నన్ను మీ సినిమాల్లో పెట్టుకోండి... డాక్టర్ రాజశేఖర్ ఆవేదన

 


ఎవరు ఏమనుకున్నా చిత్ర పరిశ్రమ సక్సెస్ వెంట పరిగెత్తుతుందనేది కాదనలేని వాస్తవం. ఎన్ని కష్టాలు ఎదురైనా, అవమానాలు ఎదుర్కొన్నా... మధ్యలో ఆగిపోకుండా చివరి వరకు పోరాడే వాడే ఇక్కడ నిలబడగలుగుతాడు. ఈ రన్నింగ్ రేసులో పరిగెత్తలేక మధ్యలోనే ఆగిపోయిన వారు బ్లాక్ అండ్ వైట్ ఎరా నుంచి నేటి వరకు ఎందరో. తమ ముందుతరాల వారి జీవితాలను దగ్గరి నుంచి చూసిన కొందరు నటులు మాత్రమే చివరి వరకు నటిస్తూ తమకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు.

హీరోలుగా చేసినవారు హీరోలుగానే చేయాలనే గిరి గీసుకుని కూర్చొంటే బండి నడవటం ఎంతో కష్టమని ఎన్నో ఉదాహరణలు. హీరోలుగా వైభవాన్ని చూసినవారు ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్‌లుగా నటిస్తున్నారు. జగపతి బాబు, శ్రీకాంత్ తదితర నటులు ఫ్యామిలీ హీరోలుగా వెలుగొంది... ఒక స్టేజ్ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. ముఖ్యంగా జగపతి బాబు కాలానికి తగినట్లుగా తనను తాను మార్చుకున్నారు. పవర్ ఫుల్ విలన్‌గా, స్టైలీష్ ఫాదర్‌గా మెప్పిస్తూ దక్షిణాదిలో డిమాండ్ ఉన్న నటుడిగా నిలిచారు. 

తెలుగునాట యాంగ్రి యంగ్‌మెన్‌గా చరిత్ర సృష్టించి పవర్‌ఫుల్ పాత్రలకు కేరాఫ్‌గా నిలిచారు డాక్టర్ రాజశేఖర్. తమిళ నటుడే అయినా తెలుగు ప్రజలు ఆయన్ను ఆదరించారు. వందేమాతరం, ప్రతిఘటన, అంకుశం, మగాడు, తలంబ్రాలు, అల్లరి ప్రియుడు, మా అన్నయ్య, మనసున్న మారాజు, సింహరాశి, ఎవడైతే నాకేంటీ తదితర చిత్రాలతో స్టార్ హీరో అనిపించుకున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్స్ తర్వాత టాలీవుడ్‌లో అంతటి ఫాలోయింగ్ ఉన్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు రాజశేఖర్. 

అయితే ఇదంతా గతం.. ఇప్పుడు రాజశేఖర్‌ను పట్టించుకునేవారు లేరు. ఆయన హిట్ కొట్టి చాలాకాలమే అయ్యింది. ఆపరేషన్ గరుడ వేగతో తిరిగి పూర్వ వైభవం అందుకున్నట్లు కనిపించినా...  తర్వాత తీసిన కల్కి, అర్జున, దెయ్యం, శేఖర్, ఎక్స్‌ట్రార్డినరి మ్యాన్ చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ఆ తర్వాత అనారోగ్య సమస్యలు, ఇతర కారణాలతో రాజశేఖర్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం యంగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న బైకర్‌లో కీలకపాత్రలో పోషిస్తున్నారు రాజశేఖర్. 

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటిలు బైకర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 3న ఈ సినిమా విడుదల కానుంది. స్పోర్ట్స్  బ్యాక్‌గ్రౌండ్‌లో తెరకెక్కుతోన్న బైకర్‌లో శర్వానంద్ రేసర్‌గా కనిసిస్తున్నారు. ఆయనకు తండ్రిగా రాజశేఖర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో రాజశేఖర్ ఉద్వేగంగా ప్రసంగించారు.

