దిగ్గజాల సరసన రామ్ పోతినేని..!

 

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నారు. ఏడేళ్ల క్రితం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆయన మళ్లీ హిట్ కొట్టలేదు. తర్వాత చేసిన రెడ్, రొమాంటిక్, ది వారియర్, స్కంధ, డబుల్ ఇస్మార్ట్, ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజప్పాయింట్ చేశాయి. దీంతో రేసులో నిలబడాలంటే ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్ధితి నెలకొంది. ఇప్పటికే యంగ్ టాలెంట్‌తో పాటు సీనియర్ హీరోల నుంచి రామ్ పోతినేనికి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో తన 23వ సినిమాకు సంబంధించి ఆయన ఓ నిర్ణయం తీసుకున్నారు. 

దేవదాసు సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు రామ్ పోతినేని. తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న రామ్.. ఎనర్జిటిక్ హీరో, చాక్లెట్ బాయ్‌గా అభిమానుల్లో స్టార్‌డమ్ తెచ్చుకున్నాడు. రెడీ, మస్కా, కందిరీగ, రేయ్, నేను శైలజ, హైపర్, ఇస్మార్ట్ శంకర్, డబుల్ ఇస్మార్ట్ వంటి హిట్స్‌తో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే 20 ఏళ్ల కెరీర్‌లో అనుకున్నంత స్థాయిలో ఆయన సక్సెస్ కాలేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రస్తుతం వరుస ఫ్లాపుల్లో ఉన్న రామ్ పోతినేని.. తన 23వ చిత్రానికి స్వయంగా దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటి వరకు నటుడిగా, గాయకుడిగా, గేయ రచయితగా తన టాలెంట్ చూపించిన ఆయన కెరీర్‌లో తొలిసారిగా మెగా ఫోన్ పట్టనున్నారు. మే 15న తన పుట్టినరోజును పురస్కరించుకుని RAPO 23 పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో రామ్ లెదర జాకెట్‌తో వెనుక నుంచి చూపిస్తూ స్టైలీష్ లుక్‌లో అదరగొట్టేశారు. ఈ సినిమాలో ఆయన వీర అనే క్యారెక్టర్‌ను పోషించనున్నారు. జూన్‌లో సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లి డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

అయితే ఈ సినిమాతో రామ్ అరుదైన ఘనతను అందుకోనున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకులుగా మారిన హీరోల లిస్ట్‌లో ఆయన చేరనున్నారు. విశ్వ విఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్, సూపర్‌స్టార్ కృష్ణ, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వంటి దిగ్గజాలు హీరోలుగా నటిస్తూనే మెగా ఫోన్ పట్టి తమ అభిరుచి మేరకు సినిమాలకు దర్శకత్వం వహించారు. అన్న ఎన్టీఆర్ సీతారామ కళ్యాణంతో మొదలుపెట్టి శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర వరకు దాదాపు 15 సినిమాలకు దర్శకత్వం వహించారు. 

ఇక సూపర్‌స్టార్ కృష్ణ సింహాసనం మూవీతో మొదలుపెట్టి ఈశ్వర్ అల్లా తేరే నామ్ వరకు దాదాపు 17 సినిమాలకు దర్శకత్వం వహించి అత్యధిక సినిమాలను డైరెక్ట్ చేసిన హీరోగా ఘనత వహించారు. అలాగే దర్శకుడిగా తెలుగు తెరకు తొలి 70 ఎంఎం, తొలి డీటీఎస్ వంటి టెక్నాలజీలను పరిచయం చేశారు నట శేఖర కృష్ణ. అంతేకాదు.. ఏక కాలంలో తెలుగు, హిందీ భాషల్లోనూ సినిమాలను డైరెక్ట్ చేసిన శెభాష్ అనిపించుకున్నారు కృష్ణ.

