లిన నాగ్.. తనతో పాటు గార్డెన్ ఏరియా మాదిరిగా ఉన్న రూమ్‌లోకి ఓ కీని పట్టుకుని వెళ్లారు. ఈసారి ఆట మొత్తం ఈ మేజిక్ కీతోనే ఉందని చెప్పిన ఆయన 10 బాక్స్‌లు చూపించారు. ఇందులో ఓ బాక్స్‌ను తన దగ్గరున్న కీతో ఓపెన్ చేయగా అందులో ఈ కీ ల గురించి, ఈ బాక్స్‌లు ఓపెన్ చేయడం వల్ల వచ్చే పవర్స్ గురించి చదివి వినిపించారు. 

ఆ తర్వాత హౌస్‌లోకి వచ్చిన తొలి నలుగురు కంటెస్టెంట్స్‌ దేబ్‌జనీ మోదక్, త్రిగుణ్, సుధీర్ రెడ్డి, సింగర్ ఝాన్సీలను గార్డెన్ ఏరియాకి పిలిపించి వారికి మేజిక్ కీ గురించి చెప్పి టాస్క్ ఇచ్చారు. 

దీని ప్రకారం వారి ఎదురుగా డైమండ్ షేపులో ఉన్న పజిల్, బాక్స్‌ పెట్టారు. బజర్ మోగగానే వారి ముందున్న బాక్స్‌లు పగలగొట్టి వాటి ఉన్న బిగ్‌బాస్ 10 అనే ఇంగ్లీష్ అక్షరాలు ఉన్న బాక్స్‌లను తీసుకోవాలి. వాటిని డైమండ్ షేపులో సరిగ్గా అమర్చాలి. బజర్ మోగే లోగా ఎవరైతే ఫస్ట్ పూర్తి చేస్తారో వాళ్లకి కీ దొరుకుతుంది. ఈ టాస్క్‌లో తొలుత త్రిగుణ్ గెలవగా.. ఆ తర్వాత సింగర్ ఝాన్సీ గెలిచి కీని సొంతం చేసుకుంది. 

ఆ తర్వాత హౌస్‌లోకి వచ్చిన మరో నలుగురు కంటెస్టెంట్స్ చైత్రారాయ్, ఆటో రాంప్రసాద్, శాలిని, అమన్‌లకు కూడా కీ టాస్క్ పెట్టారు. అయితే అమన్‌కు అంతకుముందు నాగార్జున ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేయకపోవడంతో అతనిని ఈ టాస్క్ నుంచి ఎలిమినేట్ చేస్తున్నట్లు కింగ్ ప్రకటించారు. ఈ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్స్ ముందు రంధ్రాలున్న బోర్డ్ పెట్టి వాటిలో నుంచి బంతిని అందుకుంటూ ఒక బాక్స్‌లో వేయాలి. ఎవరైతే ముందుగా పడేస్తారో వారికే మేజిక్ కీలు దొరుకుతాయి. ఈ టాస్క్‌లో రాంప్రసాద్, షాలినీలు గెలిచి కీలు సొంతం చేసుకున్నారు.

ఆ తర్వాత వంశీ, చరణ్, సృష్టి, పొట్టి నరేష్‌ల ముందు గోల్డెన్ ఎగ్స్ పెట్టి ఒక్కొక్కరితో వాటిని పగలగొట్టారు. వారిలో చరణ్, సృష్టిలకు ఉడకబెట్టిన గుడ్డులు వస్తాయి. దాంతో నరేశ్, వంశీలలో ఒకరిని తమతో పాటు టాస్క్‌కి తీసుకెళ్లాలని నాగార్జున చెప్పారు. దాంతో వారిద్దరూ ఆలోచించుకుని నరేశ్ అయితే తమకు పోటీ ఉండరు అనుకుని అతనిని సెలెక్ట్ చేసుకున్నారు. అనంతరం గార్డెన్ ఏరియాకు ముగ్గురిని పిలిచి వారికి ఓ ఐరన్ రాడ్ తిప్పి దాని కిందపడే రింగులను, ఎదురుగా ఉన్న మూడు హుక్స్‌పై కరెక్ట్‌గా పడేలా వేయాలని టాస్క్ పెట్టారు. ఈ టాస్క్‌లో సృష్టి, పొట్టి నరేశ్‌లు గెలిచి కీలు సొంతం చేసుకున్నారు. 