ఈ సినిమా ఒప్పుకోవడానికి ముందు హీరోగానే  కాకుండా క్యారెక్టర్ రోల్స్ కూడా చేయాలని నిర్ణయించుకున్నా. అందరూ కథలు చెబుతున్నా.. నాకు సరైన సబ్జెక్ట్ రాలేదు. రెండేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత అభిలాష్ గారు ఈ సబ్జెక్ట్ చెప్పారు. ఈ కథ చాలా బాగా నచ్చింది.. శర్వానంద్ గారి సినిమాలో సెకండ్ హీరోగా అనుకున్నాను. కానీ తర్వాత నేను, జీవిత, నా పిల్లలు అందరం కలిసి మాట్లాడుకున్నాం.. మీరు చేయాలని అనుకుంటున్నారు, అలాగే ఉంటుంది కానీ చేయండని చెప్పి ఒప్పించారు. ఇటీవల సినిమాకు వెళ్లినప్పుడు మిమ్మల్ని తెరపై చూసి చాలాకాలం అయ్యింది.. మీ సినిమా ఎప్పుడు వస్తుందని అడిగారు. నెక్ట్స్ బైకర్ వస్తుంది.. నా సినిమా చూడండి అని చెప్పా. 

అందరూ శర్వానంద్ గారి సినిమానా? అని అడగటంతో కొంత ఇబ్బందిపడ్డా.. ఇదంతా నాకు కొత్తగా ఉన్నా, దిల్‌రాజు గారు, బన్నీవాసు గారు మాట్లాడటం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఓ పక్క సెకండ్ లెవల్‌కి వెళ్లిపోయామే అనిపిస్తుంది.. మా అమ్మాయిలు ఒకటే అన్నారు, ఇంతకుముందు అలా ఉండేది, కానీ ఇప్పుడు అలా లేదని అందరూ ఒకటే. సెకండ్ లెవల్, థర్డ్ లెవల్ అని అనుకోవద్దని చెప్పడంతో అడ్జెస్ట్ అయిపోయా. ఎక్కువ సినిమాల్లో నన్ను పెట్టుకోండి.. మంచి క్యారెక్టర్స్ ఉంటే ఇవ్వండి. శర్వానంద్ గారు చాలా స్వీట్ పర్సన్. నిర్మాతలతో పాటు శర్వానంద్ గారు కూడా నన్ను హీరోగానే చూసుకున్నారు అని డాక్టర్ రాజశేఖర్ ఎమోషనల్ అయ్యారు. 


ఉస్తాద్ భగత్ సింగ్ బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? పవన్ మూవీకి ఎన్ని కోట్లు రావాలంటే?

 


ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి 19న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకురానుంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటిస్తోన్న ధురంధర్ 2 మూవీ రిలీజ్ కూడా ఇదే రోజు ఉండటంతో రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్ నడుస్తోంది. 

ఓజీ తర్వాత పవన్ నటించిన సినిమా కావడంతో పాటు గబ్బర్ సింగ్ (2012) విడుదలైన 14 ఏళ్ల తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. ముందుగా ఉస్తాద్‌ను మార్చి 26న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ యష్ నటించిన టాక్సిక్ సినిమా విడుదల వాయిదాపడటంతో ఉస్తాద్ ఒక వారం ముందుకు జరిగి మార్చి 19న విడుదల అవుతోంది. 

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నెనీ, యలమంచిలి రవిశంకర్‌లు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను 150 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. రాశీ ఖన్నా, శ్రీలీలు హీరోయిన్లుగా నటించారు. తమిళ నటుడు పార్ధిబన్, అశుతోష్ రాణా, నవాబ్ షా, రాజీవ్ కనకాల, పోసాని కృష్ణమురళి, గౌతమి, చమ్మక్ చంద్ర, రావు రమేశ్‌లు ఇతర పాత్రలు పోషించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం, థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. అయనాంక బోస్ సినిమాటోగ్రఫి, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్‌గా పనిచేశారు. 

