వారణాసిలో విలక్షణ నటుడు.. ఆ ఆకలి తీరిందంటూ పోస్ట్ వైరల్

 


ఆర్ఆర్ఆర్ తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం వారణాసి. సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే కుంభగా పృథ్వీరాజ్.. మందాకినిగా ప్రియాంక చోప్రాల ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత రామోజీ ఫిలింసిటీలో జరిగిన గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్‌లో రుద్రగా మహేశ్ బాబు లుక్, గెటప్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. వీరు ముగ్గురు కాకుండా సినిమాలో నటించే ఇతర నటీనటుల ఎవరన్నది ఇంత వరకు బయటకు రాలేదు. రాజమౌళి కూడా అత్యంత గోప్యత పాటిస్తున్నారు. తాజాగా వారణాసిలోని నటిస్తోన్న మరో నటుడి వివరాలు బయటకు వచ్చాయి. స్వయంగా ఆ నటుడు ట్వీట్ చేశాడు.

శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ పతాకాలపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తీకేయ, ఎస్ గోపాల్ రెడ్డిలు ఈ సినిమాను దాదాపు 1300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వీ విజయేంద్రప్రసాద్, ఎస్ఎస్ కాంచీలు వారణాసి సినిమాకు కథను అందిస్తుండగా.. దేవ కట్టా డైలాగ్స్ రాశారు. పీఎస్ వినోద్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. వీ శ్రీనివాస్ మోహన్ ఈ వారణాసి సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ నిర్వహణను చూస్తున్నారు. 2027 వేసవి కానుకగా వారణాసి చిత్రం విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషలలో వారణాసి చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. 

వారణాసి సినిమాను అత్యున్నత స్థాయి నిర్మాణ విలువలతో తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే రాజమౌళి తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తొలిసారిగా పూర్తి సినిమాను ఐ మ్యాక్స్ ఫార్మాట్‌లో తీస్తున్నారు. రామాయణ పార్ట్ 1 తర్వాత ఈ విధానంలో తెరకెక్కుతోన్న రెండవ భారతీయ చిత్రం వారణాసి కావడం గమనార్హం. అలాగే  నాన్ ఇంగ్లీష్ సినిమా కేటగిరీలో 1:43:1 ఐ మ్యాక్స్ రేషియాలో తెరకెక్కుతున్న సినిమాగా రాజమౌళి - మహేశ్‌ల మూవీ నిలిచింది.

వారణాసి సినిమాలో పలువురు నటీనటులు భాగమైనట్లుగా గతంలో గాసిప్స్ వచ్చాయి.. ఇప్పటికీ ఇవి వస్తూనే ఉన్నాయి. కానీ అవన్నీ గాలివార్తలుగా మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో నటిస్తున్న నటుడు తాను రీసెంట్ షెడ్యూల్ పూర్తి చేసినట్లు స్వయంగా ట్వీట్ చేశారు. ఆ నటుడు ఎవరో కాదు.. విలక్షణ నటుడు ప్రకాశ్‌‌రాజ్. ఈ చిత్రం నాలోని నటుడి ఆకలి తీర్చింది. నాకు అవకాశం కల్పించిన రాజమౌళికి ధన్యవాదాలు. మహేశ్ బాబు, పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రాలతో కలిసి పనిచేయడం బాగుంది.. తదుపరి షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రకాష్‌రాజ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. 

ప్రస్తుతం ప్రకాశ్‌రాజ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆయన వారణాసి చిత్రంలో ఏ రోల్ పోషిస్తున్నారు. మహేశ్ తండ్రిగానా? హీరోయిన్ తండ్రిగానా? లేక మరేదైనా కీలకపాత్రా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే రాజమౌళి మంచి టైం చూసుకుని ప్రకాశ్‌రాజ్ తాలూకా లుక్, గెటప్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ప్రకాశ్‌రాజ్ నటించడం ఇది రెండోసారి. గతంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన విక్రమార్కుడులో ప్రకాష్ రాజ్ నటించారు. 


