హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. ఏపీ వాసులకి చల్లని కబురు

 


హైదరాబాద్‌లో మంగళవారం భారీ వర్షం కురిసింది. సాయంత్రం చిరు జల్లులతో ప్రారంభమై రాత్రి  9 గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, మియాపూర్, చందానగర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, షాపూర్, చింతల్‌లో భారీ వర్షం కురిసింది. దాంతో సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్లకు బయల్దేరిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం తగ్గే వరకు మెట్రో పిల్లర్ల కింద వాహనదారులు బారులు తీరారు. 

రోడ్లపైకి వర్షపు నీరు పోటెత్తి, మోకాలి లోతులో వరద నీరు ప్రవహించింది. యూసుఫ్‌గూడ, శ్రీకృష్ణనగర్ ఏరియాలలో భారీగా నీరు రోడ్ల మీదకు దూసుకొచ్చి కాలనీలను  ముంచెత్తింది. ఈ ప్రవాహంలో పలు వాహనాలు కొట్టుకుపోయాయి. చాలా ఏరియాలలో భారీ ట్రాఫిక్ జాంలు చోటు చేసుకోవడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. రంగంలోకి దిగిన జీహెఎంసీ, హైడ్రా, పోలీస్, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. వేసవి కారణంగా గత కొంతకాలంగా ఎండ వేడి, ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ నగర ప్రజలు తాజా వర్షంతో కాస్త సేదతీరారు. 

మరోవైపు.. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోఫి కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. రాగల 72 గంటల్లో ఏపీలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, పశ్చిమ గోదావరి, ఏలూరు, తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 


మగాళ్లకు ఫ్రీ బస్సు.. ఉచితంగా ఫ్రిజ్.. అన్నాడీఎంకే హామీలు విన్నారా?

 


త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. డీఎంకేకు చెక్ పెట్టి ఈసారి అధికారాన్ని అందుకోవాలని అన్నాడీఎంకే.. రెండోసారి కూడా పవర్‌ని కంటిన్యూ చేయాలని డీఎంకే గట్టి పట్టుదలతో ఉన్నాయి. ఇక డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా ఎదిగే లక్ష్యంతో కోలీవుడ్ సూపర్‌స్టార్ దళపతి విజయ్ తన టీవీకేతో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 

తమిళనాడు ఎన్నికలు అంటేనే భారీగా ఉంటాయని దేశంలో పేరు. ఓటర్లను ఆకర్షించడానికి అనేక ఆఫర్లను, హామీలను, పథకాలను ఆయా పార్టీలు పోటీపడుతుంటాయి. ఈసారి కూడా ప్రజలకు భారీ హామీలతో పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి. దీనిలో భాగంగా అన్నాడీఎంకే పలు ప్రజాకర్షక పథకాలతో ముందుకొచ్చింది. రాష్ట్రంలో అన్నాడీఎంకే సారథ్యంలోని ఎన్డీయే కూటమిలో బీజేపీ, పీఎంకే, ఏఎంఎంకే, టీఎంసీ(ఎం), పీబీకే, పీబీకే, పీడీకేలు ఒక కూటమిగా ఉన్నాయి. సోమవారం ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపిణీ పూర్తయ్యింది. 

234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి మార్చి 30న అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి 30 నుంచి ఏప్రిల్ 6 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 9. రాష్ట్రంలోని అన్ని స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ పేర్కొంది. మే 4న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటించనున్నారు. 

అభ్యర్థల ఎంపిక, సీట్ల పంపిణీ, పొత్తులు ఖరారు కావడంతో తమిళనాడులో ఎన్డీయే కూటమి ప్రచారంపై ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏఐఏడీఎంకే పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. కనివినీ ఎరుగని హామీలతో అన్నాడీఎంకే షాకిచ్చింది. 

