Kantara: Chapter 1 Day 12 Collections World Wide: కాంతార 12 రోజుల కలెక్షన్స్.. రజనీ, ప్రభాస్ రికార్డులు గల్లంతు



రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాంతార చాప్టర్ 1. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు విజయ్ కిరంగదూర్, చాలువే గౌడలు దాదాపు 125 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. అక్టోబర్ 2వ తేదీన విడుదలైన కాంతార చాప్టర్ 1 త్వరలో రెండు వారాలు పూర్తి చేసుకోనుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్రభంజనం తగ్గడం లేదు. తాజాగా 12వ రోజు వరల్డ్ వైడ్‌గా రిషబ్ శెట్టి మూవీ ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?

కాంతార చాప్టర్ 1 చిత్రానికి స్వయంగా దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటించారు రిషబ్ శెట్టి. ఈ చిత్రంలో ఆయనకు రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించారు. జయరామ్, దీపక్ రామ్ పనాజీ, హరిప్రసాద్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేశ్ పూజారి, ప్రకాశ్ తుమినాడ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ స్వరకల్పన చేయగా.. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్‌గా, సురేష్ మల్లయ్య ఎడిటర్‌గా పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా కాంతార చాప్టర్ 1కు 440 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా... ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 880 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది.

కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్

కాంతార చాప్టర్ చిత్రం ఇప్పటి వరకు కర్ణాటకలో 142.7 కోట్ల రూపాయలు, తెలు రాష్ట్రాల్లో 78.15 కోట్ల రూపాయలు, హిందీలో 149.25 కోట్ల రూపాయలు, తమిళనాడులో 46 కోట్ల రూపాయలు, మలయాళంలో 35.8 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సాక్‌నిక్ వెబ్‌సైట్ ప్రకటించింది. దాంతో ఇండియాలో కాంతార చాప్టర్ 1 మూవీకి 451.9 కోట్ల రూపాయల నికర వసూళ్లు... 540.3 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

ఓవర్సీస్‌లోని నార్త్ అమెరికా మార్కెట్‌లో రిషబ్ శెట్టి మూవీకి ఇప్పటి వరకు 4 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం 35.4 కోట్ల రూపాయలు) వచ్చినట్లు కాంతార చాప్టర్ 1 మూవీకి నార్త్ అమెరికాలో పంపిణీదారుగా వ్యవహరిస్తోన్న ప్రత్యంగిరా మూవీస్ ట్విట్టర్‌లో ప్రకటించింది. నార్త్ అమెరికాను మినహాయిస్తే ఇతర దేశాల్లో 60 కోట్ల రూపాయల్ని ఈ చిత్రం రాబట్టింది. దీంతో కాంతారకు ఓవర్సీస్ నుంచి 95 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. దాంతో కాంతార చాప్టర్ 1 చిత్రం 12 రోజుల నాటికి ప్రపంచవ్యాప్తంగా 635 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది. అయితే 11 రోజుల్లో ఈ సినిమా 655 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు హోంబలే ఫిలింస్ ప్రకటించింది. తెలుగు హీరో కాకుండా తెలుగు రాష్ట్రాలలో 100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన మూడో హీరోగా రిషబ్ శెట్టి నిలిచాడు. గతంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ (3 సార్లు), యశ్ (ఒకసారి) ఈ ఫీట్ అందుకున్నారు.

కాంతార చాప్టర్ 1 ఫస్ట్ వీక్ కలెక్షన్స్

కాంతార చాప్టర్ 1కు తొలి వారం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 337.4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇందులో కర్ణాటక నుంచి 106.95 కోట్ల రూపాయలు, తెలుగులో 63.55 కోట్ల రూపాయలు, హిందీలో 108.75 కోట్ల రూపాయలు, తమిళనాడులో 31.5 కోట్ల రూపాయలు, మలయాళంలో 26.65 కోట్ల రూపాయలు వచ్చింది.

కర్ణాటకలో ఇప్పటికే అత్యంత వేగంగా 150 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ను దాటేసిన కాంతార చాప్టర్ 1 త్వరలో 200 కోట్ల మార్క్‌ను అందుకోవాలని చూస్తోంది. తద్వారా కర్ణాటకలో సోలోగా 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిన తొలి కన్నడ మూవీగా నిలవనుంది. 12 రోజుల నాటి వసూళ్లతో... అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారతీయ చిత్రాల్లో జైలర్ (650 కోట్ల రూపాయలు), సుల్తాన్ (623 కోట్ల రూపాయలు) వసూళ్లను అధిగమించింది. 

