లెనిన్ హిట్.. భారీగా పెరిగిన భాగ్యశ్రీ రెమ్యునరేషన్?

 

ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టువిడవకుండా మన ప్రయత్నం సాగిస్తే ఏదో ఒకరోజు ఖచ్చితంగా విజయం దొరుకుతుందని కొందరి జీవితాలు పాఠాలుగా నిలుస్తాయి. ఈ కోవలకే వస్తారు అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే. దాదాపు 11 ఏళ్లుగా హిట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు అఖిల్. ప్రతిసారి ఎన్నో అంచనాల మధ్య రావడం ఆ సినిమా కాస్తా పరాజయం పాలవ్వడం షరా మామూలే అన్నట్లుగా తయారైంది. ఈ పరిస్ధితిని మార్చి ఈసారి హిట్ కొట్టాలనే సంకల్పంతో అఖిల్ కష్టపడ్డారు. దానికి ప్రతిఫలమే లెనిన్ మూవీ సక్సెస్.

అఖిల్‌ను నటుడిగా మరో మెట్టుపైకి ఎక్కించిన సినిమాగా, ఆయన కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌‌గా నిలిచింది లెనిన్. ఈ విజయంతో అఖిల్ ఎమోషనల్ అవుతున్నారు. సక్సెస్ సెలబ్రేషన్స్‌లో కంటతడి పెట్టిన ఆయన తన తండ్రి నాగార్జున పాదాలకు నమస్కరించి వెక్కి వెక్కి ఏడ్చారు. ఇక్కడే కాదు ఈవెంట్స్‌లోనూ లెనిన్‌లో విజయం తాలూకా భావోద్వేగం కనిపిస్తూనే ఉంది. ఎట్టకేలకు లెనిన్‌తో తమ హీరో ట్రాక్ ఎక్కేశాడని అక్కినేని అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు.

ఇక మరొకరు భాగ్యశ్రీ బోర్సే. అందం, అభినయం ఉన్నప్పటికీ కెరీర్ స్టార్టింగ్ నుంచి నేటి వరకు ఈ ముద్దుగుమ్మకు హిట్ దక్కలేదు. దాంతో ఐరన్ లెగ్ అన్న ముద్ర పడింది. మిస్టర్ బచ్చన్ మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు భాగ్యశ్రీ బోర్సే. తొలి సినిమాతోనే అందం, లుక్స్ పరంగా కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్‌ అనిపించుకున్నారు. కానీ మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత కింగ్డమ్, ఆంధ్రా కింగ్ తాలూకా, కాంత సినిమాలలో నటించారు. అన్ని స్టార్ హీరోల సినిమాలే.. బాగా చేసిందన్న పేరు తప్పించి ఆమెకు విజయం మాత్రం దక్కలేదు.

ఈ క్రమంలో లెనిన్‌లో భారతిగా ఆఫర్ వచ్చింది. ఫస్ట్ లుక్ నుంచే భాగ్యశ్రీ తన ముద్ర వేయడం ప్రారంభించారు. నాటకాలలో దుర్యోధనుని పాత్ర.. దానవీర శూరకర్ణలోని ఎన్టీఆర్ ఫేమస్ డైలాగ్ ఏమంటివి.. ఏమంటివిని అద్భుతంగా పలికి శెభాష్ అనిపించుకుంది. సినిమా విడుదలయ్యాక అఖిల్‌తో సమానంగా ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు కెరీర్‌లో తొలి హిట్ అందుకున్నారు భాగ్యశ్రీ. సక్సెస్ సెలబ్రేషన్స్‌లో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టింది ఈ ముద్దుగుమ్మ. తనపై ఐరన్ లెగ్ ముద్ర వేశారని.. కానీ అభిమానులు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఈరోజు ఇక్కడ నిలబడ్డానని చెప్పారు. హైదరాబాద్ నా కర్మభూమి.. నా చివరి సినిమా కూడా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచే ఉంటుందని భాగ్యశ్రీ ఎమోషనల్ అయ్యారు.

