టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్.. ఫైనల్లో న్యూజిలాండ్ చిత్తు, టీమిండియా నయా హిస్టరీ
Photo Courtesy: X.com/BCCI
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా టీమిండియా నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి మూడో సారి టీ20 ప్రపంచకప్ను అందుకుని చరిత్ర సృష్టించింది. ఇంతకు ముందు క్రికెట్ దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మలు భారత జట్టుకు ట్రోఫీలు అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి సరసన సూర్యకుమార్ యాదవ్ కూడా చేరారు.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ 2026లో తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు అభిషేర్ శర్మ (52), సంజూ శాంసన్ (89)లు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ విధ్వంసక ఆటతో కివీస్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు.
ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను రచిన్ రవీంద్ర విడదీశాడు. 52 పరుగుల వ్యక్తిగత స్కోరు అభిషేక్ శర్మ ఔటయ్యాడు. అభి ఔటైనా సంజూ విధ్వంసం కొనసాగింది. అతనికి ఇషాన్ కిషన్ (54) నుంచి చక్కటి సహకారం లభించగా.. ఇద్దరూ ధాటిగా ఆడి పరుగుల వరద పారించారు. వీరి ధాటికి భారత్ 12 ఓవర్లకే 150 పరుగుల మార్క్ దాటేసింది. ఈ దశలో జేమ్స్ నీషమ్ మేజిక్ చేశాడు. ఒకే ఓవర్లో సంజూ, ఇషాన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్లను ఔట్ చేశాడు. తర్వాత కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో భారత్కు పరుగులు చేయడం కష్టమైంది.
ఈ దశలో హార్డిక్ పాండ్య (18), శివమ్ దూబే (26)లు బ్యాట్ ఝళిపించడంతో టీమిండియా 250 పరుగుల మార్క్ దాటింది. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో జేమ్స్ నీషమ్ 3 వికెట్లు తీయగా.. హెన్రీ, రచిన్ రవీంద్రలు తలో వికెట్ పడగొట్టారు. భారత బ్యాట్స్మెన్లో సంజూ శాంసన్ 89 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.
256 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ ధాటిగా తన ఇన్నింగ్స్ను ఆరంభించింది. ఓపోనర్ టిమ్ సీఫెర్ట్ ఫోర్లు, సిక్సర్లతో భారత బౌలర్లను వణికించాడు. ఈ దశలో అక్షర్ పటేల్ కివీస్కు షాకిచ్చాడు. 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓపెనర్ అలెన్ను ఔట్ చేశాడు. ఆ వెంటనే బుమ్రా బౌలింగ్లో రచిన్ రవీంద్ర పెవిలియన్ చేరాడు. కీలక ఆటగాళ్లు గ్లెన్ ఫిలిప్స్ (5), మార్క్ చాప్మెన్ (3), డేరీ మిచెల్ (17)లను భారత్ త్వరత్వరగా ఔట్ చేయడంతో న్యూజిలాండ్ కష్టాల్లో పడింది.
ఓ వైపు వికెట్లు పడుతున్నా స్టిఫెర్ట్ మాత్రం దూకుడుగా ఆడుతూనే ఉన్నాడు. ఈ దవలో వరుణ్ చక్రవర్తికి దొరికిపోవడంతో న్యూజిలాండ్ ఆశలు వదిలేసుకుంది. చివరి వరుస బ్యాట్స్మెన్లు జేమ్స్ నీషమ్ (8), హెన్రీ (0), ఫెర్గూసన్ (6), జాకబ్ డఫి (3)లను కూడా భారత బౌలర్లు ఇంటికి పంపారు. అయితే న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ మొండిగా పోరాడుతూ ఆశలు రేపాడు. అయితే బుమ్రా అతనిని క్లీన్బౌల్డ్ చేసి భారత్కు విజయాన్ని ఖరారు చేశాడు. దాంతో న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటై దారుణ పరాజయాన్ని చవిచూసింది. నాలుగు వికెట్లు తీసి భారత విజయంలో కీలకపాత్ర పోషించిన జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కగా.. సంజూ శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ దక్కించుకున్నాడు.