ఎన్టీఆర్, కృష్ణల తర్వాత నుంచి చాలామంది తెలుగు అగ్రనటులు దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చినప్పటికీ ఎవరూ సాహసం చేయలేకపోయారు. మధ్యలో నట సింహం బాలకృష్ణ నర్తనశాల పేరుతో పౌరాణికాన్ని తెరకెక్కించేందుకు మెగా ఫోన్ పట్టినప్పటికీ ఈ ప్రాజెక్ట్ అనివార్య కారణాలతో అర్ధాంతరంగా నిలిచిపోయింది. 

వీరి తర్వాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఆ సాహసం చేశారు. జానీ సినిమాతో మెగా ఫోన్ పట్టారు. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు పవన్ కళ్యాణ్. 2003 ఏప్రిల్ 25న విడుదలైన జానీ మూవీ అభిమానులను నిరాశపరిచింది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ప్రయత్నాన్ని విశ్లేషకులు సైతం మెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ మేకోవర్, జానీ కర్చీఫ్‌లు, బనియన్స్, రిబ్బన్స్, బెల్టులతో మార్కెట్‌లో ప్రభంజనం సృష్టించారు పవన్. 

పవన్ కళ్యాణ్ తర్వాత కొన్నాళ్ల వరకు తెలుగులో మరే హీరో కూడా మెగా ఫోన్ పట్టలేదు. ఈ జనరేషన్‌లో మాస్ దా కాస్ దాస్ విశ్వక్‌సేన్ రెండు చిత్రాలకు దర్శకత్వం వహించారు. మరో సినిమా సెట్స్ మీదుంది. సిద్ధూ జొన్నలగడ్డ, నవీన్ పొలిశెట్టిలు స్క్రిప్ట్, డైరెక్షన్ విషయాలలో జోక్యం చేసుకుంటున్నా.. ఫుల్ టైం డైరెక్టర్లు కాలేదు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం త్వరలోనే మెగా ఫోన్ పట్టుకోనున్నారు. 

అయితే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ పోతినేని దర్శకుడిగా మారుతుండటం హాట్ టాపిక్‌గా మారింది. తన సోదరుడు చైతన్య కృష్ణ నిర్మాణంలో తన 23వ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు రామ్. దీనికి స్వయంగా ఆయనే కథ అందిస్తుండటం విశేషం. ఓ సినిమాలో నటిస్తూ.. దానికి దర్శకత్వం వహించడం, స్క్రిప్ట్, మిగిలిన పనులు చూసుకోవడం అంతా కత్తిమీద సాములాంటి వ్యవహారమే. అయితే దీని కోసం రామ్ పోతినేని అన్ని రకాలుగా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. మరి దర్శకుడుగా ఈ ఎనర్జిటిక్ హీరో ఎంత మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి. 


MK Stalin: ఎంకే స్టాలిన్‌‌‌కు బిగ్‌షాక్.. టీవీకే అభ్యర్ధి చేతిలో సీఎం ఓటమి

 

2026 తమిళనాడు ఎన్నికలు ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)కు పీడకలను మిగిల్చాయి. రెండోసారి అధికారంలోకి వస్తామని కలలు కన్న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆశలు గల్లంతయ్యాయి. డీఎంకేదే ఈసారి విజయమని అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అంచనా వేయగా.. దళపతి విజయ్ అన్ని అంచనాలను తారుమారు చేశారు. దాదాపు 110 స్థానాల్లో విజయంతో మేజిక్ ఫిగర్‌కు అడుగు దూరంలో నిలిచారు. అన్నాడీఎంకే లేదా చిన్నా చితకా పార్టీల సాయంతో విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇక ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌కు ఓటర్లు షాకిచ్చారు. పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోవడంతో పాటు ఆయన స్వయంగా ఓడిపోయారు. కొలత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన స్టాలిన్‌పై టీవీకే అభ్యర్ధి వీఎస్ బాబా దాదాపు 9 వేల ఓట్ల తేడాతో విజయం సాధించడం డీఎంకే కేడర్‌కు షాకిస్తోంది. ఎన్నికల్లో అధికారానికి దూరం కావడాన్ని మించి స్టాలిన్ ఓటమి డీఎంకే శ్రేణులను తీవ్ర నైరాశ్యంలో ముంచేసింది. 

