Exit Polls 2026: మమత, స్టాలిన్‌, హిమంతలకు మరో ఛాన్స్.. ఇద్దరు విజయ్‌లకి షాక్ తప్పదా?

ఈ ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఎక్కువ ఆసక్తిని కలిగించాయి. కోలీవుడ్ సూపర్‌స్టార్, దళపతి విజయ్ టీవీకే పార్టీతో ఎన్నికల రణరంగంలోకి దిగడంతో తమిళనాడు ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. అటు పశ్చిమబెంగాల్‌లో వరుసగా మూడు సార్లు సీఎంగా గెలిచి హ్యాట్రిక్ కొట్టిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని సర్వశక్తులు ఒడ్డారు. దశాబ్ధాలుగా తమకు మింగుడుపడని బెంగాల్‌ను ఈసారి కైవసం చేసుకోవాలని బీజేపీకి కూడా గట్టిగా కృషి చేయడంతో ఇక్కడ ఫలితాలు ఎలా ఉంటాయోనని దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 

తమిళనాడు ఎగ్జిట్ పోల్స్

234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో అధికారాన్ని అందుకోవాల్సిన మేజిక్ ఫిగర్ 118. ఈసారి కూడా డీఎంకే నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తుందని.. స్టాలిన్ మరోసారి సీఎం అవుతారని మ్యాట్రిజ్, పీపుల్స్ పల్స్, పీ మార్క్, పీపుల్స్ ఇన్‌సైట్, ప్రజాపోల్, జేవీసీ వంటి సంస్థలు అంచనా వేశాయి. అన్నాడీఎంకే మరోసారి ప్రతిపక్షం తప్పదని సర్వేలు తేల్చాయి. 

ఇక కొత్తగా పార్టీ పెట్టిన దళపతి విజయ్‌ మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ అధికారం కష్టమేనని తేల్చాయి. రెండంకెల స్థానాలతో టీవీకే మూడో స్థానంలో ఉంటుందని పేర్కొన్నాయి. అయితే ఎన్డీటీవీ- యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం.. దాదాపు 120 స్థానాలు గెలుచుకుని టీవీకే అధికారాన్ని అందుకుంటుందని అంచనా వేసింది.

పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్

294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో అధికారాన్ని అందుకోవడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 148. హోరాహోరీగా జరిగిన బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీదే విజయమని ఎక్కువ సంస్థలు అభిప్రాయపడ్డాయి. అయితే బీజేపీ గట్టి పోటీ ఇచ్చి అధికారానికి చేరువగా రావొచ్చని మరికొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. 

కేరళ ఎగ్జిట్ పోల్స్

140 అసెంబ్లీ స్థానాలున్న  కేరళలో అధికారానికి అందుకోవాల్సిన మేజిక్ ఫిగర్ 71. మరోసారి  సీఎంగా గెలిచి హ్యాట్రిక్ అందుకోవాలన్న పినరయి విజయన్‌కు షాక్ తప్పదని అన్ని ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. ఎల్డీఎఫ్ కూటమి ఓటమి పాలై.. యూడీఎఫ్ విజయాన్ని అందుకుంటుందని, అలాగే బీజేపీ ఈసారి కేరళలో ఖాతా తెరిచే అవకాశాలు ఉన్నాయని సర్వేలు పేర్కొన్నాయి. 

అసోం ఎగ్జిట్ పోల్స్

అస్సాంలో మరోసారి ఎన్డీయే అధికారంలోకి వస్తుందని మెజారిటీ సంస్థలు అభిప్రాయపడ్డాయి. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సారథ్యంలోని బీజేపీ- ఏపీజీ- బీపీఎఫ్ కూటమి 100 స్థానాలు గెలుచుకోవచ్చని, కాంగ్రెస్ కూటమి 24 స్థానాలకు పరిమితమై మరోసారి ప్రతిపక్షంతో సరిపెట్టుకోవాల్సిందేనని సర్వేలు తెలిపాయి. 

పుదుచ్చేరి ఎగ్జిట్ పోల్స్

30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీలో అధికారాన్ని అందుకోవడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 17. ఈసారి కూడా ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చి  ఎన్ రంగస్వామి సీఎం అవుతారని  ఎగ్జిట్ పోల్స్ అంచానా వేశాయి. ఎస్‌పీఏ కూటమి 12 స్థానాలు గెలుచుకుని ప్రతిపక్షానికి పరిమితం అవుతుందని సర్వేలు తెలిపాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాషాయ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. మరి సర్వేలు వేసిన అంచనాలు నిజమవుతాయో లేదో తెలియాలంటే మే 4 వరకు వెయిట్ చేయాల్సిందే. 


ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత

 


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాదెండ్ల.. హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 22న తుదిశ్వాస విడిచారు. భాస్కరరావు మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. 

1935 జూన్ 23న గుంటూరులో జన్మించిన నాదెండ్ల భాస్కరరావు.. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయవాదిగా పట్టా అందుకున్నారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన.. 1978లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో గెలుపొంది ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ  తర్వాత మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

అనంతరం తెలుగువారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు.. తెలుగుదేశం పార్టీని స్థాపించడంలో కీలకపాత్ర పోషించిన భాస్కరరావు.. కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు. 1983లో వేమూరు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా విజయం సాధించిన ఆయన.. ఎన్టీఆర్ కేబినెట్‌లో ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీలో ఎన్టీఆర్ తర్వాత శక్తివంతమైన నేతగా గుర్తింపు తెచ్చుకుని రాష్ట్ర రాజకీయాలను శాసించారు.

అయితే 1984లో నాదెండ్ల భాస్కరరావు రాజకీయ జీవితం అనూహ్య మలుపు తిరిగింది. సీఎం ఎన్టీఆర్ వైద్య చికిత్స కోసం అమెరికాకు వెళ్లిన సమయంలో గవర్నర్ రామ్ లాల్ మద్ధతుతో ఎన్టీఆర్‌పై తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. అయితే ఎన్టీఆర్ తిరిగి భారతదేశానికి చేరుకుని రాజకీయ, ప్రజా సంఘాల మద్ధతుతో పోరాటానికి దిగి తిరిగి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. దాంతో కేవలం నెల రోజుల పాటు నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నారు. 

ఈ పరిణామాలతో టీడీపీ నుంచి నాదెండ్ల భాస్కరరావును సీఎం ఎన్టీఆర్ బహిష్కరించారు. దాంతో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు భాస్కరరావు. 1989 ఎన్నికల్లో తెనాలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 1998లో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలుపొంది లోక్‌సభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉన్న భాస్కరరావు.. 2019లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. 

నాదెండ్ల భాస్కరరావు వారసుడిగా ఆయన తనయుడు నాదెండ్ల మనోహర్ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ప్రారంభించిన మనోహర్.. తెనాలి నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్‌గా, స్పీకర్‌గా పనిచేశారు. అనంతరం రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో తుడిచిపెట్టుకుని పోవడంతో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరారు. 2024లో తెనాలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన నాదెండ్ల మనోహర్... చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 



రామ్ చరణ్‌తో ఆటాపాటా.. పెద్దిలో ఐటెం సాంగ్‌కి సంయుక్త రెమ్యునరేషన్ ఎంతంటే?

 


బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్, బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న మూవీ పెద్ది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌‌లో, పూర్తి స్థాయి గ్రామీణ వాతావరణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. 

గేమ్ ఛేంజర్‌తో డిజాస్టర్ ఎదుర్కొన్న చరణ్.. ఈసారి మాత్రం సాలీడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యెందు, బొమన్ ఇరానీ, విజీ చంద్రశేఖర్, రాజతవ దత్తా, సత్య, జాన్ విజయ్, పోసాని కృష్ణమురళీ తదితరులు నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి సంయుక్తంగా పెద్ది సినిమాను నిర్మిస్తున్నాయి.

ఏప్రిల్ 30న పెద్ది సినిమా విడుదల కావాల్సి ఉండగా.. అనివార్య కారణాలు, షూటింగ్ పూర్తికాకపోవడంతో సినిమాను వాయిదా వేశారు. జూన్‌లో పెద్ది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

అయితే పెద్దిలో ఓ ఐటెం సాంగ్ తప్పించి మిగిలిన షూటింగ్ పార్ట్ పూర్తయినట్లుగా ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఐటెం సాంగ్‌లో ఎవరు నటిస్తారన్న దానిపై రకరకాల రూమర్స్ వచ్చాయి. తమన్నా, మృణాల్ ఠాకూర్‌ల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ ఈ ప్రచారాన్ని వారు ఖండించారు.

చివరికి ఈ ఛాన్స్ సంయుక్త మీనన్‌ను వరించినట్లుగా రూమర్స్ వస్తున్నాయి. వరుస విజయాలు, సినిమాలతో బిజీగా ఉన్న ఈ కేరళ కుట్టి.. రామ్ చరణ్‌తో కలిసి ఆడిపాడనున్నారు. చెర్రీ మాస్ డ్యాన్స్‌కు, సంయుక్త అందాలు ఈ స్పెషల్ సాంగ్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని భావిస్తున్నారు. ఇక ఈ ఐటెం నెంబర్ కోసం సంయుక్త మీనన్‌కు కళ్లు చెదిరే పారితోషికం ముట్టజెబుతున్నారట మేకర్స్. 

ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం.. దాదాపు 3 కోట్ల రూపాయలను సంయుక్త ఛార్జ్ చేస్తున్నారట. స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుండటంతో పాటు వరుస విజయాలతో గోల్డెన్ హ్యాండ్‌గా ముద్ర వేసుకున్న సంయుక్తకు ఈ రేంజ్‌లో ఇచ్చేందుకు నిర్మాతలు వెనుకాడటం లేదు. మరి నిజంగానే సంయుక్తకు 3 కోట్ల రూపాయల పారితోషికం నిజమో? కాదో త్వరలోనే తేలనుంది. 


భూత్ బంగ్లా డే 1 కలెక్షన్స్.. అక్షయ్ మూవీకి ఓపెనింగ్స్ ఎంత రావొచ్చంటే?

 


అక్షయ్ కుమార్, టబు జంటగా ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ భూత్ బంగ్లా. బాలాజీ మోషన్ పిక్చర్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్ బ్యానర్లపై ఏక్తా కపూర్, శోభా కపూర్, అక్షయ్ కుమార్ నిర్మించారు. వామికా గబ్బీ, పరేష్ రావెల్, రాజ్‌పాల్ యాదవ్, జిషు సేన్ గుప్తా, మనోజ్ జోషి, అస్రానీ, రాజేశ్ శర్మ తదితరులు కీలకపాత్రలు పోషించారు

ఏప్రిల్ 17వ తేదీన ఈ భూత్ బంగ్లా మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. భూత్ బంగ్లా మూవీకి 150 కోట్ల రూపాయలతో నిర్మించినట్లుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అక్షయ్ కుమార్ మూవీ బ్రేక్ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద 184 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉండగా.. క్లీన్ హిట్ కావాలంటే 280 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉందని చెబుతున్నారు. 

అడ్వాన్స్ బుకింగ్‌లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రీమియర్స్ + ఫస్డ్ డేకు గాను అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇండియాలో భూత్ బంగ్లాకు దాదాపు 3.32 కోట్ల రూపాయలు వసూలైనట్లుగా వార్తలు వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 1.29 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. 

మహారాష్ట్రతో పాటు ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌లో ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. 2026లో విడుదలైన బాలీవుడ్ సినిమాలలో అడ్వాన్స్ బుకింగ్ పరంగా భూత్ బంగ్లా 3వ స్థానంలో నిలవగా.. ధురంధర్ 2 (53 కోట్ల రూపాయలు) టాప్‌లో ఉంది. ఆ తర్వాత బోర్డర్ 2 (12.5 కోట్ల రూపాయలు) రెండో స్థానంలో నిలిచింది.

అక్షయ్ కుమార్ మూవీకి ఏప్రిల్ 16వ తేదీ రాత్రి ప్రీమియర్స్ ప్రదర్శించారు. ప్రీమియర్స్‌తో ఇండియాలో 6.26 కోట్ల రూపాయల నెట్.. 7.46 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. తొలిరోజు ఇండియాలో అక్షయ్ కుమార్ మూవీకి 10 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 5 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 18 కోట్ల రూపాయల రేంజ్‌లో ఓపెనింగ్స్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు. 


తమిళనాడు ఎన్నికలు: టీవీకేకు ఊహించని దెబ్బ.. పోటీకి ముందే విజయ్‌కి తొలి ఓటమి

 


మూడు దశాబ్థాలకు పైగా సినీ కెరీర్‌ను పక్కకుపెట్టి తమిళ ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయ రంగంలోకి దిగారు కోలీవుడ్ సూపర్‌స్టార్, దళపతి విజయ్. తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని స్థాపించిన ఆయన రాజకీయాల్లో దూకారు. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ.. బీజేపీ, కాంగ్రెస్‌ల పొత్తు ఆఫర్లను కూడా కాదని ద్రవిడ రాజకీయ దిగ్గజాలు డీఎంకే, అన్నాడీఎంకేలను ఒంటరిగా ఢీకొట్టేందుకు సిద్ధమయ్యారు దళపతి. తమిళనాడు, పుదుచ్చేరిలలో మొత్తం స్థానాలకు అభ్యర్ధులను నిలబెట్టారు విజయ్. అనంతరం ప్రచారంలో దూసుకెళ్తున్నారు టీవీకే చీఫ్. ఈ క్రమంలో పోటీకి ముందే తమిళనాడు ఎన్నికల్లో విజయ్‌కి తొలి ఓటమి ఎదురైంది.