ఉస్తాద్ భగత్ సింగ్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను తొలుత అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకోగా... లాస్ట్ మినిట్‌లో నెట్‌ఫ్లిక్స్ చేతికి ఇవి చిక్కాయి. ఉస్తాద్ భగత్ సింగ్ నైజాం థియేట్రికల్ రైట్స్ 46 కోట్ల రూపాయలు, సీడెడ్ థియేట్రికల్ రైట్స్ 15 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్ర థియేట్రికల్ రైట్స్ 13 కోట్ల రూపాయలు, కృష్ణా థియేట్రికల్ రైట్స్ 8 కోట్ల రూపాయలు, నెల్లూరు థియేట్రికల్ రైట్స్ 4.50 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరి థియేట్రికల్ రైట్స్ 9.50 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరి థియేట్రికల్ రైట్స్ 7.50 కోట్ల రూపాయలు, గుంటూరు థియేట్రికల్ రైట్స్ 9.50 కోట్ల రూపాయలు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా 7 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ 12 కోట్ల రూపాయలు కింద వరల్డ్ వైడ్‌గా 132 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. పవన్ కళ్యాణ్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 133 కోట్ల రూపాయల షేర్.. 270 కోట్ల రూపాయల  గ్రాస్ కలెక్షన్స్  తీసుకురావాలని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.  


కల్కి కోసం కమల్ హాసన్‌కు రికార్డ్ రెమ్యునరేషన్? 10 రోజులకు ఎన్ని కోట్లంటే?

నటనకే భాష్యం చెప్పిన మహానటుడు కమల్ హాసన్. భారతదేశం గర్వించదగ్గ మహానటుల్లో ఆయన కూడా ఒకరు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి తన నటనతో మాయజాలం చేస్తారు కమల్ హాసన్. కొత్తగా నటనా రంగంలోకి వచ్చే వారికి ఆయన చేసిన సినిమాలు ఓ గ్రంథాలయం అనడంలో అతిశయోక్తి లేదు. 70 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లతో సమానంగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు కమల్. రోటిన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, విభిన్నమైన కథలతో ముందుకొస్తారు కమల్ హాసన్.

ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియన్ 3, కల్కి 2898 ఏడీ: పార్ట్ 2, కమల్ 237లతో పాటు రజనీకాంత్‌తో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నారు. అన్నింటిలోకి కమల్ నటిస్తోన్న కల్కి 2 మీదనే అందరిచూపు నెలకొంది. కల్కిలో సుప్రీం యాస్కిన్‌గా నెగిటివ్ రోల్‌లో నటిస్తున్నారు. స్వర్గం లాంటి కాంప్లెక్స్‌కు పాలకుడిగా.. ప్రాజెక్ట్ కే కోసం గర్భవతుల్ని చంపుతూ క్రూరంగా కనిపించారు కమల్. 

విభిన్నమైన గెటప్‌లో మరోసారి ఆయన మేజిక్ చేశారు. పార్ట్ 1లో కనిపించింది కొద్దిసేపే అయినా ఆకట్టుకున్నారు కమల్. అయితే కల్కి 2లో మాత్రం ప్రభాస్, అమితాబ్‌లతో ఢీ అంటే ఢీ అనేలా కమల్ హాసన్ రోల్ ఉండబోతోందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కల్కి 2898 ఏడీ కోసం ఈ నట దిగ్గజం అందుకున్న పారితోషికం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కల్కి 2898 ఏడీ. భారతీయ పురాణాలు, సైన్స్ ఫిక్సన్ కలయికగా నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దిగ్గజ నటులు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్‌తో పాటు శోభన, దీపికా పదుకొనె, రాజేంద్రప్రసాద్, దిశా పటానీ తదితరులు కల్కిలో నటించారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం 2024 జూన్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది. థియేట్రికల్ రన్ ముగిసేసరికి వరల్డ్  వైడ్‌గా 1200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల అంచనా.