తమిళ రాజకీయ దిగ్గజం, దివంగత కరుణానిధి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన స్టాలిన్.. 1989లో థౌజండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన స్టాలిన్ తొలిసారిగా తమిళనాడు అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1996, 2001, 2006 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఇదే స్థానం నుంచి గెలుపొందారు. 2011 నుంచి తన స్థానాన్ని కొలత్తూరు అసెంబ్లీ సెగ్మెంట్‌కు మార్చుకుని 2016, 2021 ఎన్నికలలో విజయం సాధించారు స్టాలిన్. 

అయితే 2026లో మాత్రం స్టాలిన్‌కు కొలత్తూరు ప్రజలు షాకిచ్చి వీఎస్ బాబుకు పట్టం కట్టారు. వీఎస్ బాబు మాజీ డీఎంకే నేత. స్టాలిన్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. విజయ్ స్థాపించిన టీవీకేలో చేరి తన మాజీ బాస్‌ని ఓడించారు. కౌంటింగ్ స్టార్ట్ చేసిన నాటి నుంచి స్టాలిన్- బాబు మధ్య హోరాహోరీ పోరు సాగింది. చివరికి టీవీకే అభ్యర్ధి వీఎస్ బాబుకి 82110 ఓట్లు పోలవ్వగా.. సీఎం స్టాలిన్‌కు 72988 ఓట్లు మాత్రమే పోలై ఓటమి పాలయ్యారు. 


తమిళనాడులో టీవీకే చరిత్ర... ఎన్టీఆర్ సరసన దళపతి విజయ్

 

యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉదయం నుంచే రాజకీయ విశ్లేషకులు, ప్రజలకు షాకిచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో డీఎంకే మరోసారి అధికారాన్ని గెలుచుకుంటుందని, స్టాలిన్ సీఎం అవుతారని అంచనా వేశాయి. అన్నాడీఎంకే మరోసారి ప్రధాన ప్రతిపక్షంగా మారుతుందని వెల్లడించాయి. దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే చెప్పుకోదగ్గ స్థానాలను గెలుచుకుంటుంది తప్పించి అధికారం కష్టమేనని అంచనా వేశాయి.

కానీ మే 4వ తేదీ ఉదయం ఎన్నికల ఫలితాలు ప్రారంభమైన గంటలోనే వెలువడిన ఫలితాలు షాకిచ్చాయి. అధికారాన్ని అందుకుంటుంది అనుకున్న డీఎంకే మూడో స్థానానికి, అన్నాడీఎంకే రెండో స్థానానికి పరిమితం కాగా.. ఎవ్వరూ ఊహించని విధంగా టీవీకే 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో నిలిచింది. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో అధికారాన్ని అందుకోవడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ (118). ఈ కథనం రాసే సమాయానికి టీవీకే 105, ఏఐఏడీఎంకే 71, డీఎంకే 57 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. దీంతో తమిళనాడులో హంగ్ ఏర్పడే అవకాశాలు దాదాపుగా కనిపిస్తున్నాయి. అన్నాడీఎంకేతో టీవీకే పొత్తు పెట్టుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ఈ స్థాయి ఫలితాలతో దళపతి విజయ్ చరిత్ర సృష్టించారు. సినిమా వాళ్లు రాజకీయాలకు తారుమారు చేయగలరని ఆయన నిరూపించారు. అంతేకాదు.. సినీ పరిశ్రమ నుంచి ముఖ్యమంత్రి కాబోతున్న వ్యక్తిగా.. కరుణానిధి, అన్నాదురై, ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత వంటి దిగ్గజాల సరసన చేరనున్నారు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం నాటి రోజులను దళపతి విజయంతో పోల్చి చూస్తున్నారు. 