ఏఐఏడీఎంకే మేనిఫెస్టో- 2026

  • రేషన్ కార్డ్ కలిగిన కుటుంబాలకు ఉచిత ఫ్రిజ్‌లు
  • మహిళలతో సమానంగా పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం
  • 25 వేల సబ్సిడీతో రాష్ట్రంలోని 5 లక్షల మంది మహిళా ఉద్యోగులకు ద్విచక్ర వాహనాల పంపిణీ
  • బ్యాంకుల్లో తీసుకున్న విద్యా రుణాలు మాఫీ
  • రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 10 వేల రూపాయల ఆర్ధిక సాయం
  • రేషన్ కార్డ్  ఉన్న వారికి నెలవారి  కోటా కింద బియ్యంతో పాటు ఉచితంగా కేజీ కందిపప్పు, కేజీ మంచి నూనె
  • రాష్ట్రంలోని కుటుంబాలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు
  • ఫించను మొత్తం 2 వేల రూపాయలకు పెంపు
  • జల్లికట్లు ఆటలో పాల్గొనే వారి కుటుంబాలకు 10 లక్షల ఆర్ధిక సాయం


తమిళనాడులో ఎన్డీయే సీట్ల పంపకం పూర్తి... ఒంటరిగా మిగిలిన దళపతి విజయ్

 


అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యలో తమిళనాడులో రాజకీయ పార్టీలు పొత్తులు, సీట్ల పంపకంలో తలమునకలై ఉన్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలతో పాటు ఈసారి అదృష్టం పరీక్షించుకోనున్న కోలీవుడ్ సూపర్‌స్టార్ దళపతి విజయ్‌కి చెందిన  తమిళగ వెట్రి కళగంపైనే అందరిచూపు నెలకొంది. కాంగ్రెస్, బీజేపీలు విజయ్‌ని పొత్తుల్లోకి తీసుకురావాలని ప్రయత్నించినప్పటికీ.. ఆయన ససేమిరా అనడంతో రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా అన్నాడీఎంకే - బీజేపీ కూటమి సీట్ల పంపకాలను పూర్తి చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ఎన్నికలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. 15 ఏళ్లుగా బెంగాల్‌ను ఏలుతున్న మమతా బెనర్జీ ఈసారి కూడా పట్టు నిలుపుకుంటారా? లేక బీజేపీకి అధికారాన్ని అప్పగిస్తారా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇక దక్షిణాదిన పెద్ద రాష్ట్రంగా ఉన్న తమిళనాడు మరింత ఆసక్తికిని రేపుతోంది.

234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి మార్చి 30న అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 6 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 9. అన్ని స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే రోజున ఎన్నికలు జరగనున్నాయి, మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. 

తమిళనాడు ఎన్నికల్లో కాంగ్రెస్, డీఎంకే, లెఫ్ట్ పార్టీలు, వీసీకే, ఎండీఎంకే, ఐయూఎంఎల్, ఎంఎంకే, కేఎండీకే, ఎంఎన్ఎం, డీఎండీకే ఒక కూటమిగా ఉన్నాయి. అన్నాడీఎంకే సారథ్యంలోని ఎన్డీయే కూటమిలో బీజేపీ, పీఎంకే, ఏఎంఎంకే, టీఎంసీ(ఎం), పీబీకే, పీబీకే, పీడీకేలు ఒక కూటమిగా ఉన్నాయి. పీఎంకే(ఆర్), ఏఐపీటీఎంఎంకేలు మరో కూటమిగా బరిలో నిలిచాయి. దళపతి విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ కూడా తమ అదృష్టం పరీక్షించుకుంటున్నాయి.

తాజాగా ఎన్డీయే కూటమిలో ఎన్నికల్లో పొత్తులు ముగిశాయి. చెన్నైలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో జరిగిన భేటీలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామి, బీజేపీ తరపున కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్, పీఎంకే చీఫ్ అన్బుమణి రామదాస్, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకర్‌లు పాల్గొన్నారు. పొత్తుల్లో భాగంగా తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు గాను 27 స్థానాల్లో బీజేపీ, 18 చోట్ల పీఎంకే, ఏఎంఎంకేకు 11 సీట్లు కేటాయించగా.. మిగిలిన 170 స్థానాల్లో అన్నాడీఎంకే పోటీ చేయనుంది. 

