Who Is GDN: 100 ఏళ్ల కిందటే మేక్ ఇన్ ఇండియాకు పునాది... ఎవరీ జీడీఎన్?
విలక్షణ నటుడు మాధవన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జీడీఎన్. కొయంబత్తూరుకు చెందిన భారతీయ శాస్త్రవేత్త, ఇంజనీర్, పారిశ్రామికవేత్త గోపాలస్వామి దొరస్వామి నాయుడు జీవితం, ఆయన సాధించిన విశేషాలు ఇతివృత్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో జీడీఎన్గా మాధవన్ టైటిల్ రోల్ పోషించారు. ఈ సినిమా టైటిల్ ప్రకటించిన నాటి నుంచే ప్రత్యేకత సంతరించుకుంది. మాధవన్ లుక్ బయటకు వచ్చిన తర్వాత అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఆగస్ట్ 7న జీడీఎన్ విడుదల కానుంది. అయితే ఎవరీ జీడీఎన్? ఆయన జీవితం ఏంటీ? జీడీఎన్ సాధించిన విజయాలు ఏంటీ? అనే ఆసక్తి జెన్ జీ పిల్లల్లో నెలకొంది.
కోయంబత్తూరులో స్థిరపడిన తెలుగు రైతు కుటుంబంలో 1893 మార్చి 23న జన్మించారు జీడీ నాయుడు. ఆయన పుట్టిన కొద్దినెలలకే తల్లి చనిపోయారు. అనివార్య కారణాలతో మూడో తరగతిలోనే చదువు మానేశారు. కోయంబత్తూరులోని ఓ హోటల్లో సర్వర్గా ప్రస్థానం ప్రారంభించిన ఆయన రూపాయి రూపాయి కూడబెట్టి దాచిన డబ్బుతో చిన్న మోటార్ సైకిల్ కొనుగోలు చేసి ప్రయోగాలు ప్రారంభించారు. ఆ మోటార్ సైకిల్లోని ప్రతి భాగాన్ని విడదీసి.. మళ్లీ బిగించి మెకానిక్గా మారిపోయారు.
1920లలో ఒక ఆటోమొబైల్ కోచ్ను కొన్న ఆయన ట్రాన్స్పోర్ట్ బిజినెస్లోకి దిగారు. పొల్లాచ్చి నుంచి పళని వరకు ప్రయాణించారు. కొన్నేళ్లకే వ్యాపారంలో సత్తా చాటిన నాయుడు తన యూనివర్సల్ మోటార్ సర్వీస్ (యూఎంఎస్)తో దేశవ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ రంగంలో గుర్తింపు సంపాదించారు. కేవలం 13 సంవత్సరాలలోనే ఆయన రవాణా సామ్రాజ్యం అనూహ్యంగా విస్తరించి 280కి పైగా బస్సులను కలిగి దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బస్సు కంపెనీలలో ఒకటిగా ఘనత వహించింది.
1930లో న్యూ ఎలక్ట్రిక్ వర్క్స్ కంపెనీని ప్రారంభించి ఎలక్ట్రిక్ మోటార్లను ఉత్పత్తి చేశారు. భారతదేశంలో తొలి మోటార్ను జీడీ నాయుడు కంపెనీయే తయారు చేసింది. కోయంబత్తూరులో ఉన్న ఆయన ఫ్యాక్టరీ నేషనల్ ఎలక్ట్రిక్ వర్క్స్ ఈ వినూత్న ఆవిష్కరణ చేసింది. అలాగే గోపాల్ క్లాక్ ఇండస్ట్రీ కూడా వినియోగదారుల ఆదరణను పొందింది.
నాయుడు.. పరిశోధనలు, సంచలనాలు అక్కడితో ఆగలేదు. 1937లో డీ బాలసుందరం నాయుడుతో కలిసి భారతదేశంలో తొలి ఇండిజెనస్ మోటర్ను తయారు చేశారు. ఈ విజయంతో బాలసుందరం టెక్ట్స్టూల్ను కనుగొని టెక్ట్స్టూల్ బాలసుందరంగా మారారు. ఆ తర్వాత డ్రై సెల్స్తో రేజర్ను తయారు చేశారు జీడీఎన్. సూపర్ థిన్ షేవింగ్ బ్లేడ్స్, సినిమా కెమెరాలలో డిస్టెన్స్ అడ్జెస్టర్, ఫ్రూట్ జ్యూస్ ఎక్స్ట్రాక్టర్, టాంపర్ ప్రూఫ్ వోట్ రికార్డింగ్ మెషిన్, కిరోసిన్తో నడిచే ఫ్యాన్, ఫైవ్ వాల్వ్ రేడియో సెట్స్, టూ సీటర్ పెట్రోల్ ఇంజిన్ కార్ తదితర ఆవిష్కరణలతో సంచలనం సృష్టించారు జీడీఎన్.