అమెరికాలో 30 మంది భారతీయులు అరెస్ట్

 


Photo Credit: X.Com/CBP

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత వలసలు, వలస విధానంపై కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తొలి నుంచి అమెరికా ఫస్ట్ విధానానికే తన ఓటు అని తన తొలి విడత పాలనా కాలంలోనే ట్రంప్ ప్రపంచానికి చూపించారు. ఆ సమయంలో ట్రంప్ దెబ్బకు వలసవాదులు వణికిపోయారు. ఇప్పుడు ట్రంప్ 2.0లో అమెరికాలో వలసదారులకు పరిస్ధితులు మరింత కఠినంగా మారాయి. 

ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే అక్రమ వలసదారులను పట్టుకుని ప్రత్యేక విమానాలలో వారి స్వదేశాలకు తరలించారు. అలాగే రోజుకొక కొత్త నిబంధనతో విదేశీయులకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు ట్రంప్. హెచ్ 1తో సహా పలు రకాల ఇమ్మిగ్రేషన్, నాన్ ఇమ్మిగ్రేషన్ పాలసీలలో రకరకాల మార్పులు తీసుకొస్తున్నారు. దేశవ్యాప్తంగా తనిఖీల పేరుతో ముచ్చెమటలు పట్టిస్తున్నారు ట్రంప్. సోషల్ మీడియాలో అమెరికాకు వ్యతిరేకంగా పోస్టులు ఉంటే చాలు.. అరెస్ట్‌లు, వీసా తిరస్కరణ వంటి చర్యలు చేపడుతున్నారు అగ్ర రాజ్యాధినేత.

రెండ్రోజుల క్రితం కూడా హెచ్ 1 వీసాల జారీ ప్రక్రియలో కొత్త మార్పులకు అమెరికా శ్రీకారం చుట్టింది. ఎప్పటి నుంచో అమలు చేస్తోన్న లాటరీ విధానం స్థానంలో.. నైపుణ్యాలు, అధిక వేతనాలకు పెద్దపీట వేసే వ్యవస్థను తీసుకురావాలని ఫెడరల్ ప్రభుత్వం నిర్ణయించినట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ఓ ప్రకటనలో తెలిపింది. లాటరీ విధానాన్ని ఎన్నో కంపెనీలు దుర్వినియోగం చేస్తూ తక్కువ వేతనాలతో విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్నట్లు కొన్నేళ్లుగా ఆరోపణలు వస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో ఫెడరల్ ప్రభుత్వం కొత్త హెచ్ 1 బీ వీసా విధానంపై కసరత్తు చేసి ఓ రూపు తీసుకొచ్చింది. హెచ్‌ 1 బీ వీసా జారీ వ్యవస్థలో కొత్త విధానం 2026 ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి వస్తుందని డీహెచ్ఎస్ పేర్కొంది. అలాగే 2027 ఆర్ధిక సంవత్సరంలో హెచ్ 1 బీ క్యాప్ రిజిస్ట్రేషన్‌ సీజన్‌కు ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది. అమెరికా ప్రభుత్వ నిర్ణయంతో కంపెనీలు, విదేశీ  ఉద్యోగులు, హెచ్ 1 బీ వీసా దరఖాస్తుదారుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. 

మరోవైపు.. కాలిఫోర్నియాలో రాష్ట్రంలోని ఇమ్మిగ్రేషన్ చెక్‌ పోస్టుల వద్ద 49 మంది అక్రమ వలసదారులను బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో దాదాపు 30 మంది భారతీయులు ఉన్నట్లు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం  తెలిపింది. మిగిలిన వారు చైనా, మెక్సికో, రష్యా, టర్కీ దేశాలకు చెందినవారిగా తెలుస్తోంది. అరెస్ట్ అయిన వారిలో ఎక్కువ మంది ట్రక్ డ్రైవర్లు కావడం గమనార్హం. వీరిలో చాలామంది ట్రక్ డ్రైవర్ లైసెన్స్‌తో సెమీ ట్రక్కులు నడపటంతో పాటు అక్రమంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో నివసిస్తున్నట్లు గుర్తించారు.