అయితే చివరిలో వచ్చిన వర్షిణి సౌందరాజన్, కృష్ణుడు, ముఖేష్ గౌడ, రోహిత్‌లకు మేజిక్ కీ గెలుచుకునే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌కు వంశీ సంచాలక్‌గా వ్యవహరించారు. టాస్క్‌లో భాగంగా ఒక రింగ్‌కు అటు ఇటూ తాళ్లు కట్టి ఉంటాయి. వాటిని ఇద్దరు పట్టుకుని మధ్యలో బంతిని పెట్టి దానిని నెట్‌లో వేయాలి.. బజర్ మోగేసరికి ఎవరు ఎక్కువ బంతులు వేస్తారో వారు గెలిచినట్లు అని వంశీ చదివి వినిపించారు. 

ముఖేష్- వర్షిణి, కృష్ణుడు- రోహిత్‌లు ఒక జోడీగా టాస్క్ ఆడారు. ఈ టాస్క్‌లో ముఖేష్-వర్షిణి గెలిచి మేజిక్ కీలను సొంతం చేసుకున్నారు. ఓవరాల్‌గా త్రిగుణ్, సింగర్ ఝాన్సీ, ఆటో రాంప్రసాద్, శాలిని, సృష్టి, పొట్టి నరేశ్, వర్షిణి, ముఖేష్ గౌడతో కలిపి 8 మంది మేజిక్ కీలను గెలుచుకున్నారు. మరో రెండు కీలు బ్యాలెన్స్ ఉండగా వాటిని ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి. 


Who Is GDN: 100 ఏళ్ల కిందటే మేక్ ఇన్ ఇండియాకు పునాది... ఎవరీ జీడీఎన్?

 


విలక్షణ నటుడు మాధవన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జీడీఎన్. కొయంబత్తూరుకు చెందిన భారతీయ శాస్త్రవేత్త, ఇంజనీర్, పారిశ్రామికవేత్త గోపాలస్వామి దొరస్వామి నాయుడు జీవితం, ఆయన సాధించిన విశేషాలు ఇతివృత్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో జీడీఎన్‌గా మాధవన్ టైటిల్ రోల్ పోషించారు. ఈ సినిమా టైటిల్ ప్రకటించిన నాటి నుంచే ప్రత్యేకత సంతరించుకుంది. మాధవన్ లుక్ బయటకు వచ్చిన తర్వాత అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఆగస్ట్ 7న జీడీఎన్ విడుదల కానుంది. అయితే ఎవరీ జీడీఎన్? ఆయన జీవితం ఏంటీ? జీడీఎన్ సాధించిన విజయాలు ఏంటీ? అనే ఆసక్తి జెన్ జీ పిల్లల్లో నెలకొంది. 

కోయంబత్తూరులో స్థిరపడిన తెలుగు రైతు కుటుంబంలో 1893 మార్చి 23న జన్మించారు జీడీ నాయుడు. ఆయన పుట్టిన కొద్దినెలలకే తల్లి చనిపోయారు. అనివార్య కారణాలతో మూడో తరగతిలోనే చదువు మానేశారు. కోయంబత్తూరులోని ఓ హోటల్‌లో సర్వర్‌గా ప్రస్థానం ప్రారంభించిన ఆయన రూపాయి రూపాయి కూడబెట్టి దాచిన డబ్బుతో చిన్న మోటార్ సైకిల్ కొనుగోలు చేసి ప్రయోగాలు ప్రారంభించారు. ఆ మోటార్ సైకిల్‌లోని ప్రతి భాగాన్ని విడదీసి.. మళ్లీ బిగించి మెకానిక్‌గా మారిపోయారు. 

