నిర్మాతగా కమల్ హాసన్.. టాలీవుడ్ టాప్ హీరోతో సినిమా, దిగ్గజ నటుడి బిగ్‌ స్కెచ్?


గతంలో పోలిస్తే హీరోలు సినిమాలలో నటించడంతో సరిపెట్టకుండా సినిమాతో వ్యాపారం ఎలా చేయాలనే దానిపై గట్టిగా ఫోకస్ పెడుతున్నారు. చాలా మంది హీరోలు నిర్మాతలుగా మారి మంచి లాభాలను గడిస్తున్నారు. మరికొందరైతే పంపిణీ రంగంలో అడుగుపెట్టి అక్కడా సక్సెస్ కొడుతున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇలాంటి వారు చాలామందే ఉన్నారు. అయితే ఆల్రెడీ నిర్మాణ రంగంలో ఉన్న హీరోలు.. తమ బిజినెస్ మరింత విస్తరించే పనిలో పడ్డారు. ఈ లిస్ట్‌లోకే వస్తారు తమిళ నట దిగ్గజం కమల్ హాసన్.

నటనకే కొత్త భాష్యం చెప్పి భారతదేశం గర్వించదగ్గ మహానటుల్లో ఒకరిగా చోటు దక్కించుకున్నారు కమల్ హాసన్. చాలా ఏళ్ల క్రితమే ఆయన సినీ నిర్మాణంలో అడుగుపెట్టి ఎన్నో విజయవంతమైన చిత్రాలను తీశారు. ప్రయోగాలకు, వినూత్నమైన కథలకు పెద్దపీట వేసే కమల్.. తన అభిరుచి వల్ల నిర్మాతలకు ఎలాంటి నష్టం కలగకుండా, నతకు నచ్చిన స్క్రిప్ట్‌లను వెండితెరపై ఆవిష్కరించేందుకు వీలుగా రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌ను స్థాపించారు. 

1981లో అమావాస్య చంద్రుడితో మొదలుపెట్టి.. నిన్న మొన్నటి థగ్‌లైఫ్ వరకు ఎన్నో చిత్రాలను తీశారు కమల్ హాసన్. ప్రస్తుతం తన సహచరుడు, కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి దాదాపు 45 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్నాడు కమల్. ఈ చిత్రానికి స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. భారీ బడ్జెట్‌ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం రజనీకి ఏకంగా 225 కోట్ల రూపాయల పారితోషికం సైతం అందజేయబోతున్నట్లుగా కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.

దీనితో పాటు తన 237వ చిత్రాన్ని సొంతంగా నిర్మిస్తున్నారు కమల్ హాసన్. ఇది కాకుండా కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తీకేయన్‌తో సెయాన్ నిర్మిస్తున్నారు. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. శివకార్తీకేయన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అంచనాలను పెంచేసింది. ఇదిలాఉండగా తన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌ సంస్థను విస్తరించాలని కమల్ భావిస్తున్నారట. 

తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాలు నిర్మించాలని లోక నాయకుడు యోచిస్తున్నారట. టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తదితరులతో సినిమాలు తీసి పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలని కమల్ ప్రణాళికలు రచిస్తున్నట్లుగా చిత్ర పరిశ్రమలో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఈ హీరోల ఇమేజ్‌కు తగిన స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో ఆయన ఉన్నారని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే తెలుగు స్టార్స్‌తో కమల్ సినిమా పట్టాలెక్కడం పెద్ద విషయం కాదని అంటున్నారు విశ్లేషకులు. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. 


Jaahnavi Kandula: అమెరికాలో తెలుగు విద్యార్ధిని మృతి... బాధితురాలికి 262 కోట్ల నష్టపరిహారం

ఐదేళ్ల క్రితం అమెరికాలోని సియాటెల్ నగరంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన తెలుగు విద్యార్ధిని జాహ్నవి కందుల కుటుంబానికి ఊరట లభించింది. బాధిత కుటుటంబానికి దాదాపు 262 కోట్ల రూపాయల నష్టపరిహారం దక్కింది. అసలు ఈ కేసు ఏంటీ? జాహ్నవి ఎలా చనిపోయారు? ఈ కేసులో వివాదం ఏంటీ? అనే పూర్వాపరాల్లోకి వెళితే.