అయితే అమెరికా ప్రభుత్వం హైవేలు, ట్రక్కు డ్రైవర్లపై విరుచుకుపడటానికి కారణం ఉంది. ఇటీవలి కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ట్రక్కుల కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. విదేశీ ట్రక్కు డ్రైవర్లకు వర్క్ వీసా, కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీని నిలిపివేసింది. అలాగే కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్‌లతో సెమీ ట్రక్కులను నడుపుతున్న వారిపై ఫోకస్ పెట్టి పెద్ద ఎత్తున అరెస్ట్‌లకు దిగుతోంది. 



సామాన్లు చూపించొద్దు.. హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై హీరో శివాజీ కామెంట్స్

హీరోగా ఒకప్పుడు వరుస సినిమాలు చేసి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు నటుడు శివాజీ. పలు విజయవంతమైన చిత్రాలలో నటించిన ఆయన తర్వాత అనూహ్యంగా రాజకీయాలు, అమరావతి ఉద్యమం వైపు వెళ్లారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా ఉన్న సమయంలో అమరావతిని నిర్లక్ష్యం చేయడం, మూడు రాజధానుల నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు నిర్వహించిన నిరసనల్లో శివాజీ పాల్గొన్నారు. రైతుల పోరాటానికి మద్ధతుగా టీవీలలో జరిగే చర్చా కార్యక్రమాల్లోనూ, బహిరంగ వేదికలపైనా మాట్లాడి రైతుల పక్షాన తన గొంతును వినిపించారు.

సినిమాలకు దూరంగా ఉన్న దశలో అనూహ్యంగా బిగ్‌బాస్ తెలుగు 7లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి షాకిచ్చాడు శివాజీ. బిగ్‌బాస్ ఆటతీరును మొత్తం చదివేసి తనదైన గేమ్‌తో షోను నడిపించాడు. సామాన్యులుగా వచ్చిన ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్‌లతో కలిసి గేమ్ ఆడాడు. దాంతో అభిమానులు ఈ ముగ్గురిని స్పై బ్యాచ్ అంటూ ముద్దుగా పిలుచుకునేవారు. ప్రిన్స్, పల్లవి ప్రశాంత్‌లకు మద్ధతు ఇస్తూ వారిని ఫైనల్ వరకు తీసుకెళ్లి చాణక్యుడిగా ముద్ర వేయించుకున్నాడు శివాజీ. పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్ టైటిల్ విన్నర్ కావడం వెనుక కీలకపాత్ర పోషించాడు.

ఇక దాదాపు 13 ఏళ్ల విరామం తర్వాత కోర్ట్: స్టేట్ వర్సెస్ నో బడి సినిమాలో మంగపతి క్యారెక్టర్ ద్వారా శివాజీ తనలోని మరో కోణాన్ని చూపించాడు. మంగపతి పాత్రకు మంచి గుర్తింపు, ప్రశంసలు రాగా.. తనకు ఈ తరహా క్యారెక్టర్లు బాగా వస్తున్నాయని చెప్పాడు. ఇప్పటి తరం తనను కొత్తగా చూస్తోందని శివాజీ తెలిపాడు. ఇక 90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్‌లో తండ్రిగానూ శివాజీ అద్భుతంగా నటించి జెన్ జెడ్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. 

ప్రస్తుతం  శివాజీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం దండోరా. మురళీ కాంత్ దేవసోత్ దర్శకత్వం వహించారు. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీమతి ముప్పనేని శ్రీలక్ష్మీ సమర్పిస్తున్నారు. నవీదప్, నందు, బిందు మాధవి, రవికృష్ణ, మానిక, మౌనిక రెడ్డి, రాధ్యా, మురళీధర్ గౌడ్‌లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మార్క్ కే రాబిన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. వెంకట్ ఆర్ శాఖమూరి సినిమాటోగ్రాఫర్‌గా, సృజన అడుసుమిల్లి ఎడిటర్‌గా సేవలందించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న దండోరా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

రిలీజ్ డేట్ దగ్గరపడటంతో డిసెంబర్ 22న హైదరాబాద్‌లో దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో శివాజీ మాట్లాడుతూ.. హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్లు తాము ధరించే డ్రెస్స్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయిల అందం నిండుగా వేసుకునే బట్టల్లోనే ఉంటుంది కానీ సామాన్లు చూపించడంలో కాదు. ఇలాంటి బట్టలు వేసుకుంటే బయటికి అందరూ బాగుందనే అంటారు. కానీ లోలోపల తిట్టుకుంటారు అని శివాజీ వ్యాఖ్యానించారు.