మరోవైపు.. డీఎంకే అధినేత, సీఎం ఎంకే స్టాలిన్ కూడా ఏవో కొన్ని స్థానాలకు తప్పించి చాలా వరకు తమ మిత్రపక్షాలకు సీట్లు కేటాయించారు. అయితే ప్రస్తుతం అందరిచూపు కోలీవుడ్ సూపర్‌స్టార్ దళపతి విజయ్‌పైనే ఉంది. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన ఆయన సీట్ల కేటాయింపు ఎలా చేస్తారు? ఎవరికి సీట్లు కేటాయిస్తారనేది ఆసక్తిగా మారింది. విజయ్‌ని ఎన్డీయే కూటమిలోకి తీసుకురావడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నించింది. 80 సీట్లు, డిప్యూటీ సీఎం పదవి కూడా ఆఫర్ చేసింది. అయితే టీవీకే నుంచి సానుకూల స్పందన రాలేదు.

ఈరోజు తమిళనాడులో ఎన్డీయే కూటమి పొత్తులు, సీట్లు ఖరారు చేయడంతో విజయ్ ఒంటరిగానే బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. అయితే క్షేత్రస్థాయిలో అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ దళపతికి కత్తిమీద సాములా తయారైంది. ఆర్ధిక, రాజకీయ సమీకరణలు, ఇతర అంశాలు విజయ్‌కి ఏమాత్రం మింగుడు పడటం లేదు. అభ్యర్ధులుగా పోటీ చేసేవారు కనీసం 5 కోట్ల రూపాయల ఖర్చును భరించగలిగే స్థోమత ఉంటేనే టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉందంటూ టీవీకే అంతర్గత చర్చలు బయటకు రావడం వివాదాస్పదమైంది. 

తమిళ రాజకీయ దిగ్గజాలు డీఎంకే, అన్నాడీఎంకేల అంగబలం, అర్ధబలాన్ని ఎదురొడ్డి నిలబడటం అంత తేలిక కాదని టీవీకే అధినేతతో పాటు ఆ పార్టీ కేడర్‌కు తెలియనది కాదు. వారితో పోటీపడాలంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉండటంతో గెలిచే స్థానాలు తప్పించి, రిస్క్ ఉన్న చోట ధైర్యం చేసేందుకు టీవీకే ఆశావహులు సిద్ధంగా లేరన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

టీవీకే టికెట్ల కోసం మొదట 10 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ ఈ సంఖ్య 7 వేలకు పడిపోయిందని వార్తలు వస్తున్నాయి. దాంతో అసలు రాష్ట్రంలోని 234 స్థానాలకు విజయ్ తన అభ్యర్ధులను నిలబెడతారా? లేక బలమున్న చోటే బరిలో దిగుతారా అన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి అనిశ్చితి వేళ దళపతి తన టీవీకేను ఎలా ఎన్నికలకు సిద్ధం చేస్తారనేది ఆసక్తిగా మారింది. 


సిద్ధిపేటపై రేవంత్ కన్ను... హరీష్‌‌రావును గెలవడం అంత ఈజీయా?

 


సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో పర్యటన సందర్భంగా తెలంగాణ  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సిద్ధిపేటలో ఎమ్మెల్యేగా గెలిచిన వారికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానని ఆయన బహిరంగంగా ప్రకటించడం ఈ పొలిటికల్ హీట్‌కు కారణం. రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా సిద్ధిపేటలో గెలిచినవారికి మంత్రి పదవి విషయాన్ని పక్కనపెడితే.. అసలు గెలిచే వ్యక్తి ఎవరు? అసలు సిద్ధిపేటలో గెలవడం అంత ఆషామాషీ కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గం.. కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఎంట్రీతో కల్వకుంట్ల కుటుంబానికి అడ్డాగా మారింది. 1985 నుంచి నేటి వరకు దాదాపు 40 ఏళ్లుగా కేసీఆర్ కుటుంబ సభ్యులే ఇక్కడి నుంచి గెలుస్తున్నారంటే సిద్ధిపేటలో పరిస్ధితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 1985, 89, 94, 99 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున కేసీఆర్ వరుసగా గెలిచారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలోకి దూకిన కేసీఆర్.. టీడీపీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి విజయం సాదించారు. 