తెలుగు చిత్ర పరిశ్రమను మూడు దశాబ్ధాలకు పైగా రారాజులా ఏలిన ఎన్టీఆర్ తన సినీ జీవితానికి స్వస్తి పలికి.. ప్రజల కోసం రాజకీయాల్లోకి దిగారు. 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ స్థాపించి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేపట్టారు. చైతన్య రథంపై ఊరువాడా తిరుగుతూ.. నాటి కాంగ్రెస్ పాలనపై వాడి వేడి విమర్శలు చేశారు. ప్రధానంగా తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఎన్టీఆర్ దెబ్బకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్రతిహతంగా సాగుతోన్న కాంగ్రెస్ పాలనకు చెక్ పడింది.

1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 294 స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ 201 స్థానాలను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించగా.. కాంగ్రెస్ పార్టీ 60, సీపీఎం 5, సీపీఐ 4, బీజేపీ 3 స్థానాలు గెలుచుకున్నాయి. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎన్టీఆర్.. భారత రాజకీయాల్లోనే ఈ ఘనత సాధించిన తొలి నేతగా రికార్డు సృష్టించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా అన్నగారు నిలిచారు.

తన సంక్షేమ పథకాలు, పాలనతో టీడీపీని ఒక బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడంతో పాటు లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించిన ఏకైక ప్రాంతీయ పార్టీగా నిలబెట్టారు ఎన్టీఆర్. 1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్యతో దేశమంతా కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించగా.. ఆంధ్రప్రదేశ్‌‌లో మాత్రం టీడీపీ గాలి వీచింది. ఉమ్మడి ఏపీలోని 42 లోక్‌సభ స్థానాలకు గాను నాటి పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ కూటమి 35 స్థానాలు గెలుచుకోగా.. కాంగ్రెస్ పార్టీ కేవలం 6 స్థానాలకే పరిమితం కావడం రాజకీయ వర్గాలనే ఆశ్చర్యంలో ముంచెత్తింది.

1983, 1985, 1994లలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎన్టీఆర్.. తెలుగు రాజకీయాలను సమూలంగా మార్చేశారు. 2 రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, ప్రజల వద్దకే పాలన, ఆడపడుచులకు ఆస్తిలో హక్కు, పటేల్- పట్వారి వ్యవస్ధ రద్దు వంటి చారిత్రాత్మక పథకాలు ఎన్టీఆర్‌ను దేవుడిని చేశాయి. రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ రామారావు తనదైన ముద్రవేశారు. కాంగ్రెసేతర పక్షాలను ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి నేషనల్ ఫ్రంట్‌గా నామకరణం చేసి... దానికి ఛైర్మన్‌గానూ వ్యవహరించారు.

ఇక విజయ్ విషయానికి వస్తే.. మూడు దశాబ్ధాలకు పైగా సినీ జీవితాన్ని ప్రజల కోసం పక్కనపెట్టి రాజకీయాల్లోకి దిగారు విజయ్. 2009 జూలైలో తమిళనాడు వ్యాప్తంగా ఉన్న తన 85000కు పైగా అభిమాన సంఘాలను ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి దానికి విజయ్ మక్కల్ ఇయక్కమ్ అని నామకరణం చేశారు. 2011లో ఈ అసోసియషన్.. అన్నాడీఎంకేకు అండగా నిలవడంతో నాటి ఎన్నికల్లో జయలలిత ఘన విజయం సాధించారు. అయితే తన బలాన్ని పరీక్షించాలని అనుకున్న విజయ్.. 2021లో తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలోకి దిగి 169 స్థానాల్లో పోటీ చేసి 115 స్థానాల్లో గెలుపొందారు.