1920లలో ఒక ఆటోమొబైల్ కోచ్‌ను కొన్న ఆయన ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్‌లోకి దిగారు. పొల్లాచ్చి నుంచి పళని వరకు ప్రయాణించారు. కొన్నేళ్లకే వ్యాపారంలో సత్తా చాటిన నాయుడు తన యూనివర్సల్ మోటార్ సర్వీస్ (యూఎంఎస్)తో దేశవ్యాప్తంగా ట్రాన్స్‌పోర్ట్ రంగంలో గుర్తింపు సంపాదించారు. కేవలం 13 సంవత్సరాలలోనే ఆయన రవాణా సామ్రాజ్యం అనూహ్యంగా విస్తరించి  280కి పైగా బస్సులను కలిగి దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బస్సు కంపెనీలలో ఒకటిగా ఘనత వహించింది. 

1930లో న్యూ ఎలక్ట్రిక్ వర్క్స్ కంపెనీని ప్రారంభించి ఎలక్ట్రిక్ మోటార్లను ఉత్పత్తి చేశారు. భారతదేశంలో తొలి మోటార్‌ను జీడీ నాయుడు కంపెనీయే తయారు చేసింది. కోయంబత్తూరులో ఉన్న ఆయన ఫ్యాక్టరీ నేషనల్ ఎలక్ట్రిక్ వర్క్స్ ఈ వినూత్న ఆవిష్కరణ చేసింది. అలాగే గోపాల్ క్లాక్ ఇండస్ట్రీ కూడా వినియోగదారుల ఆదరణను పొందింది. 

నాయుడు.. పరిశోధనలు, సంచలనాలు అక్కడితో ఆగలేదు. 1937లో డీ బాలసుందరం నాయుడుతో కలిసి భారతదేశంలో తొలి ఇండిజెనస్ మోటర్‌ను తయారు చేశారు. ఈ విజయంతో బాలసుందరం టెక్ట్స్‌టూల్‌ను కనుగొని టెక్ట్స్‌టూల్ బాలసుందరంగా మారారు. ఆ తర్వాత డ్రై సెల్స్‌తో రేజర్‌ను తయారు  చేశారు జీడీఎన్. సూపర్ థిన్ షేవింగ్ బ్లేడ్స్‌, సినిమా కెమెరాలలో డిస్టెన్స్ అడ్జెస్టర్, ఫ్రూట్ జ్యూస్ ఎక్స్‌ట్రాక్టర్, టాంపర్ ప్రూఫ్ వోట్ రికార్డింగ్ మెషిన్, కిరోసిన్‌తో నడిచే ఫ్యాన్, ఫైవ్ వాల్వ్ రేడియో సెట్స్, టూ సీటర్‌ పెట్రోల్ ఇంజిన్ కార్ తదితర ఆవిష్కరణలతో సంచలనం సృష్టించారు జీడీఎన్. 

అయితే ఆయన ప్రయోగాలకు ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సహం లభించలేదు, లైసెన్స్ మంజూరు చేయడానికి కూడా ముందుకు వచ్చేది కాదు. దాంతో ఆయన ఆటోమోటివ్స్ ప్రయోగాలను పక్కనపెట్టి.. రైతాంగానికి కొత్తరకం పత్తి, బొప్పాయి, మొక్కజోన్న విత్తనాలను తయారు చేశారు జీడీఎన్. ఆయన వ్యవసాయ క్షేత్రాన్ని దిగ్గజ శాస్త్రవేత్త సర్ సీవీ రామన్, ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్, భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యలు సందర్శించారు. ఇక కేవలం 11 గంటల రికార్డ్ సమయంలోనే ఇంటిని నిర్మించి సంచనం సృష్టించారు జడీఎన్. 

1922లో లండన్‌లో జరిగిన కింగ్ జార్జ్ V అంత్యక్రియలను వ్యక్తిగతంగా వీడియో తీశారు. జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌ను కూడా జీడీఎన్ కలిశారు. అప్పటి కాంగ్రెస్ అగ్రనేత కే కామరాజ్‌తో సన్నిహితంగా ఉండేవారు జీడీఎన్. అలాగే జాతిపతి మహాత్మాగాంధీ, తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌లను తన కెమెరాలో బంధించారు. రాజకీయాలపై ఆసక్తితో 1936 ప్రావిన్సియల్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలవ్వడంతో రాజకీయాల నుంచి తప్పుకున్నారు. నాయుడుకు రోల్స్ రాయిస్ కారు బహుమతిగా లభించగా.. ఆ రోజుల్లో అంతటి విలాసవంతమైన కారును కలిగివున్న ఏకైక వ్యక్తి జీడీఎన్ కావడం విశేషం. 