లెనిన్ విజయం కారణంగా భాగ్యశ్రీకి అవకాశాలు క్యూకట్టే అవకాశం ఉంది. అంతేకాదు.. తన రెమ్యునరేషన్ కూడా బాగా పెంచేసినట్లుగా ఫిలింనగర్‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లెనిన్‌కు ముందు వరకు సినిమాకు కోటి రూపాయలు పారితోషికం తీసుకున్న ఈ మరాఠీ భామ.. ఇప్పుడు 2 కోట్ల రూపాయల్ని డిమాండ్ చేస్తోందట. అందం, అభినయం, యువతలో ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు కూడా భాగ్యశ్రీ ఎంత అడిగితే అంత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తమిళంలో సియోన్ మూవీలో నటిస్తున్నారు భాగ్యశ్రీ.


అనిల్ రావిపూడికి కోలీవుడ్ నుంచి బంపరాఫర్? ఆ స్టార్ హీరో 50వ సినిమాకి డైరెక్టర్‌గా?

 

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి వరుస విజయాలతో మంచి ఊపు మీదున్నారు. చేసిన ప్రతి సినిమా కావడంతో పరాజయం లేని దర్శకుల జాబితాలో చోటు దక్కించుకున్నారు అనిల్. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లతో కలిసి ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు అనిల్. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. 

చాలా తక్కువ బడ్జెట్‌తో, అత్యంత వేగంగా సినిమాలు తీయడంలో ఎక్స్‌పర్ట్ అని ముద్ర వేయించుకున్న అనిల్ రావిపూడితో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు బడా నిర్మాతలు, హీరోలు క్యూకడుతున్నారు. తాజాగా వెంకటేష్ - కళ్యాణ్ రామ్ ప్రాజెక్ట్ ముగిసిన వెంటనే ఆయన తదుపరి సినిమాపై అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. 

పటాస్ సినిమాతో టాలీవుడ్‌లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు అనిల్. ఆ తర్వాత సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, ఎఫ్ 3, భగవంత్ కేసరి, సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారితో సినిమాలతో వరుస హిట్స్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతికి రావడం హిట్‌ని ఖాతాలో వేసుకుని వెళ్లడం అనిల్‌కి ఆనవాయితీగా మారింది. ఈ ఏడాది సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారితో సినిమాతో మెగాస్టార్ చిరంజీవికి కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌ని అందించాడు అనిల్.

ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌- నందమూరి కళ్యాణ్‌రామ్‌లతో మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నారు అనిల్ రావిపూడి. ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు తర్వాత అనిల్ - వెంకీ కలయికలో వస్తోన్న నాలుగో సినిమా ఇది. అలాగే పటాస్ అనంతరం లాంగ్ గ్యాప్ తర్వాత నందమూరి కళ్యాణ్‌రామ్‌తో అనిల్ రావిపూడి సినిమా చేస్తుండటం విశేషం. షైన్ పిక్చర్స్, సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియో సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ మూవీలో వెంకటేష్ సరసన కీర్తి సురేష్.. కళ్యాణ్ రామ్ సరన కృతిశెట్టి హీరోయిన్లుగా నటించనున్నారని ఫిలింనగర్ టాక్.

కాగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించేందుకు పలువురు కోలీవుడ్ స్టార్స్ సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ కూడా అనిల్ డైరెక్షన్‌లో చేయాలని అనుకున్నారు. అయితే ఆ కాంబో సెట్ కాలేదు. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి మరో కోలీవుడ్ అగ్రనటుడు సూర్య పేరు వినిపిస్తోంది. ఇటీవల ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన కరుప్పతో కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు సూర్య. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో సూర్య నటిస్తున్నారు. 

ఆ తర్వాత తన 47వ సినిమాను జీతూ మాధవన్ తెరకెక్కిస్తుండగా.. పా రంజిత్, టీజే జ్ఞానవేల్‌లతో సినిమాలు చేసేందుకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో సూర్య కెరీర్‌లోనే మైలురాయిగా చెబుతున్న 50వ సినిమాను ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. అయితే ఆ దర్శకుడు అనిల్ రావిపూడేనంటూ తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచే అనిల్ అయితే ఖచ్చితంగా హిట్ గ్యారెంటీ అని సూర్య విశ్వసిస్తున్నారు. అలాగే అనిల్ చెప్పిన కథ కూడా ఆయనకు బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ ఓకే చేసినట్లుగా కథనాలు వస్తున్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే అనిల్ - సూర్య కాంబోపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 