2004లో ఎంపీగా పోటీ చేసిన కేసీఆర్.. యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా అవకాశం దక్కడంతో సిద్ధిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తనకు బదులుగా తన మేనల్లుడు తన్నీరు హరీష్‌రావుని ఉప ఎన్నిక బరిలో నిలబెట్టి గెలిపించారు కేసీఆర్. నాటి నుంచి సిద్ధిపేటలో హరీశ్‌రావు శకం మొదలైంది. 2009 అసెంబ్లీ ఎన్నికలు, 2010 ఉపఎన్నిక, 2014, 2018, 2023 ఎన్నికల్లో హరీష్‌రావు వరుస విజయాలు సాధించి డబుల్ హ్యాట్రిక్ అందుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ కేబినెట్‌లలో హరీష్‌రావుగా మంత్రిగా పనిచేశారు.

అధికారంలో ఉన్నా లేకున్నా సిద్ధిపేట అభివృద్ధిపై హరీష్‌రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రత్యేక జిల్లా చేయడం దగ్గరి నుంచి, తాగునీరు, పక్కా రోడ్లు, డ్రైనేజీ, సుందరీకరణ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మాస్ లీడర్‌గా ఎదిగారు. హరీష్‌రావు అంటే సిద్ధిపేట.. సిద్ధిపేట అంటే హరీష్‌రావు అన్నంతగా గుర్తింపు తెచ్చుకున్నారు. 

సిద్ధిపేట పట్టణంతో పాటు నియోజకవర్గంలోని ప్రతి వార్డ్‌లో ఆయనకు మద్ధతుదారులు, సానుభూతిపరులు, అభిమాన గణం ఉంది. ఎన్నిక ఏదైనా సరే.. ఎప్పుడొచ్చినా  సరే.. హరీష్‌రావుదే విజయమని ప్రత్యర్ధులు సైతం ఒప్పుకుంటారు. అలాంటి సిద్ధిపేటలో హరీష్‌ను కాదని వేరే పార్టీ జెండా ఎగరడం అసాధ్యమని స్థానికులు చెబుతున్నారు.

సిద్ధిపేటలో హరీష్‌ను ఢీకొనే స్థాయి నేతలు లేరు. ప్రధాన రాజకీయ పార్టీలకు ఇక్కడ బలమైన నేతలు లేరు. కాంగ్రెస్, బీజేపీలకు సరైన నేతలు, అభ్యర్ధులు లేరు. దీనికి తోడు బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్‌గా, చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న హరీష్‌రావు వ్యూహాల ముందు మరో నేత నిలబడగలరా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే దశాబ్ధాల బీఆర్ఎస్ కంచుకోటను బద్ధలు కొడతామని, సిద్ధిపేటలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. 

సిద్ధిపేటలో అభివృద్ది కార్యక్రమాలతో పాటు కేడర్ బలోపేతంపై సీఎం దృష్టి సారించారు. ఎన్నికలకు రెండేళ్లకు పైగా సమయం ఉండటంతో దీర్ఘకాలిక వ్యూహాన్ని రచిస్తున్నారు రేవంత్ రెడ్డి. సిద్ధిపేట కంచుకోటను బద్ధలు  కొట్టేందుకు సీఎం స్థాయి వ్యక్తి బరిలో దిగడంతో పాటు దశాబ్థాల  తన ఉనికిని కాపాడుకునేందుకు హరీష్‌రావు వ్యూహాల నేపథ్యంలో 2029 సిద్ధిపేట ఎన్నికల సమరం రసవత్తరంగా సాగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 


నన్ను మీ సినిమాల్లో పెట్టుకోండి... డాక్టర్ రాజశేఖర్ ఆవేదన

 


ఎవరు ఏమనుకున్నా చిత్ర పరిశ్రమ సక్సెస్ వెంట పరిగెత్తుతుందనేది కాదనలేని వాస్తవం. ఎన్ని కష్టాలు ఎదురైనా, అవమానాలు ఎదుర్కొన్నా... మధ్యలో ఆగిపోకుండా చివరి వరకు పోరాడే వాడే ఇక్కడ నిలబడగలుగుతాడు. ఈ రన్నింగ్ రేసులో పరిగెత్తలేక మధ్యలోనే ఆగిపోయిన వారు బ్లాక్ అండ్ వైట్ ఎరా నుంచి నేటి వరకు ఎందరో. తమ ముందుతరాల వారి జీవితాలను దగ్గరి నుంచి చూసిన కొందరు నటులు మాత్రమే చివరి వరకు నటిస్తూ తమకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు.

