మన సరబ్‌జిత్ సింగ్‌ను చంపిన పాకిస్తాన్ డాన్ హతం

 



భారత్‌కు చెందిన సరబ్‌జిత్ సింగ్‌ను జైల్లోనే చంపిన కేసులో నిందితుడిగా వున్న పాకిస్తాన్ డాన్ హత్యకు గురయ్యాడు. ఆదివారం లాహోర్‌లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అమీర్‌ సర్ఫరాజ్‌ను కాల్చిచంపారు. పాకిస్తాన్‌లో మోస్ట్ వాంటెడ్‌గా వున్నాడు అమీర్ సర్ఫరాజ్. ఇతను లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కు అత్యంత సన్నిహితుడు. 

సరబ్‌జిత్ సింగ్ ఎవరు :

పంజాబ్‌లోని భికివిండ్‌కు చెందిన రైతు సరబ్‌జిత్ సింగ్. భారత్ - పాక్ సరిహద్దులను దాటి తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడనే ఆరోపణలతో 1990లో అతనిని పాకిస్తాన్ అరెస్ట్ చేసింది. అంతేకాదు.. పంజాబ్ ప్రావిన్స్‌లో పలు బాంబు పేలుళ్ల వెనుక సరబ్‌జిత్ ప్రమేయం వుందని ఆయనపై అభియోగాలు మోపి, చివరికి మరణశిక్ష విధించింది. లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో శిక్ష అనుభవిస్తుండగా.. 2013లో భారత పార్లమెంట్‌పై దాడి చేసిన అఫ్జల్ గురుని మనదేశం ఉరితీసింది. 

ఇది జరిగిన కొన్ని రోజులకే కోట్ లఖ్‌పత్ జైలులో శిక్ష అనుభవిస్తున్న అమీర్ సర్ఫరాజ్ సహా కొందరు రైతులు సరబ్‌జిత్ సింగ్‌పై ఇనుప కడ్డీలు, ఇటుకలతో దాడికి దిగారు. ఈ ఘటనలో మెదడుకు తీవ్రగాయాలయ్యారు. దీంతో ఆయనను జైలు అధికారులు జిన్నా ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ సరబ్‌జిత్ సింగ్ తుదిశ్వాస విడిచారు. 1990లో అరెస్ట్ అయిన ఆయన.. దాదాపు 23 ఏళ్ల పాటు కోట్ లఖ్‌పత్ జైలులో శిక్ష అనుభవించారు. 

Also Read :  'ప్రతీకారం' తప్పదు .. ఇజ్రాయెల్‌పై యుద్ధానికి దిగిన ఇరాన్ సుప్రీం లీడర్ , ఎవరీ అయతుల్లా అలీ ఖమేనీ ..?

భారత్‌కు వచ్చిన అతని మృతదేహాన్ని పరిశీలిస్తే చంపాలనే ఉద్దేశంతోనే జైల్లో దాడి జరిగినట్లుగా తేలింది. సరబ్‌జిత్ సింగ్ మృతదేహంలో గుండె, మూత్రపిండాలు, ఇతర అవయవాలు తొలగించినట్లుగా గుర్తించారు. తలకు తీవ్రగాయం కావడం, అంతర్గత రక్తస్రావం జరిగిందని సరబ్‌జిత్ పుర్రెపై 5 సెంటిమీటర్ల వెడల్పాటి గాయం వల్లే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లుగా పోస్ట్‌మార్టం నివేదిక చెబుతోంది. 

ఇదిలావుండగా.. సరబ్‌జిత్ సింగ్‌ను క్షేమంగా భారత్‌కు తీసుకురావాలని అతని సోదరి దల్బీర్‌కౌర్ సుదీర్ఘకాలం పాటు న్యాయ పోరాటం చేశారు. సరబ్‌‌జిత్‌ను చూసేందుకు పాకిస్తాన్ సైతం వెళ్లొచ్చారు. ఆయన మరణంపై విచారణ జరపాలని భారత విదేశాంగ శాఖ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరింది. దల్బీర్ కూడా ఇదే రకమైన డిమాండ్‌ను లేవనెత్తారు. ఆమె గతేడాది అనారోగ్యంతో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో తుదిశ్వాస విడిచారు. 

సరబ్‌జిత్ సింగ్ భార్య సుఖ్‌ప్రీత్ కౌర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సరబ్‌జిత్- సుఖ్‌ప్రీత్‌కు పైనం, స్వపన్ దీప్ కౌర్ అనే ఇద్దరు కుమార్తెలు వున్నారు. 


Comments