హీరోగా దేవిశ్రీ ప్రసాద్... నేను ఎప్పుడో అయ్యా.. థమన్ షాకింగ్ కామెంట్స్

 

దేవి శ్రీ ప్రసాద్.. ఈ పేరు తెలియనివారు ఉండరు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఇప్పుడు హవా తగ్గింది కానీ 10, 15 ఏళ్ల క్రితం అంతా దేవిశ్రీ పాటలే వినిపించేవి. సీనియర్ హీరోల నుంచి జూనియర్ హీరోల వరకు అందరికీ దేవియే కావాలి. అలా అభిమానులతో రాక్‌ స్టార్ అని పిలిపించుకున్న దేవిశ్రీ ప్రసాద్‌కు ఇటీవల థమన్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఒకటి ఆరా చిత్రాలు తప్పించి.. ఎక్కువగా థమన్ హవానే కనిపిస్తోంది.

ఇండస్ట్రీలో చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు హీరోలుగా, దర్శకులుగా రాణించారు. ఈ క్రమంలోనే దేవి శ్రీ ప్రసాద్‌కు సంగీత దర్శకుడి నుంచి హీరోగా ప్రమోషన్ వచ్చింది. బలగం ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఎల్లమ్మ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీ కోసం కంప్లీట్‌గా మేకోవర్ అయిన ప్రాణం పెట్టి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్నారు.

నిజానికి దేవిశ్రీ ప్రసాద్‌ను హీరోగా చూడాలని ఆయన తండ్రి, ప్రముఖ సినీ రచయిత సత్యమూర్తి ఆశించారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో దేవిని హీరోగా లాంచ్ చేసేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ సమయంలో సత్యమూర్తి చనిపోవడంతో హీరో కావాలన్న ఆలోచనను దేవి విరమించుకున్నారు. హీరోగా నటించకపోయినా శంకర్ దాదా, జులాయి, అత్తారింటికి దారేది, ఖైదీ నెం 150 తదితర సినిమాలో తెరపై తళుక్కున మెరిశారు. 

దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటించడంపై ఎస్ఎస్ థమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓజీ టూర్ కాన్సర్ట్‌లో పాల్గొన్న ఆయనను మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలు  అడగ్గా ఓపికగా సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే దేవిశ్రీ ప్రసాద్ గారు హీరోగా  చేస్తున్నారు? మరి మీరు ఎప్పుడు హీరోగా చేస్తున్నారు? అని విలేకరులు ప్రశ్నించారు. దీనికి థమన్ ఆసక్తికరంగా బదులిచ్చారు. 

నేను ఆల్రెడీ హీరో అయ్యే వచ్చాను. బాయ్స్‌లో హీరో అయిపోయి వచ్చాను. యాక్టింగ్ చాలా కష్టం.. అది ఎంత పనో మీకు తెలియదు. అది చాలా టార్చర్.. మనం ప్రశాంతంగా ఏసీ  రూమ్‌లో కూర్చొని మంచి ట్యూన్ చేయరా అని దేవుడు ఆశీర్వదించాడు. ఈ ఎండలు, వడదెబ్బలు మనకెందుకు? కానీ దేవి అన్నకు హ్యాట్సాఫ్. ఆ స్క్రిప్ట్ మొత్తం నాకు తెలుసు.. అది బ్లాక్‌బస్టర్ సినిమా అంతే. అన్న అయితే ప్రాణం పెట్టేస్తున్నాడు.. దిల్‌రాజు గారు కూడా నాతో చెప్పారు. 

అవసరమైతే నేను కూడా మీకు సాయం చేస్తానని దిల్‌రాజు గారికి  చెప్పాను. జీవితంలో అంతా నాకే, నాదే అనుకోకూడదు. అందరం కలిసి పనిచేసుకుందామని దిల్‌రాజు గారితో మాట్లాడాను. ఎల్లమ్మ బ్లాక్‌బస్టర్ స్క్రిప్ట్స్, ఫస్ట్ సినిమాతోనే యాక్టర్‌గా దేవిశ్రీ ప్రసాద్ గారు ప్రూవ్ చేసుకుంటారని థమన్ అన్నారు. భవిష్యత్తులో కూడా హీరో కావాలన్న ఉద్దేశం నాకు లేదు. గేమ్ ఛేంజర్ ఆడియో ఫంక్షన్‌కి డల్లాస్ వెళ్లినప్పుడు ఎల్లమ్మ మూవీ లైన్ ఫ్లైట్‌లోనే చెప్పారు. సినిమా చాలా బాగుంటుంది అని థమన్ వెల్లడించారు. 


విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోరం... 8 మంది కార్మికులు మృతి

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో సోమవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉక్కుద్రవం లీకై 8 మంది కార్మికులు దుర్మరణం పాలవ్వగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్లాంట్‌లోని ఎస్ఎంఎంస్ 2, ఎస్‌టీసీ -3 హీట్ ఎఫ్‌జీలో స్టీల్ మెటల్ లిక్విడ్ లాడిల్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

పేలుడు జరిగిన సమయంలో దాదాపు 1500 డిగ్రీల వేడితో ఉన్న స్టీల్ మెటల్ లిక్విడ్‌ను లిఫ్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పేలుడు శబ్ధం వినిపించగానే భయాందోళనలకు గురైన కార్మికులు, ఇతర ఉద్యోగులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, పోలీస్, ఇతర అధికారులు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాద విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మెరుగైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అటు హోంమంత్రి అనిత కూడా విజయనగరంలో తన పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని విశాఖకు బయల్దేరారు. 


Peddi Public Talk: పెద్ది పబ్లిక్ టాక్.. రామ్ చరణ్ మూవీపై జనం టాక్ ఇదే

 


బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన మూవీ పెద్ది. జగపతిబాబు, శివరాజ్ కుమార్, దివ్యెందు శర్మ, బొమన్ ఇరానీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లపై వై రవిశంకర్, నవీన్ యెర్నెనీ, వెంకట సతీష్ కిలారులు కలిసి పెద్ది సినిమాను నిర్మించారు. 

జూన్ 4న పెద్ది మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే జూన్ 3వ తేదీ రాత్రి ఈ సినిమా ప్రీమియర్స్ ప్రదర్శించారు. పెద్దిపై పబ్లిక్ టాక్ ఎలా ఉంది? రామ్ చరణ్ నటన, బుచ్చిబాబు డైరెక్షన్ ఎలా ఉంది? అనే దానిపై సోషల్ మీడియాలో వీడియోలు, పోస్టులు వైరల్ అవుతున్నాయి. 

రామ్ చరణ్‌కు రంగస్థలంకు నేషనల్ అవార్డ్ రాలేదు. కానీ ఈ మూవీ చూసిన తర్వాత ఆయనకు నేషనల్ అవార్డ్ రాకపోతే నేషనల్ అవార్డ్ జ్యూరీనే మార్చుకోవాలేమో. అందరూ ఓ టైప్ ఆఫ్ మూవీస్‌కి అలవాటు పడిపోయారు. స్లో యాక్షన్, స్లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, పిచ్చి పిచ్చి బీజీఎంలు, గాలిలో ఎగిరే సీన్లు వస్తే అదే సినిమా అనుకుంటున్నారు. కానీ నిజంగా ఒక యాక్టర్ పొటెన్షియల్ ఏంటీ? కమర్షియల్ యాంగిల్ అన్ని పక్కనపెడితే పెద్దితో చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాము. 

మన తెలుగులో ఇలాంటి మూవీ వచ్చింది. ఈ సినిమా చూస్తుంటే ఒక హాలీవుడ్ మూవీలా అనిపించింది. ఇంటర్వెల్ వచ్చినప్పటి నుంచి తెరపై వాళ్లు ఏడుస్తుంటే మాకు ఏడుపొచ్చింది. వాళ్లని కొడుతుంటే ఆ పెయిన్ మనకి వస్తుంది. థియేటర్‌లో చూసిన 600 మందిలో ఒక్కళ్లనైనా పెద్ది సినిమా ఖచ్చితంగా ఇన్‌స్పైర్ చేస్తుందని ఒక అభిమాని తెలిపారు. 

ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇన్‌స్పైర్ అవ్వాల్సిందే. ఐడెంటీటీ, గెలుపు అనేది చాలా ముఖ్యం. అది ఉంటేనే బయట రెస్పెక్ట్ ఇచ్చేది కూడా అని ఓ ప్రేక్షకుడు చెప్పాడు. రామ్ చరణ్ బాడీ చూస్తే అదిరిపోయింది. నాకు కూడా జిమ్‌కి వెళ్లాలని అనిపిస్తుంది. ఖచ్చితంగా రామ్ చరణ్‌కి నేషనల్ అవార్డ్ వస్తుంది.. ఎందుకు రాదో చూద్దామని ఓ అభిమాని అన్నాడు. 

మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. బుచ్చిబాబు గారి డైరెక్షన్ కానీ, రామ్ చరణ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగున్నాయి. ఇది ఒక సినిమా కాదు.. ఒక ఆటగాడి గెలుపు. ఆట అనేది స్వార్ధం కోసం కాదు.. ఒక పర్పస్ కోసమని సూపర్‌గా ప్రజెంట్ చేశారు. చరణ్ జీవితంలో మరో మైలురాయి. తండ్రిని మించిన తనయుడిగా ఇవాళ ఆయన యాక్టింగ్ అద్భుతంగా చేశాడు అని ఫ్యాన్స్ తెలిపారు. 


Peddi: పెద్ది బడ్జెట్ ఎంత? రామ్ చరణ్ ముందు టార్గెట్ ఎంతంటే?

 


తమిళ దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్ కావడంతో మెగా ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు. దాంతో ఎలాగైనా అభిమానులకు సాలీడ్ హిట్ అందించాలని డిసైడ్ అయిన రామ్ చరణ్ .. తన వీరాభిమాని బుచ్చిబాబు సానాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉప్పెన తర్వాత కొన్నేళ్ల పాటు చరణ్ కోసం వెయిట్ చేసి చివరికి అనుకున్నది సాధించారు బుచ్చిబాబు. వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన మూవీ పెద్ది. 

స్పోర్ట్స్, విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు తెరకెక్కించాయి. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యెందు శర్మ, బొమన్ ఇరానీ, రవికిషన్, విజి చంద్రశేఖర్, సత్య, అజయ్ ఘోష్, ఉపేంద్ర లిమాయే తదితరులు నటించారు. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ స్పెషల్ సాంగ్ చేశారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు.

పెద్దిని 350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించినట్లు స్వయంగా దర్శకుడు బుచ్చిబాబు వెల్లడించారు. రామ్ చరణ్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకు భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. 

నైజాంలో 48 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 24 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 18 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 10.20 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 8.25 కోట్ల రూపాయలు, గుంటూరులో 11.20 కోట్ల రూపాయలు, కృష్ణాలో 9.30 కోట్ల రూపాయలు, నెల్లూరులో 6.30 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 17 కోట్ల రూపాయలు, తమిళనాడులో 5.25 కోట్ల రూపాయలు, కేరళలో 2 కోట్ల రూపాయలు, హిందీ+ రెస్టాఫ్ ఇండియాలో 25 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 34 కోట్ల రూపాయలతో కలిపి వరల్డ్ వైడ్‌గా 218 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది పెద్ది. ఈ సినిమా బ్రేక్ఈవెన్ కావాలంటే 220 కోట్ల రూపాయల షేర్.. 450 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. 

సంక్రాంతి సీజన్ తర్వాత టాలీవుడ్ గడ్డు పరిస్ధితులని ఎదుర్కొంటోంది. ఒకటి రెండు సినిమాలు తప్పించి పెద్ద సినిమాలన్నీ వాయిదా పడటంతో తెలుగు చిత్ర పరిశ్రమకు కీలకమైన సమ్మర్ సీజన్ నిరుత్సాహ పరిచింది. దాంతో ప్రేక్షకులు రాక... కొత్త సినిమాల సందడి లేక థియేటర్లు వెలవెలబోయాయి. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల ఆశలన్నీ పెద్దిపైనా ఉన్నాయి. మరి టాలీవుడ్‌కు పెద్ది సినిమా తిరిగి ఊపిరి పోస్తుందో లేదో చూడాలి. 