హీరోలుగా చేసినవారు హీరోలుగానే చేయాలనే గిరి గీసుకుని కూర్చొంటే బండి నడవటం ఎంతో కష్టమని ఎన్నో ఉదాహరణలు. హీరోలుగా వైభవాన్ని చూసినవారు ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్‌లుగా నటిస్తున్నారు. జగపతి బాబు, శ్రీకాంత్ తదితర నటులు ఫ్యామిలీ హీరోలుగా వెలుగొంది... ఒక స్టేజ్ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. ముఖ్యంగా జగపతి బాబు కాలానికి తగినట్లుగా తనను తాను మార్చుకున్నారు. పవర్ ఫుల్ విలన్‌గా, స్టైలీష్ ఫాదర్‌గా మెప్పిస్తూ దక్షిణాదిలో డిమాండ్ ఉన్న నటుడిగా నిలిచారు. 

తెలుగునాట యాంగ్రి యంగ్‌మెన్‌గా చరిత్ర సృష్టించి పవర్‌ఫుల్ పాత్రలకు కేరాఫ్‌గా నిలిచారు డాక్టర్ రాజశేఖర్. తమిళ నటుడే అయినా తెలుగు ప్రజలు ఆయన్ను ఆదరించారు. వందేమాతరం, ప్రతిఘటన, అంకుశం, మగాడు, తలంబ్రాలు, అల్లరి ప్రియుడు, మా అన్నయ్య, మనసున్న మారాజు, సింహరాశి, ఎవడైతే నాకేంటీ తదితర చిత్రాలతో స్టార్ హీరో అనిపించుకున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్స్ తర్వాత టాలీవుడ్‌లో అంతటి ఫాలోయింగ్ ఉన్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు రాజశేఖర్. 

అయితే ఇదంతా గతం.. ఇప్పుడు రాజశేఖర్‌ను పట్టించుకునేవారు లేరు. ఆయన హిట్ కొట్టి చాలాకాలమే అయ్యింది. ఆపరేషన్ గరుడ వేగతో తిరిగి పూర్వ వైభవం అందుకున్నట్లు కనిపించినా...  తర్వాత తీసిన కల్కి, అర్జున, దెయ్యం, శేఖర్, ఎక్స్‌ట్రార్డినరి మ్యాన్ చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ఆ తర్వాత అనారోగ్య సమస్యలు, ఇతర కారణాలతో రాజశేఖర్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం యంగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న బైకర్‌లో కీలకపాత్రలో పోషిస్తున్నారు రాజశేఖర్. 

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటిలు బైకర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 3న ఈ సినిమా విడుదల కానుంది. స్పోర్ట్స్  బ్యాక్‌గ్రౌండ్‌లో తెరకెక్కుతోన్న బైకర్‌లో శర్వానంద్ రేసర్‌గా కనిసిస్తున్నారు. ఆయనకు తండ్రిగా రాజశేఖర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో రాజశేఖర్ ఉద్వేగంగా ప్రసంగించారు.

ఈ సినిమా ఒప్పుకోవడానికి ముందు హీరోగానే  కాకుండా క్యారెక్టర్ రోల్స్ కూడా చేయాలని నిర్ణయించుకున్నా. అందరూ కథలు చెబుతున్నా.. నాకు సరైన సబ్జెక్ట్ రాలేదు. రెండేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత అభిలాష్ గారు ఈ సబ్జెక్ట్ చెప్పారు. ఈ కథ చాలా బాగా నచ్చింది.. శర్వానంద్ గారి సినిమాలో సెకండ్ హీరోగా అనుకున్నాను. కానీ తర్వాత నేను, జీవిత, నా పిల్లలు అందరం కలిసి మాట్లాడుకున్నాం.. మీరు చేయాలని అనుకుంటున్నారు, అలాగే ఉంటుంది కానీ చేయండని చెప్పి ఒప్పించారు. ఇటీవల సినిమాకు వెళ్లినప్పుడు మిమ్మల్ని తెరపై చూసి చాలాకాలం అయ్యింది.. మీ సినిమా ఎప్పుడు వస్తుందని అడిగారు. నెక్ట్స్ బైకర్ వస్తుంది.. నా సినిమా చూడండి అని చెప్పా. 