స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అమ్మాయిలపై అంత గౌరవం పెరుగుతుంది. మా అమ్మ.. మహానటి సావిత్రి ఇప్పటికీ నిండైన రూపంతో మన గుండెల్లో నిలిచిపోవడానికి కారణం వారి నటన, వస్త్రధారణే. గ్లామర్ ఉండాలి.. కానీ అది హద్దులు దాటకూడదు. గౌరవం మన వేష భాషల నుంచే వస్తుంది.. విశ్వవేదికలపై చీర కట్టుకున్న వారికే విశ్వసుందరి కిరీటాలు వచ్చాయని శివాజీ అన్నారు. ప్రస్తుతం శివాజీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనూ, సినీరంగంలోనూ చర్చనీయాంశం అయ్యాయి. 


బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న రణ్‌వీర్ సింగ్... 900 కోట్ల దిశగా దురంధర్

 


బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా, సారా అర్జున్ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం దురంధర్. దేశభక్తి, స్పై, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాకు ఆదిత్య ధార్ తెరకెక్కించారు. అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడి, నవీన్ కౌశిక్, మానవ్ గోహిల్, సౌమ్యా టాండన్‌లు నటించారు. జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్‌ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండేలు నిర్మించారు. 

విశేష్ నవ్లాఖా సినిమాటోగ్రాఫర్‌గా, శివమ్ కుమార్ వీ పానికర్ ఎడిటర్‌గా పనిచేశారు. శాశ్వంత్ సచ్‌‌దేవ్‌ సంగీత దర్శకత్వం వహించారు. ఈ ఏడాది డిసెంబర్ 5న దురంధర్ చిత్రం వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం 280 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. 

దురంధర్‌‌కు భారతదేశంలో తొలి రోజున 28 కోట్ల రూపాయలు, 2వ రోజున 32 కోట్ల రూపాయలు, 3వ రోజున 43 కోట్ల రూపాయలు, 4వ రోజున 23.25 కోట్ల రూపాయలు, 5వ రోజున 27 కోట్ల రూపాయలు, 6వ రోజున 27 కోట్ల రూపాయలు, 7వ రోజున 27 కోట్ల రూపాయలు, 8వ రోజున 32.5 కోట్ల రూపాయలు, 9వ రోజున 53 కోట్ల రూపాయలు, 10వ రోజున 58 కోట్ల రూపాయలు, 11వ రోజున 30.5 కోట్ల రూపాయలు, 12వ రోజున 30.5 కోట్ల రూపాయలు, 13వ రోజున 25.5 కోట్ల రూపాయలు, 14వ రోజున 23.25 కోట్ల రూపాయలు, 15వ రోజున 22.5 కోట్ల రూపాయలు, 16వ రోజున 34.25 కోట్ల రూపాయలు, 17వ రోజున 38.5 కోట్ల రూపాయలు చొప్పున 555.75 కోట్ల రూపాయలు, 666.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

దురంధర్ తొలి వారం 207.25 కోట్ల రూపాయలు, రెండో వారంలో 253.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో తొలి వారం కంటే రెండో వారం రణ్‌వీర్ సింగ్ సినిమా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. జేమ్స్ కామెరాన్ విజువల్ వండర్ అవతార్ 3: ఫైర్ అండ్ యాష్ సినిమా బరిలో ఉన్నప్పటికీ దానికి మించి దురంధర్ వసూళ్లు రాబట్టడం విశేషం. భారత్‌లో పూర్తిగా రణ్‌వీర్ సింగ్ డామినేషన్ కనిపిస్తోంది. 