Kantara: Chapter 1 Updates: కాంతార చాప్టర్ 1 సెట్స్ నుంచి రిలీజ్ వరకు .. ఏం జరిగిందంటే?

 


2022లో వచ్చిన కాంతార ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం 15 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 407కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. కేజీఎఫ్ సిరీస్‌తో కన్నడ సినిమా తీరుతెన్నులు మారిపోగా.. కాంతార దానిని మరో మెట్టు పైకెక్కించింది.

కాంతార తారాగణం

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించగా.. కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, ప్రకాశ్ తుమినాడ్, నవీన్ డీ పడిల్, షైన్ శెట్టి తదితరులు కీలకపాత్రలు పోషించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్, చాలువే గౌడలు కాంతారను నిర్మించారు. అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫి, అజనీష్ లోకనాథ్ మ్యూజిక్, కేఎం ప్రకాశ్, శోభిత్ శెట్టిలు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం

సెప్టెంబర్ 30, 2022న విడుదలైన కాంతార చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. కర్ణాటకలో 168 కోట్ల రూపాయలు, ఆంధ్రా - నైజాంలలో 60 కోట్ల రూపాయలు, తమిళనాడులో 13 కోట్ల రూపాయలు, కేరళలో 19 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 45 కోట్ల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో 96 కోట్ల రూపాయలు చొప్పున భారత్‌లో 309 కోట్ల రూపాయల నికర వసూళ్లు, 363.82 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 407 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

కాంతార చాప్టర్ 1కి శ్రీకారం

కాంతార హిట్ కావడంతో దానికి ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్ 1ని తెరకెక్కిస్తామని దర్శక నిర్మాతలు ప్రకటించారు. కన్నడ నాట ప్రచారంలో ఉన్న జానపద కథలు, ఆధ్యాత్మికత, యాక్షన్, ప్రకృతితో మనిషి సంబంధం కీలక అంశాలుగా తీసుకుని కాంతార చాప్టర్ 1ని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. 2023 నవంబర్‌లో ఈ సినిమా అధికారికంగా సెట్స్ పైకి వెళ్లింది. నవంబర్ 27న కాంతార చాప్టర్ 1 ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌ను రిలీజ్ చేశారు. ఐ మ్యాక్స్, డీ బాక్స్, ఐసీఈ, 4డీఎక్స్, డాల్బీ సినిమా, ఎపిక్ ఫార్మాట్‌‌లో రిలీజ్ చేసే విధంగా కాంతార చాప్టర్ 1 చిత్రీకరణ జరిగింది.

8 నెలల్లో స్క్రిప్ట్ రెడీ

మంగళూరులో కాంతారకు ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్ 1 తీసేందుకు పంజుర్లి దేవత అనుమతి తీసుకున్నారు దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి. 8 నెలలో స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన ఆయన ఇందుకోసం షానీల్ గౌతమ్, అనిరుధ్ మహేశ్‌ల సహకారం తీసుకున్నారు. కాంతార చాప్టర్ 1లో ప్రధానంగా పంజుర్లి దేవత, గులిగ దేవతల చుట్టూ కథ ఉంటుందని చెప్పారు. భారతదేశానికి ఆంగ్లేయులు రావడానికి ముందు కర్ణాటక ప్రాంతం కాదంబులు, బనవాసి రాజవంశాల పాలనలో ఉండేది. గిరిజనులు, రాజవంశానికి మధ్య జరిగిన యుద్ధాన్ని కాంతార చాప్టర్ 1లో చూపించారు.

కాంతార సెట్‌లో మరణాలు

కాంతార చాప్టర్ 1 షూటింగ్ మొదలైన నాటి నుంచి పలువురు అనూహ్యంగా మరణించడం కలకలం రేపింది. నలుగురి మరణాలతో పాటు షూటింగ్ స్పాట్‌లో పలు ప్రమాదాలు, దున్నపోతు మృతి వంటి పరిణామాలు చర్చనీయాంశంగా మారింది. కాంతార టీమ్‌ను ఏదో దుష్ట శక్తి వెంటాడుతుందంటూ పుకార్లు వ్యాపించాయి. స్వయంగా హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి సైతం మూడు, నాలుగు సార్లు చావు అంచుల వరకు వెళ్లినట్లు చెప్పారు. అయితే దేవుడి ఆశీర్వాదం వల్ల తాము షూటింగ్ పూర్తి చేసినట్లు రిషబ్ తెలిపారు.