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి కందుల 2021లో మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్లారు. అనంతరం సౌత్‌లేక్ యూనియన్‌లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందారు. ఈ దశలో 2023 జనవరి 23వ తేదీ రాత్రి రోడ్డు దాటుతుండగా అదే సమయంలో అటువైపు వేగంగా వస్తోన్న పోలీస్ వాహనం ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జాహ్నవి ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. ఉన్నత చదువులు చదివి జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తుందనుకున్న తమ బిడ్డ తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో జాహ్నవి కుటుంబ సభ్యలు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

అయితే అమెరికాలో తీవ్ర సంచలనం సృష్టించిన జాహ్నవి మృతి కేసుపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో అక్కడి ప్రభుత్వం విచారణ చేయించింది. ప్రమాదానికి కారణమైన పోలీస్ వాహనాన్ని ఆ సమయంలో కెవిన్ డేవ్ అనే అధికారి డ్రైవ్ చేస్తున్నాడు. జాహ్నవిని ఢీకొట్టిన ప్రదేశంలో నిబంధనల ప్రకారం కారును 40 కి.మీ వేగంలో నడపాల్సి ఉంది. కానీ కెవిన్ మాత్రం వాహనాన్ని దాదాపు 119 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నాడు. అప్పటికే అతను డ్రగ్స్ మత్తులో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. అలాగే కారుకున్న ఎమర్జెన్సీ లైట్లు ఆన్ చేసి.. కూడళ్ల వద్ద తన సైరన్‌ను ఉపయోగించినట్లు విచారణ తేలింది. 

అటు జాహ్నవి మరణంపై స్థానికంగానూ నిరసనలు జరిగాయి. ఇదే సమయంలో మరో అధికారి బాడీ కెమెరా రికార్డింగ్స్‌లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఇందులో కెవిన్ నవ్వుతూ.. జాహ్నవి మరణానికి విలువ లేదని వ్యాఖ్యానించడంతో అతనిని ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. అతని వ్యాఖ్యలు పోలీస్  శాఖ ప్రతిష్టను, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశాయని నగర పౌర వాచ్‌డాగ్ కనుగొంది. అయితే తనను విధుల నుంచి తప్పించడంపై కెవిన్ కోర్టును ఆశ్రయించాడు. న్యాయవాదులు ఈ మరణంపై ఎలా స్పందిస్తారనే  దానిపై విమర్శించేందుకే ఈ వ్యాఖ్యలు చేశానని దారుణంగా మాట్లాడాడు. 

అయితే కందుల జాహ్నవి మరణానికి కారకులైన వారిని వదిలిపెట్టేది లేదని ఆమె కుటుంబం న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తూనే వచ్చింది. ఈ క్రమంలో గత శుక్రవారం కింగ్ కౌంటీ సుపీరియర్ కోర్టులో ఇరుపక్షాలు సెటిల్‌మెంట్ నోటీసు దాఖలు చేశాయి. దీనిలో భాగంగా జాహ్నవి కుటుంబానికి 29 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 262 కోట్ల రూపాయలు) పరిహారం చెల్లించేందుకు సియాటెల్ సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ కీలక ప్రకటన చేశారు. దీని ద్వారా జాహ్నవి కుటుంబానికి కాస్తయిన ఉపశమయనం లభిస్తుందని ఎరికా పేర్కొన్నారు. అయితే సెటిల్‌మెంట్‌పై జాహ్నవి తరపు న్యాయవాదులు ఇంకా స్పందించలేదని మీడియాలో కథనాలు వస్తున్నాయి. 


ICC Under-19 Men's Cricket World Cup: విశ్వవిజేతగా యువ భారత్.. ఆరవసారి కప్ కొట్టిన టీమిండియా

 

Photo Courtesy: x.com/BCCI

అండర్ 19 వన్డే ప్రపంచకప్‌ 2026లో టీమిండియా తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఆరోసారి అండర్ 19 వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచి అరుదైన ఘనత సాధించింది. హరారెలో శుక్రవారం ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్‌లో ఏకంగా 100 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టును మట్టికరిపించి సగర్వంగా అండర్ 19 వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది టీమిండియా. 

