జనగణనకు ముహూర్తం ఖరారు.. ఎప్పటి నుంచి అంటే?

 


దాదాపు 15 ఏళ్ల తర్వాత చేపట్టబోయే జనగణనకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జూన్ 16న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ జనగణన 2027 మార్చి 1వ తేదీ నాటికి పూర్తి చేయనున్నారు. అంతేకాదు.. ఈ జనగణన బ్రిటీష్ హయాంతో కలుపుకుని 16వ సారి కాగా.. స్వతంత్ర భారతంలో 8వది. 

ఈ భారీ కార్యక్రమం కోసం దాదాపు 34 లక్షల మంది గణకులు, సూపర్ వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది సేవలు అందించనున్నారు. తొలిసారిగా జనగణనతో పాటు కుల గణను కూడా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  అయితే ప్రభుత్వ పోర్టల్స్ ద్వారా ప్రజలే వ్యక్తిగతంగా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని కేంద్ర హోంశాఖ తెలిపింది. జనగణన చట్టం 1948, సెక్షన్ 3 ప్రకారం జన- కులగణనను చేపడుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. 

జమ్మూకాశ్మీర్, లడఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లో 2026 అక్టోబర్ 1 నుంచి తొలిదశలో.. 2027 మార్చి 1 నుంచి దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో జనగణనను చేపట్టనున్నారు. దేశంలో 1872 నుంచి జనాభాను లెక్కిస్తున్నారు. దశాబ్ధానికి ఒకసారి జనగణన చేపట్టాలని నిర్ణయించారు. చివరిసారిగా 2011లో జనగణన చేపట్టారు. తర్వాత 2021లో జనాభాను లెక్కించాలి.. అయితే ఆ సమయంలో భారతదేశంలో కోవిడ్ భీకరంగా ఉంది. ఈ పరిస్ధితులతో కేంద్రం జనగణనను వాయిదా వేసింది. 

తాజాగా పరిస్ధితులు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో జనగణనకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈసారి ప్రతి ఒక్కరూ తమ కులాన్ని చెప్పే ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అలగే జనగణనకు కేంద్రం రూ.13 వేల కోట్లకు పైగా ఖర్చు చేసే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 


Thug Life Box Office Collection Day 1: థగ్‌లైఫ్‌ ఫస్ట్ డే కలెక్షన్స్.. కమల్ హాసన్ మూవీకి రికార్డ్ ఓపెనింగ్స్

 



నాయగన్ తర్వాత దాదాపు 38 ఏళ్లకు విలక్షణ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్‌లో తమిళ దిగ్గజ నటుడు కమల్ హాసన్ నటించిన చిత్రం థగ్‌ లైఫ్. విడుదలకు ముందు ఎన్నో వివాదాలకు కారణమై కర్ణాటకలో బ్యాన్‌కు గురైంది థగ్ లైఫ్. జూన్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలైంది. భారతీయుడు 2 తర్వాత కమల్ హాసన్ నటించిన సినిమా కావడంతో థగ్‌లైఫ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి తొలిరోజు ఈ భారీ చిత్రం ఏ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది? ఫస్ట్ డే ఏ ఏరియాలో ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయో? చూస్తే:

థగ్ లైఫ్ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెగ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్, మణిరత్నం, శివ అనంత్‌లు దాదాపు రూ.200  కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. కమల్ హాసన్ సరసన అభిరామి, త్రిషలు హీరోయిన్లుగా నటించగా.. కోలీవుడ్ స్టార్ హీరో శింబు కీలకపాత్ర పోషించారు. అలాగే ఐశ్వర్య లక్ష్మీ, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్, తణికెళ్ల భరని, మహేశ్ మంజ్రేకర్‌లు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. 