1944లో ఆటోమొబైల్ తదితర ప్రయోగాల నుంచి పదవీ విరమణ తీసుకున్న జీడీఎన్.. సామాజిక సేవా కార్యక్రమాలతో సంచలనం సృష్టించారు. 1945లో కోయంబత్తూరులో భారతదేశంలోనే మొట్టమొదటి పాలిటెక్నిక్ కాలేజీ అయిన ఆర్ధర్ హోప్ పాలిటెక్నిక్ కాలేజీ (ప్రస్తుతం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ)ని స్థాపించడానికి చొరవ తీసుకుని భారీ విరాళాలు అందజేయడంతో పాటు ఈ కాలేజీకి ప్రిన్సిపాల్‌గానూ వ్యవహరించారు. 

ఆ సమయంలో పాలిటెక్నిక్‌ కోర్సుకు 4 ఏళ్ల కాలం విద్యార్ధుల సమయాన్ని వృథా చేయడమేనని భావించిన జీవిఎన్ దానిని రెండేళ్లకు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఆయన ప్రతిపాదనను అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం తిరస్కరించడంతో పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్‌ పదవికి రాజీనామా చేశారు. 1967లో జడీ నాయుడు ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ను స్థాపించారు. 

తన ఇంజనీరింగ్, మాన్యుఫాక్చరింగ్ కంపెనీలలో వేలాదిమందికి ఉద్యోగాలు కల్పించారు జీడీఎన్. ఎలక్ట్రికల్, మెకానికల్, అగ్రికల్చర్, హైబ్రీడ్ కల్టీవేషన్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో ఎన్నో పరిశోధనలు, ఎన్నో ఆవిష్కరణలు చేసి కోయంబత్తూరు నగరం దేశంలోనే ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా మార్చడంలో కీలకపాత్ర పోషించారు. సామాన్య ప్రజల జీవితాలపై గొప్ప ప్రభావాన్ని చూపిన ఎన్నో వస్తువులను జీడీఎన్ ఆవిష్కరించి.. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ప్రాజెక్ట్‌లను వందేళ్ల క్రితమే ప్రారంభించి స్థానికంగా వస్తువులను ఆవిష్కరించడానికి పునాది వేసిన ఘనత జీడీ నాయుడుదే. 

1974లో 80 ఏళ్ల వయసులో జీడీ నాయుడు తుదిశ్వాస విడిచారు. ఆయనకు కుమారుడు జీడీ గోపాల్, మనవడు జీడీ రాజ్‌కుమార్, మనవరాలు శాంతిని ఉన్నారు. జీడీఎన్ గౌరవార్థం కోయంబత్తూరులోని ఒక స్కూల్‌కు జీడీ మెట్రిక్యూలేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్, జీడీ పబ్లిక్ స్కూల్‌కు ఆయన పేరు పెట్టారు. అలాగే ఓ రోడ్డుకు జీడీ నాయుడు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వేగా  నామకరణం చేశారు. 


నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత.. ఛత్రపతి విలన్ మరణానికి కారణమేంటీ?

 


ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. ఆగస్ట్ 4వ తేదీన గుండెపోటుతో ప్రదీప్ రావత్ ముంబైలో తుదిశ్వాస విడిచారు. తెలుగుతో పాటు పలు భాషల్లో ఆయన నటించారు. ఎక్కువగా ప్రతినాయక పాత్రలతో ప్రదీప్ తనదైన ముద్రవేశారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. 