ఇంతటి భారీ విజయం తర్వాత కల్కికి సీక్వెల్‌గా కల్కి 2ను తెరకెక్కించాలని వైజయంతి మూవీస్, దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి దీపిక పదుకొనె తప్పుకోవడం సంచలనం సృష్టించింది. ఆమె ప్లేస్‌లో సాయిపల్లవిని హీరోయిన్‌గా తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. గత నెలలో కల్కి 2 షూటింగ్‌ను లాంఛనంగా ప్రారంభించింది చిత్ర యూనిట్. హైదరాబాద్‌లోని శంకర్‌పల్లి పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే కల్కి 2 సెట్‌లో ప్రభాస్ జాయిన్ కానున్నారు. 2027 సమ్మర్ లేదా దసరాకి కల్కి 2 ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

కాగా.. కల్కిలో నటీనటుల పారితోషికాలు అప్పట్లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రభాస్ 150 కోట్లు, అమితాబ్, దీపికా 20 కోట్ల రూపాయల రేంజ్‌లో పారితోషికం తీసుకున్నట్లుగా కథనాలు  వచ్చాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి కమల్ హాసన్ అందరికంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నారని చెబుతున్నారు తమిళ నటుడు యుగిసేతు. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కల్కి కోసం కమల్ 20 రోజుల కాల్షీట్లు ఇచ్చినట్లు ప్రచారం జరిగినా, అది 10 రోజులేనని తెలిసింది. అప్పటి వరకు కమల్ హాసన్‌కు రోజుకు 2 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారని వార్తలు వచ్చాయి. 

కానీ ఆయనకు రోజుకు 15 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ కింద ముట్టజెప్పారు. దీని ప్రకారం 10 రోజులకు 150 కోట్లు అందుకున్నారు. తద్వారా దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా కమల్ హాసన్ రికార్డు సృష్టించారని యుగిసేతు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వార్త గడిచిన కొద్దిరోజులుగా చక్కర్లు కొడుతోందని తెలిపారు. 


టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్.. ఫైనల్‌లో న్యూజిలాండ్ చిత్తు, టీమిండియా నయా హిస్టరీ

 

Photo Courtesy: X.com/BCCI

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఛాంపియన్‌గా టీమిండియా నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి మూడో సారి టీ20 ప్రపంచకప్‌ను అందుకుని చరిత్ర సృష్టించింది. ఇంతకు ముందు క్రికెట్ దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మలు భారత జట్టుకు ట్రోఫీలు అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి సరసన సూర్యకుమార్ యాదవ్ కూడా చేరారు. 

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ 2026లో తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు అభిషేర్ శర్మ (52), సంజూ శాంసన్ (89)లు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ విధ్వంసక ఆటతో కివీస్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. 

ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను రచిన్ రవీంద్ర విడదీశాడు. 52 పరుగుల వ్యక్తిగత స్కోరు అభిషేక్ శర్మ ఔటయ్యాడు. అభి ఔటైనా సంజూ విధ్వంసం కొనసాగింది. అతనికి ఇషాన్ కిషన్ (54) నుంచి చక్కటి సహకారం లభించగా.. ఇద్దరూ ధాటిగా ఆడి పరుగుల వరద పారించారు. వీరి ధాటికి భారత్ 12 ఓవర్లకే 150 పరుగుల మార్క్ దాటేసింది. ఈ దశలో జేమ్స్ నీషమ్ మేజిక్ చేశాడు. ఒకే ఓవర్‌లో సంజూ, ఇషాన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లను ఔట్ చేశాడు. తర్వాత కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో భారత్‌కు పరుగులు చేయడం కష్టమైంది. 

ఈ దశలో హార్డిక్ పాండ్య (18), శివమ్ దూబే (26)లు బ్యాట్ ఝళిపించడంతో టీమిండియా 250 పరుగుల మార్క్ దాటింది. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో జేమ్స్  నీషమ్ 3 వికెట్లు తీయగా.. హెన్రీ, రచిన్ రవీంద్రలు తలో వికెట్ పడగొట్టారు. భారత బ్యాట్స్‌మెన్‌లో సంజూ శాంసన్ 89 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 