అందరూ శర్వానంద్ గారి సినిమానా? అని అడగటంతో కొంత ఇబ్బందిపడ్డా.. ఇదంతా నాకు కొత్తగా ఉన్నా, దిల్‌రాజు గారు, బన్నీవాసు గారు మాట్లాడటం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఓ పక్క సెకండ్ లెవల్‌కి వెళ్లిపోయామే అనిపిస్తుంది.. మా అమ్మాయిలు ఒకటే అన్నారు, ఇంతకుముందు అలా ఉండేది, కానీ ఇప్పుడు అలా లేదని అందరూ ఒకటే. సెకండ్ లెవల్, థర్డ్ లెవల్ అని అనుకోవద్దని చెప్పడంతో అడ్జెస్ట్ అయిపోయా. ఎక్కువ సినిమాల్లో నన్ను పెట్టుకోండి.. మంచి క్యారెక్టర్స్ ఉంటే ఇవ్వండి. శర్వానంద్ గారు చాలా స్వీట్ పర్సన్. నిర్మాతలతో పాటు శర్వానంద్ గారు కూడా నన్ను హీరోగానే చూసుకున్నారు అని డాక్టర్ రాజశేఖర్ ఎమోషనల్ అయ్యారు. 


ఉస్తాద్ భగత్ సింగ్ బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? పవన్ మూవీకి ఎన్ని కోట్లు రావాలంటే?

 


ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి 19న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకురానుంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటిస్తోన్న ధురంధర్ 2 మూవీ రిలీజ్ కూడా ఇదే రోజు ఉండటంతో రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్ నడుస్తోంది. 

ఓజీ తర్వాత పవన్ నటించిన సినిమా కావడంతో పాటు గబ్బర్ సింగ్ (2012) విడుదలైన 14 ఏళ్ల తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. ముందుగా ఉస్తాద్‌ను మార్చి 26న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ యష్ నటించిన టాక్సిక్ సినిమా విడుదల వాయిదాపడటంతో ఉస్తాద్ ఒక వారం ముందుకు జరిగి మార్చి 19న విడుదల అవుతోంది. 

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నెనీ, యలమంచిలి రవిశంకర్‌లు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను 150 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. రాశీ ఖన్నా, శ్రీలీలు హీరోయిన్లుగా నటించారు. తమిళ నటుడు పార్ధిబన్, అశుతోష్ రాణా, నవాబ్ షా, రాజీవ్ కనకాల, పోసాని కృష్ణమురళి, గౌతమి, చమ్మక్ చంద్ర, రావు రమేశ్‌లు ఇతర పాత్రలు పోషించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం, థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. అయనాంక బోస్ సినిమాటోగ్రఫి, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్‌గా పనిచేశారు. 

ఉస్తాద్ భగత్ సింగ్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను తొలుత అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకోగా... లాస్ట్ మినిట్‌లో నెట్‌ఫ్లిక్స్ చేతికి ఇవి చిక్కాయి. ఉస్తాద్ భగత్ సింగ్ నైజాం థియేట్రికల్ రైట్స్ 46 కోట్ల రూపాయలు, సీడెడ్ థియేట్రికల్ రైట్స్ 15 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్ర థియేట్రికల్ రైట్స్ 13 కోట్ల రూపాయలు, కృష్ణా థియేట్రికల్ రైట్స్ 8 కోట్ల రూపాయలు, నెల్లూరు థియేట్రికల్ రైట్స్ 4.50 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరి థియేట్రికల్ రైట్స్ 9.50 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరి థియేట్రికల్ రైట్స్ 7.50 కోట్ల రూపాయలు, గుంటూరు థియేట్రికల్ రైట్స్ 9.50 కోట్ల రూపాయలు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా 7 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ 12 కోట్ల రూపాయలు కింద వరల్డ్ వైడ్‌గా 132 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. పవన్ కళ్యాణ్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 133 కోట్ల రూపాయల షేర్.. 270 కోట్ల రూపాయల  గ్రాస్ కలెక్షన్స్  తీసుకురావాలని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.  


కల్కి కోసం కమల్ హాసన్‌కు రికార్డ్ రెమ్యునరేషన్? 10 రోజులకు ఎన్ని కోట్లంటే?