భారత్ నిర్దేశించిన 412 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండో 40.2 ఓవర్లలో 311 పరుగుల ఆలౌట్ అయ్యింది. ఫాల్కనర్ సెంచరీతో (115) ఒంటరి పోరాటం చేసినప్పటికీ అతనికి సహకరించేవారు లేక జట్టు ఓటమి పాలైంది. ఇంగ్లీష్ ఆటగాళ్లలో బెన్ డాకిన్స 66, బెన్ మేయెస్ 45, థామస్ రేవ్ 31 పరుగులు చేశారు. భారత బౌలర్ల అంబరీష్ 3, దీపేశ్, కనిష్క్‌లు తలో 2 వికెట్లు తీయగా.. ఖిలాన్ పటేల్, ఆయుష్ మాత్రేలు తలో వికెట్ పడగొట్టారు.

తొలుత టాస్ గెలిచిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ (175) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి.. జట్టు భారీ స్కోరు చేడానికి కారణమయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ ఆయుష్ మాత్రే 53, అభిజ్ఞాన్ కుందు (40), వేదాంత్ త్రివేది (32) పరుగులు చేశారు. ఇంగ్లీష్ బౌలర్లలో జేమ్స్ మింట 3, మోర్గాన్, అలెక్స్ గ్రీన్‌లు తలో 2 వికెట్లు పడగొట్టగా.. మానీ ఒక వికెట్ తీశారు.

1988లో అండర్ 19 వన్డే వరల్డ్ కప్‌కు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రూపకల్పన చేసింది. ఈ మెగా టోర్నీలో భారత జట్టుది తిరుగులేని  రికార్డ్. మొత్తం 6 సార్లు టీమిండియా ఈ అండర్ 19 వన్డే వరల్డ్ కప్‌ ట్రోఫీని అందుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 4 సార్లు, పాకిస్తాన్ రెండు సార్లు, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాయ, వెస్టిండిస్‌లు తలో ఒకసారి కప్ గెలిచాయి. 37 ఏళ్ల ఈ ట్రోఫీ చరిత్రలో న్యూజిలాండ్, శ్రీలంకలు ఒక్కసారి కూడా కప్ గెలవలేకపోయాయి. 



భారత్- పాకిస్తాన్ మ్యాచ్ విలువ ఎన్ని వేల కోట్లో తెలుసా? మ్యాచ్ రద్దయితే నష్టం ఎంతంటే?

 


త్వరలో జరగనున్న టీ 20 ప్రపంచకప్ వివాదాస్పదం అవుతోంది. భారత్‌లో భద్రతా కారణాలను సాకుగా చూపి బంగ్లాదేశ్ ఈ టోర్నీలో తప్పుకోవడంతో కలకలం రేపింది. ఐసీసీ పలుమార్లు నచ్చజెప్పాలని చూసినా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (బీసీబీ) మాత్రం ససేమిరా అనడంతో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌ను ఈ టోర్నీ నుంచి తప్పించి దాని స్థానంలో స్కాట్లాండ్‌ను టీ 20 ప్రపంచకప్‌లో ఆడేందుకు అనుమతించింది. ఈ వ్యవహారం సద్దుమణిగిందో లేదో ఈ టోర్నీలో మరో వివాదం చోటు చేసుకుంది. 

బంగ్లాదేశ్‌కు మద్ధతుగా నిలబడుతూ వచ్చిన పాకిస్తాన్ ఈ టోర్నీలో భారత్‌లో జరగనున్న మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశాల మేరకు పాక్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. 