ఈ క్రమంలో 2024 ఫిబ్రవరి 2వ తేదీన ఆ అసోసియేషన్‌ను తమిళగ వెట్రి కజగం (టీవీకే) అనే పేరుతో రాజకీయ పార్టీగా మార్చారు విజయ్. అదే ఏడాది అక్టోబర్ 27న విల్లుపురంలో జరిగిన పార్టీ తొలి ప్లీనరీకి దాదాపు 10 లక్షల మంది హాజరు కావడం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. చేతిలో ఉన్న సినిమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వచ్చిన విజయ్.. జన నాయగన్ చిత్రంతో తన నట జీవితానికి వీడ్కోలు పలుకుతున్నట్లు మలేషియాలో ప్రకటించారు.

కరూర్ తొక్కిసలాట, సంగీత విడాకుల నోటీసులు, జన నాయగన్ సినిమా వాయిదా వంటి వివాదాలు చుట్టుముడుతున్నా తట్టుకుని నిలబడ్డారు విజయ్. డీఎంకే, అన్నాడీఎంకేల అంగబలం, అర్ధ బలం ముందు తాను సరిపోనని తెలిసినప్పటికీ, ఒంటరిగానే బరిలోకి దిగుతానని.. ఎవరి జెండా మోయనని విజయ్ బలంగా సంకేతాలు పంపారు. ఎంతో శ్రమించి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు సాగించారు. 

ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో డీఎంకే మరోసారి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనా వేశాయి. కానీ ఒకే ఒక్క సర్వే మాత్రం విజయ్‌దే విజయమని తేల్చిచెప్పింది. చివరికి ఆ అంచనాను నిజం చేస్తూ విజయ్ విజిల్ మోగించారు. అన్న ఎన్టీఆర్ మాదిరిగానే పార్టీ పెట్టిన కొంతకాలానికే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు విజయ్. హంగ్ అసెంబ్లీ పరిస్ధితులు కనిపిస్తుండటంతో విజయ్ ఎవరితో జట్టు కడతారు? పవర్ షేరింగ్ ఎలా అన్నది ఆసక్తిగా మారింది.

ఫలితాలకు ముందే దళపతి విజయ్ అలర్ట్... టీవీకే విజేతలకి క్యాంప్ రెడీ!

 

దేశవ్యాప్తంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల ఎన్నికలు ఆసక్తిని రేకెత్తించిన సంగతి తెలిసిందే. అన్నింటిలోకి తమిళనాడు మరింత హాట్ టాపిక్‌గా మారింది. అధికారాన్ని నిలబెట్టుకోవాలని డీఎంకే.. పవర్ అందుకోవాలని ఏఐఏడీఎంకే.. తొలి ఎన్నికల్లోనే జైత్రయాత్ర సాగించాలని దళపతి విజయ్‌లు బరిలోకి దిగడమే దీనికి కారణం. దాంతో రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ముక్కోణపు పోటీ నెలకొనడంతో పాటు భారీగా పోలింగ్ నమోదైంది. 

అన్ని పార్టీలు ప్రజలను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన పథకాలను ప్రకటించాయి. బలమైన అభ్యర్ధులను రంగంలోకి దించి ప్రచారాన్ని పరుగులు పెట్టించాయి. ఎండల్ని లెక్కచేయకుండా అగ్రనేతలంతా ప్రచారంలో పాల్గొన్నారు. చివరి వరకు సర్వశక్తుల్ని ఒడ్డటంతో గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మే 4న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తమిళనాడులో డీఎంకేదే విజయమని  చెబుతుండగా.. కొన్ని సంస్థలు హంగ్ వచ్చే పరిస్ధితి కూడా ఉందని అంచనా వేయడంతో అన్ని పార్టీలు కౌంటింగ్‌కు ముందే క్యాంప్ రాజకీయాలకు తెరదీశాయి. తొలిసారి ఎన్నికలను ఎదుర్కొంటున్న టీవీకే అధినేత దళపతి విజయ్... కింగ్ మేకర్‌గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాంతో విజయ్ అప్రమత్తమయ్యారు. నేతలు చేజారిపోకుండా, ప్రలోబాలకు లొంగిపోకుండా ముందుజాగ్రత్తగా తమ పార్టీ అభ్యర్ధులను రిసార్ట్స్‌కు తరలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. 