కాంతార నటీనటుల రెమ్యునరేషన్

కాంతార చాప్టర్‌ 1 సినిమాతో పాటు నటీనటుల రెమ్యునరేషన్ కూడా హాట్ టాపిక్‌గా మారాయి. కాంతారకు 4 కోట్ల రూపాయలు తీసుకున్న రిషబ్ శెట్టి.. కాంతార చాప్టర్ 1కు మాత్రం రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదట. దీనికి బదులుగా లాభాల్లో వాటాను తీసుకునేందుకు నిర్మాతలతో ముందుగానే ఒప్పందం చేసుకున్నారట. ఇక హీరోయిన్ రుక్మిణీ వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య, సంయుక్త గౌడలకు తలో కోటీ రూపాయలు రెమ్యునరేషన్ కింద చెల్లించినట్లుగా శాండల్ వుడ్ వర్గాలు తెలిపాయి.

కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ బిజినెస్:

కాంతార బ్రాండ్ ఇమేజ్ కారణంగా కాంతాఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. దేశ, విదేశాల్లో అనేక బడా డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం పోటీ పడ్డాయి. కేరళలో హీరో పృథ్వీ సుకుమారన్‌కు చెందిన పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్... నార్త్ ఇండియాలో ఏఏ ఫిల్మ్స్... తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్, వారాహి చలన చిత్రం, విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌వీ సినిమాస్, ఎస్‌కేఎన్ టెలీఫిల్మ్స్... తమిళనాడులో థింక్ స్టూడియోస్‌, ఎం మూవీస్, ఫైవ్‌స్టార్ కే సెంథిల్, ఎస్ పిక్చర్... ఓవర్సీస్‌లో పరాస్ ఫిల్మ్స్, నార్త్ అమెరికాలో ప్రత్యంగిరా సినిమాస్‌‌లు దక్కించుకున్నాయి. కాంతార చాప్టర్ 1 డిజిటల్ రైట్స్‌ని అమెజాన్ ప్రైమ్ వీడియోస సంస్థ 125 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది.

నైజాంలో 40 కోట్లు, ఆంధ్రలో 45 కోట్లు, సీడెడ్‌లో 15 కోట్లు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల రూపాయల వ్యాపారం చేసింది కాంతార. కర్ణాటకలో 169 కోట్ల రూపాయలు, తమిళనాడులో 13 కోట్ల రూపాయలు, కేరళలో 20 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియాలో 96 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 44.5 కోట్ల రూపాయలు చొప్పున 440 కోట్ల రూపాయలు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రిషబ్ శెట్టి మూవీ లాభాల్లోకి రావాలంటే వరల్డ్ వైడ్‌గా 850 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ రాబట్టాల్సి ఉంది. 

జనగణనకు ముహూర్తం ఖరారు.. ఎప్పటి నుంచి అంటే?

 


దాదాపు 15 ఏళ్ల తర్వాత చేపట్టబోయే జనగణనకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జూన్ 16న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ జనగణన 2027 మార్చి 1వ తేదీ నాటికి పూర్తి చేయనున్నారు. అంతేకాదు.. ఈ జనగణన బ్రిటీష్ హయాంతో కలుపుకుని 16వ సారి కాగా.. స్వతంత్ర భారతంలో 8వది. 

ఈ భారీ కార్యక్రమం కోసం దాదాపు 34 లక్షల మంది గణకులు, సూపర్ వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది సేవలు అందించనున్నారు. తొలిసారిగా జనగణనతో పాటు కుల గణను కూడా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  అయితే ప్రభుత్వ పోర్టల్స్ ద్వారా ప్రజలే వ్యక్తిగతంగా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని కేంద్ర హోంశాఖ తెలిపింది. జనగణన చట్టం 1948, సెక్షన్ 3 ప్రకారం జన- కులగణనను చేపడుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. 