నటనకే భాష్యం చెప్పిన మహానటుడు కమల్ హాసన్. భారతదేశం గర్వించదగ్గ మహానటుల్లో ఆయన కూడా ఒకరు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి తన నటనతో మాయజాలం చేస్తారు కమల్ హాసన్. కొత్తగా నటనా రంగంలోకి వచ్చే వారికి ఆయన చేసిన సినిమాలు ఓ గ్రంథాలయం అనడంలో అతిశయోక్తి లేదు. 70 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లతో సమానంగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు కమల్. రోటిన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, విభిన్నమైన కథలతో ముందుకొస్తారు కమల్ హాసన్.

ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియన్ 3, కల్కి 2898 ఏడీ: పార్ట్ 2, కమల్ 237లతో పాటు రజనీకాంత్‌తో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నారు. అన్నింటిలోకి కమల్ నటిస్తోన్న కల్కి 2 మీదనే అందరిచూపు నెలకొంది. కల్కిలో సుప్రీం యాస్కిన్‌గా నెగిటివ్ రోల్‌లో నటిస్తున్నారు. స్వర్గం లాంటి కాంప్లెక్స్‌కు పాలకుడిగా.. ప్రాజెక్ట్ కే కోసం గర్భవతుల్ని చంపుతూ క్రూరంగా కనిపించారు కమల్. 

విభిన్నమైన గెటప్‌లో మరోసారి ఆయన మేజిక్ చేశారు. పార్ట్ 1లో కనిపించింది కొద్దిసేపే అయినా ఆకట్టుకున్నారు కమల్. అయితే కల్కి 2లో మాత్రం ప్రభాస్, అమితాబ్‌లతో ఢీ అంటే ఢీ అనేలా కమల్ హాసన్ రోల్ ఉండబోతోందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కల్కి 2898 ఏడీ కోసం ఈ నట దిగ్గజం అందుకున్న పారితోషికం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కల్కి 2898 ఏడీ. భారతీయ పురాణాలు, సైన్స్ ఫిక్సన్ కలయికగా నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దిగ్గజ నటులు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్‌తో పాటు శోభన, దీపికా పదుకొనె, రాజేంద్రప్రసాద్, దిశా పటానీ తదితరులు కల్కిలో నటించారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం 2024 జూన్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది. థియేట్రికల్ రన్ ముగిసేసరికి వరల్డ్  వైడ్‌గా 1200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల అంచనా.

ఇంతటి భారీ విజయం తర్వాత కల్కికి సీక్వెల్‌గా కల్కి 2ను తెరకెక్కించాలని వైజయంతి మూవీస్, దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి దీపిక పదుకొనె తప్పుకోవడం సంచలనం సృష్టించింది. ఆమె ప్లేస్‌లో సాయిపల్లవిని హీరోయిన్‌గా తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. గత నెలలో కల్కి 2 షూటింగ్‌ను లాంఛనంగా ప్రారంభించింది చిత్ర యూనిట్. హైదరాబాద్‌లోని శంకర్‌పల్లి పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే కల్కి 2 సెట్‌లో ప్రభాస్ జాయిన్ కానున్నారు. 2027 సమ్మర్ లేదా దసరాకి కల్కి 2 ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

కాగా.. కల్కిలో నటీనటుల పారితోషికాలు అప్పట్లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రభాస్ 150 కోట్లు, అమితాబ్, దీపికా 20 కోట్ల రూపాయల రేంజ్‌లో పారితోషికం తీసుకున్నట్లుగా కథనాలు  వచ్చాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి కమల్ హాసన్ అందరికంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నారని చెబుతున్నారు తమిళ నటుడు యుగిసేతు. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కల్కి కోసం కమల్ 20 రోజుల కాల్షీట్లు ఇచ్చినట్లు ప్రచారం జరిగినా, అది 10 రోజులేనని తెలిసింది. అప్పటి వరకు కమల్ హాసన్‌కు రోజుకు 2 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారని వార్తలు వచ్చాయి. 

కానీ ఆయనకు రోజుకు 15 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ కింద ముట్టజెప్పారు. దీని ప్రకారం 10 రోజులకు 150 కోట్లు అందుకున్నారు. తద్వారా దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా కమల్ హాసన్ రికార్డు సృష్టించారని యుగిసేతు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వార్త గడిచిన కొద్దిరోజులుగా చక్కర్లు కొడుతోందని తెలిపారు.