ఏపీ ఇంటర్నేషనల్, హోమ్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ థగ్ లైఫ్ ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ దక్కించుకుంది. ఆంధ్రా, నైజాం హక్కులను శ్రేష్ట్ మూవీస్ దాదాపు రూ.20 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక థగ్‌లైఫ్ డిజిటల్ రైట్స్‌ను ఏకంగా రూ.149.7 కోట్లకు ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కైవసం చేసుకుంది. ఆగస్ట్ 7న థగ్‌లైఫ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను స్టార్ విజయ్ టీవీ దాదాపు రూ.60 కోట్లకు దక్కించుకుంది. కేవలం థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్‌తోనే థగ్‌లైఫ్ తన పూర్తి పెట్టుబడిని రాబట్టుకుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. 

కమల్ హాసన్ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాటి లాభాల్లోకి రావాలంటే ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉందని  ట్రేడ్ పండితులు విలువ కట్టారు. థగ్ లైఫ్ కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే ఇండియా వైడ్‌ దాదాపు రూ.6 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఓవర్సీస్‌లో రూ.7.5 కోట్లను ప్రీ సేల్స్ ద్వారా సొంతం చేసుకున్న థగ్ లైఫ్ మొత్తంగా అడ్వాన్స్  బుకింగ్ ద్వారా రూ.13.5 కోట్లు ఆర్జించింది. తొలిరోజు కమల్ హాసన్ - మణిరత్నంల చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్ల ఓపెనింగ్స్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు. 


హరిహర వీరమల్లు... నిరాశలో పవన్ సైన్యం

 


రాజకీయాల్లోకి వెళ్లి, పదేళ్ల పోరాటం తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్. పిఠాపురం నుంచి శాసనసభ్యుడు కావడంతో పాటు చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగానూ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు, తన ఆశయాలకు అనుగుణంగా అత్యంత కీలకమైన శాఖలను స్వీకరించిన పవన్ దూసుకెళ్తున్నారు. 

పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా సక్సెస్ కావడంతో ఆయన అభిమానులకు ఓ పక్క సంతోషంగా ఉన్నప్పటికీ, మరోవైపు పవన్‌ను వెండితెర మీద చూడలేమని బాధపడ్డారు. సినీ పరిశ్రమను వదిలిపెట్టి రాజకీయాల్లో పూర్తిగా నిమగ్నమయ్యేసరికి పవన్ కళ్యాణ్ చేతిలో హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. వీటిలో హరిహర వీరమల్లు సినిమాకు ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. కరోనా, లాక్‌డౌన్, పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో దాదాపు ఐదేళ్లుగా సినిమా ఆగిపోయింది. 

తొలుత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన క్రిష్ జాగర్లమూడి ఈ ఆలస్యంతో వీరమల్లు నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. అసలే ఇబ్బందుల్లో ఉన్న ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్నాన్ని ఇది మరింత ఇరకాటంలో నెట్టింది. క్రిష్ సూచన మేరకు ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ మెగాఫోన్ పట్టుకుని మిగిలిన పార్ట్ పూర్తి చేసే బాధ్యతను తీసుకున్నారు. పవన్‌తో సంబంధం లేని సన్నివేశాలను జ్యోతికృష్ణ వేగంగా పూర్తి చేశారు. ఈలోపు పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్‌లో చేరి వీరమల్లును విడుదలకు సిద్ధం చేశారు.

జూన్ 12న హరిహర వీరమల్లు సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుందని మెగా సూర్య ప్రొడక్షన్స్ ప్రకటించింది. ఈ వార్తతో మెగా, పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. రెండేళ్ల విరామం తర్వాత పైగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ నటించిన సినిమా విడుదల కానుండటంతో ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అటు విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ సైతం ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. 

చెన్నైలో ఓ పాటను లాంచ్ చేసిన వీరమల్లు యూనిట్.. జూన్ 8న తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. జూన్ 7 నాటికే పవన్ కళ్యాణ్ తిరుపతి చేరుకుని, తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా హరిహర వీరమల్లు వాయిదా అంటూ సోషల్ మీడియాలో, మీడియాలో గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఇంత జరగుతున్నా పవన్ క్యాంప్ నుంచి ఒక్కరు కూడా స్పందించలేదు. ఇంతలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ అంటూ మరో న్యూస్ చక్కర్లు కొట్టింది.