అసలు ఏ ఐసీసీ టోర్నమెంట్ అయినా అసలు సిసలు మజా అందించేది భారత్ - పాకిస్తాన్ మ్యాచే. దాయాదుల మ్యాచ్‌ను ఇరుదేశాల ప్రజలతో పాటు క్రికెట్ అభిమానులు ఎంజాయ్ చేస్తుంటారు. మైదానంలో సింహాల్లా పోరాడటంతో పాటు భావోద్వేగాలు ముడిపడిన అంశం కావడంతో ఏ మ్యాచ్‌కు రానంత రికార్డ్ స్థాయిలో వ్యూస్‌తో పాటు ఆదాయం కూడా భారత్ - పాక్ మ్యాచ్‌కు వస్తుండటంతో ఐసీసీ తన టోర్నమెంట్‌లలో ఖచ్చితంగా రెండు జట్లను ఒకే గ్రూప్‌లో ఆడేలా ప్లాన్ చేస్తుంది.

భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌తో ఐసీసీకి, ఇరు దేశాల క్రికెట్ బోర్డులకు కూడా భారీ ఆదాయం వస్తోంది. ప్రసార హక్కులు, ప్రకటనలు, స్పాన్సర్‌షిప్‌లు, టికెట్ విక్రయాలు, ఇతర వాణిజ్య కార్యక్రమాలతో భారీ లాభాలను కళ్లజూస్తున్నారు. ఈసారి టీ 20 ప్రపంచకప్ - 2006లోనూ భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ విలువ దాదాపు 4500 కోట్ల రూపాయలని అంచనా.  ఇందులో సింహా భాగం డిజిటల్, లైవ్ టెలివిజన్ ప్రసార హక్కుల ద్వారా వచ్చేదే. 

భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ జరుగుతుండగా ప్రకటనలు ప్రసారం చేయాలంటే 10 సెకన్ల స్లాట్‌కు 25 నుంచి 40 లక్షల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. అలా ఒక్క మ్యాచ్ ద్వారా ప్రకటనల కింద దాదాపు 300 కోట్ల ఆదాయం రానుంది. టీ 20 ప్రపంచకప్‌లో ఏ ఇతర జట్ల మధ్య జరిగే మ్యాచ్ కూడా ఈ స్థాయిలో ఆదాయాన్ని అందించలేదు. ఒక్కో మ్యాచ్ విలువ సరాసరిగా 138 కోట్ల రూపాయలు మాత్రమే. ఇది భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌లో ప్రకటన ద్వారా వచ్చే ఆదాయంలో సగం కూడా దాటదంటే దాయాదుల పోరుకు క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

ఇప్పుడు ఇండియాతో జరిగే మ్యాచ్‌ను పాకిస్తాన్ బహిష్కకరించడం వల్ల ఈ ప్రకటనల కింద వచ్చే ఆదాయాన్ని బ్రాడ్‌కాస్టర్స్ కోల్పోనున్నారు. ఈ మ్యాచ్ ప్రభావం.. టోర్నీలోని మిగిలిన మ్యాచ్‌లపైనా బలంగా పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. తద్వారా బ్రాడ్‌కాస్టర్స్ దాదాపు 400 కోట్ల రూపాయలు కోల్పోతారని భావిస్తున్నారు. దీనిని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ భరిస్తుంది. అయితే సభ్యదేశాలకు పంచే ఆదాయంలో కోత విధిస్తుంది. ఈ ప్రభావం క్రికెట్‌ను శాసించే భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి దేశాలపై పడదు. కానీ చిన్నా చితకా జట్లకు ఐసీసీ ఆదాయమే జీవనాధారం అలాంటి దేశాలు పాకిస్తాన్ నిర్ణయం వల్ల తీవ్రంగా నష్టపోనున్నాయి.

అటు భారత్‌తో మ్యాచ్‌ను పాకిస్తాన్ బహిష్కరించడం వల్ల పాక్ క్రికెట్ మనుగడ ప్రశ్నార్ధకంగా మారనుంది. ఐసీసీ నుంచి ఏడాదికి పాక్ క్రికెట్ బోర్డ్ 34.51 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని అందుకుంటుంది. ఇప్పుడు భారత్‌తో మ్యాచ్ రద్దయితే ఆదాయంలో కోతతో పాటు ఐసీసీ నుంచి భారీ జరిమానాలు, ప్రసారకర్తల నుంచి లీగల్ సమస్యలు, అంతర్జాతీయ క్రీడాకారులు పాకిస్తాన్‌లో పాల్గొనే మ్యాచ్‌లకు ఎన్ఓసీ అందుకునే విషయంలో తీవ్ర ఇబ్బందులు తప్పవు. 