256 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ ధాటిగా తన ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. ఓపోనర్ టిమ్ సీఫెర్ట్ ఫోర్లు, సిక్సర్లతో భారత బౌలర్లను వణికించాడు. ఈ దశలో అక్షర్ పటేల్ కివీస్‌కు షాకిచ్చాడు. 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓపెనర్ అలెన్‌ను ఔట్ చేశాడు. ఆ వెంటనే బుమ్రా బౌలింగ్‌లో రచిన్ రవీంద్ర పెవిలియన్ చేరాడు. కీలక ఆటగాళ్లు గ్లెన్ ఫిలిప్స్ (5), మార్క్ చాప్‌మెన్ (3), డేరీ మిచెల్‌ (17)లను భారత్ త్వరత్వరగా ఔట్ చేయడంతో న్యూజిలాండ్ కష్టాల్లో పడింది.

ఓ వైపు వికెట్లు పడుతున్నా స్టిఫెర్ట్ మాత్రం దూకుడుగా ఆడుతూనే ఉన్నాడు. ఈ దవలో వరుణ్ చక్రవర్తికి దొరికిపోవడంతో న్యూజిలాండ్ ఆశలు వదిలేసుకుంది. చివరి వరుస బ్యాట్స్‌మెన్లు జేమ్స్ నీషమ్ (8), హెన్రీ (0), ఫెర్గూసన్ (6), జాకబ్ డఫి (3)లను కూడా భారత బౌలర్లు ఇంటికి పంపారు. అయితే న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ మొండిగా పోరాడుతూ ఆశలు రేపాడు. అయితే బుమ్రా అతనిని క్లీన్‌బౌల్డ్ చేసి భారత్‌కు విజయాన్ని ఖరారు చేశాడు. దాంతో న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటై దారుణ పరాజయాన్ని చవిచూసింది. నాలుగు వికెట్లు తీసి భారత విజయంలో కీలకపాత్ర పోషించిన జస్‌ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కగా.. సంజూ శాంసన్‌ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ అవార్డ్ దక్కించుకున్నాడు. 

 


టాక్సిక్ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

 


కర్ణాటకకు చెందిన బడా నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు అస్సలు టైం బాగున్నట్లుగా కనిపించడం లేదు. కోలీవుడ్ సూపర్‌స్టార్, దళపతి విజయ్ సినీ కెరీర్‌లో చివరి మూవీ జన నాయగన్‌ను ఈ సంస్థే నిర్మించింది. తమ అభిమాన నటుడి చివరి సినిమా కావడంతో విజయ్ అభిమానులు కూడా జన నాయగన్ కోసం ఉత్కంఠగా ఎదురుచూశారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది.

అయితే సెన్సార్ బోర్డ్ నుంచి అనుమతులు రాకపోవడం, న్యాయపరమైన చిక్కులు కారణంగా జన నాయగన్ సినిమాను వాయిదా వేస్తున్నట్లు కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. కట్ చేస్తే.. కన్నడ సూపర్‌స్టార్ యష్ నటించిన లేటెస్ట్ మూవీ టాక్సిక్. కేజీఎఫ్ సిరిస్ తర్వాత యష్ నటిస్తున్న మూవీ కావడంతో టాక్సిక్‌పైనా భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి 19న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా విడుదల అవుతుందని నిర్మాతలు ప్రకటించారు.

ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ చేశారు. అదే రోజున రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 విడుదల కానుండటంతో రెండు సినిమాలలో ఏది బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుందోనని సినీ జనాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి దశలో టాక్సిక్‌ నిర్మాతలు షాకిచ్చారు. టాక్సిక్ : ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్‌ మూవీ విడుదలను వాయిదా వేస్తున్నట్లు కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. 

ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ యుద్ధంతో పాటు ఇరాన్ ప్రతీకార దాడులతో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది. జూన్ 4న భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్‌లో టాక్సిక్‌ను విడుదల చేస్తామని ప్రకటించింది. దాంతో యష్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 


Thalapathy Vijay: దళపతి విజయ్‌కి షాక్.. విడాకులు కోసం కోర్టుకెక్కిన భార్య సంగీత

 


కోలీవుడ్ సూపర్‌స్టార్, టీవీకే అధినేత దళపతి విజయ్‌కి తమిళనాడు ఎన్నికల వేళ బిగ్ షాక్ తగిలింది. విజయ్ నుంచి విడాకులు కావాలంటూ ఆయన సతీమణి సంగీత ఫిబ్రవరి 25వ తేదీన చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని పరిగణనలోనికి తీసుకున్న కోర్ట్.. విజయ్‌కి సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 20న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. తన భర్తకు మరో మహిళ అక్రమ సంబంధం ఉందని సంగీత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 

దశాబ్ధాల పాటు తనను ఆదరించి ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజల కోసం సినీ కెరీర్‌ను వదులుకుని రాజకీయాల్లోకి దిగారు దళపతి విజయ్. తమిళగ వెట్రి కజగం అనే పార్టీని స్థాపించి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తమిళనాట సూపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్, ఛరిష్మా ఉన్న నటుడిగా విజయ్‌కి పేరు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి దిగడంతో రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పక్షాలైన డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు కాంగ్రెస్, బీజేపీలు షాక్ అయ్యాయి. 

త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ ఎవరి ఓట్లు చీలుస్తాడో? ఎవరికి విజయావకాశాలను దూరం చేస్తాడోననని నేతలు టెన్షన్‌లో ఉన్నారు. ఇప్పటికే విడుదలవుతున్న పలు సర్వేలు.. విజయ్‌కి చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు పడతాయని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్‌ని దారికి తెచ్చుకుని పొత్తు పెట్టుకోవాలని పలు పార్టీలు భావిస్తున్నాయి. అయితే డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీలకు తాను దూరమని ఇప్పటికే విజయ్ ప్రకటించారు. 

రాష్ట్ర రాజకీయాలు హాట్ టాపిక్‌గా ఉన్న సమయంలో కొద్దిరోజుల క్రితం ప్రముఖ సినీ నటి త్రిషతో విజయ్‌కి లింక్ పెడుతూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. విజయ్‌కి రాజకీయ అనుభవం లేదని... ముందు ఆయన తన కుటుంబంలోని సమస్యలను చక్కదిద్దుకోవాలి. త్రిష ఇంటి నుంచి బయటకు వస్తేనే విజయ్‌కి వాస్తవాలు తెలుస్తాయంటూ నాగేంద్రన్ వ్యాఖ్యానించారు. 

ఈ వ్యాఖ్యలు తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. విజయ్ - త్రిషల మధ్య ఏదో జరుగుతోందని గత కొద్దినెలలుగా గాసిప్స్ వైరల్ అవుతున్న దశలో నాగేంద్రన్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అయితే దీనికి త్రిష తనదైన శైలిలో రియాక్ట్ అయ్యింది. సంబంధం లేని విషయాల్లోకి తన పేరును తీసుకురావొద్దని.. లేనిపక్షంలో లీగల్‌గానే స్పందిస్తానని వార్నింగ్ ఇచ్చింది. దాంతో త్రిషకి నాగేంద్రన్ క్షమాపణలు చెప్పారు. 

ఈ వివాదం సద్దుమణిగిందో లేదో విజయ్ భార్య సంగీత షాకిచ్చారు. తనకి విడాకులు కావాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లో ఆమె పలు అభియోగాలు కూడా చేశారు. 2021 నుంచి విజయ్‌కి ఓ తమిళ సినీ నటితో వివాహేతర సంబంధం ఉందని.. దీని కారణంగా తాను ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తున్నట్లు సంగీత ఆరోపించింది. రెండేళ్లుగా తామిద్దరం విడివిడిగానే ఉంటున్నామని పేర్కొంది. 

ఇప్పటికే కరూర్ తొక్కిసలాట, సీబీఐ విచారణ, జన నాయగన్ మూవీ ఆగిపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్న విజయ్‌కి తాజాగా భార్య సంగీత షాక్ ఇవ్వడంతో ఆయనకు ఏం చేయాలో అర్ధం కానీ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు రాజకీయ ప్రత్యర్ధులను ఎదుర్కొంటూనే.. ఇప్పుడు సొంతింట్లో భార్య చేసిన ఆరోపణల నుంచి తన నిజాయితీని దళపతి విజయ్ ఎలా నిరూపించుకుంటారోనని తమిళ సినీ, రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. 



