నేను పిలిస్తే 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్లోకే : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
బీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు తెలంగాణ కాంగ్రెస్ నేత , మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు ముందుగా కల్వకుంట్ల కవితకు బెయిల్ ఎలా తెచ్చుకోవాలో ఆలోచించాలంటూ చురకలంటించారు. తనతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో వున్నట్లుగా కేసీఆర్ చెబుతున్నారని.. కానీ తాను పిలిస్తే దాదాపు పాతిక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తారని వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read : అయోధ్యలో రామయ్య నుదిటిన ‘‘సూర్య తిలకం ’’ .. ప్రతి శ్రీరామనవమికి ఎలా సాధ్యం..?
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో రెండు లేదా మూడు స్థానాల్లో గెలుస్తుందని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని.. మెదక్లో మూడో స్థానంలో నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇరిగేషన్ పరంగా నల్గొండ జిల్లాకు కేసీఆర్ అన్యాయం చేశారని.. మరి ఏ ముఖం పెట్టుకుని బీఆర్ఎస్ అధినేత ఇక్కడ బస్సు యాత్ర చేపడుతున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ మోకాళ్ల మీద యాత్ర చేసినా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్కు డిపాజిట్ రాదన్నారు. కేసీఆర్ తన ప్రవర్తనను మార్చుకోవాలని ఆయన హితవు పలికారు.
మత ఘర్షణలు చెలరేగేలా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడటం బాధాకరమని.. ఇటీవల జరిగిన తొలి దశ లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికే ఎక్కువ సీట్లు వస్తాయని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జోస్యం చెప్పారు. ఉత్తర భారతంలో బీజేపీ పరిస్ధితి బాలేదేని.. అందుకే దక్షిణాదిపై దృష్టి పెట్టారని ఆరోపించారు.

Comments
Post a Comment