సీజీ వర్క్ పూర్తి కాకపోవడం వల్లే వీరమల్లు వాయిదా పడిందని ఫిలింనగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కానీ అసలు కారణం ఏంటి? ఇంతకీ సినిమా జూన్ 12న విడుదల అవుతుందా? లేదా? అన్న దానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్, దర్శకుడు జ్యోతికృష్ణ, నిర్మాత ఏఎం రత్నం స్పందించాలని పవన్ అభిమానులు కోరుతున్నారు. 


అలీపై వ్యాఖ్యలు: మీ ఖర్మ, నేను ఇలాగే మాట్లాడతా.. రాజేంద్రప్రసాద్

 



సీనియర్ నటుడు, నటకిరిటీ డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఇటీవలి కాలంలో మైక్ అందుకుంటే చాలు కాంట్రవర్సీ అయిపోతోంది. అల్లు అర్జున్, డేవిడ్ వార్నర్‌లపై రాజేంద్రుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో స్వయంగా క్షమాపణలు చెప్పారు. రాజేంద్రప్రసాద్‌కు వయసు పెరుగుతున్న కొద్ది హుందాగా ఉండాలన్న విజ్ఞత ఉండటం లేదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. వేదికపై మైక్ అందుకున్న తర్వాత సభా మర్యాదను పాటించడం నేర్చుకోవాలంటూ చురకలంటిస్తున్నారు. 

ఇటీవల ఓ కార్యక్రమంలో కమెడియన్ అలీని అసభ్య పదజాలంతో దూషించడంతో రాజేంద్రప్రసాద్‌పై నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. సినీవర్గాల్లో సైతం ఆయన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. తాజాగా తాను చేసిన వ్యాఖ్యలపై రాజేంద్రప్రసాద్ స్పందించారు.  ఓ కార్యక్రమంలో హీరోయిన్, నటుడి గురించి సరదాగా చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారని.. నేను ఎప్పుడూ ఇలాగే ఉంటానని తేల్చిచెప్పారు. 

అన్నయ్య స్థానంలో ఉండి నేను చేసిన కొన్ని వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్ధం చేసుకున్నారు. అది మీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది.. అది మీ ఖర్మ. నేను ఎప్పుడూ ఇలాగే సరదాగా ఉంటానని రాజేంద్రప్రసాద్ అన్నారు. పెళ్లి పుస్తకం నుంచి షష్టి పూర్తి సినిమా వరకు నా కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగిందని ఆయన గుర్తుచేసుకున్నారు. 

ఇన్నేళ్ల అనుభవంలో నేను చేర్చుకున్నవి, నాకు తెలిసినవి అందరికీ చెబుతానని.. నాకు ఎన్నో భిన్నమైన పాత్రల్లో నటించే అవకాశం దక్కిందని రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఇలాంటి పాత్రలే చివరి శ్వాస వరకు చేయాలని అనుకుంటున్నానని .. ఇళయరాజా జన్మదినం నాడు షష్టిపూర్తి సినిమా సక్సెస్‌మీట్‌ను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అయితే వేదిక మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు రాజేంద్రప్రసాద్ ఎలాంటి క్షమాపణలు చెప్పకపోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. 

పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేశ్ చౌదరి, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం షష్టిపూర్తి. ఇందులో రాజేంద్రప్రసాద్, అర్చనలు కీలకపాత్రలు పోషించారు. వంశీ దర్శకత్వంలో వచ్చిన లేడీస్ టైలర్ తర్వాత ఈ సీనియర్ నటులిద్దరూ కలిసి నటించడం 38 సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన షష్టిపూర్తి సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. 