అయితే ఆయన ప్రయోగాలకు ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సహం లభించలేదు, లైసెన్స్ మంజూరు చేయడానికి కూడా ముందుకు వచ్చేది కాదు. దాంతో ఆయన ఆటోమోటివ్స్ ప్రయోగాలను పక్కనపెట్టి.. రైతాంగానికి కొత్తరకం పత్తి, బొప్పాయి, మొక్కజోన్న విత్తనాలను తయారు చేశారు జీడీఎన్. ఆయన వ్యవసాయ క్షేత్రాన్ని దిగ్గజ శాస్త్రవేత్త సర్ సీవీ రామన్, ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్, భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యలు సందర్శించారు. ఇక కేవలం 11 గంటల రికార్డ్ సమయంలోనే ఇంటిని నిర్మించి సంచనం సృష్టించారు జడీఎన్.
1922లో లండన్లో జరిగిన కింగ్ జార్జ్ V అంత్యక్రియలను వ్యక్తిగతంగా వీడియో తీశారు. జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ను కూడా జీడీఎన్ కలిశారు. అప్పటి కాంగ్రెస్ అగ్రనేత కే కామరాజ్తో సన్నిహితంగా ఉండేవారు జీడీఎన్. అలాగే జాతిపతి మహాత్మాగాంధీ, తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్లను తన కెమెరాలో బంధించారు. రాజకీయాలపై ఆసక్తితో 1936 ప్రావిన్సియల్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలవ్వడంతో రాజకీయాల నుంచి తప్పుకున్నారు. నాయుడుకు రోల్స్ రాయిస్ కారు బహుమతిగా లభించగా.. ఆ రోజుల్లో అంతటి విలాసవంతమైన కారును కలిగివున్న ఏకైక వ్యక్తి జీడీఎన్ కావడం విశేషం.
1944లో ఆటోమొబైల్ తదితర ప్రయోగాల నుంచి పదవీ విరమణ తీసుకున్న జీడీఎన్.. సామాజిక సేవా కార్యక్రమాలతో సంచలనం సృష్టించారు. 1945లో కోయంబత్తూరులో భారతదేశంలోనే మొట్టమొదటి పాలిటెక్నిక్ కాలేజీ అయిన ఆర్ధర్ హోప్ పాలిటెక్నిక్ కాలేజీ (ప్రస్తుతం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ)ని స్థాపించడానికి చొరవ తీసుకుని భారీ విరాళాలు అందజేయడంతో పాటు ఈ కాలేజీకి ప్రిన్సిపాల్గానూ వ్యవహరించారు.
ఆ సమయంలో పాలిటెక్నిక్ కోర్సుకు 4 ఏళ్ల కాలం విద్యార్ధుల సమయాన్ని వృథా చేయడమేనని భావించిన జీవిఎన్ దానిని రెండేళ్లకు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఆయన ప్రతిపాదనను అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం తిరస్కరించడంతో పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేశారు. 1967లో జడీ నాయుడు ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ను స్థాపించారు.
తన ఇంజనీరింగ్, మాన్యుఫాక్చరింగ్ కంపెనీలలో వేలాదిమందికి ఉద్యోగాలు కల్పించారు జీడీఎన్. ఎలక్ట్రికల్, మెకానికల్, అగ్రికల్చర్, హైబ్రీడ్ కల్టీవేషన్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఎన్నో పరిశోధనలు, ఎన్నో ఆవిష్కరణలు చేసి కోయంబత్తూరు నగరం దేశంలోనే ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా మార్చడంలో కీలకపాత్ర పోషించారు. సామాన్య ప్రజల జీవితాలపై గొప్ప ప్రభావాన్ని చూపిన ఎన్నో వస్తువులను జీడీఎన్ ఆవిష్కరించి.. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ప్రాజెక్ట్లను వందేళ్ల క్రితమే ప్రారంభించి స్థానికంగా వస్తువులను ఆవిష్కరించడానికి పునాది వేసిన ఘనత జీడీ నాయుడుదే.
1974లో 80 ఏళ్ల వయసులో జీడీ నాయుడు తుదిశ్వాస విడిచారు. ఆయనకు కుమారుడు జీడీ గోపాల్, మనవడు జీడీ రాజ్కుమార్, మనవరాలు శాంతిని ఉన్నారు. జీడీఎన్ గౌరవార్థం కోయంబత్తూరులోని ఒక స్కూల్కు జీడీ మెట్రిక్యూలేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్, జీడీ పబ్లిక్ స్కూల్కు ఆయన పేరు పెట్టారు. అలాగే ఓ రోడ్డుకు జీడీ నాయుడు ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వేగా నామకరణం చేశారు.

.jpg)

.jpg)
.jpg)
.jpg)
.jpg)