ప్రదీప్ రావత్ ప్రస్థానం:

1952 జనవరి 21న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించారు ప్రదీప్ రావత్. ఆయన అసలు పేరు ప్రదీప్ సింగ్ రావత్. తొలుత హిందీలో అతిబార్ అనే సినిమాతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన చిన్నాచితకా పాత్రలు పోషిస్తూ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో బుల్లితెరపై అడుగుపెట్టిన ప్రదీప్ రావత్.. బీఆర్ చోప్రా తెరకెక్కించిన ఫేమస్  సీరియల్ మహాభారత్‌లో అశ్వత్థామగా నటించారు. దూరదర్శన్‌లో ప్రసారమైన ఈ ధారావాహికతో ప్రదీప్ రావత్‌కు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత తెహల్కా, చంద్రకాంత, యుగ్, గుల్ సానోబార్, మిషన్  ఫ్రెష్ తదితర సీరియల్స్‌లో నటించారు.

2001లో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ నటించిన లగాన్‌లోనూ ప్రదీప్ రావతో కీలకపాత్ర పోషించారు. 2004లో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై చిత్రంతో తెలుగువారిని పలకరించిన ఆయన భిక్షు యాదవ్‌గా ప్రేక్షకులను భయపెట్టారు. ఈ సినిమాకు గాను ఉత్తమ విలన్‌గా ఫిల్మ్‌ఫేర్, నంది అవార్డులను అందుకున్నారు. ఆ తర్వాత ఛత్రపతితో ప్రదీప్  రావత్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. పవర్‌ఫుల్ విలన్‌గా, ప్రభాస్‌కు ధీటుగా నటించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు.

ఆ తర్వాత భద్ర, స్టాలిన్, దేశముదురు, యోగి, గజినీ, మస్కా, రెబల్, నిప్పు, నాయక్, వన్ నేనొక్కడినే, నేను శైలజ, సరైనోడు, నేనే రాజు నేనే మంత్రి, జై లవకుశ, నా పేరు సూర్య, వాల్తేర్ వీరయ్య తదితర తెలుగు సినిమాలలో నటించారు. చివరిసారిగా ఈ ఏడాది విడుదలైన గాయపడ్డ సింహం సినిమాలో ప్రదీప్ రావత్ తెలుగులో నటించారు. 40 ఏళ్ల కెరీర్‌లో తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, ఒడియా, బెంగాలీ, భోజ్‌పురి, నేపాలీ, మరాఠీ భాషలలో ఆయన వందలాది చిత్రాల్లో నటించారు. 

ప్రదీప్ రావత్‌కు భార్య కళ్యాణి రావత్, పిల్లలు విక్రాంత్ రావత్, సింగ్ రావత్ ఉన్నారు. ప్రదీప్ భార్య కళ్యాణి తెలుగు అమ్మాయే కావడం విశేషం. హీరోయిన్లను మించిన అందంతో మెరిసిపోయే కళ్యాణి.. చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. తన నటనతో కోట్లాది మందిని అలరించిన ప్రదీప్ రావత్ మరణం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు. 




ఐడియాను దాచుకోవద్దు.. అమ్మేయండి.. పాతికేళ్ల వ్యాపారవేత్త సక్సెస్ స్టోరీ

 


ప్రస్తుతం జెన్ జీ జనరేషన్ ఆకాశామే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా, సాదాసీదా కుటుంబం నుంచి వచ్చినా జీవితంలో సక్సెస్ కొడుతున్నారు. పుట్టినప్పటి నుంచే టెక్నాలజీని వాడుతున్న ఈ తరం వారు.. ఏ సెక్టార్ అయినా సరే తమదైన బెంచ్ మార్క్‌లు సెట్ చేస్తున్నారు. నిండా పాతికేళ్లు కూడా దాటకుండానే కోటీశ్వరులుగా మారిపోతున్న వారు ఉన్నారు. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని సూత్రానికి తమ తెలివితేటలు జోడించి జెండా ఎగురవేస్తున్నారు. తాజాగా ఓ పాతికేళ్ల కుర్రాడు తన తెలివితేటలతో వ్యాపారవేత్తగా అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఆయన సక్సెస్ స్టోరీ మీకోసం.