భారత్‌తో సమానంగా ఓవర్సీస్‌లో దురంధర్ ఆదిపత్యం కనిపిస్తోంది. నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 12 మిలియన్లు (107 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. మిగిలిన దేశాలలో 80 కోట్ల రూపాయలు రాబట్టింది. దీంతో ఓవర్సీస్ నుంచి దురంధర్ సినిమాకు 187 కోట్ల రూపాయలు వచ్చింది. ఈ ఏడాది ఓవర్సీస్‌లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాలో రజనీకాంత్ - లోకేష్ కనగరాజ్‌ల కూలీ (180.50 కోట్ల రూపాయలు) టాప్‌లో నిలిచింది. ఇప్పుడు ఈ వసూళ్లతో ఆ రికార్డ్‌ను దురంధర్ బద్ధలు కొట్టి 200 కోట్ల రూపాయల దిశగా పరుగులు తీస్తోంది. ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి 17 రోజుల వరకు దురంధర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 852.75 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. 


Bigg Boss Telugu 9 Grand Finale Voting: ఓటింగ్‌లో దూసుకొస్తోన్న సంజన... కళ్యాణ్- తనూజలకు టఫ్ ఫైట్

 


బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌కు మరో నాలుగు రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది. దాదాపు 100 రోజులకు పైగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది బిగ్‌బాస్ 9. 14వ వారంతో ఎలిమినేషన్స్ పూర్తవ్వగా ఐదుగురు  కంటెస్టెంట్స్ ఫైనలిస్టులుగా టాప్ 5లో చోటు దక్కించుకున్నారు. వారు పడాల పవన్ కళ్యాణ్, తనూజా పుట్టస్వామి, సంజన గల్రానీ, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, డిమోన్ పవన్‌లు. వీరిలో ఒకరు బిగ్‌బాస్ తెలుగు 9 విజేత కానున్నారు. 

ఈ ఏడాది సెప్టెంబర్ 7న బిగ్‌బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్ జరిగింది. ఆ రోజున 9 మంది సెలబ్రిటీలు, 6గురు కామన్‌మెన్‌లు హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మరో కామన్‌మెన్ దివ్య నిఖిత కంటెస్టెంట్‌గా వచ్చింది. అనంతరం ఆరుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. తొలి వారం శ్రష్టీ వర్మ, రెండో వారం మర్యాద మనీష్, మూడో వారం ప్రియాశెట్టి, నాలుగో వారం హరిత హరీశ్, ఐదో వారం శ్రీజ దమ్ము, ఫ్లోరా షైనీ, ఆరో వారం ఆయేష్ జీనత్, ఏడో వారం రమ్య మోక్ష కంచర్ల, ఎనిమిదో వారం దివ్వెల మాధురి, తొమ్మిదో వారం రాము రాథోడ్, పదో వారం శ్రీనివాస సాయి, పదకొండో వారం నిఖిల్ నాయర్, పన్నెండో వారం గౌరవ్ గుప్తా, పదమూడో వారం దివ్య నిఖిత, రీతూ చౌదరి, పద్నాలుగో వారం సుమన్ శెట్టి, భరణిలు ఎలిమినేట్ అయ్యారు. 

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పడాల టికెట్ టూ ఫినాలే టాస్క్‌లో గెలిచి బిగ్‌బాస్ తెలుగు 9లో తొలి ఫైనలిస్ట్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్, డిమోన్ పవన్, సంజన గల్రానీ, తనూజ పుట్టస్వామిలు బిగ్‌బాస్‌ తెలుగు 9 ఫైనల్‌లో అడుగుపెట్టారు. వీరిలో ఒకరు డిసెంబర్ 21వ తేదీ ఆదివారం జరిగే ఫైనల్‌లో ఈ సీజన్ విజేత కానున్నారు. ఇక బిగ్‌బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే కోసం ఓటింగ్ లైన్స్ ఓపెన్ కాగా.. ఓటింగ్ టఫ్‌గా సాగుతోంది. పడాల పవన్ కళ్యాణ్, తనూజ పుట్టస్వామిల మధ్య హోరాహోరీ ఫైట్ జరుగుతోంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓటింగ్‌ను పరిశీలిస్తే..