ఇక్కడితో ఇది ఆగదు.. క్రమశిక్షణ చర్యల కింద పాకిస్తాన్‌ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఐసీసీ సస్పెండ్ చేసే అవకాశం కూడా లేకపోలేదనే వార్తలు వస్తున్నాయి. త్వరలో ఐసీసీ సమావేశం జరగనుండగా.. ఈ భేటీలో పాకిస్తాన్‌పై చర్యలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌కు సమయం ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ తన నిర్ణయం పట్ల వెనక్కి తగ్గుతుందా? లేక కట్టుబడి ఉంటుందా? అన్నది చూడాలి. పీసీబీ నిర్ణయంపై క్రికెట్ ప్రేమికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 


ఘోర విమాన ప్రమాదం... మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం

 


బుధవారం మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. ఈ వార్తతో మహారాష్ట్రతో పాటు యావత్ దేశం ఉలిక్కిపడింది. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం బుధవారం ముంబై నుంచి బారామతి వెళ్తుండగా విమానం కుప్పకూలినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌ సహా ఐదుగురు దుర్మరణం పాలైనట్లుగా తెలుస్తోంది. వీరిలో ఇద్దరు పైలట్స్, ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

అజిత్ పవార్ ప్రస్థానం:

1959 జూలై 22న మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా దేయ్‌లాలీ ప్రవరలో జన్మించారు అజిత్ పవార్. ఆయన తండ్రి అనంతరావ్ పవార్. ఈయన ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కి స్వయాన అన్నయ్య. చదువు పూర్తి చేసిన తర్వాత రాజకీయాలపై ఆసక్తితో బాబాయ్ శరద్ పవార్ శిష్యరికంలో అడుగులువ వేశారు అజిత్. 1982లో తొలిసారిగా కార్పోరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డ్‌కు ఎన్నికయ్యారు. అనంతరం మహారాష్ట్రలో బలమైన సహకార సంఘాలపై పట్టు సాధించిన పవార్.. 16 ఏళ్ల పాటు పుణె జిల్లా కేంద్ర సహకార కో ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్‌గా వ్యవహరించారు.

1991లో తొలిసారిగా తన కుటుంబ రాజకీయాలకు కేంద్రంగా ఉన్న బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ దశలో శరద్ పవార్ కేంద్రంలో చక్రం తిప్పేందుకు వీలుగా బాబాయ్ కోసం ఆ సీటును త్యాగం చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు 1991లో బారామతి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి తొలిసారిగా మహారాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ నియోజకవర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత అజిత్ పవార్ సొంతం. 

పలుమార్లు మంత్రిగా పనిచేసిన అజిత్ పవార్... ముఖ్యంగా ఆర్ధిక శాఖపై బలమైన ముద్ర వేశారు. పలుమార్లు బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటు మహారాష్ట్రకు పాలసీలు రూపొందించారు. బాబాయ్ శరద్ పవార్‌కు కుడిభుజంగా ఉంటూ మహారాష్ట్ర రాజకీయాలను శాసించారు. అయితే గత మహారాష్ట్ర ఎన్నికలకు ముందు బాబాయ్ శరద్ పవార్‌పై తిరుగుబాటు చేసి ఎన్సీపీలో చీలిక తీసుకొచ్చారు. తన వర్గం ఎమ్మెల్యేలతో ఎన్డీఏలో చేరి వ్యూహాత్మకంగా పార్టీని, ఎన్సీపీ గుర్తును సొంతం చేసుకున్నారు. అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా.. ఆర్ధిక, ప్రణాళిక, క్రీడలు, మైనారిటీ వ్యవహారాల శాఖలను నిర్వహిస్తున్నారు. గతంలోనూ పలువురు ముఖ్యమంత్రులకు డిప్యూటీ సీఎంగా వ్యవహరించి.. మహారాష్ట్రలో అత్యధిక కాలం డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఘనత దక్కించుకున్నారు అజిత్ పవార్.