అతను ఎవరో కాదు.. జెడిటల్ మీడియా వ్యవస్థాపకుడు జైద్ ఖాన్. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఖాన్.. తొలుత డాక్టర్ కావాలని కలలు కన్నారు. ఒకవేళ నీట్‌లో క్వాలిఫై కాకపోతే ఇంజనీరింగ్ ‌సెకండ్ ఛాయిస్‌గా పెట్టుకున్నారు. అయితే డెస్టినీ ఆయనను  మరో మార్గం వైపు నడిపించింది. యూట్యూబ్ ఛానెల్స్‌కు పనిచేయడం ప్రారంభించి, కాలిఫోర్నియాకు చెందిన ఓ ఫేమస్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌తో పాటు కొన్ని ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్‌లను దక్కించుకున్నాడు. పర్సనల్ బ్రాండింగ్, మీమ్ మార్కెటింగ్, కంటెంట్ డిస్ట్రిబ్యూషన్, లింక్డ్ ఇన్ ప్రొఫైల్స్‌ నిర్వహణ సేవలను జెడిటల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌ ద్వారా అందిస్తున్నారు.

ఇటీవల ది క్రోర్ క్లబ్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన వ్యాపార ప్రయాణం, ఆర్ధిక విజయాలు గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు జైద్ ఖాన్. మీ దగ్గర ఉన్నది నైపుణ్యం, సలహా.. ఏం ఉన్నా సరే ముందు అమ్మడం మొదలుపెట్టాలి. అది 100 డాలర్లయినా, 200 డాలర్లయినా సరే.. ఇది మీలోని ఆత్మ విశ్వాసాన్ని మరో స్థాయికి చేరుస్తుంది. ఆన్‌లైన్‌లో యాక్టీవ్‌గా ఉండటం, మీకంటూ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకోవాలని ఖాన్ తెలిపారు.

2023లో నా 22వ యేట తొలిసారిగా కోటి రూపాయల ఆదాయాన్ని ఆర్జించానని అప్పటి నుంచి తన వ్యాపారాన్ని విస్తరిస్తూనే ఉన్నానని.. విద్యాపరంగా మరింత పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఐఐఎం బెంగళూరులో చదువుకుంటున్నట్లు చెప్పాడు. నేను జీవితంలో వెనుకబడిపోయింది చదువు విషయంలోనే.. అందుకే కొత్త విషయాలు నేర్చుకుంటూ వాటిని వ్యాపారంలో అమలు చేస్తున్నా. మనం ఏం సాధించాలనుకున్నా దానికి డబ్బు ఇంధనం వంటిదని ఖాన్ చెప్పారు.

ఈ ప్రయాణంలో నా తల్లిదండ్రులు నాపై నమ్మకం ఉంచారు. నీట్‌కు 10 రోజుల ముందు నన్ను జర్నలిజంలో చేర్చించారు. కానన్ 80డీ కెమెరాతో వీడియోలు తీసి యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసి ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించే స్థాయికి ఎదిగినట్లు ఖాన్ వెల్లడించారు. కంటెంట్ అనేది డిజిటల్ కరెన్సీ.. ఆన్‌లైన్‌లో యాక్టీవ్‌గా లేనప్పుడు మీరు ఎవ్వరికీ కనిపించరు, ఎవ్వరికీ తెలియదని ఖాన్ అభిప్రాయపడ్డారు. 


సాయిపల్లవి క్రేజ్.. రామాయణకు లేడీ పవర్‌స్టార్‌కు రికార్డ్ రెమ్యునరేషన్?

 


గ్లామర్ షో, ఇంటిమేట్ సీన్స్‌కు దూరంగా ఉంటూ స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటవచ్చని నిరూపించారు లేడీ పవర్‌స్టార్ సాయిపల్లవి. ఇష్టమొచ్చిన కథలను ఎంచుకోకుండా తనకు మనసుకు నచ్చిన, కథాబలమున్న పాత్రలనే చేస్తూ అరుదైన వ్యక్తిత్వంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు సాయిపల్లవి. అందం, డ్యాన్స్, నటన ఇలా ఏ విషయంలోనైనా తనకు తిరుగులేని నిరూపించుకున్నారు ఈ ముద్దుగుమ్మ.