పడాల పవన్ కళ్యాణ్‌ తొలిరోజున ఆధిపత్యం వహించగా.. రెండో రోజు నాటికి తనూజ టఫ్ ఫైట్ ఇస్తున్నారు. సోషల్ మీడియా టాక్ ప్రకారం.. పవన్ కళ్యాణ్‌కు 37.23 శాతం ఓటింగ్ నమోదవ్వగా.. తనూజకు 31.48 శాతం ఓటింగ్ వచ్చింది. అయితే అనూహ్యంగా సంజన గల్రానీ దూసుకొస్తున్నారు.. నిన్నటి వరకు ఓటింగ్‌లో అట్టడుగున ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా 19.98 శాతం ఓటింగ్‌తో మూడో స్థానంలోకి వచ్చేసింది. ఈమెకు ఏమాత్రం ఛాన్స్ దొరికినా కళ్యాణ్, తనూజలకు నిరాశ తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. ఓటింగ్‌లో ఆ తర్వాతి స్థానాల్లో డిమోన్ పవన్ (6.01 శాతం), జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ (5.3 శాతం) ఓటింగ్‌తో నిలిచారు. ఓటింగ్ లైన్స్ మరికొద్దిరోజులు ఓపెన్‌లోనే ఉండనున్నాయి.. దీంతో బిగ్‌బాస్ తెలుగు 9 విజేతగా ఎవరు నిలుస్తారోనని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 


Akhanda 2 Collections: అఖండ 2 ఐదు రోజుల కలెక్షన్స్... బాలకృష్ణ మూవీ బ్రేక్‌ఈవెన్ కావాలంటే?

 


బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన అఖండకు సీక్వెల్‌గా ఈ సినిమాను నిర్మించారు. 14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు రామ్ అచంట, గోపీచంద్ అచంట ఈ సినిమాను నిర్మించారు. బాలకృష్ణ కుమార్తె నందమూరి తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరించారు. బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించారు. 

ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా, కబీర్ దుహన్ సింగ్, స్వస్త ఛటర్జీ, రాన్‌సన్ విన్సెంట్, అచ్యుత్ కుమార్, సంగే షెల్ట్రిమ్, రవి మరియా, విక్రమ్‌జిత్, పూర్ణ, సాయికుమార్, హర్ష చెముడు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. థమన్ స్వరాలు సమకూర్చగా.. తమ్మిరాజు ఎడిటింగ్, సీ. రాంప్రసాద్, సంతోష్ దేట్కేలు సినిమాటోగ్రాఫర్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. అఖండ 2 విడుదలై 6 రోజులు కావొస్తుండగా.. ఇప్పటి వరకు బాలయ్య చిత్రం ఎన్ని కోట్లు రాబట్టింది? బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా ఎన్ని కోట్లు రావాలి? అన్నది చూస్తే.

అఖండ  2కు భారతదేశంలో ప్రీమియర్స్‌తో 8 కోట్ల రూపాయలు, తొలిరోజున 22.5 కోట్ల రూపాయలు, రెండో రోజున 15.5 కోట్ల రూపాయలు, మూడో రోజున 15.1 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 5.25 కోట్ల రూపాయలు, ఐదో రోజున 4.25 కోట్ల రూపాయలు వసూలైంది. ఇప్పటి వరకు ఇండియాలో 70.6 కోట్ల రూపాయల నికర కలెక్షన్స్.. 83.55 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. 

నార్త్ అమెరికాలో మంగళవారం ఒక్కరోజు 68k డాలర్లు (61.46 లక్షల రూపాయలు) వసూలవ్వగా.. 5 రోజుల వరకు ఈ మొత్తం 900K డాలర్లు (8.13 కోట్ల రూపాయలు) క్రాస్ చేసి ఉంటుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. నార్త్ అమెరికాలో అఖండ 2 దూకుడుకు దురంధర్ అడ్డుగా నిలుస్తున్నాడు. లేనిపక్షంలో బాలయ్య ఈ పాటికే 1 మిలియన్ మార్క్ టచ్ చేసేవాడని విశ్లేషకులు చెబుతున్నారు. నార్త్ అమెరికాను మినహాయిస్తే మిగిలిన దేశాలలో అఖండ 2కు మరో 3 కోట్ల రూపాయలు వసూలైంది. దీనితో ఒక్క ఓవర్సీస్‌‌లోనే ఇప్పటి వరకు 11.2 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి.