Rashmika Mandanna Net Worth: రష్మిక మందన్న ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?

 


కిర్రాక్ పార్టీతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి నేషనల్ క్రష్‌గా ఎదిగారు కన్నడ కస్తూరి రష్మిక మందన్న. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండను ఆమె త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మీడియాలో వస్తున్న కథనాలను బట్టి ఫిబ్రవరి 26వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ వివాహం జరగనుంది. కానీ ఈ ఇద్దరు స్టార్స్ మాత్రం తమ పెళ్లి విషయాన్ని రహస్యంగానే ఉంచుతున్నారు. ఓ పక్క ఇరు కుటుంబాల్లో పెళ్లి పనులు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తుండగా.. రష్మిక కానీ, విజయ్ కానీ ఈ విషయాన్ని ఇంత వరకు అధికారికంగ ప్రకటించలేదు. ఈ క్రమంలో రష్మిక మందన్న ఓ సినిమాకు తీసుకునే పారితోషికం ఎంత? ఆమె ఆస్తులు ఎన్ని కోట్లు? అనేది పరిశీలిస్తే.

ఏప్రిల్ 5, 1996న కర్ణాటకలోని విరాజ్‌పేటలో కొడవ కమ్యూనిటీలో జన్మించారు రష్మిక మందన్న. ఆమె తల్లిదండ్రులు సుమన్, మదన్ మందన్నా. రష్మిక తండ్రికి స్థానికంగా కాఫీ ఎస్టేట్, ఫంక్షన్ హాల్ ఉంది. ఆమె తల్లి సాధారణ గృహిణి. అయితే రష్మిక చిన్నతనంలో ఆమె తండ్రికి వ్యాపారంలో బాగా నష్టాలు రావడంతో ఆర్ధికంగా వీరి కుటుంబం చితికిపోయింది. అద్దె ఇంట్లోకి మారడం, తన తల్లిదండ్రులు తనకు ఆటబొమ్మలు కూడా కొనలేని స్థితిలో ఉన్నారని రష్మిక పలు సందర్భాల్లో చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. 

చిన్నప్పటి నుంచి చదువులో ముందుండే రష్మిక.. బెంగళూరులోని ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. ఈ క్రమంలోనే మోడలింగ్ వైపు అడుగులు వేసిన రష్మిక 2014లో టైమ్స్ ఆఫ్ ఇండియా క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ అవార్డ్‌ అందుకున్నారు. ఈ దశలో సినీరంగం నుంచి ఆమెకు అవకాశాలు వచ్చాయి. అయితే వాటిని రష్మిక తిరస్కరించారు.. తనకు నటన అంటే ఇష్టం లేదని చెప్పేవారు. కానీ ఆమె కాలేజ్ ప్రొఫెసర్ ఒత్తిడితో ఓ సినిమాకు ఆడిషన్‌ ఇవ్వడానికి వెళ్లి సెలెక్ట్ అయ్యారు రష్మిక. ఈ క్రమంలో తొలి సినిమా అగ్రిమెంట్‌ మీద సంతకం చేయడానికి తల్లిదండ్రులు మొదట ఒప్పుకోలేదు. అయితే కూతురి ఇష్టాన్ని కాదనలేక అంగీకరించారు.

2015లో కన్నడ సూపర్‌స్టార్ రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన కిర్రాక్ పార్టీలో రక్షిత్ శెట్టి సరసన నటించారు రష్మిక. ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించడంతో పాటు రష్మికు బెస్ట్ డెబ్యూ నటిగా రష్మికకు సైమా అవార్డ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత అంజనీ పుత్ర, చమక్ తదితర కన్నడ చిత్రాలలో నటించారు. ఇదే సమయంలో తన తొలి చిత్ర హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ.. ఆయనతో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంది. అయితే పెళ్లికి కొద్దిరోజుల ముందు రక్షిత్ శెట్టితో నిశ్చితార్ధాన్ని రద్దు చేసుకుని షాకిచ్చారు రష్మిక మందన్నా. 