దక్షిణాదిలో ఎదురులేదని ప్రూవ్ చేసుకున్న సాయిపల్లవి.. ప్రస్తుతం బాలీవుడ్‌లో జెండా ఎగరవేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది ఏక్ దిన్‌తో హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాయిపల్లవి అనుకున్న రిజల్ట్ రాబట్టలేకపోయారు. అయితే రణబీర్ కపూర్ హీరోగా నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సాయి పల్లవి అకాశం దక్కించుకున్నారు. ఇందులో సీతగా ఆమె నటిస్తున్నారు. 

దాదాపు 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీపావళి కానుకగా నవంబర్ 6న రామాయణ తొలి భాగం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ ప్రతిష్టాత్మక సినిమా కోసం సాయి పల్లవి రెండేళ్లకు పైగా సమయం వెచ్చించారు. అయితే సీతగా సాయి పల్లవిని తీసుకోవడంపై హిందీ జనాలు, సినీ ప్రముఖులు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారు లేడీ పవర్‌స్టార్.

అయితే రామాయణ కోసం సాయి పల్లవి రెమ్యునరేషన్ ఇప్పుడు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం రామాయణ రెండు భాగాలకు కలిపి సాయి పల్లవికి 20 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒక దక్షిణాదికి చెందిన హీరోయిన్‌కు బాలీవుడ్‌లో ఈ స్థాయిలో రెమ్యునరేషన్ అందించడం సాధారణ విషయం కాదని అంటున్నారు విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. ఈ దెబ్బతో భారత్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే ప్రియాంక చోప్రా, దీపిక పదుకొణె, ఆలియా భట్, నయనతార, రష్మిక మందన్న వంటి స్టార్ హీరోయిన్ల సరసన సాయి పల్లవి స్థానం సంపాదించుకున్నారు. 


NBK 111: గోపీచంద్ మలినేని మూవీ షూటింగ్‌.. బాలయ్యకు గాయం

 


గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 66 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. గతేడాది చివరిలో అఖండ 2తో ప్రేక్షకులను పలకరించిన బాలయ్య ప్రస్తుతం భారీ లైనప్‌ని సెట్ చేశారు. తనతో వీరసింహారెడ్డి మూవీని తెరకెక్కించిన గోపీచంద్ మలినేనితో ఎన్‌బీకే 111 అనే మూవీలో నటిస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను  నిర్మిస్తున్నారు. ఇది కాకుండా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవలే అమరావతిలో బాలకృష్ణ - కొరటాల శివ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. 

ఎన్‌బీకే 111 షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్‌కు సిద్ధం చేయాలని బాలకృష్ణ భావిస్తున్నారు. యాక్షన్, మాస్ మసాలా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలయ్య గ్యాంగ్‌స్టర్‌గా  నటిస్తున్నారని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాకినాడ పోర్ట్ పరిసరాల్లో జరుగుతోందట. ఇక్కడ బాలయ్య - మంచు విష్ణుల మధ్య కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారట గోపీచంద్. 

అయితే జూలై 21న షూటింగ్‌లో బాలయ్య ప్రమాదవశాత్తూ కాలుజారి కిందపడిపోవడంతో ఆయన మోకాలికి స్వల్ప గాయమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. వెంటనే స్పందించిన చిత్ర యూనిట్.. షూటింగ్‌ను నిలిపివేసి బాలయ్యను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారట. ప్రాథమిక చికిత్సతో పాటు ఇతర టెస్టులు కూడా నిర్వాహించారని, కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు బాలయ్యకు సూచించారట. దాంతో బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు. 


లెనిన్ హిట్.. భారీగా పెరిగిన భాగ్యశ్రీ రెమ్యునరేషన్?

 

ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టువిడవకుండా మన ప్రయత్నం సాగిస్తే ఏదో ఒకరోజు ఖచ్చితంగా విజయం దొరుకుతుందని కొందరి జీవితాలు పాఠాలుగా నిలుస్తాయి. ఈ కోవలకే వస్తారు అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే. దాదాపు 11 ఏళ్లుగా హిట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు అఖిల్. ప్రతిసారి ఎన్నో అంచనాల మధ్య రావడం ఆ సినిమా కాస్తా పరాజయం పాలవ్వడం షరా మామూలే అన్నట్లుగా తయారైంది. ఈ పరిస్ధితిని మార్చి ఈసారి హిట్ కొట్టాలనే సంకల్పంతో అఖిల్ కష్టపడ్డారు. దానికి ప్రతిఫలమే లెనిన్ మూవీ సక్సెస్.