భారత్‌లో విజృంభిస్తోన్న కరోనా.. 4 వేలకు చేరువలో కేసులు

 


భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 4 వేల మార్క్‌కు చేరువైంది. దేశవ్యాప్తంగా యాక్టీవ్ కేసుల సంఖ్య 3,961 వద్ద ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ జూన్ 2న వెల్లడించింది. కేరళలో అత్యధికగా 1435 కేసులు, మహారాష్ట్రలో 506, ఢిల్లీలో 483, బెంగాల్‌లో 339, గుజరాత్‌లో 338, తమిళనాడులో 199, ఉత్తరప్రదేశ్‌లో 149, ఒడిశాలో 12, హర్యానాలో 12, పంజాబ్‌లో 6 కేసులు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. గడిచిన 24 గంటల్లో 360 కొత్తగా కోవిడ్ బారినపడినట్లు అధికారులు వెల్లడించారు. 

ఇక కోవిడ్ కారణంగా కేరళ, కర్ణాటకలలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి కోవిడ్ కారణంగా భారత్‌లో మరణించిన వారి సంఖ్య 32కి చేరుకుంది. అలాగే జూన్ 2 ఉదయం 8 గంటల వరకు 2,188 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 

దేశంలో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో సామాజిక దూరం పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, పరిశుభ్రత పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి ఇతర వేరియెంట్లతో పోలిస్తే ప్రస్తుతం భారత్‌లో వ్యాప్తి చెందుతున్న కరోనా రకం తీవ్రమైన అనారోగ్యానికి దారి తీస్తుందని సూచనలు ఏమీ లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లు తాజా వేరియంట్ ప్రభావాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొంటాయని అభిప్రాయపడింది.

భారత్‌లో వ్యాప్తి చెందుతున్న కరోనా రకాన్ని ఎన్‌బీ.1.8.1గా గుర్తించింది డబ్ల్యూహెచ్‌వో. అలాగే  గడిచిన రెండు వారాలుగా భారత్‌లో ఎక్కువగా బీఏ .2, జేఎన్.1 వేరియంట్ కేసులు నమోదవుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. వ్యాక్సిన్ల ప్రభావం తగ్గడం, కరోనా నిబంధనలను ప్రజలు పాటించకపోవడం, వ్యాధి నిరోధక శక్తి వంటివి తగ్గడం వల్లే దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 


సమంతతో క్లోజ్‌గా రాజ్ నిడిమోరు.. దర్శకుడి భార్య సంచలన పోస్ట్

 


టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభుతో బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు రిలేషన్‌లో ఉన్నారంటూ గత కొంతకాలంగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. రోజురోజుకు వీరిద్దరి మధ్య బంధానికి సంబంధించి ఏదో ఒక వార్త బయటికి వస్తూనే ఉంది. తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలను జంటగా దర్శించుకోవడం, శుభం సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఫ్లైట్‌లో రాజ్ భుజాలపై సమంత వాలిపోవడం, నిన్నగాక మొన్న రాజ్‌తో సామ్ పికెల్ బాల్ ఆడుతున్న ఫోటోలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా వీరు బాంబు పేలుస్తారని సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఒకదానికొకటి లింక్ పెడుతూ జరుగుతున్న పరిణామాలతో రాజ్ నిడిమోరు భార్య శ్యామాలి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. కాలమే అన్నింటినీ బయటపెడుతుందని, కర్మ దీనికి సమాధానం చెబుతుందని, ఆ విశ్వమే నిశితంగా పరిశీలిస్తుందని శ్యామాలి పోస్ట్ పెట్టారు. సమంత- రాజ్ నిడిమోరు ఎఫైర్ వార్తల మధ్య ఆమె సందేశం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత హిందీలో ది ఫ్యామిలీమెన్, సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్‌లు చేశారు. వీటిని రాజ్ & డీకేలు తెరకెక్కించారు. వీరిలో రాజ్ నిడిమోరు ఒకరు. ఈయన తెలుగువారు కావడం విశేషం. చిత్తూరు జిల్లాకు చెందిన రాజ్ తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో చదువుకున్నారు. బీటెక్ తర్వాత అమెరికాలో కొన్నాళ్లు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. తర్వాత మిత్రుడు డీకేతో కలిసి సినీరంగం వైపు అడుగులు వేశారు. ఈ క్రమంలోనే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు తెరకెక్కించారు. 