ఈ క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రష్మికకు పిలుపొచ్చింది. ఛలో మూవీ ద్వారా ఆమె టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత గీతా గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మతో హిట్స్ అందుకున్న రష్మిక కెరీర్‌ను పుష్ప సిరీస్ మలుపు తిప్పింది. ఇందులో శ్రీవల్లిగా జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్నారు. అనంతరం యానిమల్, ఛావా, సికందర్, కుబేరా, థామా, ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రాలతో నేషనల్ క్రష్‌గా అవతరించారు రష్మిక. అత్యధిక సక్సెస్ రేట్‌తో ఆమె దరిదాపుల్లోనూ ఏ హీరోయిన్ లేరంటే అతిశయోక్తి కాదు.  ప్రస్తుతం హిందీలో కాక్‌టెయిల్, తెలుగులో మైసా సినిమాలో రష్మిక నటిస్తున్నారు. 

గీత గోవిందం సినిమా టైంలో విజయ్ దేవరకొండతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ సీక్రెట్‌గా ప్రేమాయణం సాగిస్తూ పలుమార్లు మీడియాకు దొరికిపోయారు. కానీ ఇద్దరూ తమ బంధాన్ని బయటపెట్టలేదు. గతేడాది విజయ్ దేవరకొండ - రష్మికల ఎంగేజ్‌మెంట్ హైదరాబాద్‌లో జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని కూడా వీరిద్దరూ రహస్యంగానే ఉంచారు. అనంతరం రష్మిక - విజయ్‌ల పెళ్లిపై రకరకాల రూమర్స్ వచ్చాయి. కానీ వేటికీ కూడా ఇద్దరూ స్పందించలేదు. చివరికి ఫిబ్రవరి 26వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో విజయ్ - రష్మికల పెళ్లి సీక్రెట్‌గా జరగనుందని గాసిప్స్ వైరల్ అయ్యాయి. దీనిపైనా అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. కానీ రెండు కుటుంబాల్లోనూ పెళ్లిపనులు మొదలైనట్లుగా సాక్ష్యాలు చూపిస్తున్నారు నెటిజన్లు. 

ప్రస్తుతం వార్తల్లో నిలిచిన రష్మిక మందన్న సంపాదన, ఆమె ఆస్తులపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. సినిమాల పారితోషికం, బ్రాండ్ అండార్స్‌మెంట్స్ ద్వారా రష్మిక మందన్న బాగానే ఆస్తులను కూడబెట్టినట్లుగా ఫిలింనగర్ టాక్. సినిమాకు 10 నుంచి 12 కోట్ల రూపాయల రేంజ్‌లో రెమ్యునరేషన్ అందుకుంటున్న రష్మిక మందన్న.. బ్రాండ్ ప్రమోషన్స్‌కు కూడా భారీగానే ఛార్జ్ చేస్తున్నారట. ఇక ఆమె ఆస్తుల విషయానికి వస్తే .. బెంగళూరులో 8 కోట్ల రూపాయల విలాసవంతమైన భవనంతో పాటు కూర్గ్, హైదరాబాద్‌లలోనూ రష్మికకు ఖరీదైన ఆస్తులు ఉన్నాయి. తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని రియల్ ఎస్టేట్‌తో పాటు ఇతర మార్గాల్లో పెట్టుబడులు పెడుతున్నారు రష్మిక మందన్న.

ఇక కార్లంటే రష్మికకు ఎంతో ఇష్టం. ఆమె వద్ద 1.84 కోట్ల రూపాయల విలువైన రేంజ్ రోవర్ స్పోర్ట్, ఆడి క్యూ3 (40 లక్షల రూపాయలు), మెర్సిడెస్ బెంజ్ సీ క్లాస్ (50 లక్షల రూపాయలు), టయోటా ఇన్నోవా, హ్యుందాయ్ క్రెటా వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. మొత్తంగా రష్మిక మందన్న ఆస్తుల విలువ 70 కోట్ల రూపాయల వరకు ఉంటుందని సినీ వర్గాల అంచనా.