జమ్మూకాశ్మీర్, లడఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లో 2026 అక్టోబర్ 1 నుంచి తొలిదశలో.. 2027 మార్చి 1 నుంచి దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో జనగణనను చేపట్టనున్నారు. దేశంలో 1872 నుంచి జనాభాను లెక్కిస్తున్నారు. దశాబ్ధానికి ఒకసారి జనగణన చేపట్టాలని నిర్ణయించారు. చివరిసారిగా 2011లో జనగణన చేపట్టారు. తర్వాత 2021లో జనాభాను లెక్కించాలి.. అయితే ఆ సమయంలో భారతదేశంలో కోవిడ్ భీకరంగా ఉంది. ఈ పరిస్ధితులతో కేంద్రం జనగణనను వాయిదా వేసింది. 

తాజాగా పరిస్ధితులు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో జనగణనకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈసారి ప్రతి ఒక్కరూ తమ కులాన్ని చెప్పే ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అలగే జనగణనకు కేంద్రం రూ.13 వేల కోట్లకు పైగా ఖర్చు చేసే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 


Thug Life Box Office Collection Day 1: థగ్‌లైఫ్‌ ఫస్ట్ డే కలెక్షన్స్.. కమల్ హాసన్ మూవీకి రికార్డ్ ఓపెనింగ్స్

 



నాయగన్ తర్వాత దాదాపు 38 ఏళ్లకు విలక్షణ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్‌లో తమిళ దిగ్గజ నటుడు కమల్ హాసన్ నటించిన చిత్రం థగ్‌ లైఫ్. విడుదలకు ముందు ఎన్నో వివాదాలకు కారణమై కర్ణాటకలో బ్యాన్‌కు గురైంది థగ్ లైఫ్. జూన్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలైంది. భారతీయుడు 2 తర్వాత కమల్ హాసన్ నటించిన సినిమా కావడంతో థగ్‌లైఫ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి తొలిరోజు ఈ భారీ చిత్రం ఏ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది? ఫస్ట్ డే ఏ ఏరియాలో ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయో? చూస్తే:

థగ్ లైఫ్ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెగ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్, మణిరత్నం, శివ అనంత్‌లు దాదాపు రూ.200  కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. కమల్ హాసన్ సరసన అభిరామి, త్రిషలు హీరోయిన్లుగా నటించగా.. కోలీవుడ్ స్టార్ హీరో శింబు కీలకపాత్ర పోషించారు. అలాగే ఐశ్వర్య లక్ష్మీ, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్, తణికెళ్ల భరని, మహేశ్ మంజ్రేకర్‌లు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. 

ఏపీ ఇంటర్నేషనల్, హోమ్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ థగ్ లైఫ్ ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ దక్కించుకుంది. ఆంధ్రా, నైజాం హక్కులను శ్రేష్ట్ మూవీస్ దాదాపు రూ.20 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక థగ్‌లైఫ్ డిజిటల్ రైట్స్‌ను ఏకంగా రూ.149.7 కోట్లకు ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కైవసం చేసుకుంది. ఆగస్ట్ 7న థగ్‌లైఫ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను స్టార్ విజయ్ టీవీ దాదాపు రూ.60 కోట్లకు దక్కించుకుంది. కేవలం థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్‌తోనే థగ్‌లైఫ్ తన పూర్తి పెట్టుబడిని రాబట్టుకుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. 

కమల్ హాసన్ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాటి లాభాల్లోకి రావాలంటే ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉందని  ట్రేడ్ పండితులు విలువ కట్టారు. థగ్ లైఫ్ కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే ఇండియా వైడ్‌ దాదాపు రూ.6 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఓవర్సీస్‌లో రూ.7.5 కోట్లను ప్రీ సేల్స్ ద్వారా సొంతం చేసుకున్న థగ్ లైఫ్ మొత్తంగా అడ్వాన్స్  బుకింగ్ ద్వారా రూ.13.5 కోట్లు ఆర్జించింది. తొలిరోజు కమల్ హాసన్ - మణిరత్నంల చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్ల ఓపెనింగ్స్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు. 


హరిహర వీరమల్లు... నిరాశలో పవన్ సైన్యం

 


రాజకీయాల్లోకి వెళ్లి, పదేళ్ల పోరాటం తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్. పిఠాపురం నుంచి శాసనసభ్యుడు కావడంతో పాటు చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగానూ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు, తన ఆశయాలకు అనుగుణంగా అత్యంత కీలకమైన శాఖలను స్వీకరించిన పవన్ దూసుకెళ్తున్నారు. 

పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా సక్సెస్ కావడంతో ఆయన అభిమానులకు ఓ పక్క సంతోషంగా ఉన్నప్పటికీ, మరోవైపు పవన్‌ను వెండితెర మీద చూడలేమని బాధపడ్డారు. సినీ పరిశ్రమను వదిలిపెట్టి రాజకీయాల్లో పూర్తిగా నిమగ్నమయ్యేసరికి పవన్ కళ్యాణ్ చేతిలో హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. వీటిలో హరిహర వీరమల్లు సినిమాకు ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. కరోనా, లాక్‌డౌన్, పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో దాదాపు ఐదేళ్లుగా సినిమా ఆగిపోయింది. 

తొలుత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన క్రిష్ జాగర్లమూడి ఈ ఆలస్యంతో వీరమల్లు నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. అసలే ఇబ్బందుల్లో ఉన్న ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్నాన్ని ఇది మరింత ఇరకాటంలో నెట్టింది. క్రిష్ సూచన మేరకు ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ మెగాఫోన్ పట్టుకుని మిగిలిన పార్ట్ పూర్తి చేసే బాధ్యతను తీసుకున్నారు. పవన్‌తో సంబంధం లేని సన్నివేశాలను జ్యోతికృష్ణ వేగంగా పూర్తి చేశారు. ఈలోపు పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్‌లో చేరి వీరమల్లును విడుదలకు సిద్ధం చేశారు.

జూన్ 12న హరిహర వీరమల్లు సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుందని మెగా సూర్య ప్రొడక్షన్స్ ప్రకటించింది. ఈ వార్తతో మెగా, పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. రెండేళ్ల విరామం తర్వాత పైగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ నటించిన సినిమా విడుదల కానుండటంతో ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అటు విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ సైతం ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. 

చెన్నైలో ఓ పాటను లాంచ్ చేసిన వీరమల్లు యూనిట్.. జూన్ 8న తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. జూన్ 7 నాటికే పవన్ కళ్యాణ్ తిరుపతి చేరుకుని, తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా హరిహర వీరమల్లు వాయిదా అంటూ సోషల్ మీడియాలో, మీడియాలో గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఇంత జరగుతున్నా పవన్ క్యాంప్ నుంచి ఒక్కరు కూడా స్పందించలేదు. ఇంతలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ అంటూ మరో న్యూస్ చక్కర్లు కొట్టింది.

సీజీ వర్క్ పూర్తి కాకపోవడం వల్లే వీరమల్లు వాయిదా పడిందని ఫిలింనగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కానీ అసలు కారణం ఏంటి? ఇంతకీ సినిమా జూన్ 12న విడుదల అవుతుందా? లేదా? అన్న దానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్, దర్శకుడు జ్యోతికృష్ణ, నిర్మాత ఏఎం రత్నం స్పందించాలని పవన్ అభిమానులు కోరుతున్నారు. 


అలీపై వ్యాఖ్యలు: మీ ఖర్మ, నేను ఇలాగే మాట్లాడతా.. రాజేంద్రప్రసాద్

 



సీనియర్ నటుడు, నటకిరిటీ డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఇటీవలి కాలంలో మైక్ అందుకుంటే చాలు కాంట్రవర్సీ అయిపోతోంది. అల్లు అర్జున్, డేవిడ్ వార్నర్‌లపై రాజేంద్రుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో స్వయంగా క్షమాపణలు చెప్పారు. రాజేంద్రప్రసాద్‌కు వయసు పెరుగుతున్న కొద్ది హుందాగా ఉండాలన్న విజ్ఞత ఉండటం లేదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. వేదికపై మైక్ అందుకున్న తర్వాత సభా మర్యాదను పాటించడం నేర్చుకోవాలంటూ చురకలంటిస్తున్నారు. 