ఫ్యామిలీమెన్, సిటాడెల్ వెబ్ సిరీస్‌ల షూటింగ్ సమయంలోనే సమంతకు, రాజ్ నిడిమోరుకు పరిచయం ఏర్పడి ఇది ప్రేమకు దారి తీసిందని అంటున్నారు. తమ బంధంపై జరుగుతున్న ప్రచారంపై సమంత, రాజ్ నిడిమోరులు విడివిడిగా ఖండించినా ఈ గాసిప్స్‌కు చెక్ పడటం లేదు. తాజాగా శ్యామాలి పోస్ట్‌తో ఈ వ్యవహరం ఎటు దారి తీస్తుందో చూడాలి. 


‘ఆదిత్య 369 .. ఆ ముగ్గురికీ రుణపడి ఉంటా’

 

Aditya 369

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన భారతదేశపు తొలి సైన్స్ ఫిక్షన్ - టైమ్ ట్రావెల్ సినిమా ఆదిత్య 369 రీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా రీ రిలీజ్‌ను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బాలన్నతో ఉంటే తమకు షూటింగ్ చేసినట్లు ఉండదని బాబూమోహన్ అన్నారు. 

బాలన్న ఈ సినిమాలో చేసిన రెండు క్యారెక్టర్లు వర్ణనాతీతమని చెప్పారు. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందేనని బాబూమోహన్ ప్రశంసించారు. తరాలు మారినా ఆదిత్య 369ని కొత్త సినిమాగానే చూస్తారని ఆయన పేర్కొన్నారు. 

ఈ సినిమా తీయడానికి వెనుక దారితీసిన పరిస్ధితులను నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ వివరించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నాకు ఫోన్ చేసి విజయా గార్డెన్స్‌కు రమ్మన్నారని, అర్జెంట్‌గా సింగీతం శ్రీనివాసరావు గారిని కలిసిరా అని చెప్పారని కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. అర్ధగంట పాటు  నాకు కథ వినిపించారని, టైం మిషన్ , టైం ట్రావెల్ కాన్సెప్ట్ చెప్పారని కృష్ణప్రసాద్ వెల్లడించారు. 

ఆ తర్వాత తనకు కొన్ని ఇంగ్లీష్ చిత్రాల వీసీడీలు ఇచ్చి చూడమన్నారని.. దానిని భారతీయ నేపథ్యానికి అనుగుణంగా మార్పులు చేశానని శివలెంక కృష్ణప్రసాద్ చెప్పారు.  నాకు భయమేసి బాలుగారిని కలిసి టైం మిషన్, టైం ట్రావెల్ అంటున్నారని నాకు భయంగా ఉందని చెప్పానని కృష్ణప్రసాద్ అన్నారు.  ఈ సినిమాను ఫస్ట్ నువ్వు నమ్ము.. ఈ సినిమాతో కొన్ని దశాబ్ధాల పాటు గుర్తుండిపోతావని బాలు ధైర్యం చెప్పారని ఆయన గుర్తుచేసుకున్నారు. 

ఉదయాన్నే శ్రీనివాసరావు దగ్గరికి వెళ్లి మీరిచ్చిన మూడు సీడీలలో ఒకటి చూశానని.. ఇంకా రెండు పెండింగ్ ఉన్నాయని చెప్పానని కృష్ణప్రసాద్ అన్నారు. మీరు చెప్పిన పాయింట్ బాగుందని శ్రీనివాసరావుతో చెప్పడంతో ఈ సినిమాకు సంబంధించిన 40 నిమిషాల కథ చెప్పారని తెలిపారు. కృష్ణదేవరాయలు పాత్ర నందమూరి బాలకృష్ణ చేస్తేనే మీతో ఈ సినిమా చేస్తానని సింగీతం శ్రీనివాసరావు అన్నారని శివలెంక వెల్లడించారు. వెంటనే దేవి వరప్రసాద్‌కు బాలుగారు ఫోన్ చేసి బాలకృష్ణ అపాయింట్‌మెంట్‌ను ఇప్పించారని కృష్ణప్రసాద్ అన్నారు. 