మహారాష్ట్రలో పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పక్షాల్లోనూ అజిత్ పవార్‌కు సన్నిహితులు ఉన్నారు. రాజకీయ, సినీ, వ్యాపార, తదితర రంగాల ప్రముఖులతోనూ ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రవేయడంతో పాటు భవిష్యత్‌లో సీఎం అవుతారని అంతా భావిస్తున్న వేళ అజిత్ పవార్ విమాన ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో రాష్ట్ర ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అజిత్ పవార్ హఠాన్మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ తదితరులు సంతాపం తెలియజేస్తున్నారు. 

300 కోట్లకు అడుగు దూరంలో మెగాస్టార్.. మన శంకర వరప్రసాద్ గారుతో చిరంజీవి రికార్డ్‌లు చూశారా?


అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ చిత్రం.. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మెగా అభిమానులు అసలు సిసలు సంక్రాంతిని తెచ్చింది. మెగాస్టార్ నుంచి తాము ఏళ్లుగా మిస్ అయిన.. తాము చిరంజీవిని ఎలా చూడాలని అనుకుంటున్నామో నాటి వింటేజ్ హీరోని అభిమానుల ముందు ప్రెజెంట్ చేశారు అనిల్ రావిపూడి. చిరంజీవికి తోడు వెంకటేష్ అల్లరితో మన శంకర వరప్రసాద్ మూవీ భారీ కలెక్షన్స్ సాధిస్తోంది. విడుదలై వారం దాటిపోయిన నేపథ్యంలో చిరంజీవి ఫస్ట్ వీక్ ఎన్ని కోట్ల కలెక్షన్స్ వసూలు చేశారు అనేది ఆసక్తిగా మారింది.

సాక్‌నిక్ వెబ్‌సైట్ వెల్లడించిన లెక్కల ప్రకారం మనశంకర వరప్రసాద్ గారు మూవీ భారతదేశంలో తొలివారం 158 కోట్ల రూపాయల నికర కలెక్షన్స్... 188 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు సాక్‌నిక్ చెప్పింది. మెగాస్టార్ మూవీ ఇప్పటికే  నార్త్ అమెరికాలో 2.5 మిలియన్ డాలర్లు రాబట్టగా.. త్వరలోనే 3 మిలియన్ డాలర్లు (27 కోట్ల రూపాయలు) మైలురాయిని చేరుకోనుంది. మన శంకర వరప్రసాద్ గారు మూవీ ఫస్ట్ వీక్‌లో 292  కోట్లు వసూలు చేసినట్లు షైన్ క్రియేషన్స్‌ అధికారికంగా ప్రకటించింది. సోమవారం నాటి కలెక్షన్స్‌తో ఈ సినిమా 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తద్వారా మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో తొలి 300 కోట్ల రూపాయల సినిమాగా మన శంకర వరప్రసాద్ గారు మూవీ నిలవనుంది. 

టాలీవుడ్‌కు నాలుగు దశాబ్ధాలుగా నాలుగు స్తంభాల్లా నిలిచిన నలుగురు  అగ్ర కథానాయకుల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత 300 కోట్ల కలెక్షన్స్ సాధించిన హీరోగా చిరంజీవి నిలవనున్నారు. అలాగే వరుసగా రెండు సంక్రాంతులకు రెండు 300 కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్‌గా అనిల్ రావిపూడి అరుదైన రికార్డుకు అడుగు దూరంలో నిలిచారు. అలాగే మొదటి వారంలో 292 కోట్ల రూపాయలు వసూలు చేసిన తొలి రీజనల్ మూవీగా మన శంకర వరప్రసాద్ నిలిచింది. దానితో పాటు విడుదలైన ఏడో రోజు 30 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాగా శంకర వరప్రసాద్ కొత్త చరిత్ర సృష్టించాడు. 