మహాబలిపురం సమీపంలోని పూంజేరి వద్ద ఉన్న ఒక లగ్జరీ ప్రైవేట్ రిసార్ట్ మొత్తాన్ని టీవీకే పార్టీ బుక్ చేసినట్లుగా తెలుస్తోంది. దాదాపు 100 మందికి పైగా బస చేసే సదుపాయాలు అందులో ఉన్నాయట. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడిన తర్వాత టీవీకేకు చెందిన కీలక నేతలతో విజయ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. హంగ్ అసెంబ్లీ వచ్చే పరిస్ధితులు కనిపిస్తుండటంతో ఎన్నికల్లో గెలిచినట్లు అధికారులు ప్రకటించిన వెంటనే.. విజేతలంతా రిసార్ట్‌కు చేరుకోవాలని విజయ్ ఆదేశాలు జారీ చేశారు. 

మరి తమిళనాడులో హంగ్ అసెంబ్లీ వస్తుందా? విజయ్ కింగ్ మేకర్‌గా మారతారా? లేక సింగిల్ పార్టీకే ఏకపక్షంగా తమిళనాడు ప్రజలు అధికారాన్ని కట్టబెడతారా? అనేది తెలియాలంటే మరికొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.


Exit Polls 2026: మమత, స్టాలిన్‌, హిమంతలకు మరో ఛాన్స్.. ఇద్దరు విజయ్‌లకి షాక్ తప్పదా?

ఈ ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఎక్కువ ఆసక్తిని కలిగించాయి. కోలీవుడ్ సూపర్‌స్టార్, దళపతి విజయ్ టీవీకే పార్టీతో ఎన్నికల రణరంగంలోకి దిగడంతో తమిళనాడు ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. అటు పశ్చిమబెంగాల్‌లో వరుసగా మూడు సార్లు సీఎంగా గెలిచి హ్యాట్రిక్ కొట్టిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని సర్వశక్తులు ఒడ్డారు. దశాబ్ధాలుగా తమకు మింగుడుపడని బెంగాల్‌ను ఈసారి కైవసం చేసుకోవాలని బీజేపీకి కూడా గట్టిగా కృషి చేయడంతో ఇక్కడ ఫలితాలు ఎలా ఉంటాయోనని దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 

తమిళనాడు ఎగ్జిట్ పోల్స్

234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో అధికారాన్ని అందుకోవాల్సిన మేజిక్ ఫిగర్ 118. ఈసారి కూడా డీఎంకే నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తుందని.. స్టాలిన్ మరోసారి సీఎం అవుతారని మ్యాట్రిజ్, పీపుల్స్ పల్స్, పీ మార్క్, పీపుల్స్ ఇన్‌సైట్, ప్రజాపోల్, జేవీసీ వంటి సంస్థలు అంచనా వేశాయి. అన్నాడీఎంకే మరోసారి ప్రతిపక్షం తప్పదని సర్వేలు తేల్చాయి. 

ఇక కొత్తగా పార్టీ పెట్టిన దళపతి విజయ్‌ మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ అధికారం కష్టమేనని తేల్చాయి. రెండంకెల స్థానాలతో టీవీకే మూడో స్థానంలో ఉంటుందని పేర్కొన్నాయి. అయితే ఎన్డీటీవీ- యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం.. దాదాపు 120 స్థానాలు గెలుచుకుని టీవీకే అధికారాన్ని అందుకుంటుందని అంచనా వేసింది.

పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్

294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో అధికారాన్ని అందుకోవడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 148. హోరాహోరీగా జరిగిన బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీదే విజయమని ఎక్కువ సంస్థలు అభిప్రాయపడ్డాయి. అయితే బీజేపీ గట్టి పోటీ ఇచ్చి అధికారానికి చేరువగా రావొచ్చని మరికొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. 

కేరళ ఎగ్జిట్ పోల్స్

140 అసెంబ్లీ స్థానాలున్న  కేరళలో అధికారానికి అందుకోవాల్సిన మేజిక్ ఫిగర్ 71. మరోసారి  సీఎంగా గెలిచి హ్యాట్రిక్ అందుకోవాలన్న పినరయి విజయన్‌కు షాక్ తప్పదని అన్ని ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. ఎల్డీఎఫ్ కూటమి ఓటమి పాలై.. యూడీఎఫ్ విజయాన్ని అందుకుంటుందని, అలాగే బీజేపీ ఈసారి కేరళలో ఖాతా తెరిచే అవకాశాలు ఉన్నాయని సర్వేలు పేర్కొన్నాయి. 

అసోం ఎగ్జిట్ పోల్స్

అస్సాంలో మరోసారి ఎన్డీయే అధికారంలోకి వస్తుందని మెజారిటీ సంస్థలు అభిప్రాయపడ్డాయి. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సారథ్యంలోని బీజేపీ- ఏపీజీ- బీపీఎఫ్ కూటమి 100 స్థానాలు గెలుచుకోవచ్చని, కాంగ్రెస్ కూటమి 24 స్థానాలకు పరిమితమై మరోసారి ప్రతిపక్షంతో సరిపెట్టుకోవాల్సిందేనని సర్వేలు తెలిపాయి. 

పుదుచ్చేరి ఎగ్జిట్ పోల్స్

30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీలో అధికారాన్ని అందుకోవడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 17. ఈసారి కూడా ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చి  ఎన్ రంగస్వామి సీఎం అవుతారని  ఎగ్జిట్ పోల్స్ అంచానా వేశాయి. ఎస్‌పీఏ కూటమి 12 స్థానాలు గెలుచుకుని ప్రతిపక్షానికి పరిమితం అవుతుందని సర్వేలు తెలిపాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాషాయ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. మరి సర్వేలు వేసిన అంచనాలు నిజమవుతాయో లేదో తెలియాలంటే మే 4 వరకు వెయిట్ చేయాల్సిందే. 


ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత

 


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాదెండ్ల.. హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 22న తుదిశ్వాస విడిచారు. భాస్కరరావు మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. 

1935 జూన్ 23న గుంటూరులో జన్మించిన నాదెండ్ల భాస్కరరావు.. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయవాదిగా పట్టా అందుకున్నారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన.. 1978లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో గెలుపొంది ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ  తర్వాత మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

అనంతరం తెలుగువారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు.. తెలుగుదేశం పార్టీని స్థాపించడంలో కీలకపాత్ర పోషించిన భాస్కరరావు.. కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు. 1983లో వేమూరు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా విజయం సాధించిన ఆయన.. ఎన్టీఆర్ కేబినెట్‌లో ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీలో ఎన్టీఆర్ తర్వాత శక్తివంతమైన నేతగా గుర్తింపు తెచ్చుకుని రాష్ట్ర రాజకీయాలను శాసించారు.

అయితే 1984లో నాదెండ్ల భాస్కరరావు రాజకీయ జీవితం అనూహ్య మలుపు తిరిగింది. సీఎం ఎన్టీఆర్ వైద్య చికిత్స కోసం అమెరికాకు వెళ్లిన సమయంలో గవర్నర్ రామ్ లాల్ మద్ధతుతో ఎన్టీఆర్‌పై తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. అయితే ఎన్టీఆర్ తిరిగి భారతదేశానికి చేరుకుని రాజకీయ, ప్రజా సంఘాల మద్ధతుతో పోరాటానికి దిగి తిరిగి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. దాంతో కేవలం నెల రోజుల పాటు నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నారు. 