అయితే డైరెక్టర్ ఎవరని దేవివరప్రసాద్ అడగటంతో సింగీతం శ్రీనివాసరావు అని బాలు చెప్పారని దాంతో ప్రసాద్ కాస్త కంగారు పడ్డారని శివలెంక తెలిపారు. అయినప్పటికీ వెంటనే బాలయ్య అపాయింట్‌మెంట్ ఇప్పించారని ఆయన గుర్తుచేసుకున్నారు. బాలకృష్ణ ఆ సమయంలో కమర్షియల్ సినిమాలతో మంచి ఊపులో ఉన్నారని.. దర్శకులు, కథలు ఆయన కోసం రెడీ అవుతున్నాయని అయినప్పటికీ సింగీతం శ్రీనివాసరావు సినిమాకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని శివలెంక కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. 

సినిమా మొదలుపెట్టాక అంతా నాకు సహకారం అందించారని ఆయన గుర్తుచేసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేశాక.. వెంకటేశ్, నాగార్జున, నాగేశ్వరరావు వంటి వారు ఏం జరుగుతోందని ఆశ్చర్యపోయారని కృష్ణప్రసాద్ అన్నారు. ఈ సినిమా కోసం పీసీ శ్రీరామ్, వీఎస్ఆర్ స్వామి, కబీర్‌లాల్ వంటి ముగ్గురు కెమెరామెన్‌లు పనిచేశారని ఆయన తెలిపారు. 

సినిమా రిలీజ్ అయ్యాక నాకు స్పెషల్ బ్రాండ్ వచ్చిందని.. నేను ఎన్నో సినిమాలు తీసినా మీరు ఆదిత్య 369 నిర్మాత అని తెలుసుకుని మెచ్చుకుంటున్నారని కృష్ణప్రసాద్ చెప్పారు. ఈ సినిమా విషయంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సింగీతం శ్రీనివాసరావు, నందమూరి బాలకృష్ణలకు జీవితాంతం రుణపడి ఉంటానని శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు. 

శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ ఆదిత్య 369 చిత్రాన్ని నిర్మించారు. బాలకృష్ణ సరసన తొలుత విజయశాంతిని హీరోయిన్‌గా అనుకున్నప్పటికీ ఆమె డేట్స్ దొరక్కపోవడంతో మలయాళ నటి మోహినిని ఎంపిక చేశారు. టిను ఆనంద్, అమ్రీష్ పురి, సిల్క్ స్మిత, చంద్రమోహన్, జేవీ సోమయాజులు, సుత్తివేలు, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, గొల్లపూడి మారుతీరావు, చలపతిరావు, తనికెళ్ల భరణి, బాబుమోహన్, శ్రీలక్ష్మీ , బాలనటులుగా తరుణ్, రాశీలు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. 

మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత దర్శకుడిగా అద్భుతమైన స్వరాలు అందజేశారు. ముఖ్యంగా జానవులే నెరజానవులే, రాసలీల వేళ, సెంచరీలు కొట్టే వయసు మాది వంటి పాటలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. సిల్క్ స్మితతో బాలయ్య చేసిన జానవులే సాంగ్ ఆల్‌టైమ్ క్లాసిక్‌గా నిలిచింది. 18 జూలై 1991న విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. 

ఆదిత్య 369కి సీక్వెల్ తీయాలని సింగీతం శ్రీనివాసరావు తన మనసులో మాట చెప్పారు. ఈ చిత్రాన్ని బాలయ్యకు బదులుగా ఆయన కుమారుడు నందమూరి మోక్షజ్ఞతో ఆదిత్య 999 పేరుతో తీస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు స్వయంగా బాలకృష్ణ కథ రాయడం విశేషం