ఎడప్పాడి శాసనసభ స్థానానికి టీవీకే తరపున అరుణ్ కుమార్ అనే వ్యక్తికి టికెట్ కన్ఫర్మ్ కాగా.. ఆయన అభ్యర్ధిగా నామినేషన్ వేశారు. అయితే నామినేషన్ల పరిశీలన సందర్భంగా అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రపోజర్ల వివరాలు సరిగా లేకపోవడంతో ఆ నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించడంతో టీవీకే శ్రేణులు షాకయ్యాయి. 

ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. ఏదైనా ఇబ్బంది తలెత్తితే సేఫ్ సైడ్‌గా ఉంటుందనే ఉద్దేశంతో మరో ప్రత్యామ్నాయ అభ్యర్ధిని కూడా టీవీకే నిలబెట్టింది. అయితే అతని నామినేషన్ వివరాలు కూడా సరిగా లేకపోవడంతో దానిని ఎన్నికల అధికారి తిరస్కరించడంతో విజయ్ పార్టీ శ్రేణులు ఖంగుతిన్నాయి. 

విజయ్ పార్టీ తరపున అభ్యర్ధి లేకపోవడంతో ఎడప్పాడిలో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్య ద్విముఖ పోరు నెలకొంది. ఇక్కడి నుంచి తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి బరిలో ఉన్నారు. వరుసగా ఆరోసారి విజయం కోసం పళనిస్వామి ఎదురుచూస్తున్నారు. డీఎంకే నుంచి సీ కాశీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పోటీ చేయకుండా తమిళనాడు ఎన్నికల్లో ఒక స్థానాన్ని కోల్పోవడంతో టీవీకే కేడర్ అసహనం వ్యక్తం చేస్తోంది. 

తొలి నుంచి ఎడప్పాడి నియోజకవర్గం తమిళనాడులోని వీవీఐపీ స్థానాల్లో ఒకటికావడం విశేషం. ఇక్కడి నుంచి ఎడప్పాడి పళనిస్వామి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989లో తొలిసారిగా ఏఐఏడీఎంకే అభ్యర్ధిగా బరిలో నిలిచిన పళనిస్వామి విజయం సాధించారు. 1991లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ మరోసారి గెలిచారు. ఆ తర్వాత 1996లో హ్యాట్రిక్‌పై కన్నేసిన పళనిస్వామికి అనూహ్యంగా షాక్ తగిలి, ఏకంగా మూడో  స్థానానికి పరిమితమయ్యారు. నాటి ఎన్నికల్లో పీఎంకేకి చెందిన ఐ గణేశన్ విజయం సాధించారు.

2001లో పోటీ చేయని పళనిస్వామి.. 2006లో బరిలో దిగగా మరోసారి షాక్ తగిలింది. ఈసారి ఆయన రెండో స్థానంలో నిలిచారు. నాటి ఎన్నికల్లో పీఎంకేకు చెందిన వీ కావేరి విజయం సాధించారు. అయితే 2011 నుంచి ఎడప్పాడిలో పళనిస్వామి హవా మొదలైంది. 2011, 2016, 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పళనిస్వామి.. జయలలిత ఆకస్మిక మరణంతో తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వరుసగా హ్యాట్రిక్ సాధించిన పళనిస్వామికి ఈసారి కూడా విజయం సాధించాలని గట్టి పట్టుదలగా ఉన్నారు. 


సినీ కెరీర్‌కు నటి త్రిష గుడ్‌బై? స్టార్ డైరెక్టర్ కామెంట్స్ వైరల్

 


ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో.. మరీ ముఖ్యంగా తమిళనాడు సినీ, రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు త్రిష కృష్ణన్. కోలీవుడ్ సూపర్‌స్టార్, టీవీకే అధినేత దళపతి విజయ్‌తో ఆమె రిలేషన్‌లో ఉన్నారంటూ కొద్దిరోజుల క్రితం తమిళనాడు బీజేపీ చీఫ్ నాయనర్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆయన క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదానికి తెరపడింది. 

ఇది జరిగిన  కొద్దిరోజులకే దళపతి విజయ్ సతీమణి సంగీత సోర్ణలింగం షాకిచ్చారు. తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలంటూ చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమిళ సినీరంగానికి చెందిన ఓ నటితో తనకు భర్తకు వివాహేతర సంబంధం ఉందని, ఆమె కారణంగా మా ఇద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకుంటున్నాయని సంగీత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే అందులో నటి పేరును మాత్రం ఆమె ప్రస్తావించలేదు. కానీ అందరి చూపు త్రిషపైనే పడింది.