ఇప్పటి వరకు అఖండ 2కు తెలుగు రాష్ట్రాలలో 68 కోట్ల రూపాయలు, హిందీ+ రెస్టాఫ్ ఇండియాలో 1.8 కోట్ల రూపాయలు, తమిళనాడులో 4.08 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 9.03 కోట్ల రూపాయలు, కేరళలో 15 లక్షల రూపాయలు వసూలైంది. అలాగే ప్రముఖ టికెటింగ్ యాప్‌ బుక్ మై షోలో ఏకంగా 2 మిలియన్‌కు పైగా టికెట్లు అమ్ముడైనట్లు 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. 

తెలుగు రాష్ట్రాల్లోని నైజాంలో 15.84 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 10.22 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 4.64 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 3.67 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 2.68 కోట్ల రూపాయలు, గుంటూరులో 4.90 కోట్ల రూపాయలు, కృష్ణాలో 3.20 కోట్ల రూపాయలు, నెల్లూరులో 2.39 కోట్ల రూపాయలు రాబట్టాడు బాలయ్య. ఈ కలెక్షన్స్‌ను బట్టి అఖండ 2కి 5 రోజుల్లో 57.29 కోట్ల రూపాయల షేర్... 96.80 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. బాలయ్య సినిమా బ్రేక్ ఈవెన్ (104 కోట్ల రూపాయల షేర్) కావాలంటే మరో 47 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది. 

తండ్రి బాటలో... ఏఎన్ఆర్ కాలేజీకి అక్కినేని నాగార్జున భారీ విరాళం

 


తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్లలా వెలుగొందారు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు. సినిమాలతో పాటు పరిశ్రమ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నారు.. మద్రాస్ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు రావడంలో కీలకపాత్ర పోషించారు. అలాగే సమాజానికి వీరిద్దరూ ఎంతో సేవ చేశారు. తుఫానులు, వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు స్వయంగా జోలె పట్టె, ఊరూరా తిరిగి విరాళాలు సేకరించి ప్రజలకు అందజేసి వారిని ఆదుకున్నారు. తెలుగు ప్రజలకు ఎప్పుడు? ఏ కష్టం వచ్చినా ఎన్టీఆర్- ఏఎన్ఆర్ ముందుండేవారు. వారు చూపిన బాటలోనే ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమ ఫాలో అవుతోంది. 

ఇక నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు చిన్నతనం నుంచి చదువంటే ఎంతో ఇష్టం. కానీ వారి కుటుంబ ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా పెద్దగా చదువుకోలేకపోయారు. తాను ఎదుర్కొన్న కష్టాలు తన పిల్లలు పడకూడదని తన పిల్లల్ని బాగా చదివించారు. అలాగే పేదరికం కారణంగా తనలాగా ఎవ్వరూ చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో గుడివాడలో అక్కినేని నాగేశ్వరరావు కాలేజీ స్థాపనలో కీలకపాత్ర పోషించడంతో పాటు దానికి భారీగా విరాళాలు అందించారు. 

ఇక్కడ చదువుకున్న ఎంతోమంది దేశ, విదేశాల్లో ప్రముఖ స్థానాల్లో ఉన్నారు. తాజాగా ఈ విద్యా నిలయం స్థాపించి 75 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ క్రమంలోనే డైమండ్ జూబ్లీ వేడుకలు జరుగుతున్నాయి. డిసెంబర్ 16, 17,18 తేదీలలో వజ్రోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, ఏఎన్ఆర్ కుమారుడు అక్కినేని నాగార్జున విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు భారీ విరాళం ప్రకటించారు.

గుడివాడలో అక్కినేని నాగేశ్వరరావు  కాలేజికి 75 సంవత్సరాలు, హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియోస్‌కి 50 ఏళ్లు, నాన్నగారు అక్కడ స్థాపించిన అన్నపూర్ణ కాలేజీ ఆఫ్ ఫిల్మ్ అండ్ ఇండియాకు పదేళ్లు పూర్తవుతోంది. ఈ లెక్కలన్నీ కరెక్ట్‌గా కుదిరాయి. చాలా ఎమోషనల్‌గా ఉంది. ఏఎన్ఆర్ కాలేజీ 75 సంవత్సరాల వేడుకలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉండటమే కాదు... చాలా గర్వంగా ఉంది. మనుషులు శాశ్వతం కాదు.. వాళ్లు చేసే పనులు శాశ్వతం. నాన్నగారు చేసిన మంచి పనుల్లో ఏఎన్ఆర్ కాలేజీ ఒక ఎగ్జాంపుల్ అని నాగార్జున అన్నారు. 