అంతేకాదు.. ప్రాంతీయ చిత్రాల విభాగంలో అత్యంత వేగంగా బుక్ మై షోలో 3 మిలియన్లకు పైగా టికెట్స్ బుక్ చేసిన సినిమాగా నిలిచింది. కృష్ణా జిల్లాలో తొలి వారం అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ 5 చిత్రాలలో మన శంకర వరప్రసాద్ గారు (7.63 కోట్ల  రూపాయలు) 4వ స్థానంలో నిలిచినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ జాబితాలో ఆర్ఆర్ఆర్ (10.70 కోట్ల రూపాయలు) అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత పుష్ప 2 (8.49 కోట్ల రూపాయలు), బాహుబలి 2 (8.35 కోట్ల రూపాయలు), కల్కి 2898 ఏడీ (7.02 కోట్ల రూపాయలు)తో నిలిచాయి. 


ఇరాన్‌పై ట్రంప్ దూకుడు... మరో భారీ ఆపరేషన్‌కు ఇండియా రెడీ?

 


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుతో ప్రపంచం వణికిపోతోంది. కొద్దిరోజుల క్రితం వెనిజులా అధ్యక్షుడు, అతని భార్యను అరెస్ట్ చేసి రాత్రికి రాత్రి న్యూయార్క్ తరలించి ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేశారు ట్రంప్. అక్కడితో ఆగకుండా తానే వెనిజులాకు తాత్కాలిక అధ్యక్షుడినని ప్రకటించారు. అమెరికా భద్రత, డ్రగ్స్ నిర్మూలన‌కే ఈ సైనిక చర్య చేపట్టినట్లు ట్రంప్ చెబుతున్నప్పటికీ.. వెనిజులాలోని చమురు, పెట్రోల్ వనరులపై ఆధిపత్యం కోసమే అగ్రరాజ్యం ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ కన్ను

వెనిజులాపై సైనిక చర్యను మరిచిపోకముందే ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ఆయన పావులు కదుపుతున్నారు. అమెరికా జాతీయ భద్రత దృష్ట్యా గ్రీన్‌లాండ్ తమకే దక్కాలని.. ఇందుకు నాటో దేశాలు చొరవ చూపాలని లేదంటే రష్యా, చైనాలు దానిని ఆక్రమించుకుంటాయని ట్రంప్ చెబుతున్నారు. అయితే తోటి నాటో దేశం ఆధీనంలో ఉన్న గ్రీన్‌లాండ్‌పై సైనిక చర్యను ఆ కూటమిలోని దేశాలతో పాటు అంతర్జాతీయ సమాజం వ్యతిరేకిస్తోంది. ఈ వివాదం ముదురుతున్న దశలోనే ఇరాన్‌లో అక్కడి ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేయడం, నిరసనలను అణిచివేసేందుకు ఇరాన్ పెద్దలు కఠినంగా వ్యవహరిస్తుండటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ అయ్యారు.

ఇరాన్ నిరసనలకు ట్రంప్ మద్ధతు

ఇరాన్‌లో నిరసనకారులకు ఆయన బహిరంగంగా మద్ధతు పలకడంతో పాటు నిరసనలను ఖండించారు. ఇరాన్ ప్రజలకు అమెరికా అండగా ఉంటుందని.. నిరసనలు ఆపొద్దని సోషలో మీడియాలో పేర్కొన్నారు. ఆందోళనలను అణిచివేసే క్రమంలో మానవత్వంతో వ్యవహరించాలని లేనిపక్షంలో ఇరాన్‌ భారీ మూల్యం చెల్లించక తప్పదని ట్రంప్ హెచ్చరించారు. అయితే అగ్రరాజ్యాధినేత ఈ స్థాయిలో వార్నింగ్ ఇచ్చినా ఇరాన్ ఏమాత్రం తగ్గడం లేదు. అరెస్ట్ చేసిన ఆందోళనకారులకు మరణశిక్ష సహా కఠినమైన శిక్షలను విధించాలని అక్కడి ప్రభుత్వం పెద్దలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు

ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా ఏ క్షణామైనా ఇరాన్‌పై విరుచుకుపడే అవకాశాలు ఉండటంతో గల్ఫ్, పశ్చిమాసియా దేశాలలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్‌పై సైనిక చర్యకు ట్రంప్ నిర్ణయించినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనికి తగినట్లుగానే అగ్రరాజ్యం.. తనకు గల్ఫ్, పశ్చిమాసియా దేశాలలో ఉన్న సైనిక స్థావరాలను అప్రమత్తం చేయడంతో పాటు ఆయుధ సంపత్తిని భారీగా మొహరిస్తోంది. అలాగే అమెరికాకు దాని మిత్రపక్షాల నుంచి కూడా సంపూర్ణ సహకారం లభిస్తోంది. అటు ఇజ్రాయెల్ కూడా మరోవైపు నుంచి ఇరాన్‌ను కమ్మేయడం ఖాయంగా కనిపిస్తుండటంతో ఇరాన్‌లో రాగల 24 గంటల్లో ఏం జరుగుతుందోనని అంతర్జాతీయ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

ప్రపంచ దేశాలు అలర్ట్

ఇరాన్‌లో పరిస్ధితుల నేపథ్యంలో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. తమ పౌరులు తక్షణం ఇరాన్ విడిచి వచ్చేయడంతో పాటు ఆ దేశానికి విమాన సర్వీసులను సైతం నిలిపివేశాయి. అటు భారతదేశం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే పలుమార్లు అడ్వైజరీలను జారీ చేయగా.. తాజాగా పలు మార్గాల్లో భారతీయులు ఇరాన్‌ను వీడాలని కేంద్ర విదేశాంగ శాఖ సూచించింది. అలాగే ఇరాన్ నుంచి భారతీయులను క్షేమంగా స్వదేశానికి తిరిగి తీసుకురావడానికి భారీ ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇరాన్‌లో 10 వేలమంది భారతీయులు

విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం ఇరాన్ వ్యాప్తంగా దాదాపు 10 వేలమంది భారతీయులు ఉన్నట్లుగా అంచనా. ఇంటర్నెట్ సేవలు, రవాణా సేవలు స్తంభించిపోవడంతో వీరి తరలింపులో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ అన్ని రకాల మార్గాల ద్వారా భారతీయులను స్వదేశానికి తరలించేలా కేంద్రం కట్టుదిట్టమైనప ఏర్పాట్లు చేస్తోంది. అయితే భారతదేశానికి ఇలాంటి ఆపరేషన్లు వెన్నతో పెట్టిన విద్య. ఈ తరహా ఆపరేషన్లు నిర్వహించడం కొత్త కూడా కాదు.. కరోనా, లాక్‌డౌన్ సమయంలో వందే భారత్ మిషన్ ద్వారా ప్రపంచం మునుపెన్నడూ చూడని తరలింపు ప్రక్రియ చేపట్టింది ఇండియా.  వివిధ దేశాలలో చిక్కుకుపోయిన దాదాపు 1.83 కోట్ల మంది భారతీయులను స్వదేశానికి క్షేమంగా తీసుకొచ్చి చరిత్ర సృష్టించింది.

భారీ ఆపరేషన్‌కు ఇండియా రెడీ?

2022లో రష్యా - ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకురావడానికి గాను భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగా పేరుతో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఉక్రెయిన్ నుంచి రొమానియా, హంగరీ, పోలాండ్, స్లోవాకియా దేశాల మీదుగా 22500 మంది భారతీయులను స్వదేశానికి తరలించింది ఇండియా. ఇక గతేడాది ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధ సమయంలో ఆపరేషన్ సింధు చేపట్టిన భారతదేశం.. ఇజ్రాయెల్, ఇరాన్‌లలో ఉన్న దాదాపు 4,429 మంది భారతీయులను క్షేమంగా స్వదేశానికి తరలించింది. ఇప్పుడు ఇరాన్‌లో యుద్ధ వాతావరణం నేపథ్యంలో మరోసారి భారతదేశం భారీ ఆపరేషన్‌కు సిద్ధమైనట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే భారత విదేశాంగ శాఖ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడాల్సిందే.