ఇటీవల ఓ కార్యక్రమంలో కమెడియన్ అలీని అసభ్య పదజాలంతో దూషించడంతో రాజేంద్రప్రసాద్‌పై నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. సినీవర్గాల్లో సైతం ఆయన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. తాజాగా తాను చేసిన వ్యాఖ్యలపై రాజేంద్రప్రసాద్ స్పందించారు.  ఓ కార్యక్రమంలో హీరోయిన్, నటుడి గురించి సరదాగా చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారని.. నేను ఎప్పుడూ ఇలాగే ఉంటానని తేల్చిచెప్పారు. 

అన్నయ్య స్థానంలో ఉండి నేను చేసిన కొన్ని వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్ధం చేసుకున్నారు. అది మీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది.. అది మీ ఖర్మ. నేను ఎప్పుడూ ఇలాగే సరదాగా ఉంటానని రాజేంద్రప్రసాద్ అన్నారు. పెళ్లి పుస్తకం నుంచి షష్టి పూర్తి సినిమా వరకు నా కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగిందని ఆయన గుర్తుచేసుకున్నారు. 

ఇన్నేళ్ల అనుభవంలో నేను చేర్చుకున్నవి, నాకు తెలిసినవి అందరికీ చెబుతానని.. నాకు ఎన్నో భిన్నమైన పాత్రల్లో నటించే అవకాశం దక్కిందని రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఇలాంటి పాత్రలే చివరి శ్వాస వరకు చేయాలని అనుకుంటున్నానని .. ఇళయరాజా జన్మదినం నాడు షష్టిపూర్తి సినిమా సక్సెస్‌మీట్‌ను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అయితే వేదిక మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు రాజేంద్రప్రసాద్ ఎలాంటి క్షమాపణలు చెప్పకపోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. 

పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేశ్ చౌదరి, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం షష్టిపూర్తి. ఇందులో రాజేంద్రప్రసాద్, అర్చనలు కీలకపాత్రలు పోషించారు. వంశీ దర్శకత్వంలో వచ్చిన లేడీస్ టైలర్ తర్వాత ఈ సీనియర్ నటులిద్దరూ కలిసి నటించడం 38 సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన షష్టిపూర్తి సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. 


భారత్‌లో విజృంభిస్తోన్న కరోనా.. 4 వేలకు చేరువలో కేసులు

 


భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 4 వేల మార్క్‌కు చేరువైంది. దేశవ్యాప్తంగా యాక్టీవ్ కేసుల సంఖ్య 3,961 వద్ద ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ జూన్ 2న వెల్లడించింది. కేరళలో అత్యధికగా 1435 కేసులు, మహారాష్ట్రలో 506, ఢిల్లీలో 483, బెంగాల్‌లో 339, గుజరాత్‌లో 338, తమిళనాడులో 199, ఉత్తరప్రదేశ్‌లో 149, ఒడిశాలో 12, హర్యానాలో 12, పంజాబ్‌లో 6 కేసులు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. గడిచిన 24 గంటల్లో 360 కొత్తగా కోవిడ్ బారినపడినట్లు అధికారులు వెల్లడించారు. 

ఇక కోవిడ్ కారణంగా కేరళ, కర్ణాటకలలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి కోవిడ్ కారణంగా భారత్‌లో మరణించిన వారి సంఖ్య 32కి చేరుకుంది. అలాగే జూన్ 2 ఉదయం 8 గంటల వరకు 2,188 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 

దేశంలో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో సామాజిక దూరం పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, పరిశుభ్రత పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి ఇతర వేరియెంట్లతో పోలిస్తే ప్రస్తుతం భారత్‌లో వ్యాప్తి చెందుతున్న కరోనా రకం తీవ్రమైన అనారోగ్యానికి దారి తీస్తుందని సూచనలు ఏమీ లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లు తాజా వేరియంట్ ప్రభావాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొంటాయని అభిప్రాయపడింది.

భారత్‌లో వ్యాప్తి చెందుతున్న కరోనా రకాన్ని ఎన్‌బీ.1.8.1గా గుర్తించింది డబ్ల్యూహెచ్‌వో. అలాగే  గడిచిన రెండు వారాలుగా భారత్‌లో ఎక్కువగా బీఏ .2, జేఎన్.1 వేరియంట్ కేసులు నమోదవుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. వ్యాక్సిన్ల ప్రభావం తగ్గడం, కరోనా నిబంధనలను ప్రజలు పాటించకపోవడం, వ్యాధి నిరోధక శక్తి వంటివి తగ్గడం వల్లే దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.