టీవీకే పార్టీ ద్వారా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన విజయ్‌కి ఈ పరిణామాలు ఇబ్బంది కలిగించాయి. అయితే ఆ వెంటనే ఓ నిర్మాత ఇంట్లో పెళ్లి వేడుకకు త్రిషతో కలిసి విజయ్ జంటగా హాజరుకావడంతో సంచలనం  సృష్టించింది. దాంతో విజయ్ - త్రిషల రిలేషన్ నిజమేనంటూ వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. ఈ క్రమంలో త్రిషపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. 

అయితే త్రిష రాజకీయాల్లోకి అడుగుపెడతారని, తమిళనాడు సీఎం కావాలన్నది ఆమె కల అని సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్వయంగా త్రిష సైతం తనకు రాజకీయాలపై ఆసక్తి ఉందని పలుమార్లు బయటపెట్టారు. తాజాగా వీటికి బలం చేకూర్చేలా సీనియర్ దర్శకుడు చిత్రా లక్ష్మణన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

త్రిష త్వరలోనే తన సినీ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నారని బాంబు పేల్చారు. కొంతమంది నిర్మాతలను త్రిష గురించి అడగ్గా.. ఆమెకు సినిమాల్లో కొనసాగాలని లేదని చెప్పారని లక్ష్మణన్ అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు తమిళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. దీనిపై త్రిష స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం త్రిష కృష్ణన్ సూర్య సరసన కరుప్పు, మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర.. మలయాళంలో రామ్ చిత్రాలలో నటిస్తున్నారు.  


హీరోగా అనిల్ రావిపూడి.. నిర్మాతగా దిల్‌రాజు

 


టాలీవుడ్‌లో ఓటమి ఏరుగని దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు అనిల్ రావిపూడి. తొలి సినిమా పటాస్ నుంచి ఈ ఏడాది మన శంకర వరప్రసాద్ గారు వరకు అనిల్ తీసిన ప్రతి చిత్రం విజయాన్ని సాధిస్తూ వచ్చింది. ప్రతియేటా ఖచ్చితంగా తన సినిమాను విడుదల చేస్తూ.. సంక్రాంతి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు అనిల్ రావిపూడి.

ఆయనలో డైరెక్టర్‌తో పాటు మంచి నటుడు కూడా ఉన్నారు. హీరో కావాలని అనిల్ కూడా కలలు కన్నారు. అయితే తన సినిమాల్లో గెస్ట్ రోల్స్ మాదిరిగా తళుక్కున మెరుస్తూ ముచ్చట తీర్చుకుంటున్నారు. పలు ఈవెంట్స్‌లో విక్టరీ వెంకటేష్, డాక్టర్ రాజశేఖర్ వంటి స్టార్స్‌ను ఇమిటేట్ చేస్తూ డ్యాన్స్ ఇరగదీస్తారు అనిల్ రావిపూడి. ఒడ్డూపొడుగూ, ఫిజిక్‌, అందంతో పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ అనిపించుకున్నారు ఈ దర్శకుడు. తాజాగా అనిల్ రావిపూడిని నటుడిగా పరిచయం చేస్తానిన చెప్పారు స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు.

తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్, యంగ్ హీరోయిన్ కృతిశెట్టి జంటగా నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో అనిల్ రావిపూడి, దిల్‌రాజులు సందడి చేశారు. ఈ సందర్భంగా దిల్‌రాు మాట్లాడుతూ.. అనిల్ రావిపూడిలో మంచి నటుడు ఉన్నారు. ఆయనను నటుడిగా నేనే పరిచయం చేస్తాను. ఎప్పుడు నన్ను కలిసినా? స్టోరీ డిస్కషన్స్ కోసం వచ్చినా అదే మాట చెబుతానని దిల్‌రాజు తెలిపారు.

ఆ వెంటనే అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. రాజుగారి ఆఫర్ బాగుంది, అయితే ఆయన ప్రొడ్యూసర్‌గా, ప్రదీప్ రంగనాథన్ హీరోగా, నేను దర్శకుడిగా సినిమాను తీస్తా. ప్రస్తుతానికి నటుడిగా మారాలన్న  ఆలోచన లేదని తేల్చేశారు. కాగా.. మన శంకర వరప్రసాద్ గారు తర్వాత విక్టరీ వెంకటేష్ - నందమూరి కళ్యాణ్ రామ్‌లు హీరోలుగా ఒక మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నారు అనిల్ రావిపూడి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.