అఖిల్‌ను నటుడిగా మరో మెట్టుపైకి ఎక్కించిన సినిమాగా, ఆయన కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌‌గా నిలిచింది లెనిన్. ఈ విజయంతో అఖిల్ ఎమోషనల్ అవుతున్నారు. సక్సెస్ సెలబ్రేషన్స్‌లో కంటతడి పెట్టిన ఆయన తన తండ్రి నాగార్జున పాదాలకు నమస్కరించి వెక్కి వెక్కి ఏడ్చారు. ఇక్కడే కాదు ఈవెంట్స్‌లోనూ లెనిన్‌లో విజయం తాలూకా భావోద్వేగం కనిపిస్తూనే ఉంది. ఎట్టకేలకు లెనిన్‌తో తమ హీరో ట్రాక్ ఎక్కేశాడని అక్కినేని అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు.

ఇక మరొకరు భాగ్యశ్రీ బోర్సే. అందం, అభినయం ఉన్నప్పటికీ కెరీర్ స్టార్టింగ్ నుంచి నేటి వరకు ఈ ముద్దుగుమ్మకు హిట్ దక్కలేదు. దాంతో ఐరన్ లెగ్ అన్న ముద్ర పడింది. మిస్టర్ బచ్చన్ మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు భాగ్యశ్రీ బోర్సే. తొలి సినిమాతోనే అందం, లుక్స్ పరంగా కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్‌ అనిపించుకున్నారు. కానీ మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత కింగ్డమ్, ఆంధ్రా కింగ్ తాలూకా, కాంత సినిమాలలో నటించారు. అన్ని స్టార్ హీరోల సినిమాలే.. బాగా చేసిందన్న పేరు తప్పించి ఆమెకు విజయం మాత్రం దక్కలేదు.

ఈ క్రమంలో లెనిన్‌లో భారతిగా ఆఫర్ వచ్చింది. ఫస్ట్ లుక్ నుంచే భాగ్యశ్రీ తన ముద్ర వేయడం ప్రారంభించారు. నాటకాలలో దుర్యోధనుని పాత్ర.. దానవీర శూరకర్ణలోని ఎన్టీఆర్ ఫేమస్ డైలాగ్ ఏమంటివి.. ఏమంటివిని అద్భుతంగా పలికి శెభాష్ అనిపించుకుంది. సినిమా విడుదలయ్యాక అఖిల్‌తో సమానంగా ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు కెరీర్‌లో తొలి హిట్ అందుకున్నారు భాగ్యశ్రీ. సక్సెస్ సెలబ్రేషన్స్‌లో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టింది ఈ ముద్దుగుమ్మ. తనపై ఐరన్ లెగ్ ముద్ర వేశారని.. కానీ అభిమానులు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఈరోజు ఇక్కడ నిలబడ్డానని చెప్పారు. హైదరాబాద్ నా కర్మభూమి.. నా చివరి సినిమా కూడా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచే ఉంటుందని భాగ్యశ్రీ ఎమోషనల్ అయ్యారు.

లెనిన్ విజయం కారణంగా భాగ్యశ్రీకి అవకాశాలు క్యూకట్టే అవకాశం ఉంది. అంతేకాదు.. తన రెమ్యునరేషన్ కూడా బాగా పెంచేసినట్లుగా ఫిలింనగర్‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లెనిన్‌కు ముందు వరకు సినిమాకు కోటి రూపాయలు పారితోషికం తీసుకున్న ఈ మరాఠీ భామ.. ఇప్పుడు 2 కోట్ల రూపాయల్ని డిమాండ్ చేస్తోందట. అందం, అభినయం, యువతలో ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు కూడా భాగ్యశ్రీ ఎంత అడిగితే అంత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తమిళంలో సియోన్ మూవీలో నటిస్తున్నారు భాగ్యశ్రీ.