తాను చదువుకోలేకపోయినా వేలాది మంది చదువుకోవాలని వారికి బంగారు భవిష్యత్ ఉండాలని 1959లో.. నేను పుట్టిన సంవత్సరంలో ఆయన లక్ష రూపాయలు విరాళం ఇచ్చారు. ఆ టైంలో ఆయనకి సినిమాకి 5 వేల నుంచి 10 వేల రూపాయల రెమ్యునరేషన్ మాత్రమే వచ్చేది. కానీ లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చారు. ఏఎన్ఆర్ కాలేజీ ఒక్కదానికే కాదు.. ఆంధ్రా యూనివర్సిటీకి ఒక 25 వేలు, మరో పాతికవేలు మరో యూనివర్సిటీకి, మద్రాస్ యూనివర్సిటీకి మరో  25 వేలు ఇచ్చారు  అని నాగార్జున గుర్తుచేసుకున్నారు

ఆయనకి చదువంటే అంత ఇష్టం. ఎందుకంటే ఆయన చదువుకోలేదు కాబట్టి వేలాదిమందికి బంగారు భవిష్యత్ కల్పించాలని ఆ నిర్ణయం తీసుకున్నారు. దానికి ఉదాహరణ ఏఎన్ఆర్ కాలేజీ నుంచి వచ్చిన ఎంతో మంది ఉన్నారు. జస్టిస్ దేవానంద్ గారు, యార్లగడ్ల లక్ష్మీప్రసాద్ గారు, కావూరి సాంబశివరావు, యలమంచిలి శివాజీ గారు, రామోజీరావు గారు, పద్మనాభం గారు, కైకాల సత్యనారాయణ గారు, శోభనాద్రి గారు ఇలా ఎంతో మంది చదువుకున్నారు. వీరే కాదు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ ఏఎన్ఆర్ కాలేజీ విద్యార్ధులు మంచి పొజిషన్‌లో ఉన్నారు  అని నాగార్జున ఎమోషనల్ అయ్యారు.  

ఏఎన్ఆర్ కాలేజ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్టార్ట్ చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. రేపు నారా లోకేష్ గారు ఇక్కడికి వస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది.. ఆయన వచ్చినప్పుడు మేనేజ్‌మెంట్ వాళ్లు ఆయనకి ఇది చెప్పి దీనిని పెద్ద ఎత్తున చేయాలని, ఎమ్మెల్యే రాముగారు దీనికి తోడ్పడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను ఇక్కడికి పిలిచిన కమిటీకి చాలా థ్యాంక్స్. నా తరపున, మా అక్కయ్య నాగ సుశీల, మా అన్నయ్య వెంకట్ తరపున, ఏఎన్ఆర్ ఫ్యామిలీ తరపున మేము ఈ ఏఎన్ఆర్ కాలేజీలో ఒక స్కాలర్‌షిప్ పెట్టాలని అనుకున్నాం. దాని కోసం 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని దానికి సంబంధించిన కార్యక్రమాలు ఏఎన్ఆర్ కాలేజీ మేనేజ్‌మెంట్‌తో మాట్లాడతాం  అని నాగార్జున తెలిపారు. 

నాన్నగారు ఎప్పుడో లక్ష రూపాయలు ఇచ్చారు.. ఇప్పుడు మేము అంత కూడా ఇవ్వకపోతే బాగుండదు. ఇంట్లో బయల్దేరేముందు పిల్లలు, అమల మీ అందరికీ హల్ చెప్పమన్నారు. ఒట్టి చేతులతో వెళ్తారా? ఏమైనా తీసుకెళ్తారా? అని అడిగారు. ఈ డొనేషన్ రేపు మీ కాలేజీకి అందజేస్తాం. ఇంత ప్రేమ, ఇంత అభిమానానికి చాలా థ్యాంక్స్ అని నాగార్జున పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నాగార్జున మంచి మనసుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.