IPL 2026 విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... పోరాడి ఓడిన గుజరాత్

 

Photo Courtesy: RCBTweets

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 (ఐపీఎల్ 2026) విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. విరాట్ కోహ్లీ 75 పరుగులు, జితేష్ శర్మ 11 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్ల ధాటికి గుజరాత్ బ్యాట్స్‌మెన్ నిలవలేకపోయారు. ఒక్కొక్కరిగా పెవిలియన్ చేరారు. దాంతో గుజరాత్ కనీసం 100 పరుగులైనా చేస్తుందా అన్న అనుమానాలు నెలకొన్నాయి. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన వాషింగ్టన్ సుందర్ జట్టును ఆదుకున్నాడు. 37 బంతుల్లో 50 పరుగులు చేశాడు. 

గుజరాత్ బ్యాట్స్‌మెన్‌లలో సాయి సుదర్శన్ 12, శుభమన్ గిల్ 10, నిషాంత్ సింధు 20, జోస్ బట్లర్ 19, వాషింగ్టన్ సుందర్ 50, అర్షద్ ఖాన్ 15, రాహుల్ తేవాటియా, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్‌లు తలో 7 పరుగులు, రబాడా 3 పరుగులు చొప్పున నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హేజల్‌వుడ్‌లు తలో 2 వికెట్లు పడగొట్టగా.. రషిక్ సలామ్ దర్ 3, కృనాల్ పాండ్యా ఒక వికెట్ పడగొట్టారు.

156 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఓపెనర్ విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్‌లు శుభారంభం అందించారు. వీరిద్దరూ బౌండరీల వర్షం కురిపించడంతో బెంగళూరు లక్ష్యం దిశగా పరుగులు తీసింది. అయితే 32 పరుగులు చేసిన వెంకటేష్ అయ్యర్‌ను మొహ్మద్ సిరాజ్ ఔట్ చేశాడు. ఆ వెంటనే దేవదత్ పడిక్కల్ 1 పరుగుకే వెనుదిరిగాడు. విరాట్, కెప్టెన్ రజత్ పాటిదర్‌లు కాసేపు గుజరాత్ బౌలర్లకు ఎదురు నిలిచారు. ఈ దశలో 15 పరుగులు చేసి రజత్‌ను రషీద్ ఖాన్ ఔట్ చేశాడు.

ఆ కాసేపటికే కృనాల్ పాండ్యాను రషీద్ ఖాన్ ఎల్‌‌బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపడంతో 4 వికెట్లు కోల్పోయి బెంగళూరు కష్టాల్లో పడింది. ఈ దశలో టిమ్ డావిడ్ - విరాట్ కోహ్లీల జోడీ సమయోచితంగా ఆడి 41 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను అర్షద్ ఖాన్ విడదీశాడు. 24 పరుగుల వ్యక్తిగత పరుగుల వద్ద టిమ్ డావిడ్ పెవిలియన్ చేరాడు. దీంతో వికెట్ కీపర్ జితేష్ శర్మతో కలిసి విరాట్ కోహ్లీ జట్టును విజయం దిశగా నడిపించాడు. 

చివరిలో గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పరుగులు రావడం కష్టంగా మారింది. మ్యాచ్ నానాటికీ ఉత్కంఠగా మారుతున్న దశలో విరాట్ కోహ్లీ క్యాచ్ రూపంలో ఔట్ కావడంతో మైదానం ఒక్కసారిగా నిశ్శబ్ధంగా మారింది. అయితే టీవీ రిప్లయ్‌లో బంతి నేలను తాకినట్లుగా కనిపించడంతో థర్డ్ ఎంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. దాంతో బతికిపోయిన కోహ్లీ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. కోహ్లీ విరోచిత బ్యాటింగ్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి ఐపీఎల్ 2026 విజేతగా నిలిచింది. 

ఆర్సీబీ బ్యాట్స్‌మెన్‌లలో వెంకటేష్ అయ్యర్ 32, విరాట్ కోహ్లీ 75, దేవదత్ పడిక్కల్ 1, రజత్ పాటిదర్ 15, కృనాల్ పాండ్యా 1, టిమ్ డావిడ్ 24, జితేశ్ శర్మ 11 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్, కసిగో రబాడా, అర్షద్ ఖాన్‌లు తలో వికెట్ పడగొట్టగా.. రషీద్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టాడు.