ఈ పరిణామాలతో టీడీపీ నుంచి నాదెండ్ల భాస్కరరావును సీఎం ఎన్టీఆర్ బహిష్కరించారు. దాంతో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు భాస్కరరావు. 1989 ఎన్నికల్లో తెనాలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 1998లో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలుపొంది లోక్‌సభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉన్న భాస్కరరావు.. 2019లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. 

నాదెండ్ల భాస్కరరావు వారసుడిగా ఆయన తనయుడు నాదెండ్ల మనోహర్ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ప్రారంభించిన మనోహర్.. తెనాలి నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్‌గా, స్పీకర్‌గా పనిచేశారు. అనంతరం రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో తుడిచిపెట్టుకుని పోవడంతో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరారు. 2024లో తెనాలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన నాదెండ్ల మనోహర్... చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 



రామ్ చరణ్‌తో ఆటాపాటా.. పెద్దిలో ఐటెం సాంగ్‌కి సంయుక్త రెమ్యునరేషన్ ఎంతంటే?

 


బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్, బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న మూవీ పెద్ది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌‌లో, పూర్తి స్థాయి గ్రామీణ వాతావరణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. 

గేమ్ ఛేంజర్‌తో డిజాస్టర్ ఎదుర్కొన్న చరణ్.. ఈసారి మాత్రం సాలీడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యెందు, బొమన్ ఇరానీ, విజీ చంద్రశేఖర్, రాజతవ దత్తా, సత్య, జాన్ విజయ్, పోసాని కృష్ణమురళీ తదితరులు నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి సంయుక్తంగా పెద్ది సినిమాను నిర్మిస్తున్నాయి.

ఏప్రిల్ 30న పెద్ది సినిమా విడుదల కావాల్సి ఉండగా.. అనివార్య కారణాలు, షూటింగ్ పూర్తికాకపోవడంతో సినిమాను వాయిదా వేశారు. జూన్‌లో పెద్ది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

అయితే పెద్దిలో ఓ ఐటెం సాంగ్ తప్పించి మిగిలిన షూటింగ్ పార్ట్ పూర్తయినట్లుగా ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఐటెం సాంగ్‌లో ఎవరు నటిస్తారన్న దానిపై రకరకాల రూమర్స్ వచ్చాయి. తమన్నా, మృణాల్ ఠాకూర్‌ల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ ఈ ప్రచారాన్ని వారు ఖండించారు.

చివరికి ఈ ఛాన్స్ సంయుక్త మీనన్‌ను వరించినట్లుగా రూమర్స్ వస్తున్నాయి. వరుస విజయాలు, సినిమాలతో బిజీగా ఉన్న ఈ కేరళ కుట్టి.. రామ్ చరణ్‌తో కలిసి ఆడిపాడనున్నారు. చెర్రీ మాస్ డ్యాన్స్‌కు, సంయుక్త అందాలు ఈ స్పెషల్ సాంగ్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని భావిస్తున్నారు. ఇక ఈ ఐటెం నెంబర్ కోసం సంయుక్త మీనన్‌కు కళ్లు చెదిరే పారితోషికం ముట్టజెబుతున్నారట మేకర్స్. 

ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం.. దాదాపు 3 కోట్ల రూపాయలను సంయుక్త ఛార్జ్ చేస్తున్నారట. స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుండటంతో పాటు వరుస విజయాలతో గోల్డెన్ హ్యాండ్‌గా ముద్ర వేసుకున్న సంయుక్తకు ఈ రేంజ్‌లో ఇచ్చేందుకు నిర్మాతలు వెనుకాడటం లేదు. మరి నిజంగానే సంయుక్తకు 3 కోట్ల రూపాయల పారితోషికం నిజమో? కాదో త్వరలోనే తేలనుంది.